breaking news
Marauders
-
బందిపోటును పట్టించిన ఆంగ్లపత్రిక..
సాక్షి, సిటీబ్యూరో: మహారాష్ట్రకు చెందిన 10 మంది ముఠా కట్టారు... పక్కాగా ప్లాన్ చేసి రెక్కీ నిర్వహించారు... నగరంలో పంజా విసిరారు... ఏ సాక్ష్యం మిగలకుండా జాగ్రత్తపడ్డారు... అయినా ఘటనాస్థలిలో పోలీసులకు లభించిన ఓ ఆంగ్ల పత్రిక కీలకాధారంగా మారి ముఠా గుట్టు రట్టు చేసింది. పేట్లబురుజులోని బంగారు నగల తయారీ కర్మాగారంలో ఈ నెల 6న చోటు చేసుకున్న బందిపోటు దొంగతనం కేసు నేపథ్యమిది. మహారాష్ట్రకు చెందిన ఈ గ్యాంగ్ సూత్రధారి అమ్జను అరెస్టు చేసినట్లు నగర పోలీసు కమిషనర్ అంజనీ కుమార్ గురువారం వెల్లడించారు. పరారీలో ఉన్న ముఠా సభ్యులు చిక్కితే పూర్తి వివరాలు వెలుగులోకి వస్తాయని దక్షిణ మండల డీసీపీ సత్యనారాయణ తెలిపారు. గురువారం సిటీ పోలీస్ కమిషనరేట్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కొత్వాల్ వివరాలు వెల్లడించారు. ఈ ఘటనలో 3.5 కేజీల బంగారం, విలువైన రాళ్లు, ముత్యాలు చోరీకి గురికాగా, ప్రస్తుతం రూ.6 లక్షల విలువైన సొత్తు చేసుకున్నట్లు తెలిపారు. ముంబై కార్యాలయం సమీప వాసే... పశ్చిమ బెంగాల్కు చెందిన నిథాయిదాస్ బంగారు ఆభరణాల తయారీ వ్యాపారం నిర్వహిస్తున్నారు. ముంబైలో ప్రధాన కార్యాలయంతో పాటు ఓ కార్ఖానా ఉండగా, పాతబస్తీలోని పేట్లబురుజు ప్రాంతంలోని షేర్ అలీ తబేలాలోని ముజీబ్ అనే వ్యక్తి ఇంట్లో మరో కార్ఖానా నడుస్తోంది. థానేలోని అతని కార్యాలయానికి సమీపంలో నివసిస్తున్న పాత నేరగాడు అమ్జద్ ఖాజా అమీన్ షేక్ అలియాస్ అమ్జా కన్ను నిథాయి వ్యాపార లావాదేవీలపై పడింది. అంతరాష్ట్ర ముఠాను నిర్వహించే ఇతడిపై షోలాపూర్, థానే, ముంబైల్లోని పోలీసుస్టేషన్లలో స్నాచింగ్, దోపిడీ, బందిపోటు దొంగతనాలకు సంబంధించి 40 కేసులు ఉన్నాయి. షేర్ అలీ తబేలాలోని నిథాయిదాస్కు కర్మాగారాన్ని కొల్లగొట్టాలని నిర్ణయించుకున్న ఇతను ముంబైతో పాటు షోలాపూర్కు చెందిన తొమ్మి ది మందితో ముఠా ఏర్పాటు చేశాడు. ఇదే కర్మాగారం టార్గెట్గా మారడం వెనుక ఇంటిదొంగల పాత్రపై పోలీసులు అనుమానిస్తున్నారు. మాట్లాడుతున్న సీపీ అంజనీ కుమార్ పక్కా ప్రొఫెషనల్గా.. ఆరితేరిన బందిపోటు ముఠా కావడంతో వీరు పక్కా ప్రొఫెషనల్గా వ్యవహరించారు. ముఠాకు చెందిన ఓ వ్యక్తిని నాయకుడు ముందుగా నగరానికి పంపించి రెక్కీలు చేయించాడు. కొన్ని రోజుల ముందు ముఠా సభ్యులంతా వేర్వేరుగా వచ్చి హైదరాబాద్లో కలిశారు. అప్పుడే వీరికి పేట్లబురుజుల్లో ఎంచుకున్న తమ ‘మీటింగ్ పాయింట్’ నాయకుడు చూపించాడు. ఆపై ఎవరికి వారుగా వెళ్లిపోయారు. ఈ నెల 5న ముంబై నుంచి బయలుదేరిన ముఠా షోలాపూర్ చేరుకుంది. అక్కడ నుంచి ఎవరికి వారుగా 6న హైదరాబాద్ చేరుకున్నారు. ముఠా నాయకుడితో పాటు సభ్యులు సైతం తమ వెంట కత్తులను మాత్రమే తీసుకువచ్చారు. బేగంపేట, సికింద్రాబాద్, నాంపల్లిల్లో వేర్వేరుగా దిగిన వీరు సులఖ్ కాంప్లెక్స్ల్లో కాలకృత్యాలు తీర్చుకుని ఎవరికివారు పాతబస్తీలోని తమ మీటింగ్ పాయింట్కు వచ్చారు. అక్కడికి వచ్చిన తర్వాత కూడా కలవకుండా వేర్వేరుగానే ఉంటూ, కనుసైగలతో సంభాషించుకుని కార్ఖానాపై దాడి చేశారు. భారీ సెర్చ్ ఆపరేషన్ తర్వాత... దీంతో ముంబై వెళ్లిన ప్రత్యేక బృందాలు అక్కడి పోలీసులను కలిసి ఆరా తీయగా, అమ్జతో సహా మరికొందరు పాత నేరగాళ్ల వివరాలు లభించాయి. వీటి ఆధారంగా గాలింపు చేపట్టిన పోలీసులు అమ్జను పట్టుకుని సిటీకి తీసుకువచ్చాయి. ఇతడి నుంచి రూ.6 లక్షలు విలువైన సొత్తు రికవరీ చేయగా... మిగిలింది ముఠా సభ్యులు ముంబై, గుజరాత్లో విక్రయించినట్లు గుర్తించారు. వారు అరెస్టైన తర్వాత ఆ సొత్తు రికవరీ చేయాలని భావిస్తున్నారు. ఈ ముఠాలో ఎవరైనా పోలీసులకు చిక్కిన వెంటనే మిగిలిన ముఠా సభ్యులు రివకరీకి ఆస్కారం ఇవ్వరు. మిస్సింగ్ కేసులు పెట్టడం, కోర్టుల్లో పిటీషన్లు వేయడం, మానవహక్కుల సంఘాలను ఆశ్రయించడం చేస్తుంటారు. ఈ నేపథ్యంలోనే వీరు అనేక చోట్ల నేరాలు చేసి చిక్కినా ఎక్కడా పూర్తి స్థాయి రికవరీ సాధ్యం కాలేదు. ఈ గ్యాంగ్లో మిగిలిన సభ్యులను అరెస్టు చేయడానికి, సొత్తు రికవరీ కోసం రెండు టాస్క్ఫోర్స్ ప్రత్యేక బృందాలను కొనసాగిస్తున్నారు. ఈ కేసు కొలిక్కి తీసుకురావడంలో టాస్క్ఫోర్స్, చార్మినార్ ఇన్స్పెక్టర్లు ఎస్.మోహన్కుమార్, కె.చంద్రశేఖర్రెడ్డి కీలక పాత్ర పోషించినట్లు కొత్వాల్ తెలిపారు. కత్తికి చుట్టిన పేపర్ ఆధారంగా.. పక్కాగా వ్యవహరించిన ఈ గ్యాంగ్ తమకు తెలియకుండానే కీలక సాక్ష్యాన్ని పోలీసులకు అందించింది. 5న ముంబై నుంచి బయలుదేరిన ముఠా సభ్యుడు తన కత్తిని అక్కడి ఓ ఆంగ్ల దినపత్రికలో చుట్టుకుని, బ్యాగ్లో పెట్టుకుని వచ్చాడు. కార్ఖానాలోకి ప్రవేశించిన తర్వాత తన కత్తిని బయటకు తీసి, పేపర్ అక్కడే పడేశాడు. ‘పని’ పూర్తయిన తర్వాత ముఠా సభ్యులు వేర్వేరుగా పారిపోయి షోలాపూర్లో కలుసుకుని సొత్తు పంచుకున్నారు. ఘటనాస్థలిలో పోలీసులు ఆంగ్ల పేపర్ను స్వాధీనం చేసుకుని పరిశీలించారు. దానిపై ఉన్న మచ్చల్ని బట్టి, బాధితులు చెప్పిన దాన్ని బట్టి ముఠా సభ్యులు తెచ్చిందిగా నిర్థారించారు. అది ముంబై పత్రికని తేలడంతో అక్కడి ముఠాగా భావించారు. టాస్క్ఫోర్స్ అదనపు డీసీపీ చైతన్యకుమార్, చార్మినార్ ఏసీపీ అంజయ్య నేతృత్వంలో 12 బృందాలు ఏర్పాటు చేశారు. మరో రెండు టీమ్స్ ఘటనాస్థలి పరిసరాలు, ఇతర చోట్ల ఉన్న 300 సీసీ కెమెరాల్లో రికార్డైన ఫీడ్ను పరిశీలించింది. క్రైమ్ జరిగిన కార్ఖానాకు 100 మీటర్ల దూరంలో ఉన్న కెమెరాలో నమోదైన దృశ్యాలను బట్టి టోపీలు, వెనుక తగిలించుకునే బ్యాగ్లు, మాస్క్లతో ఉన్న 10 మంది అనుమానితులను గుర్తించారు. -
కెమెరాల్లేకుండానే నిఘా వ్యవస్థ..
ఇప్పుడు ఇంట్లో నిఘా కెమెరాల్లేకుండానే ఇంటికి భద్రత కల్పించుకునే అవకాశం అందుబాటులోకి రానుంది. మీ ఇంట్లో ఎవరు సంచరిస్తున్నారు అన్న విషయాన్ని ఓ యాప్ ద్వారా తెలుసుకోవచ్చు. 'గ్జాండెమ్ హోమ్' పేరిట రానున్న ఈ కొత్త ఉత్పత్తి... ఇంట్లోని ప్రతి కదలికలనూ హ్యారీ పాటర్ మాయా మరుడర్స్ మ్యాప్ వంటి ఓ చిన్న డిజిటల్ పరికరంద్వారా గుర్తిస్తుంది. కెమెరాలకు బదులుగా ప్లగ్ ఇన్ నోడ్స్ ను ఉపయోగించి ఓ సాలెగూడులా ఇంల్లంతా రేడియో తరంగాలు వ్యాపింపచేయడం వల్ల ఇంట్లోని ప్రతి కదలికనూ ఈ వ్యవస్థ శులభంగా గుర్తించగల్గుతుంది. ట్రెడిషనల్ మోషన్ డిటెక్షన్ సిస్టమ్ తో వచ్చే తప్పుడు అలారాలు, పరిమిత కవరేజ్ వంటి సమస్యలు పరిష్కరిస్తూ, ఇల్లంతా నిఘా వ్యవస్థను అందుబాటులో ఉండేలా చేస్తుంది. ఈ వ్యవస్థను నేషనల్ సైన్స్ ఫౌండేషన్ మరియు హోం ల్యాండ్ సెక్యూరిటీ సంయుక్త ఆధ్వర్యంలో సంవత్సరాల తరబడి నిర్వహించిన పరిశోధనల అనంతరం ఉత్సత్తి చేశారు. ఇది ఇన్ స్టాల్ చేయడానికి కేవలం 15 నిమిషాల సమయం పడుతుంది. 10 నుంచి 15 నోడ్స్ ఉండే ఈ కిట్ ను... వాల్ సాకెట్ కు ప్లగ్ అమర్చుకునేలా రూపొందించారు. గేట్ వే ను రూటర్ కు పెట్టి... ఇల్లంతా గుర్తించగలిగేట్లుగా ముందుగా వినియోగదారులు ఓ మ్యాప్ ను యాప్ లో డ్రా చేయాలి. ఇలా చేసిన తర్వాత వ్యవస్థ ప్రారంభమౌతుంది. గూడులా ఉన్న ఇన్విజిబుల్ సెన్సార్ల ద్వారా ఇంట్లో రేడియో తరంగాలు ప్రసరిస్తాయి. అయితే ఎవరైనా ఈ గూడువంటి వ్యవస్థను కదిపితే మాత్రం రేడియో తరంగాలకు భంగం కలిగే అవకాశం ఉంది. అయితే ఇంట్లో ఒక్కసారి కదలికలను యాప్ గుర్తించగలిగిందంటే అవి డైరెక్ట్ గా మ్యాప్ లోని ఏ స్థానంలో జరుగుతోందో వినియోగదాలుల స్మార్ట్ ఫోన్ కు హెచ్చరికలు పంపిస్తుంది. లైట్లు, అలారం వంటి హెచ్చరికలతో వినియోగదారులు అవసరాన్ని బట్టి యాక్షన్ తీసుకునే అవకాశం ఉంటుంది. ఇది పూర్తిగా కొత్త ఉత్పత్తి కాదని, కేవలం కొత్త సాంకేతికతలు కలిగిన పరికరం అని... దీని వ్యవస్థాపకుడు సాల్ట్ లేక్ సిటీలో నివసించే 35 ఏళ్ళ జో విల్సన్ అంటున్నాడు. 'గ్జాండెమ్ హోమ్' తో ఇంట్లోకి చొరబడిన అపరిచిత వ్యక్తులను ఎటువంటి అనుమానం రాకుండా... శులభంగా గుర్తించవచ్చని చెప్తున్నాడు. రెండు సైజుల్లో దొరికే ఈ గ్జాండెమ్ హోమ్ కిట్ ను కొనుగోలు చేయాలనుకున్నవారు ఆన్ లైన్ (Indiegogo) ద్వారా ముందుగానే ఆర్డర్ చేసుకోవచ్చు. సుమారుగా ముఫై వేల రూపాయలతోపాటు షిప్పింగ్ ఛార్జీలను ఆన్ లైన్ లో చెల్లించి బుక్ చేసే అవకాశం ఉంది. ఇప్పటికే కేవలం పదిహేడు రోజుల్లో అనుకున్న టార్గెట్ కు అమ్మకాలు చేరాయని.. తమ ప్రచారం లక్ష్యాన్ని చేరుకుంటే 2016 ఆగస్టు నాటికి ఈ నిఘా పరికరం ప్రపంచ వ్యాప్తంగా అందుబాటులోకి తెస్తామని చెప్తున్నారు.