breaking news
mamunur
-
మామునూరులో.. ఎగరనున్న విమానం !
వరంగల్: సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో సోమవారం రాత్రి వరకు జరిగిన మంత్రివర్గ సమావేశంలో ఉమ్మడి వరంగల్కు చెందిన పలు అంశాలపై నిర్ణయాలు తీసుకున్నారు. సుమారు పది రోజుల పాటు కురిసిన వర్షాలు, వరదల కారణంగా నష్టపోయిన ప్రజలను ఆదుకోవడంతో పాటు పెండింగ్లో ఉన్న వివిధ ప్రాజెక్టులపై ఈ కేబినెట్లో స్పష్టత ఇచ్చింది. ప్రధానంగా మామునూరులో ఎయిర్పోర్ట్ నిర్మాణానికి 253 ఎకరాల భూమి ఇచ్చేందుకు ఆమోదం తెలిపింది. ఏళ్లతరబడిగా ఎయిర్పోర్ట్ అంశం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్యన నలుగుతోంది. వెయ్యి ఎకరాల స్థలానికి గాను 270 ఎకరాలు అన్యాక్రాంతం కాగా 730 ఎకరాలకు ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా(ఏఏఐ) ఫెన్సింగ్ చేసింది. అయితే మరో 431 ఎకరాలు కావాలని సూచించిన అధికారులు చివరకు 253 ఎకరాలైనా పరవాలేదన్నారు. దీంతో ఎయిర్పోర్ట్కు 253 ఎకరాల స్థలం ఇచ్చేందుకు కేబినెట్లో ఆమోదం తెలపడంతో త్వరలోనే మామునూరు నుంచి విమానాలు ఎగరవచ్చన్న చర్చ మొదలైంది. ఇదిలా ఉండగా.. మహబూబాబాద్ జిల్లాతో పాటు ఇతర ప్రాంతాలకు ప్రయోజనం కలిగించే ఉద్యానవన కళాశాలకు మంత్రివర్గం పచ్చజెండా ఊపింది. ఇక నుంచి ప్రభుత్వ ఉద్యోగులు.. రోడ్డు రవాణా సంస్థ(ఆర్టీసీ)లో ఏళ్ల తరబడి పని చేస్తున్న కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా పరిగణిస్తూ విలీనం చేసుకోవడానికి కేబినెట్ తీసుకున్న నిర్ణయంపై ఆ వర్గాల నుంచి హర్షం వ్యక్తమవుతోంది. ఈనెల 3న అసెంబ్లీలో బిల్లు పెట్టి అమల్లోకి తేనున్నారు. దీంతో వరంగల్ రీజియన్ పరిధిలోని 9 ఆర్టీసీ డిపోలకు చెందిన 3,627 మంది డ్రైవర్లు, కండక్టర్లు, మెకానిక్లతో పాటు వివిధ కేడర్లకు చెందిన కార్పొరేషన్ ఉద్యోగులు ఇక నుంచి ప్రభుత్వ ఉద్యోగులుగా మారనున్నారు. ఉమ్మడి జిల్లాకు ‘వరద’ సాయం.. ఉమ్మడి వరంగల్తో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఇటీవల పది రోజుల పాటు కురిసిన వర్షాలు, వరదలకు దెబ్బతిన్న ప్రాంతాల్లో తక్షణ సహా యక చర్యల కోసం రూ.500 కోట్లు కేబినెట్ కేటాయించింది. ఇందులో సుమారు రూ.237 కోట్ల వరకు ఉమ్మడి వరంగల్కు దక్కే అవకాశం ఉన్నట్లు చెబుతున్నారు. గ్రేటర్ వరంగల్, వరంగల్, హనుమకొండ జిల్లాల్లో సుమారు రూ.587 కోట్ల మేరకు నష్టం వాటిల్లినట్లు ప్రాథమికంగా అంచనా వేసిన అధికారులు సర్వే చేస్తున్నారు. ఉమ్మడి జిల్లాలో వివిధ శాఖల పరిధిలో వరదల వల్ల రూ.1,000 కోట్లకుపైనే నష్టం జరిగి ఉంటుందని అంచనా. కాగా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఇప్పటి వరకు మృతి చెందిన 32 మందికి సంబంధించి ఒక్కో కుటుంబానికి రూ.4 లక్షల చొప్పున ఎక్స్గ్రేషియా ప్రకటించింది. వరదలతో దెబ్బతిన్న ప్రాంతాల్లో రోడ్లకు వెంటనే తాత్కాలిక మరమ్మతు చేపట్టేందుకు నిధులు కేటాయించారు. ఉమ్మడి వరంగల్ వ్యాప్తంగా ఈసారి భారీగా నష్టం జరిగిందని అభిప్రాయపడిన మంత్రివర్గం.. అన్ని విధాల అండగా ఉండాలని, సీనియర్ అధికారులను ఇన్చార్జ్లుగా నియమించి సహాయక చర్యలను వేగవంతం చేయాలని నిర్ణయించింది. -
పశు వైద్య కళాశాల మంజూరుపై హర్షం
మామునూరు : హన్మకొండ మండలం మామునూరులో పశు వైద్య కళాశాల ఏర్పాటుకు రాష్ట్రప్రభుత్వం ఆదేశాలు జారీ చేయడంపై పలువురు హర్షం వ్యక్తం చేశారు. ఈ మేరకు వరంగల్ 6వ డివిజన్ కార్పొరేటర్ చింతల యాదగిరి ఆధ్వర్యంలో ఆదివారం సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. అనంతరం యాదగిరి మాట్లాడుతూ జిల్లాలో పశు వైద్యకళాశాల ఏర్పాటుకు కృషి చేసిన డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి, వర్ధన్నపేట ఎమ్మెల్యే ఆరూరి రమేష్కు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో బి.జయశంకర్, డానియల్, రమేష్, అనంత్, బాబు, శ్రీశైలం, కుమార్, హన్మన్రెడ్డి, తదితరులు పాల్గొన్నారు. -
బైక్ను ఢీ కొన్న లారీ : ఒకరి మృతి
వరంగల్ : వేగంగా వెళ్తున్న లారీ బైక్ను ఢీ కొట్టడంతో ఒకరు అక్కడికక్కడే మృతి చెందగా, మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. ఈ సంఘటన సోమవారం వరంగల్ జిల్లా మామునూర్లోని హంటర్ రోడ్డుపై గణపతి ఇంజనీరింగ్ కాలేజీ సమీపంలో జరిగింది. వివరాలు.. అసన్పర్తి మండలం గుంటూరుపల్లి గ్రామానికి చెందిన మాధిరెడ్డి(35), మల్లారెడ్డి(48)లు బైక్పై రాయపర్తి మండలం వెళ్తున్నారు. ఈ క్రమంలోనే వరంగల్ నుంచి ఖమ్మం వెళ్తున్న లారీ అదుపు తప్పి బైక్ను ఢీ కొట్టింది. ఈ ఘటనలో మాధిరెడ్డి అక్కడికక్కడే మృతి చెందాడు. తీవ్రంగా గాయపడిన మల్లారెడ్డిని వైద్యం కోసం స్థానిక ఎమ్జీఎమ్ ఆస్పత్రికి 108లో తరలించారు. విషయం తెలిసిన పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్ట్మార్టం కోసం తరలించారు. అనంతరం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. (మామునూరు)