నేడు మెడికల్‌ షాపులు బంద్‌ | Nationwide Medical Shops Shutdown Today Over Opposition To Online Medicine Sales, Check Out More Details | Sakshi
Sakshi News home page

నేడు మెడికల్‌ షాపులు బంద్‌

May 20 2026 6:37 AM | Updated on May 20 2026 9:05 AM

Medical Shops Shut Down India Wise Today News Updates

సాక్షి, న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా ఇవాళ మెడికల్‌ షాపులు బంద్‌ పాటించనున్నాయి. ఆన్‌లైన్‌లో మందులు అమ్మకాలను ఆలిండియా ఆర్గనైజేషన్‌ ఆఫ్‌ కెమిస్ట్స్‌, డ్రగ్గిస్ట్స్‌ (AIOCD) తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. ఈ క్రమంలోనే దేశవ్యాప్తంగా దాదాపు 16 లక్షల దుకాణాలు బుధవారం మూతపడనున్నాయి. ఈ నేపథ్యంలో.. 

ప్రత్యామ్నాయ మార్గాలపై అధికారులు దృష్టిసారించారు. మందుల సరఫరాకు అంతరాయం కలగకుండా చర్యలు తీసుకున్నారు. అత్యవసర, ఇతరత్ర మందులను అందుబాటులో ఉంచుకోవాలని జిల్లా యంత్రాంగాలకు ఇప్పటికే ఆదేశాలు జారీ అయ్యాయి. మరోవైపు.. ప్రధాన ఫార్మసీ చైన్‌లు, ఆస్పత్రుల్లోని మెడికల్‌ స్టోర్లు, జన ఔషధి కేంద్రాలు, అమృత్‌ ఔట్‌లెట్స్‌ మాత్రం తెరిచి ఉండే అవకాశాలున్నాయి.

వివాదం నేపథ్యం
కోవిడ్‌ సమయంలో ప్రజలకు మందులు అందుబాటులో ఉండేలా కేంద్ర ప్రభుత్వం తాత్కాలికంగా డోర్‌ డెలివరీకి అనుమతి ఇచ్చింది. కానీ మహమ్మారి ముగిసిన తర్వాత కూడా కార్పొరేట్‌ ఈ–ఫార్మసీలు ఆ వెసులుబాటును కొనసాగిస్తూ ఆన్‌లైన్‌ విక్రయాలు చేస్తున్నారు. రిటైల్‌ షాపు యజమానుల అభిప్రాయం ప్రకారం.. ఆన్‌లైన్‌ ప్రిస్క్రిప్షన్లను వెరిఫై చేయకుండానే మందులు ఇస్తున్నారు(డెలివరీలు సైతం). ఇది ప్రజారోగ్యానికి ముప్పు. అలాగే ఈ చర్యలతో తమ వ్యాపారాలు దెబ్బ తింటున్నాయి. నిత్యావసర సరుకుల మాదిరిగా మందులను విక్రయించడం సరైన పద్ధతి కాదని వారు అంటున్నారు.

రిటైల్‌ వ్యాపారుల ఆందోళనలు
ఈ–ఫార్మసీలు భారీ డిస్కౌంట్లు ఇస్తూ రిటైల్‌ మార్కెట్‌ను ఆక్రమించుకోవాలని ప్రయత్నిస్తున్నాయని ఆరోపణలు ఉన్నాయి. దీనివల్ల అనారోగ్యకరమైన పోటీ ఏర్పడుతోందని కెమిస్టులు చెబుతున్నారు. వైద్య నిపుణులు కూడా హెచ్చరిస్తూ.. కేవలం డిస్కౌంట్‌ కోసం ఆన్‌లైన్‌లో మందులు కొనడం ప్రజల ప్రాణాలకు ప్రమాదకరమని సూచిస్తున్నారు.

చట్టపరమైన అంశాలు
ఔషధ నియంత్రణ చట్టం ప్రకారం షెడ్యూల్‌ హెచ్‌లోని యాంటీబయాటిక్స్‌, పెయిన్‌ కిల్లర్స్‌, బ్యాక్టీరియల్‌ ఇన్ఫెక్షన్‌ మందులు, అలాగే షెడ్యూల్‌ ఎక్స్‌లోని నిద్ర మాత్రలు, మత్తు మందులు వైద్యుల ప్రిస్క్రిప్షన్‌తోనే ఇవ్వాలి. కానీ ఆన్‌లైన్‌ విక్రయాల ద్వారా ఈ మందులు దుర్వినియోగానికి గురవుతున్నాయనే ఆరోపణలు ఉన్నాయి.

ప్రభుత్వ హామీ
ఇటీవల AIOCD ప్రతినిధులు కేంద్ర డ్రగ్‌ నియంత్రణ సంస్థతో సమావేశమై ఈ–ఫార్మసీల నియంత్రణపై చర్చించారు. చట్టపరమైన అంశాలను పరిశీలించి సరైన నిర్ణయం తీసుకుంటామని సంస్థ హామీ ఇచ్చింది.

రాష్ట్రాల వైఖరి
అయితే అన్ని రాష్ట్రాలు ఈ బంద్‌లో పాల్గొనడం లేదు. పశ్చిమ బెంగాల్‌, కేరళ, పంజాబ్‌, మహారాష్ట్ర, కర్ణాటక, హర్యానా, ఉత్తరప్రదేశ్‌, గుజరాత్‌, ఛత్తీస్‌గఢ్‌, సిక్కిం, ఉత్తరాఖండ్‌ రాష్ట్రాల అసోసియేషన్లు.. కేంద్రపాలిత ప్రాంతం లడాఖ్‌ బంద్‌లో పాల్గొనబోమని లేఖలు సమర్పించాయి.

ముగింపు
ఆన్‌లైన్‌ ఫార్మసీల నియంత్రణ, ప్రజారోగ్య భద్రత, రిటైల్‌ వ్యాపారుల ఆర్థిక స్థితి.. ఈ మూడు అంశాల మధ్యే వివాదం కేంద్రీకృతమై ఉంది. ఒక రోజు బంద్‌ ద్వారా కెమిస్టులు తమ ఆందోళనను వ్యక్తం చేయబోతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement