breaking news
Medical Shops
-
ఆంక్షల చట్రంలో సిరప్లు
ఎంతో జాప్యం జరిగాక భారత ప్రభుత్వం ఒక మంచి నిర్ణయం తీసుకుంది. దగ్గుకు వాడే సిరప్లు ఇకపై వైద్యుల చీటి లేకుండా అమ్మరాదని ఔషధ దుకాణాలపై ఆంక్షలు తీసుకొస్తూ కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నెల 9నే వెలువడిన ఆ నోటిఫికేషన్ మంగళవారం వెలుగులోకొచ్చింది. విదేశాలతో పోలిస్తే మన వైద్య ఆరోగ్యరంగం ఎన్నో సమస్యలు ఎదుర్కొంటున్నది. గ్రామీణ ప్రాంతాల్లో వైద్యుల కొరత చాలా ఎక్కువ. పట్టణాలు, నగరాల్లో ఈ సమస్య లేదు. గ్రామాల్లోనైనా, పట్టణాల్లోనైనా ఔషధ దుకాణాల కొరత మాత్రం ఉండదు. ప్రిస్క్రిప్షన్ లేకుండా ఎలాంటి ఔషధాలైనా విక్రయించే అలవాటు కూడా ఎక్కువే. ఈ వెసులుబాటు ఎంత వరకూ వచ్చిందంటే చిన్న చిన్న సమస్యలకు వైద్యుల్ని ఆశ్రయించటంకన్నా మందుల దుకాణంలో సమస్య చెబితే సరిపోతుందన్న అభిప్రాయం సామాన్య జనంలో స్థిరపడింది. పేదరికంవల్ల వైద్యుల దగ్గరకెళ్లే స్థోమత లేకపోవటం కూడా ఇందుకొక కారణం. విదేశాల్లో కేవలం కొన్ని రకాల విటమిన్ మాత్రలు, జలుబు మందులు మాత్రమే చీటి లేకుండా లభిస్తాయి. యాంటీ బయోటిక్స్, కొన్ని ఇతర ఔషధాలు కావాలంటే ప్రిస్క్రిప్షన్ ఉండాలి. అది కూడా ఆన్లైన్లో అప్లోడ్ అయి ఉంటేనే విక్రయిస్తారు. ఇక దగ్గు మందు విషయానికొస్తే మనకు అంతర్జాతీయంగా చాలా చెడ్డపేరొచ్చింది. 2022లో పశ్చిమాఫ్రికా దేశమైన గాంబియాలో మన దేశంనుంచి దిగుమతైన దగ్గుమందు సేవించి 70 మంది చిన్నారులు మరణించారు. వీరిలో దాదాపు అందరూ మూత్ర పిండాలు పూర్తిగా దెబ్బతిన్నవారే. అదే సంవత్సరం ఉజ్బెకిస్తాన్లో కూడా ఈ కారణంగానే మరో 18 మంది పిల్లలు చనిపోయారు. అటుతర్వాత ఇండోనేసియా, మార్షల్ ఐలాండ్స్ వంటిచోట్ల భారతీయ దగ్గు మందుల నాణ్యతపై ప్రభుత్వాలు హెచ్చరికలు జారీచేశాయి. మన దేశంలోనూ సమస్యలు తలెత్తిన ఉదంతాలున్నాయి. నిరుడు అక్టో బర్లో మధ్యప్రదేశ్లో దగ్గుమందు వాడకంవల్లే 22 మంది పసిపిల్లలు ప్రాణాలు కోల్పో యారు. ఆ సిరప్లో డై ఇథిలీన్ గ్లైకాల్(డీఈజీ) అనే విషపూరిత పారిశ్రామిక ద్రావకం 45 శాతం ఉన్నట్టు తేలింది. వాస్తవానికి ఆ మందులో అనుమతించదగ్గ పరిమితి కేవలం 0.1 శాతం మాత్రమే. అంటే పరిమితికి మించి వందల రెట్లు ఎక్కువుందన్న మాట! మన ఔషధరంగ నియంత్రణ వ్యవస్థలు పకడ్బందీగా లేవన్న విమర్శలు ఎప్పటి నుంచో ఉన్నాయి. మార్కెట్ రీసెర్చ్ ఫ్యూచర్(ఎంఆర్ఎఫ్) నివేదిక ప్రకారం 2024లో దగ్గు మందుల మార్కెట్ విలువ దాదాపు 27 కోట్ల డాలర్లు కాగా, అది యేటా 9.9 శాతం వృద్ధి రేటు సాధిస్తుందని అంచనా వేశారు. 2035 నాటికి ఇది మూడురెట్లు పెరుగుతుందని చెబుతున్నారు. కొత్త ఔషధాల తయారీ, దిగుమతులు, క్లినికల్ పరీక్షలు, ప్రమా ణాల రూపకల్పన కోసం మనకు కేంద్ర ఔషధ ప్రమాణాల నియంత్రణ సంస్థ (సీడీఎస్సీఓ) ఉంది. దీనికింద ఆరు జోనల్ కార్యాలయాలు, సబ్ జోనల్ కార్యాల యాలు, వీటికి అనుబంధంగా డ్రగ్ టెస్టింగ్ లాబొరేటరీలు ఉన్నాయి. ఇవిగాక రాష్ట్రాల స్థాయిలో ఔషధ నియంత్రణలున్నాయి. ఇన్ని రకాల వ్యవస్థలు ఉన్నా నాసిరకం మందులు మార్కెట్లోకి వస్తున్నాయి. ఇవి వైద్యసలహా లేకుండానే దుకాణదారుల దగ్గర లభ్యమవుతున్నాయంటే మనం ఎంత ప్రమాదకర స్థితిలో ఉన్నామో అర్థమవుతుంది. ఇదంతా కేంద్ర, రాష్ట్ర విభాగాల మధ్య సమన్వయం సరిగా లేకపోవటం వల్లనేనని చెబుతారు. మన దేశంలో 1,100 దగ్గుమందు ఉత్పాదక సంస్థలుండగా, తనిఖీ చేసిన 90 శాతం సంస్థల్లో నిబంధనలు ఉల్లంఘనలు కనబడ్డాయనీ, వాటిపై చర్యలు తీసుకుంటు న్నామనీ ఇటీవల డీసీజీఐ రాజీవ్ రఘువంశీ చెప్పారు. దగ్గు మందు మాత్రమే కాదు... యాంటీ బయోటిక్స్, నొప్పి నివారణ మాత్రలు, గర్భస్రావ మాత్రలు, నిద్ర మాత్రలు వగైరాల విషయంలోనూ నియంత్రణలు అవసరం. వైద్యుల సలహా లేకుండా వాడటంవల్ల పౌరుల ఆరోగ్యం తీవ్రంగా దెబ్బతింటోంది. ఆ సంగతి గ్రహించేలోగానే పరిస్థితి చేయిదాటుతోంది. గర్భస్రావ మాత్రలైతే మహిళల ప్రాణాలు తీస్తున్నాయి. కనుక మొత్తంగా ఔషధ రంగ వ్యవస్థను ప్రక్షాళన చేయటం అత్యవసరం. -
మెడికల్ షాప్ సిబ్బందిపై బుల్లెట్ల వర్షం.. క్యాషియర్ మృతి
చంఢీగడ్: మెడికల్ షాప్లోకి చొరబడి దుండగులు కాల్పులు జరిపిన ఘటన చంఢీగఢ్లో చోటు చేసుకుంది. మెడికల్స్టోర్లోకి ప్రవేశించిన పలువురు దుండగులు పలు రౌండ్లు కాల్పులు జరిపారు. ముఖాలకు మాస్క్లు ధరించి వచ్చిన ఇద్దరు దుండగులు.. ఒక్కసారిగా మెడికల్ షాప్లో ఉన్నవారిపై కాల్పులకు తెగబడ్డారు. బుల్లెట్ల వర్షం కురిపించారు. దాదాపు 13 రౌండ్లు కాల్పులు జరిపారు.ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన క్యాషియర్ మృత్యువాత పడ్డారు. మెడికల్ షాపులో చొరబడి కాల్పులు జరపడంపై పలువురు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. అయితే మెడికల్ షాపులోకి చొరబడి కాల్పులు జరపడం వెనుక పాత విభేదాలు కారణమై ఉండొచ్చనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఏకంగా బుల్లెట్ల వర్షం కురిపించడంతో పాత గొడవలే కారణమై ఉండొచ్చని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఆ దిశగా దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. -
మెడికల్ షాపులు బంద్.. ఏపీలో మూతపడ్డ 45K షాపులు
-
నేడు మెడికల్ షాపులు బంద్
సాక్షి, న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా ఇవాళ మెడికల్ షాపులు బంద్ పాటించనున్నాయి. ఆన్లైన్లో మందులు అమ్మకాలను ఆలిండియా ఆర్గనైజేషన్ ఆఫ్ కెమిస్ట్స్, డ్రగ్గిస్ట్స్ (AIOCD) తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. ఈ క్రమంలోనే దేశవ్యాప్తంగా దాదాపు 16 లక్షల దుకాణాలు బుధవారం మూతపడనున్నాయి. ఈ నేపథ్యంలో.. ప్రత్యామ్నాయ మార్గాలపై అధికారులు దృష్టిసారించారు. మందుల సరఫరాకు అంతరాయం కలగకుండా చర్యలు తీసుకున్నారు. అత్యవసర, ఇతరత్ర మందులను అందుబాటులో ఉంచుకోవాలని జిల్లా యంత్రాంగాలకు ఇప్పటికే ఆదేశాలు జారీ అయ్యాయి. మరోవైపు.. ప్రధాన ఫార్మసీ చైన్లు, ఆస్పత్రుల్లోని మెడికల్ స్టోర్లు, జన ఔషధి కేంద్రాలు, అమృత్ ఔట్లెట్స్ మాత్రం తెరిచి ఉండే అవకాశాలున్నాయి.వివాదం నేపథ్యంకోవిడ్ సమయంలో ప్రజలకు మందులు అందుబాటులో ఉండేలా కేంద్ర ప్రభుత్వం తాత్కాలికంగా డోర్ డెలివరీకి అనుమతి ఇచ్చింది. కానీ మహమ్మారి ముగిసిన తర్వాత కూడా కార్పొరేట్ ఈ–ఫార్మసీలు ఆ వెసులుబాటును కొనసాగిస్తూ ఆన్లైన్ విక్రయాలు చేస్తున్నారు. రిటైల్ షాపు యజమానుల అభిప్రాయం ప్రకారం.. ఆన్లైన్ ప్రిస్క్రిప్షన్లను వెరిఫై చేయకుండానే మందులు ఇస్తున్నారు(డెలివరీలు సైతం). ఇది ప్రజారోగ్యానికి ముప్పు. అలాగే ఈ చర్యలతో తమ వ్యాపారాలు దెబ్బ తింటున్నాయి. నిత్యావసర సరుకుల మాదిరిగా మందులను విక్రయించడం సరైన పద్ధతి కాదని వారు అంటున్నారు.రిటైల్ వ్యాపారుల ఆందోళనలుఈ–ఫార్మసీలు భారీ డిస్కౌంట్లు ఇస్తూ రిటైల్ మార్కెట్ను ఆక్రమించుకోవాలని ప్రయత్నిస్తున్నాయని ఆరోపణలు ఉన్నాయి. దీనివల్ల అనారోగ్యకరమైన పోటీ ఏర్పడుతోందని కెమిస్టులు చెబుతున్నారు. వైద్య నిపుణులు కూడా హెచ్చరిస్తూ.. కేవలం డిస్కౌంట్ కోసం ఆన్లైన్లో మందులు కొనడం ప్రజల ప్రాణాలకు ప్రమాదకరమని సూచిస్తున్నారు.చట్టపరమైన అంశాలుఔషధ నియంత్రణ చట్టం ప్రకారం షెడ్యూల్ హెచ్లోని యాంటీబయాటిక్స్, పెయిన్ కిల్లర్స్, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ మందులు, అలాగే షెడ్యూల్ ఎక్స్లోని నిద్ర మాత్రలు, మత్తు మందులు వైద్యుల ప్రిస్క్రిప్షన్తోనే ఇవ్వాలి. కానీ ఆన్లైన్ విక్రయాల ద్వారా ఈ మందులు దుర్వినియోగానికి గురవుతున్నాయనే ఆరోపణలు ఉన్నాయి.ప్రభుత్వ హామీఇటీవల AIOCD ప్రతినిధులు కేంద్ర డ్రగ్ నియంత్రణ సంస్థతో సమావేశమై ఈ–ఫార్మసీల నియంత్రణపై చర్చించారు. చట్టపరమైన అంశాలను పరిశీలించి సరైన నిర్ణయం తీసుకుంటామని సంస్థ హామీ ఇచ్చింది.రాష్ట్రాల వైఖరిఅయితే అన్ని రాష్ట్రాలు ఈ బంద్లో పాల్గొనడం లేదు. పశ్చిమ బెంగాల్, కేరళ, పంజాబ్, మహారాష్ట్ర, కర్ణాటక, హర్యానా, ఉత్తరప్రదేశ్, గుజరాత్, ఛత్తీస్గఢ్, సిక్కిం, ఉత్తరాఖండ్ రాష్ట్రాల అసోసియేషన్లు.. కేంద్రపాలిత ప్రాంతం లడాఖ్ బంద్లో పాల్గొనబోమని లేఖలు సమర్పించాయి.ముగింపుఆన్లైన్ ఫార్మసీల నియంత్రణ, ప్రజారోగ్య భద్రత, రిటైల్ వ్యాపారుల ఆర్థిక స్థితి.. ఈ మూడు అంశాల మధ్యే వివాదం కేంద్రీకృతమై ఉంది. ఒక రోజు బంద్ ద్వారా కెమిస్టులు తమ ఆందోళనను వ్యక్తం చేయబోతున్నారు.


