breaking news
mangadevi
-
13 ఏళ్లయినా మహిళ ఆచూకీ తెలుసుకోలేకపోయారా?
సాక్షి, అమరావతి: ఓ వివాహిత 13 ఏళ్ల క్రితం అదృశ్యమైతే ఆమె ఆచూకీని పోలీసులు ఇప్పటికీ తెలుసుకోలేకపోయారా.. అని హైకోర్టు విస్మయం వ్యక్తంచేసింది. తమ కుమార్తె బతికుందో.. లేదో.. కూడా తెలియకుంటే ఆ తల్లిదండ్రుల వేదన ఎలా ఉంటుందో మీకు తెలుసా? అంటూ పోలీసులను ప్రశ్నించింది. తల్లిదండ్రుల వేదనను మనందరం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉందని పేర్కొంది. తన కుమార్తె అదృశ్యం విషయంలో కొందరిపై అనుమానం వ్యక్తం చేస్తూ తండ్రి ఫిర్యాదు చేస్తే, వారిని సకాలంలో విచారించకపోవడంపై హైకోర్టు మండిపడింది. దర్యాప్తు ఎలా చేయాలో, ఎక్కడి నుంచి మొదలు పెట్టాలో కూడా తెలియదా? అంటూ తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. వ్యక్తుల అదృశ్యం కేసుల్లో ప్రతి నిమిషమూ కీలకమని స్పష్టంచేసింది. ఘటన జరిగిన మొదట్లోనే ఫిర్యాదు చేస్తే తీరిగ్గా ఆ తర్వాత ఎప్పుడో అనుమానితులను విచారిస్తే ప్రయోజనం ఏముంటుందని పోలీసులను ప్రశ్నించింది. దర్యాప్తు సాగిన తీరు విషయంలో తామెంత మాత్రం సంతృప్తికరంగా లేమంది. తాజాగా పురోగతికి సంబంధించిన వివరాలతో స్థాయీ నివేదికను తమ ముందుంచాలని పశ్చిమ గోదావరి జిల్లా ఎస్పీ, కొవ్వూరు డీఎస్పీ, తాడేపల్లిగూడెం ఎస్హెచ్వోలను ఆదేశించింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ బట్టు దేవానంద్ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు.దర్యాప్తు పక్కన పడేసిన పోలీసులు..పశ్చిమ గోదారి జిల్లా జీలుగుమిల్లి మండలం కామయ్యపాలెం గ్రామానికి చెందిన బండారు ప్రకాశరావు తన కుమార్తె మంగాదేవిని దండగర్ర గ్రామానికి చెందిన మోహన బ్రహ్మాజీ అనే వ్యక్తికిచ్చి వివాహం చేశారు. 2012 అక్టోబర్ 18న ప్రకాశరావుకు ఆయన అల్లుడు బ్రహ్మాజీ ఫోన్ చేసి మంగాదేవి కనిపించడం లేదని చెప్పారు. ప్రకాశరావు అదే రోజున తాడేపల్లిగూడెం పోలీసులకు ఫిర్యాదు చేయగా, వారు మిస్సింగ్ కేసు నమోదు చేశారు. దర్యాప్తును మాత్రం పక్కన పడేశారు. దీంతో ప్రకాశరావు 2017లో హైకోర్టును ఆశ్రయించారు. అప్పటి నుంచి హైకోర్టు ఈ వ్యాజ్యంపై పలుమార్లు విచారణ జరిపింది. తాజాగా శుక్రవారం ఈ వ్యాజ్యం న్యాయమూర్తి జస్టిస్ బట్టు దేవానంద్ ముందు విచారణకు వచ్చింది. జిల్లా ఎస్పీ తదితరులు కోర్టు ముందు హాజరయ్యారు. ఈ కేసులో పోలీసులు సాగించిన దర్యాప్తు తీరుపై న్యాయమూర్తి అసహనం వ్యక్తంచేశారు. అనుమానితుల్లో ఉన్న అదృశ్యమైన మహిళ భర్తను ఫిర్యాదు ఇచ్చిన ఐదేళ్ల తర్వాత విచారించడంపై అసంతృప్తి వ్యక్తంచేశారు. రైల్వేస్టేషన్లలో, మీ–సేవా కేంద్రాల్లో వెతికామంటూ రంగురంగుల ఫొటోలు వేస్తే ఏం ప్రయోజనం ఉంటుందని ప్రశ్నించారు. దర్యాప్తు సక్రమంగా సాగినప్పుడు ఫలితం ఉంటుందని తెలిపారు. ఈ కేసులో తాజా పురోగతితో స్థాయీ నివేదికను తమ ముందుంచాలని పోలీసులను ఆదేశిస్తూ విచారణను నాలుగు వారాలకు వాయిదా వేశారు. -
బచ్చల మల్లి షురూ
‘అల్లరి’ నరేశ్ హీరోగా ‘బచ్చల మల్లి’ సినిమా షురూ అయింది. ఈ చిత్రానికి ‘సోలో బ్రతుకే సో బెటర్’ ఫేమ్ సుబ్బు మంగాదేవి దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో అమృతా అయ్యర్ కథానాయిక. హాస్య మూవీస్ బ్యానర్పై రాజేశ్ దండా, బాలాజీ గుత్తా నిర్మిస్తున్న ఈ చిత్రం హైదరాబాద్లో ప్రారంభమైంది. ముహూర్తపు సన్నివేశానికి ప్రతాప్రెడ్డి కెమెరా స్విచ్చాన్ చేయగా, అనిల్ రావిపూడి క్లాప్ ఇవ్వగా, విజయ్ కనకమేడల గౌరవ దర్శకత్వం వహించారు. దర్శకులు మారుతి, బుచ్చిబాబు స్క్రిప్ట్ని మేకర్స్కి అందజేశారు. ‘‘న్యూ ఏజ్ యాక్షన్ డ్రామాగా యునిక్ కథతో ‘బచ్చల మల్లి’ రూపొందుతోంది. 1990 నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ మూవీలో యాక్షన్ ఎక్కువగా ఉంటుంది. ‘అల్లరి’ నరేశ్ ఇంటెన్స్ రోల్ చేస్తున్నారు. ఆయన కెరీర్లో 63వ చిత్రమిది. పూర్తిగా కొత్త లుక్లో కనిపించనున్నారు నరేశ్. ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ త్వరలో ప్రారంభమవుతుంది’’ అని మేకర్స్ పేర్కొన్నారు. కోట జయరామ్, రావు రమేశ్, సాయికుమార్, ధనరాజ్, హరితేజ ముఖ్య పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: విశాల్ చంద్రశేఖర్, కెమెరా: రిచర్డ్ ఎం.నాథన్. -
తల్లీకూతుళ్ల సజీవ దహనం కేసులో షాకింగ్ విషయాలు వెలుగులోకి..
సాక్షి, కోనసీమ(అల్లవరం): తల్లీకుమార్తెల సజీవ దహనం కేసు మిస్టరీ వీడింది. మాజీ ప్రియుడ్ని తన వైపు తిప్పుకునే క్రమంలో ఓ మహిళ పన్నాగానికి ఇద్దరు ప్రాణాలు కోల్పోయారని పోలీసులు తేల్చారు. అల్లవరం మండలం కొమరగిరిపట్నంలో ఈ నెల 2వ తేది తెల్లవారుజామున సాధనాల మంగాదేవి, మేడిశెట్టి జ్యోతి సజీవదహనమైన సంగతి తెలిసిందే. అమలాపురం రూరల్ సీఐ వీరబాబు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. కొమరగిరిపట్నానికి చెందిన సురేష్, జ్యోతి ప్రేమించుకుని ఈ ఏడాది ఫిబ్రవరి 10న పెళ్లి చేసుకుని గోడితిప్పలో నివసిస్తున్నారు. అంతకుముందు సురేష్కు నాగలక్ష్మి అనే వివాహితతో వివాహేతర సంబంధముండేది. పెళ్లయిన తర్వాత ఆమెకు దూరమవడంతో నాగలక్ష్మి ఎలాగైనా జ్యోతి సురేష్లను విడదీయాలనుకుంది. ఇందులో భాగంగా సురేష్ ఇంటి వద్ద ఆకాశరామన్న ఉత్తరాలు రాసి పడేసేది. ఇందుకు తన సవతి కుమార్తెలు సౌజన్య, దివ్య హరితలను వినియోగించుకునేది. ఆ ఉత్తరాలలో జ్యోతికి అక్రమ సంబంధం ఉన్నట్లు రాసేవారు. వాటిని చదివినా సురేష్ ఆమెతో ప్రేమగానే ఉండేవాడు. ఇలా కాదని జ్యోతిని హతమారిస్తే సురేష్ తనకు దగ్గరవుతాడని భావించింది. ఇదే సమయంలో జ్యోతి తన పుట్టింటికి వెళ్లింది. చదవండి: (తీరని శోకం: రెండు కుటుంబాలు.. నలుగురు బిడ్డలు..) ఈనెల 2వ తేదీ రాత్రి తన తల్లి సాధనాల మంగాదేవితో కలిసి పడుకుంది. ఇదే అదునుగా నాగలక్ష్మి తన సవతి కుమార్తెలిద్దరినీ ఉసి గొల్పింది. నిద్రిస్తున్న తల్లీ కూతుళ్లపై పెట్రోలు పోయాలని చెప్పింది. వారు ఇంట్లోకి వెళ్లి తల్లీకూతుళ్లపై పెట్రోలు పోసి బయటకు వచ్చి నిప్పంటించారు. కాసేపటికే మంటలు ఎగసిపడుతుండటంతో జ్యోతి తండ్రి లింగన్న మేల్కొన్నాడు. మంటలను ఆర్పేందుకు విఫలయత్నం చేశాడు. అప్పటికే మంగాదేవి, జ్యోతి సజీవ దహనమయ్యారు. పోలీసులు కేసు నమోదు చేసి చురుగ్గా దర్యాప్తు చేశారు. ఈ హత్యతో సంబంధమున్న నాగలక్ష్మ, సౌజన్య, దివ్య హరితలను బుధవారం అరెస్టు చేసినట్లు సీఐ తెలిపారు. వీరికి న్యాయమూర్తి 14 రోజులు రిమాండ్ విధించారు. నిందితులనురాజమహేంద్రవరం సెంట్రల్ జైలుకు తరలించారు. దర్యాప్తులో ఎస్సై ప్రభాకరరావు, కానిస్టేబుళ్లు ధర్మరాజు, సుభాకర్, క్రైం పార్టీకి చెందిన కానిస్టేబుల్ బాలకృష్ణ, రామచంద్రరావు, జి.కృష్ణసాయి, డి.అర్జున్ కీలక భూమిక పోషించారు. చదవండి: (ఏఈ హత్య కేసు: భార్యే కుంటలో వేసి తొక్కి.. ఏమీ ఎరగనట్లు) -
మగధీరగా మహిళ.. ‘ఏం నటిస్తున్నావయ్యా బాబూ’!
స్త్రీ పాత్రను పురుషులు వేసి మెప్పించడం సహజమే.. హావభావాలతోపాటు గాత్రం కూడా మారుతుంది. కానీ స్త్రీలకు అలా కాదు.. గాత్రాన్ని మగ గొంతుగా మార్చడం కష్టం. సాంఘిక నాటకాలంటే ఎలాగో ఆ గంట, రెండు గంటలు మేనేజ్ చేయవచ్చు. కానీ పౌరాణికంలో చాలా కష్టం. ఎందుకంటే పద్యాలు.. రాగాలాపనలు కొద్ది నిమిషాలపాటు సాగుతుంటాయి. ఇంతటి క్లిష్టమైన రంగంలో రాణిస్తూ తన ప్రతిభను చాటుకుంటోంది జిల్లాకు చెందిన మంగాదేవి. సాక్షి ప్రతినిధి, విజయనగరం: ఇక్ష్వాకు వంశ చక్రవర్తి... సత్యాన్ని జీవిత లక్ష్యంగా భావించిన మహారాజు సత్యహరిశ్చంద్రుడు. ఈయన జీవితం ఆదర్శనీయం.. మార్గం అనుసరణీయం. అటువంటి హరిశ్చంద్రుడి జీవితగాథ సినిమాగా, నాటకంగా దేశ వ్యాప్తంగా ఎందరినో ప్రభావితం చేయగా... మన రాష్ట్రంలో వీటితోపాటు హరికథగా, బుర్రకథగా ప్రాముఖ్యత సంపాదించింది. అన్నింటా హరిశ్చంద్ర పాత్రను పురుషులే పోషించగా తొలిసారి ఓ మహిళ ఈ పాత్రను పోషించి మెప్పిస్తున్నారు. వేదిక ఏదైనా మగవారి పాత్రల్లో ఇమిడిపోతున్నారు. తాను స్త్రీననే సందేహం కూడా ఎవరికీ రాకుండా చక్కని గాత్రం, హావభావాలతో ఆహూతుల ప్రశంసలు అందుకుంటున్నారు. నాటక రంగం నుంచి అంచెలంచెలుగా ఎదిగి వెండితెరకు తన ప్రయాణాన్ని సాగించి సినీ దర్శకులతో ‘ఔరా’ అనిపించుకుంటున్నారు. గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చి.. రంగస్ధలంపై అర్జునుడు, హరిశ్చంద్రుడు, రాముడు, కృష్ణుడు తదితర పురుష పాత్రలతో గుర్తింపు తెచ్చుకున్న ఆమె పేరు కె. మంగాదేవి. పడుచు పిల్లాడిని కాదు ఆడపడుచును... ఓ ఊరులో శ్రీరామనవమి ఉత్సవాలు జరుగుతున్నాయి. హరిశ్చంద్ర నాటకం మొదలయిది. ‘దేవీ కష్టము లెట్లున్నను... పుణ్యక్షేత్రమైన వారణాసిని దర్శించితిమి’ అంటూ హరిశ్చంద్రుడు వేదిక మీదకు ప్రవేశించాడు. ఆకట్టుకునే ఆహార్యం.. ఖంగుమంటున్న కంఠం. స్పష్టమైన ఉచ్ఛారణతో నటనలో చెలరేగిపోతున్నాడు ఆ నటుడు.. నాటకం పూర్తయి చదివింపుల పర్వం మొదలైంది. పంచెలు కొనుక్కోమని హరిశ్చంద్రుడి పాతధారికి కట్నాలు సమర్పిస్తున్నారు. అప్పుడా పాత్రధారి మైకులో ‘మీ దీవెనలు నాకు... శ్రీరామరక్ష, మీ అభిమానమే కొండంత అండ.. మీరిచ్చిన డబ్బుతో పంచెలు కాదు, చీరెలు కొనుక్కుంటాను. నేను మీ ఆడపడుచున’ని ముగించడంతో జనం ఆశ్చర్యపోయారు. అప్పటికిగానీ హరిశ్చంద్రుని పాత్రను పోషించింది మహిళ అని వారికి తెలియలేదు. బాల్యం నుంచే... విజయనగరం జిల్లా పార్వతీపురం మండలం బాలగుడబ గ్రామానికి చెందిన 32 ఏళ్ల మంగమ్మ చదివింది పదో తరగతే అయినా 12 ఏళ్ల ప్రాయంలోనే పాఠశాలలో పద్యాలు పాడుతూ కూనిరాగాలు తీసేవారు. ఆమె అభిరుచి గమనించిన ఉపాధ్యాయులు ఆ దిశగా ప్రోత్సహించడం మొదలుపెట్టారు. మంగమ్మకు సత్యహరిశ్చంద్రుని పాత్రలో నటించడం ఇష్టమని గుర్తించిన కుటుంబీకులు తొలుత శ్రీకాకుళం జిల్లా పాలకొండ ప్రాంతానికి చెందిన పోతల లక్ష్మణ దగ్గర శిక్షణ కోసం చేర్పించారు. సత్య హరిశ్చంద్ర పౌరాణిక నాటకంలో చంద్రమతి పాత్రనే వేయాల్సిందిగా గురువు కోరినప్పటికీ సత్య హరిశ్చంద్రపాత్రనే ఏరికోరి ఎంచుకున్నారు మంగాదేవి. ఉత్తరాంధ్రలోనూ, రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల్లోనూ ఆమె గుర్తింపు పొందారు. అర్జునుడు, కృష్ణుడు, రాముడు పాత్రల్లో కూడా శభాష్ అనిపించుకున్నారు. యూట్యూబ్లో హరిశ్చంద్ర శ్రీకాకుళం జిల్లా సంతకవిటి మండలం, మందరాడ గ్రామానికి చెందిన పద్మశ్రీ అవార్డు గ్రహీత, పౌరాణిక రంగస్థల కళాకారులైన యడ్ల గోపాలరావు దర్శకత్వంలో సత్యహరిశ్చంద్ర సంపూర్ణ పద్య చలన చిత్రం రూపొందింది. దీనిలో హరిశ్చంద్ర పాత్రను మంగాదేవి పోషించారు. ఇటీవలే ఈ చిత్రాన్ని యూ ట్యూబ్లో విడుదల చేశారు. ఏం నటిస్తున్నావయ్యా బాబూ నన్ను మగవాడననుకుని ఏం నటిస్తున్నావయ్యా బాబూ అని అభినందిస్తుంటారు. తీరా ఆడపిల్ల అని తెలుసుకుని విస్మయానికి లోనవుతారు. మా నాన్న నన్ను మగపిల్లాడిలాగానే పెంచారు. రాజాలా బతకాలనేవారు. నా హరిశ్చంద్ర వేషం చూసి నిజంగా రాజాలాగానే ఉన్నావంటూ కన్నీరు పెట్టుకునేవారు. పన్నెండేళ్ల కిందట నేనో నాటకం వేస్తుంటే మా జిల్లాలోని బలిజిపేట మండలానికి చెందిన అరసాడ గ్రామవాసి సూర్యరావు నన్ను ఆశీర్వదిస్తూ చదివింపులు పంపించారు. తర్వాత అతడు ప్రతి ప్రోగ్రామ్కి వస్తుండేవారు. అలా మాటలు కలిశాయి. మనసులూ కలిశాయి, వివాహం చేసుకున్నాం. నాటకం నాకు బంగారంలాంటి భర్తను కూడా ప్రసాదించింది. నా కూతురు నా పాత్రలు చూసి నిన్ను అమ్మా అని పిలవాలా? నాన్నా అని పిలవాలా? అని అడుగుతుంటే నవ్వొస్తుంటుంది. – కె. మంగాదేవి -
లేడీ హరిశ్చంద్ర
సినిమాల్లో లేడీ గెటప్లు వేసిన పురుషుల్ని చూశాం. కానీ, ఒక స్త్రీ తెరపై పురుష పాత్రలో కనిపిస్తే? నాటకరంగంలో తరచూ జరిగే ఈ ప్రయోగం ఇప్పుడు తెలుగు తెరపైకొచ్చింది. ప్రముఖ రంగస్థల నటి మంగాదేవి టైటిల్ పాత్రలో నటించిన చిత్రం ‘సత్య హరిశ్చంద్ర’. వై.గోపాలరావు దర్శకత్వంలో కొత్తపల్లి సీతారాము నిర్మించిన ఈ చిత్రానికి వీణాపాణి శ్రీనివాస్ సంగీత దర్శకులు. శనివారం పాటల్ని విడుదల చేశారు. ‘‘సత్య హరిశ్చంద్ర పద్య నాటకానికి వెండితెర రూపమిది. డిసెంబర్లో రిలీజ్’’ అని దర్శక, నిర్మాతలు తెలిపారు. ‘‘నేను హరి శ్చంద్ర పాత్ర చేయాలన్నది మా నాన్నగారి కోరిక. ఆయన ప్రోత్సాహంతో రంగ స్థలంపై చాలాసార్లు ఈ పాత్ర చేశా’’ అన్నారు మంగాదేవి. దర్శకులు కోడి రామ కృష్ణ, నటులు జయప్రకాశ్, రంగస్థల నటుడు గుమ్మడి గోపాలకృష్ణ పాల్గొన్నారు. -
కుమారులతో కలసి భార్యను హత్య చేసిన భర్త
అగ్నిసాక్షిగా పెళ్లాడిన భార్యను ఆస్తి కోసం భర్తతో పాటు ఆమె ఇద్దరు కుమారులు కలసి హత్య చేసిన సంఘటన తూర్పు గోదావరి జిల్లా తునిలో చోటు చేసుకుంది. మృతురాలు మంగాదేవి (48) పేరిట భారీగా ఆస్తులు ఉన్నాయి. ఈ నేపథ్యంలో గత కొంత కాలంగా ఆస్తి తమ పేరిట రాయాలంటూ మంగాదేవిపై ఆమె భర్త, పిల్లలు ఒత్తిడి తెస్తున్నారు. అందుకు ఆమె ససేమీరా అనడంతో గత అర్థరాత్రి మంగాదేవిపై భర్త ఇద్దరు కుమారులు క్రికెట్ బ్యాట్తో దాడి చేశారు. ఆ దాడిలో ఆమె తీవ్రంగా గాయపడింది. దాంతో ఆమెను కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే ఆమె మార్గ మధ్యంలోనే మృతి చెందిందని వైద్యులు వెల్లడించారు. మంగదేవి మృతిపై పోలీసులు సమాచారం అందుకుని ఆమె మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. మంగదేవి భర్త ఇద్దరు కుమారులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు.


