breaking news
N. ramachandra rao
-
దూకుడు కన్నా సమన్వయానికే మొగ్గు
‘మంచి ప్రారంభంతో సగం పని అయిపోయినట్టే’ అంటారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో పార్టీ కొత్త అధ్యక్షుల ఎన్నిక ప్రక్రియను తామలానే జరిపించగలిగామని బీజేపీ అధినాయకత్వం భావిస్తోంది. తెలంగాణలో ఎన్.రామచంద్రరావు, ఆంధ్రప్రదేశ్లో పి.వి.ఎన్. మాధవ్ కొత్త అధ్యక్షులుగా ఎన్నికవడం చూస్తే, సుదీర్ఘ కాలం పార్టీనే అంటిపెట్టుకొని ఉండటం, సైద్ధాంతిక బలం వంటి అంశాలకే ప్రాధాన్యమిచ్చిందని స్పష్టమౌతోంది. తాజా నిర్ణయంపై ఆర్ఎస్ఎస్ ప్రభావమూ విస్పష్టమే! పార్టీని దూకుడుగా తీసుకు వెళ్లటం కన్నా, ‘గ్రూప్’ల బెడద లేకుండా, ఐక్యంగా నడిపించటం పైనే అధిష్ఠానం దృష్టి నిలిపిందనిపిస్తోంది. పార్టీకి లభించే తక్షణ ఊపు కన్నా, ఎన్డీయే కూటమికి దీర్ఘకాలికంగా ఒనగూరే రాజకీయ ప్రయోజనాలకే పెద్దపీట వేశారని ఈ నిర్ణయం తేటతెల్లం చేస్తోంది. బయటి నుంచి వచ్చే నేతలకు లభించే ఇతర అందలాల సంగతెలా ఉన్నా, వారు పార్టీ సంస్థాగత పదవులు, హోదాల్లోకి రావటం అంత తేలికైన అంశం కాదనీ మరోమారు సంకేతాలు ఇచ్చినట్టయింది.జాప్యం జరిగినా తెలుగు రాష్ట్రాల అధ్యక్షుల ఎన్నిక విషయంలో బీజేపీ అధినాయకత్వం వ్యూహాత్మకంగానే అడుగులు వేసింది. అభ్యర్థుల ఎంపికలో, దూకుడు స్వభావం కన్నా సంయమనం, సమన్వయం నెరిపే నాయకత్వానికి ప్రాధాన్యమిచ్చింది. ఆంధ్రప్రదేశ్లో అధికారంలోని కూటమి భాగస్వామ్య పక్షమైన బీజేపీ, కూటమి పార్టీల మధ్య సఖ్యతకు విఘాతం రానీయకుండా చూసుకోవడమే కాక... తెలంగాణలో అటువంటి భవిష్యత్ అవకాశానికి దారులు తెరచి ఉంచింది. రేపు అది తెలుగుదేశం–జనసేనతో జట్టు కొనసాగించడమైనా కావచ్చు, కాదు పరిస్థితులు మారితే భారతæ రాష్ట్ర సమితి (బీఆర్ఎస్)తో జోడీ కట్టడమైనా కావచ్చు. పార్టీ అధినాయకత్వం కనుసన్నల్లో మెదలవటమే కాకుండా, ఢిల్లీ నాయకత్వం నిర్దేశించిన తరహాలో రాష్ట్రాల్లో పార్టీ శ్రేణుల్ని నడపగలిగే అణకువ గలిగిన నాయకత్వానికి పీట వేసింది. మొదట్నుంచీ పార్టీలోనే ఎదిగిన ఇద్దరు మాజీ ఎమ్మెల్సీలు ఎన్.రామచంద్రరావు (తెలంగాణ), పి.వి.ఎన్. మాధవ్ (ఏపీ) పార్టీ రాష్ట్ర అధ్యక్షులుగా ఎన్నికయేట్టు వ్యూహరచన చేసింది. దూకుడు నాయకత్వం ఉండుంటే, ఇతర పార్టీల నుంచి, ముఖ్యంగా బీఆర్ఎస్ నుంచి బీజేపీ వైపు వలసలుంటాయేమోననే భయం ఆ పార్టీకి ఉండేది. ఇప్పుడా భయం పోయింది.వీగిన తెలంగాణ చిక్కుముడితెలంగాణలో పార్టీ రాష్ట్రాధ్యక్ష ఎన్నిక బీజేపీ అధినాయకత్వానికి ఒక దశలో సవాల్గానే మారింది. పలువురు నాయకులు ఈ పదవిని ఆశించడమే కాకుండా ముమ్మరంగా తమ వంతు ప్రయత్నాలు చేశారు. తర్జన – భర్జనల తర్వాత త్రాసు రామచంద్రరావు వైపు మొగ్గింది. ఈ పదవిని ఆశించడమే కాకుండా ఢిల్లీ నాయకత్వాన్ని మెప్పించే ప్రయత్నం చేసిన మాజీ మంత్రి ఈటల రాజేందర్కు నిరాశే మిగిలింది. ఈటలకు పార్టీలో ‘చేరికల కమిటీ’కి నేతృత్వం ఇచ్చినప్పటికీ, ఆశించిన స్థాయిలో చేరికలు జరగకపోవడం, పార్టీలో పాత –కొత్త నాయకుల మధ్య స్పర్థ పెరగటం వంటివి అధినాయకత్వానికి చీకాకు కలిగించాయి. బీజేపీ సీఎం అభ్యర్థిగా ప్రచారం జరగటం, గజ్వేల్తో పాటు హుజూరాబాద్లోనూ ఆయన ఓడిపోవడం వంటివే కాక బీజేపీ సంస్థాగత ఎన్నికల నిబంధనలు కూడా ఆయనకు ప్రతికూలంగా ఉన్నాయి. ఈటలకు పార్టీ అధ్యక్ష పీఠం దక్కకపోవడమొక్కటే కేంద్ర మంత్రి బండి సంజయ్కు మిగిలిన సంతృప్తి కావచ్చని పార్టీలో గుసగుసలున్నాయి. బయటకు ఆసక్తిని వెల్లడించకపోయినా, ఒక దశలో తాను పోటీదారును కాదని ప్రకటించినా.... మరోమారు అధ్యక్షుడు కావాలని ఆయనకు లోలోపల ఉండినట్టు తెలుస్తోంది. అందుకు కారణం, లోగడ ఆయన బాగా పనిచేస్తున్నప్పుడు, పార్టీకి మంచి ఊపు తెచ్చినపుడు అర్ధంతరంగా ఆయన్ని తప్పించడమే! పార్టీ ఎదుగుదలకు ‘నేనే’ కారణం అనే స్థితిలోకి అధ్యక్షుడు వెళ్లిపోయారనీ, ‘నేను’ను బీజేపీ నాయకత్వం అంగీకరించదనీ పార్టీలో కొందరు అప్పట్లో అన్వయం చెప్పేవారు. ఇక తెలంగాణ అధ్యక్ష స్థానానికి ఎంపీలు అర్వింద్, డీకే అరుణ, రఘునందనరావు, డా.లక్ష్మణ్ పేర్లు ప్రచారంలోకి రావటమన్నది ఆటలో అరటిపండే!సత్తా కన్నా సంకేతాలకే మొగ్గుబీజేపీ అధిష్ఠానం వైఖరి కొన్నిసార్లు విచిత్రంగా ఉంటుంది. తెలుగు రాష్ట్రాల్లో సంస్థాగతంగా పార్టీ బలోపేతంపై దృష్టి నిలిపిన గొప్ప చరిత్ర ఏమీలేదు. ఏదో సమీకరణాల్లో... అయితే రాష్ట్రం రావాలి, కాదంటే వ్యూహం నెరవేరి ఎన్డీయేకు లబ్ధి చేకూరాలి. ఏపీ, తెలంగాణల్లో అధ్యక్షుల ఎన్నికకు అదే వ్యూహాన్ని అనుసరించినట్టు కనిపిస్తోంది. కూటమి పార్టీల మధ్య సఖ్యతకు, సయోధ్యకు మాజీ ఎమ్మెల్సీ (పట్టభద్రుల స్థానం) పి.వి.ఎన్. మాధవ్ అధ్యక్షులైతే అందరికీ ఆమోదయోగ్యంగా, అధిష్ఠానానికి తలలో నాలుకలా ఉంటారనే తాజా నిర్ణయానికి వచ్చినట్టుంది. కూటమి మిత్రులకు ఈ విషయంలో స్పష్టమైన సంకేతాలివ్వడం పార్టీకి ముఖ్యం. మాధవ్ దివంగత నేత పి.వి.చలపతిరావు తనయుడు. రెండు పర్యాయాలు ఎమ్మెల్సీగా ఉండి, ఉమ్మడి ఏపీ బీజేపీ రాష్ట్రాధ్యక్షుడిగానూ పనిచేసిన చలపతిరావుకు మంచి పేరుండేది. కోస్తాంధ్ర ప్రాంతం నుంచి సుదీర్ఘకాలం ఆయనే బీజేపీకి పెద్ద దిక్కుగా ఉన్నారు.ఇక తెలంగాణలో రామచంద్రరావు అధ్యక్షుడవడం చాన్నాళ్లుగా పార్టీనే అంటిపెట్టుకొని ఉన్న పాత నాయకులకు సంతృప్తినిచ్చే నిర్ణయం. ఉస్మానియా విశ్వవిద్యాలయం విద్యార్థి విభాగం (ఏబీవీపీ) నుంచి, యువమోర్చా నుంచి ఎదిగి వచ్చిన నాయకుడాయన. సంప్రదింపుల్లో దిట్ట అని పేరుంది. ఎమ్మెల్సీగా (పట్టభద్రులకు) ప్రాతినిధ్యం వహిస్తూ మండలిలో పార్టీ నాయకుడిగా ఉన్నారు. ప్రజలు తమకు అవకాశం ఇస్తే, బీసీని ముఖ్యమంత్రిని చేస్తామని చెప్పిన పార్టీ అధినాయకత్వం ఇతర అగ్రవర్ణాలను దూరం చేసుకోవద్దన్న వ్యూహమే ఇక్కడ పనిచేసి ఉంటుంది. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తనయ కవిత ఢిల్లీ లిక్కర్ కేసులో అరెస్టయినపుడు, ఆ పార్టీని బీజేపీతో జతచేయడమో, విలీనమో.... ప్రతిపాదనలొచ్చాయని ప్రచారం జరుగుతున్న పరిస్థితుల్లో ....తాజా అధ్యక్ష ఎంపిక/ఎన్నిక కీలకమైంది. రేపు ఏదైనా పరిణామాల్లో బీఆర్ఎస్తో బీజేపీ జట్టు కట్టాల్సివస్తే పార్టీకి సంయమనంతో వ్యవహరించే నాయకత్వం ఉండాలని ఇప్పట్నుంచే ఢిల్లీ నేతలు యోచించినట్టుంది. ఈటల రాజేందర్, బండి సంజయ్... ‘వారిద్దరిలో ఎవరికిచ్చినా వేరొకరు సహకరించక పోదుర’నే బలమైన అభిప్రాయముంది. ఇప్పటికే సిటీ వర్గం, నిజామాబాద్ బ్యాచ్, కరీంనగర్ టీమ్... ఇలా వర్గాలుగా చీలి ఉన్న తెలంగాణ బీజేపీలో మరో కొత్త వర్గాన్ని పుట్టించకుండా అధిష్ఠానం జాగ్రత్తపడిందనే సంతృప్తి కొందరిలోనైనా ఉంది. దివంగత ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి ఒకప్పుడు చెప్పిన మాటలీ సందర్భంలో గుర్తుకొస్తాయి. బీజేపీకి సన్నిహితంగా పనిచేస్తూ, ఒక దశలో బీజేపీలో చేరే ఆలోచన చేసిన టీడీపీ నాయకుడు పర్వతనేని ఉపేంద్రనుద్దేశించి వాజ్పేయి ఈ మాటలన్నారు: ‘మీ పనితీరు మాకు అతకదేమో! మీరు ఇక్కడ ఇమడలేరు, మా వాళ్లు ఇమడనివ్వరు కూడా’ అని ఆ పెద్దాయన నర్మగర్భంగా చెప్పారు. అది కరడుగట్టిన సత్యమని తెలంగాణ బీజేపీ రాజకీయాలు నిరూపించాయి.దిలీప్ రెడ్డి వ్యాసకర్త పొలిటికల్ ఎనలిస్ట్, సీనియర్ జర్నలిస్ట్ -
విజయుడు... రామచంద్రుడు
-
విజయుడు... రామచంద్రుడు
బీజేపీలో ఆనందోత్సాహాలు నగరంలో భారీగా సంబరాలు టీఆర్ఎస్ శ్రేణుల్లో నిరాశ సిటీబ్యూరో: హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్నగర్ జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గం ఎమ్మెల్సీగా బీజేపీ అభ్యర్థి ఎన్.రామచంద్రరావు విజయదుందుభి మోగించడం నగరంలోని ఆ పార్టీ శ్రేణుల్లో ఆనందోత్సాహాలు నింపింది. బుధవారం రాత్రి వారంతా సంబరాలు జరుపుకున్నారు. తెలంగాణలో భారతీయ జనతా పార్టీ బలం పుంజుకోవడానికి ఈ గెలుపు దోహదం చేస్తుందని నాయకులు, కార్యకర్తలు విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. త్వరలో జీహెచ్ఎంసీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో రామచంద్రరావు రూపంలో లభించిన ఘన విజయం పార్టీ ఓటు బ్యాంకును సమీకరించడానికి తోడ్పడుతుందని బీజేపీ గ్రేటర్ అధ్యక్షుడు బి.వెంకటరెడ్డి అభిప్రాయపడ్డారు. గతంలో హైదరాబాద్లో బలమైన పార్టీగా ఉన్న బీజేపీ ఇప్పుడు గ్రేటర్ ఎన్నికల్లో అత్యధిక స్థానాలు సాధించి పూర్వ వైభవాన్ని సంతరించుకుంటుందన్నారు. హైదరాబాద్లో రాజకీయ పునరేకీకరణకు... ప్రధాన పక్షంగా బలం సాధించుకునేందుకు వీలవుతుందని ఆ పార్టీ నేతలు అంచనా వేస్తున్నారు. వెల్లివిరిసిన ఆనందం ఓ వైపు టీవీ చానెళ్లలో ఎన్నికల ఫలితాలు వెలువడుతుండగానే నగరంలోని బీజేపీ నాయకులు, కార్యకర్తలు బాణ సంచా పేల్చి... రంగులు చల్లుకొని... సంబరాలు చేసుకున్నారు. బీజేపీ గ్రేటర్ అధ్యక్షుడు బి.వెంకటరెడ్డి ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులు పరస్పరం శుభాకాంక్షలు తెలుపుకుంటూ స్వీట్లు పంచుకున్నారు. నగరంలోని వివిధ ప్రాంతాల్లో బీజేపీ కార్యకర్తలు రోడ్లపైకి వచ్చి.. కేరింతలు కొట్టారు. మరోవైపు నగరంలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు ఉత్సవాలు జరుపుకున్నారు. -
మండలికి బీజేపీ రెడీ!
* పట్టభద్రుల నియోజకవర్గం అభ్యర్థిగా రామచంద్రరావు పేరు ఖరారు * అధికారపార్టీలో ఆశావహుల మధ్య తీవ్ర పోటీ * కౌన్సిల్ సమరానికి కాంగ్రెస్ దూరం! సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: శాసనమండలి బరిలో ఎన్.రామచంద్రరావు మరోసారి అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. త్వరలో జరిగే హైదరాబాద్- రంగారెడ్డి- మహబూబ్నగర్ పట్టభద్రుల నియోజకవర్గం నుంచి బీజేపీ తరఫున ఆయన పోటీ చేయనున్నారు. ప్రస్తుతం ఈ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నప్రొఫెసర్ కె.నాగేశ్వర్ పదవీకాలం వచ్చే ఏడాది మార్చితో ముగియనుంది. ఈ నేపథ్యంలో రామచంద్రరావు అభ్యర్థిత్వాన్ని ఖరారు చేస్తూ బీజేపీ అధిష్టానం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు బుధవారం పత్రికా ప్రకటన విడుదల చేసింది. గతంలోనూ ఇదే స్థానం నుంచి రామచంద్రరావు పోటీచేసి ఓటమిపాలయ్యారు. ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లోనూ ఆయనకు పరాభవమే ఎదురైంది. మల్కాజిగిరి అసెంబ్లీ సెగ్మెంట్ నుంచి రంగంలోకి దిగిన రామచంద్రరావు సమీప టీఆర్ఎస్ అభ్యర్థి కనకారెడ్డి చేతిలో స్వల్ప ఓట్లతో ఓడిపోయారు. హైకోర్టు న్యాయవాదిగా సుపరిచితులైన రామచంద్రరావు బీజేపీ అధికార ప్రతినిధిగా వ్యవహరిస్తున్నారు. శాసనమండలి ఎన్నికల్లో బీజేపీకి మద్దతు ఇస్తున్నట్లు ఇదివరకే తెలుగుదేశం పార్టీ ప్రకటించింది. ఈ నేపథ్యంలో పెద్దలసభకు రామచంద్రరావు అభ్యర్థిత్వానికి కమల నాయకత్వం పచ్చజెండా ఊపింది. వరుసగా రెండు సార్లు ఈ నియోజకవర్గం నుంచి గెలుపొందిన నాగేశ్వర్ ఈ సారి పోటీ చేసేందుకు ఆసక్తి చూపడంలేదనే సంకేతాలు బీజేపీ శ్రేణుల్లో ఒకింత ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. వామపక్ష పార్టీలు బలపరిచిన నాగేశ్వర్కు గతంలో టీఆర్ఎస్ కూడా మద్దతు పలికింది. ఈ సారి కమ్యూనిస్టు పార్టీలు మరొకరిని తెరమీదకు తేవాలని భావిస్తున్నాయనే ప్రచారం నేపథ్యంలో నాగేశ్వర్ పోటీ చేయకపోవచ్చని రాజకీయవర్గాలు అంచనా వేస్తున్నాయి. విద్యావంతుల్లో అంతగా పట్టులేదని భావిస్తున్న కాంగ్రెస్.. ఈ ఎన్నికలకు దూరంగా ఉండాలనే భావిస్తోంది. కాగా, విజయోత్సాహంతో ఉన్న అధికార టీఆర్ఎస్ పార్టీలో మాత్రం ఆశావహులు భారీగానే ఉన్నట్లు తెలుస్తోంది. త్వరలో పదవీ విరమణ చేయనున్న ఉపాధ్యాయ సంఘం నేత వెంకటరెడ్డి ఆ పార్టీ నుంచి టికెట్ రేసులో ముందంజలో ఉన్నారు. కాగా, పట్టభద్రుల నియోజకవర్గంలో స్థానికేతరుల అభ్యర్థిత్వాన్ని అంగీకరించేదిలేదని పేర్కొంటూ రంగారెడ్డి జిల్లాలోని టీఆర్ఎస్ అనుకూల విద్యార్థి నేతలు మద్దతు కూడగట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఇదిలావుండగా, పట్టభద్రుల ఓటర్ల నమోదుకు గడువును వచ్చేనెల 6వ తేదీవరకు పొడిగించారు. -
పట్టభద్రుల సీటుకు రామచంద్రరావు పేరు ఖరారు
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్నగర్ జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గం నుంచి శాసనమండలికి నిర్వహించనున్న ఎన్నికల్లో అభ్యర్థిగా రాష్ట్రపార్టీ ప్రధాన అధికార ప్రతినిధి ఎన్.రామచంద్రరావు పేరును జాతీయ నాయకత్వానికి తెలంగాణ రాష్ట్ర బీజేపీ సిఫార్సు చేసింది. ప్రస్తుత ఎమ్మెల్సీ కె.నాగేశ్వర్ పదవీకాలం మార్చి చివర్లో ముగియనుండటంతో ఈ ఖాళీ ఏర్పడనుంది. ఇక్కడి నుంచి పోటీ చేసేందుకు రామచంద్రరావుతోపాటు మాజీ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాసరెడ్డి, డా.మల్లారెడ్డి (రంగారెడ్డిజిల్లా) పోటీపడుతున్నారు. అయితే బీజేపీ రాష్ట్రఎన్నికలకమిటీ రామచంద్రరావు పేరును ఎంపికచేసి జాతీయనాయకత్వానికి సిఫార్సు చేసినట్లు సమాచారం. అతనికి కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు మద్దతుందని చెబుతున్నారు. -
రాజ్నాథ్ పర్యటన వాయిదా
అనారోగ్య కారణాలతో నేటి పర్యటన రద్దు సాక్షి, హైదరాబాద్: బీజేపీ జాతీయ అధ్యక్షుడు రాజ్నాధ్సింగ్ రాష్ట్ర పర్యటన మరోసారి వాయిదా పడింది. గత నెల 21న జరగాల్సిన ఆయన పర్యటన నేటికి వాయిదా పడింది. అయితే అనారోగ్య కారణాలవల్ల రాజ్నాధ్ బుధవారం కూడా రాష్ట్రానికి రావడంలేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్రెడ్డి, పార్టీ అధికార ప్రతినిధి ఎన్.రామచంద్రరావు తెలిపారు. అయితే ఆర్ఎస్ఎస్ నేతలు రాంలాల్, సతీష్, మురళీధర్రావు వస్తున్నారని, నిర్దేశిత కార్యక్రమాలు యధావిధిగా కొనసాగుతాయని వారు చెప్పారు. పార్టీ పునర్నిర్మాణం, సీమాంధ్ర ఉద్యమం, అంతర్గత కలహాలు, పోటీ చేసే నియోజకవర్గాలు తదితర అంశాలను కోర్కమిటీ సమావేశంలో చర్చిస్తారని తెలిసింది. పార్టీ తొలి ప్రాధాన్యత జాబితాలో ఉన్న సికింద్రాబాద్, మహబూబ్నగర్, నిజమాబాద్, కరీంనగర్, మల్కాజ్గిరి లోక్సభస్థానాల అభ్యర్థుల పేర్లు కేంద్ర నాయకత్వానికి చేరాయి. వీరిలో బండారు దత్తాత్రేయ, నాగం జనార్దన్రెడ్డి, యెండల లక్ష్మీనారాయణ, సీహెచ్ విద్యాసాగరరావు, నల్లు ఇంద్రసేనారెడ్డి, ఎన్.రామచంద్రరావు, డాక్టర్ కె.లక్ష్మణ్ పేర్లు ఉన్నాయి. మరోవైపు టీడీపీతో పొత్తు వ్యవహారమై పార్టీలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈనేపథ్యంలో గత పొత్తులు, గెలిచిన సీట్లు వంటి వాటిని మరోసారి సమీక్షించనున్నారు. టీడీపీతో పొత్తు వ్యవహారంలో కీలకపాత్ర పోషిస్తున్నట్టుగా భావిస్తున్న వెంకయ్య నాయుడు కూడా బుధవారం జరిగే సమావేశాలకు హాజరుకావడం లేదని తెలిసింది.