breaking news
manipur government
-
నిజం చెబితే నేరమా?
విద్వేషాగ్నిని రెచ్చగొట్టి, విధ్వంసానికి పాల్పడి, మహిళల్ని నగ్నంగా ఊరేగించిన వారిపై కేసులు పెట్టి, ఎఫ్ఐఆర్లు నమోదు చేయడానికి పాలకులకు వారాలు, నెలలు పడుతుంది. కానీ, నిజ నిర్ధారణ కమిటీలో భాగంగా వాస్తవ స్థితిని బాహ్య ప్రపంచానికి వెల్లడించి, తప్పులను ఎత్తిచూపిన పత్రికా ప్రముఖులపై కేసులు పెట్టడమైతే మాత్రం తక్షణమే జరిగిపోతుంది. ఘనత వహించిన మన మణిపుర్ పాలకుల తీరు ఇది. కేసులు మీద పడ్డ జర్నలిస్టులు చివరకు దేశ అత్యున్నత న్యాయ స్థానాన్ని ఆశ్రయిస్తే కానీ బుధవారం తాత్కాలిక రక్షణ, సాంత్వన లభించని పరిస్థితి. ఒక్కమాటలో తెచ్చిన సమాచారం వినకుండా, ఆ సమాచారం తెచ్చిన దూతను పాలకులు కొట్టడమంటే ఇదే! ఈశాన్య రాష్ట్రంలోని ఘర్షణలపై మీడియాలో వార్తల నివేదన ఎలా ఉందన్న అంశంపై ఎడిటర్స్ గిల్డ్ ఆఫ్ ఇండియా నిజనిర్ధారణ సంఘం శనివారం వెలువరించిన నివేదిక ఇంత రచ్చకు దారి తీసింది. సదరు నివేదిక పక్షపాత వైఖరితో, తప్పుదోవ పట్టించేలా ఉందని ఆరోపిస్తూ, ఓ సోషల్ మీడియా ఉద్యమకారుడు కేసు పెట్టారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా కేసు పెట్టడంతో నిజనిర్ధారణ సంఘంలోని ముగ్గురు సభ్యుల పైన, అలాగే ఎడిటర్స్ గిల్డ్ అధ్యక్షుడిపైన ఒకటికి రెండు ఎఫ్.ఐ.ఆర్.లు దాఖలయ్యాయి. గత నాలుగు నెలల్లో మణిపూర్లో పరిస్థితిపైన నోరు విప్పి మాట్లాడడానికి తీరిక లేని ఆ రాష్ట్ర సీఎంకు ఈ విషయంపై మాత్రం విలేఖరులందరినీ కూర్చోబెట్టుకొని మనసులో మాట పంచుకొనే తీరిక, ఓపిక వచ్చాయి. ఎడిటర్స్ గిల్డ్ను తీవ్రస్వరంతో హెచ్చరించే సాహసమూ చేశారు. నిజానికి, మెజారిటీ వర్గమైన మైతేయ్లకూ, మైనారిటీలైన కుకీ–చిన్లకూ మధ్య ఘర్షణలో మణిపుర్ మీడియా ‘మెయితీల మీడియా’గా మారి పక్షపాత వైఖరితో ప్రవర్తిస్తోందని క్షేత్రస్థాయిలో పర్యటించి ఎడిటర్స్ గిల్డ్ అందించిన నిజనిర్ధారణ సంఘం తన నివేదికలో పేర్కొంది. ఆ మేరకు భారత ఆర్మీకి చెందిన 3వ కోర్ దళం కేంద్రకార్యాలయం సహా వివిధ వర్గాల నుంచి ఫిర్యాదు లొచ్చాయనీ గిల్డ్ తెలిపింది. ఇంటర్నెట్పై నిషేధంతో మణిపుర్ నుంచి వార్తల నివేదన కష్టమైందని అభిప్రాయపడింది. మీడియా ఫేక్న్యూస్ అందిస్తూ, తప్పుడు సమాచారాన్ని వ్యాపింపజేస్తున్నట్టు కనీసం 10 సందర్భాల్లో తమ ఫ్యాక్ట్–చెకింగ్ బృందం తేల్చినట్టు వెల్లడించింది. మణిపూర్ సర్కార్ మాత్రం ఈ నివేదిక అవాస్తవమనీ, ప్రాయోజితమనీ, వండి వడ్డించినదనీ ఆరోపిస్తోంది. తగల బడుతున్న ఓ భవనాన్ని కుకీల గృహంగా పేర్కొన్నారనీ, నిజానికది ఓ అటవీ అధికారి ఆఫీసనీ, నివేదిక మొత్తం ‘కుకీ తీవ్రవాదుల’ ప్రాయోజితమనేది గిల్డ్పై దాఖలైన ఫిర్యాదు. ఫోటో ఎడిటింగ్లో ఆ పొరపాటు జరిగిందని గిల్డ్ విచారం వ్యక్తం చేసి, వివరణ ఇచ్చినా కేసులు ఆగలేదు. మరి, మే 3 నుంచి నాలుగు నెలల పైగా రాష్ట్రం తగలబడుతూ, కనీసం 160 మందికి పైగా ప్రాణాలు కోల్పోయి, వేలమంది నిరాశ్రయులైనా నిమ్మకు నీరెత్తిన నీరో చక్రవర్తిని తలపిస్తున్న పాల కులపై ఎన్ని కేసులు పెట్టాలి? విధి నిర్వహణలో, శాంతిభద్రతల పరిరక్షణలో పూర్తిగా విఫలమైనా సరే నైతిక బాధ్యత వహించక కుర్చీ పట్టుకు వేళ్ళాడుతున్న సీఎంను ఏమనాలి? అందరినీ సమభావంతో చూడాల్సిన సదరు వ్యక్తే తాను ఒక వర్గానికి ప్రతినిధి అన్నట్టు నిర్లజ్జగా వ్యవహరించడాన్ని ఎలా సమర్థించాలి? ఇళ్ళు, స్కూళ్ళు, చర్చీలు తగలబడుతూ ఘర్షణలు రేగుతున్నా అంతా ప్రశాంతంగా ఉందనీ, సాధారణ పరిస్థితులు తిరిగొస్తున్నాయనీ అసత్యాలు చెబుతుంటే సిసలైన జర్నలిస్టులు ఏం చేయాలి? ఎప్పుడైనా, ఎక్కడైనా ఏకపక్షంగా వార్తలు రాస్తూ, వాస్తవాలను వక్రీకరించడం ఘోరం, నేరం. ప్రజాస్వామ్యానికి నాలుగో స్తంభమైన పత్రికారంగంలో అలాంటి పగుళ్ళు పెరిగితే, ప్రజాస్వామ్య సౌధం కుప్పకూలుతుంది. అస్సామ్ రైఫిల్స్పై నిరంతర దుష్ప్రచారం అందుకు చిరు ఉదాహరణ. ఘర్షణలకు సరిగ్గా రెండు నెలల ముందే కుకీ వేర్పాటువాద బృందాలతో కాల్పుల విరమణ ఒప్పందం లాంటి త్రైపాక్షిక ‘చర్యల సస్పెన్షన్’ ఒప్పందం నుంచి బీజేపీ రాష్ట్ర సర్కార్ ఎందుకు ఉపసంహరించుకుందన్నది దేవరహస్యం. ఇలాంటి వాస్తవాల్ని గిల్డ్ నివేదిక ఎత్తిచూపితే, కేసులు వేయడం ఏ రకమైన ప్రజాస్వామ్యం? కానీ, ప్రజాస్వామ్యంలో ఆరు నెలలకు ఒకసారైనా అసెంబ్లీ సమావేశం కావాలన్న రాజ్యాంగ నిబంధనను ఉల్లంఘిస్తే తిప్పలొస్తాయని పాలకులు తంటాలు పడ్డారు. రాష్ట్రం తగలబడుతున్నా భేటీ కాని సభ గత నెలాఖరులో ఒక్కరోజే అదీ 11 నిమిషాలే సమావేశమైంది. ఎడిటర్స్ గిల్డ్ వెలువరించిన నివేదికలో అవాస్తవాలు ఉంటే ప్రభుత్వం ఆ మాటే స్పష్టం చేయవచ్చు. అసలు నిజాలేమిటో బహిరంగంగా వివరించి, ఎడిటర్ల బృందం తప్పని నిరూపించనూ వచ్చు. అంతేకానీ, క్షేత్రస్థాయి పర్యటనతో వాస్తవాల్ని బయటపెట్టేందుకు ప్రయత్నిస్తే ‘మరిన్ని ఘర్షణల్ని ప్రోత్సహిస్తున్నార’నడం సమర్థనీయం కాదు. మీడియా పనితీరుకు పరిమితం కాక, ఘర్షణలకు కారణాల్నీ గిల్డ్ పరిశీలించడమేమిటని ప్రశ్నించడమూ అర్థరహితం. పైపెచ్చు, అదే నేరమన్నట్టు క్రిమినల్ ఛార్జీలు నమోదు చేయడం ఏ రకంగానూ సరికాదు. ఈ వైఖరి అప్రజాస్వామికం, తర్కరహితమే కాదు, అక్షరాలా అధికార దుర్వినియోగం! మణిపుర్ సర్కార్ ఇప్పటికైనా తీరు మార్చుకోవాలి. ఎడిటర్స్ గిల్డ్ ప్రతినిధులపై కేసును ఉపసంహరించుకోవాలి. ముదిరిన జాతి విద్వేషాల్ని తగ్గించడమెలాగన్న దానిపై దృష్టి పెట్టాలి. ఆ అసలు సమస్యను వదిలేసి, కొసరు కథను పట్టుకొని వేళ్ళాడడం ప్రజలకూ, ప్రజాస్వామానికీ ఏ విధంగానూ మేలు చేయదు. కానీ, మన పాలకులు ఇవన్నీ చెవికెక్కించుకొనే స్థితిలో ఉన్నారా అన్నది బేతాళ ప్రశ్న. -
భారత్ చేరిన చాను: మరో అపురూప కానుక ఇచ్చిన మణిపూర్
న్యూఢిల్లీ: రజత పతకం గెలుపొంది విశ్వవేదికపై త్రివర్ణ పతాకాన్ని రెపరెపలాడించిన మీరాబాయి చానుకు సొంత రాష్ట్రం మణిపూర్ ప్రభుత్వం కానుకల వర్షం కురిపించింది. పతకం గెలిచిన రోజే రూ.కోటి నగదు బహుమతి ప్రకటించగా తాజాగా సోమవారం ఆమెకు అత్యున్నత ప్రభుత్వ ఉద్యోగం స్పోర్ట్స్ కోటాలో ఇవ్వనున్నట్లు ప్రకటించింది. అదనపు ఎస్పీగా చానును నియమిస్తున్నట్లు ముఖ్యమంత్రి ఎన్.బిరేన్ సింగ్ తెలిపారు. అయితే టోక్యో నుంచి స్వదేశానికి చాను సోమవారం చేరుకుంది. ఆమెకు ఢిల్లీ విమానాశ్రయంలో ఘన స్వాగతం లభించింది. మణిపూర్కు చెందిన చాను ఒలింపిక్స్ పోటీల్లో 49 కిలోల వెయిట్ లిఫ్టింగ్ విభాగంలో సిల్వర్ మెడల్ గెలిచి సత్తా చాటింది. ఆమె గెలుపుపై దేశమంతా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. ఈ క్రమంలోనే మణిపూర్ ప్రభుత్వం ఆమెకు రూ.కోటి నగదు బహుమతితో పాటు ఆ ప్రభుత్వ ఉద్యోగం ప్రకటించింది. మీరాబాయి టోక్యో ఒలింపిక్స్లో ఏకంగా రజత పతకం హస్తగతం చేసుకొని మరో చరిత్రను లిఖించింది. ఒలింపిక్స్ వెయిట్లిఫ్టింగ్లో రజత పతకం నెగ్గిన తొలి భారతీయ క్రీడాకారిణిగా... స్టార్ షట్లర్ పీవీ సింధు తర్వాత విశ్వ క్రీడల్లో రజతం సాధించిన రెండో భారతీయ క్రీడాకారిణిగా 26 ఏళ్ల మీరాబాయి ఘనత వహించింది. 8 మంది వెయిట్లిఫ్టర్లు పాల్గొన్న 49 కేజీల విభాగంలో మీరాబాయి చాను మొత్తం 202 కేజీలు బరువెత్తి రెండో స్థానంలో నిలిచింది. మీరాబాయి స్నాచ్లో 87 కేజీలు.. క్లీన్ అండ్ జెర్క్లో 115 కేజీలు బరువెత్తింది. -
గోడ దూకాడు.. పదవి పట్టాడు!
మణిపూర్ అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేశారు. గెలిచారు కూడా.. కానీ ఇంకా అసెంబ్లీలోకి కూడా ప్రవేశించక ముందే బీజేపీలోకి జంప్ కొట్టారు. దానికి ప్రతిఫలంగా మంత్రి పదవి కూడా సంపాదించేశారు. ఆయనెవరో కాదు.. ఆండ్రియో ఎమ్మెల్యే శ్యామ్ కుమార్. ఇప్పుడు ఆయనకు మంత్రివర్గంలో చోటు లభించడంతో కాంగ్రెస్ పార్టీ ఆయనకు షోకాజ్ నోటీసు జారీచేసింది. కేంద్ర మంత్రులు పియూష్ గోయల్, ప్రకాష్ జవదేకర్ సహా బీజేపీ జాతీయ నాయకుడు రాం మాధవ్ సమక్షంలో జరిగిన ప్రమాణ స్వీకార కార్యక్రమంలో శ్యామ్కుమార్తో గవర్నర్ నజ్మా హెప్తుల్లా మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమానికి మాజీ ముఖ్యమంత్రి ఓక్రమ్ ఇబోబి సింగ్ కూడా హాజరయ్యారు. అక్కడ ఆయన శ్యామ్ కుమార్ను చూసి వెంటనే మేల్కొన్నారు. దాంతో కొత్త మంత్రికి పాత పార్టీ నుంచి నోటీసులు వెళ్లాయి. బీజేపీకి మద్దతిచ్చిన నేషనల్ పీపుల్స్ పార్టీ నుంచి నలుగురు, ఎల్జేపీ నుంచి ఇద్దరు, ఎన్పీఎఫ్ నుంచి ఒకరికి మంత్రి పదవులు దక్కాయి. వాళ్లతో పాటు కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చిన ఏకైక ఎమ్మెల్యే శ్యామ్ కుమార్కు కూడా పదవి ఇచ్చారు. ఆయన పేరును ప్రకటించగానే ఒక్కసారిగా రాజ్భవన్ హాల్లో ఉన్న బీజేపీ నాయకులు హర్షధ్వానాలు చేశారు. అయితే.. షోకాజ్ నోటీసులు వచ్చినా, తాను రాబోయే పరిణామాలు ఎదుర్కోడానికి సిద్ధంగా ఉన్నట్లు శ్యామ్ చెప్పారు. మణిపూర్ ప్రజలు కాంగ్రెస్ పార్టీ పట్ల విశ్వాసం కోల్పోయారని, అందుకే వాళ్లు అధికారంలో మార్పు కోరుకున్నారని తెలిపారు. ఇక ఒకప్పుడు ఇబోబి సింగ్కు అత్యంత సన్నిహితంగా మెలిగిన మణిపూర్ మాజీ డీజీపీ.. ఎన్పీపీ ఎమ్మెల్యే జోయ్కుమార్కు మంత్రిపదవి ఇవ్వడమే కాక, ఆయనను ఏకంగా ఉపముఖ్యమంత్రిగా కూడా చేశారు. దీనిపై కూడా వివాదం చెలరేగింది. జోయ్కుమార్ డీజీపీగా ఉన్న సమయంలో రాష్ట్రంలో బూటకపు ఎన్కౌంటర్లు బాగా పెరిగాయని చెప్పేవారు. ఇలాంటి వ్యక్తికి అంతటి పదవేంటన్న విమర్శలు వినిపిస్తున్నాయి.