breaking news
new unit
-
రూ. 407 కోట్లతో సీసీఎల్ విస్తరణ
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఇన్స్టంట్ కాఫీ దిగ్గజం సీసీఎల్ ప్రొడక్ట్స్ వియత్నాం తయారీ కేంద్రంలో కొత్త యూనిట్ ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. 6,000 టన్నుల వార్షిక సామర్థ్యంతో ఫ్రీజ్ డ్రైడ్ కాఫీ ఫెసిలిటీని నెలకొల్పనున్నారు. ప్రాజెక్టు అంచనా వ్యయం సుమారు రూ.407 కోట్లు. కాగా, 2022–23 ఆర్థిక సంవత్సరానికిగాను మధ్యంతర డివిడెండ్ రూ.3 చెల్లించాలని బోర్డు నిర్ణయించింది. డిసెంబర్ త్రైమాసికంలో కన్సాలిడేటెడ్ ఫలితాల్లో కంపెనీ నికరలాభం అంత క్రితం ఏడాది ఇదే కాలంతో పోలిస్తే 24.9 శాతం ఎగసి రూ.73 కోట్లు సాధించింది. ఎబిటా 9 శాతం పెరిగి రూ.101 కోట్లుగా ఉంది. టర్నోవర్ 26.5 శాతం అధికమై రూ.535 కోట్లు నమోదు చేసింది. -
ఇసుజు కార్ల ప్లాంట్ విస్తరణ
వరదయ్యపాళెం(చిత్తూరు జిల్లా): శ్రీసిటీలోని జపనీస్ యుటిలిటీ వాహన తయారీదారు ఇసుజు మోటార్స్ ఇండియా పరిశ్రమలో అదనపు ఉత్పత్తుల యూనిట్ను సోమవారం లాంఛనంగా ప్రారంభించారు. కంపెనీ ఆవరణలో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో జపాన్ కాన్సుల్ జనరల్ కొజిరో యఖియామా, ఇసుజు మోటార్స్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ టోరూ నకాటా, మిట్సుబిషి కార్పొరేషన్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్, సీఈఓ ఇవారో టోయిడి శ్రీసిటీ మేనేజింగ్ డైరెక్టర్ రవీంద్ర సన్నారెడ్డిలు ముఖ్య అతిథులుగా పాల్గొని రూ. 400కోట్ల పెట్టుబడులతో అదనపు ఉత్పత్తి కేంద్రంగా ఏర్పాటు చేసిన ప్రెస్షాప్ సదుపాయం, ఇంజన్ అసెంబ్లింగ్ యూనిట్లను ప్రారంభించారు. ఈ రెండవ దశ కార్యకలాపాల ప్రారంభం భారత్లోని ఇసుజు ప్రయాణంలో అతి ముఖ్యమైన మైలురాయిగా నిలుస్తుందని జపాన్ కాన్సుల్ జనరల్ తెలిపారు. అంతర్జాతీయ తయారీ కేంద్రాలలో ఒకటిగా ఈ ప్లాంటును తీర్చిదిద్దడానికి ఇసుజు చేస్తున్న ప్రయత్నాలను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నామన్నారు. అనివార్య పరిస్థితుల్లో ఈ కార్యక్రమానికి హాజరు కాలేక పోయిన రాష్ట్ర పరిశ్రమల శాఖామంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి పంపిన అభినందన సందేశాన్ని శ్రీసిటీ మేనేజింగ్ డైరెక్టర్ రవీంద్ర సన్నారెడ్డి చదివి వినిపించారు. మంత్రి తన సందేశంలో ఇసుజుకు అన్నివిధాలా రాష్ట్ర ప్రభుత్వం మద్దతు, భరోసా ఇస్తుందని తెలిపారు. రాష్ట్రంలో ఆటో మొబైల్ తయారీకి ఇసుజు ఒక ప్రామాణికంగా నిలుస్తుందని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్లో మొట్టమొదటి కార్ల పరిశ్రమ ఇసుజు అంటూ శ్రీసిటీ మేనేజింగ్ డైరెక్టర్ రవీంద్ర సన్నారెడ్డి వ్యాఖ్యానించారు. టోరూ నకాటా మాట్లాడుతూ.. పోటీ మార్కెట్లో అత్యుత్తమ శ్రేణి ఉత్పత్తులు, సేవలను అందించడానికి ఇసుజు ఎప్పుడూ ప్రయత్నిస్తూ ఉంటుందన్నారు. ప్రపంచవ్యాప్తంగా తమ ఉత్పత్తుల నాణ్యత, విశ్వసనీయతకు భరోసా అందిస్తామన్నారు. రెండవ దశ కార్యకలాపాలు తమ వృద్ధిని మరింత వేగవంతం చేయడంతో పాటు అంతర్జాతీయ మార్కెట్ సామర్థ్యాన్ని విస్తరించనుందని పేర్కొన్నారు. -
రాయల్ ఎన్ఫీల్డ్ కొత్త యూనిట్
చెన్నై: ప్రముఖ వాణిజ్య వాహనాల తయారీ కంపెనీ ఐషర్ మోటార్స్ ఇండియాలో మరో యూనిట్ ప్రారంభించింది. ఐషర మోటార్స్ విభాగానికి చెందిన రాయల్ ఎన్ ఫీల్డ్ చెన్నై సమీపంలో వల్లం వడగల్లో కమర్షియల్ ప్రొడక్షన్ యూనిట్ను ప్రారంభించింది. ఈ కొత్త ఉత్పాదన కేంద్రం నుంచి వాణిజ్య ఉత్పత్తిని నేటి నుంచి ప్రారంభించింది. ఇక్కడినుంచి ఇండియా మార్కెట్తోపాటు అంతర్జాతీయ మార్కెట్లు కోసం రాయల్ ఎన్ఫీల్డ్ బైక్లను తయారు చేయనున్నామని ఐషర్ మోటార్స్ ఒక ప్రకటనలో తెలిపింది. మొదటి దశలో సంవత్సరానికి 300,000 బైక్ల ఉత్పత్తి సామర్ధ్యం కలిగి ఉన్నట్టు తెలిపింది. కాగా ఈ ప్లాంట్ తో రాయల్ ఎన్ ఫీల్డ్ కు ఇది మూడవ ఉత్పత్తి కేంద్రం. 2018 ఆర్థికసంవత్సరానికి గాను మొత్తం మూడు ప్లాంట్ల ఉత్పత్తి సామర్థ్యం 825,000 యూనిట్లుగా ఉంది.