breaking news
Internet Economy
-
డిజిటల్ దిగ్గజాల దారెటు?
బీమా కావాలా...? పాలసీ బజార్లో చూడు! ఉద్యోగమా...? నౌఖ్రీలో వెతుకు! మరి సప్లయర్స్..? ఇండియా మార్ట్ ఉందిగా! ఇంటి సంగతో... హౌసింగ్.కామ్కు వెళ్లు! సమాచారాన్ని తెలియజేయటంలో కొత్త ఒరవడికి బాటలువేసి రివ్వుమన్న ఇంటర్నెట్ కంపెనీలివి. వీటి పోలికలతోనే వందల వెబ్సైట్లు వచ్చినా... లీడర్లు ఇవే. కానీ ఏఐ దీన్ని మార్చేసింది. ‘ క్లెయిమ్ సెటిల్మెంట్లో మంచి రికార్డున్న తక్కువ ధర హెల్త్ ఇన్సూరెన్స్ కావాలి’ ‘కోకాపేట్లో రూ.కోటికి త్రిబుల్ బెడ్రూమ్ ఇల్లు దొరుకుతుందా?’ అని ఏ జెమినైనో, క్లాడ్నో, చాట్జీపీటీనో అడిగితే చాలు. వివిధ ప్లాట్ఫామ్స్లో అవే వెతికేసి... రెడీమేడ్ సమాధానమిస్తున్నాయి. దీనర్థం సెర్చ్ ట్రాఫిక్ ఇపుడు వెబ్సైట్లకే పరిమితం కావటంలేదు. ఏఐ అసిస్టెంట్ల చేతుల్లోకి వెళ్లింది. ఇంటర్నెట్ కంపెనీలు ఎదుర్కొంటున్న అతిపెద్ద ముప్పు ఇదే. మరెలా? మున్ముందు జరిగేదేంటి? ఈ షేర్ల విషయంలో రిటైల్ ఇన్వెస్టర్లు చేయాల్సిందేంటి? ఏ కంపెనీ ఎలా మారబోతోంది? ఇదే ఈ వారం ‘సాక్షి వెల్త్’ ప్రత్యేక కథనం...కాలం మారుతుంటుంది. టెక్నాలజీ కూడా. ఇంటర్నెట్ కంపెనీలు మొదటి దశలో సమాచారం ఇచ్చాయి. సెర్చ్లో విప్లవాన్ని తెచ్చాయి. మార్కెట్ ప్లేస్లను నిర్మించి డిజిటల్ దిగ్గజాలుగా ఎదిగాయి. కానీ ఇపుడు ఏఐ విస్ఫోటనంతో వాటికి వ్యూహాలు మార్చుకోక తప్పటం లేదు. కొన్ని స్టార్టప్లలో ఇన్వెస్ట్ చేస్తూ విలువ పెంచుకుంటుంటే... మరికొన్ని దూకుడుగా ఇతర కంపెనీలను కొంటూ స్ట్రాటజీ మార్చుకుంటున్నాయి. మరికొన్ని ఏఐని అర్థం చేసుకుంటూ దాన్నే తమ బలంగా మార్చుకునే ప్రయత్నాలు మొదలుపెట్టాయి. మొత్తంగా అన్ని కంపెనీలూ ఏఐ ఏజెంట్లుగా మారే ప్రయత్నాలు మొదలుపెట్టాయి. పీబీ ఫిన్టెక్ (పాలసీ బజార్)బీమా తేలికైన విషయం కాదు కాబట్టి దీనికి ఏఐ ముప్పు తక్కువే. కస్టమర్లకు ఇతర కంపెనీల పాలసీలతో పోల్చి చూపించటంతో పాటు క్లెయిమ్, అండర్ రైటింగ్, డాక్యుమెంటేషన్, రెన్యూవల్స్ వంటివన్నీ చేసిపెట్టాలి. ఒక ఏఐ ఎల్ఎల్ఎం దీన్నంతటినీ చేయటం కష్టం. కానీ ఇదే ప్లాట్ఫామ్లో ఏఐ ఓ అసిస్టెంట్గా మారగలదు. అందుకే పాలసీలను పోల్చే వెబ్సైట్లా మిగిలిపోకుండా ఏఐ–నేటివ్ ఇన్సూరెన్స్ ఆపరేటింగ్ సిస్టమ్పై పీబీ ఫిన్టెక్ భారీగా ఇన్వెస్ట్ చేస్తోంది. అడ్వయిజరీ టూల్స్లో ఏఐని మిళితం చేస్తోంది. దీనివల్ల ఖర్చులు తగ్గటం ఒక ఎత్తయితే కస్టమర్ల సంతృప్తి స్థాయి పెరిగిందని, ప్రొడక్టివిటీ కూడా పెరిగిందని కంపెనీ యాజమాన్యం చెబుతోంది. భవిష్యత్తులో బీమా ఏజెంటు, ఏఐ ఏజెంటు కలిసి పాలసీ బజార్ ప్లాట్ఫామ్పై సేవలు అందిస్తారు. ఏఐ దీనికి అదనపు బలమవుతుందని చెప్పొచ్చు. కంపెనీ చెబుతున్నవన్నీ ఆచరణలోకి వస్తే వచ్చే పదేళ్లలో ఇది బీమా ఆపరేటింగ్ వ్యవస్థగా మారొచ్చు. ఇన్ఫో ఎడ్జ్నౌఖ్రీ, 99ఏకర్స్, జీవన్సాథీ వంటి వెబ్సైట్లను నిర్వహించే ఇన్ఫో ఎడ్జ్కు పీబీ ఫిన్టెక్, జొమాటోతో సహా చాలా స్టార్టప్లలో పెట్టుబడులున్నాయి. అవి బాగా లాభాలిచ్చాయి కూడా. చాట్ జీపీటీ వంటి ఏఐ ఏజెంట్లు ఇప్పటికీ రెజ్యూమ్స్ రాస్తున్నాయి. ఇంటర్వ్యూలకు సిద్ధమయ్యేందుకు ప్రశ్నలు–సమాధానాలు ఇస్తున్నాయి. స్కిల్స్ సరిపోతాయో, లేదో చెక్ చేస్తున్నాయి. మున్ముందు ఇవి ఆటోమేటిగ్గా జాబ్స్ను రికమమెండ్ చేయొచ్చు. దీనివల్ల సంప్రదాయ జాబ్ పోర్టల్స్కు ట్రాఫిక్ తగ్గిపోయే అవకాశాలు ఎక్కువే. మరి నౌఖ్రీ ఏం చేస్తోంది?: ఈ సంస్థ ఏఐపై బాగానే ఇన్వెస్ట్ చేస్తోంది. దీనివల్ల వల్ల ఇప్పటికే యూజర్ల సేవలు మెరుగయ్యాయని, అంతర్గతంగా ప్రొడక్టివిటీ పెరిగిందని యాజమాన్యం చెబుతోంది. ఈ ఏఐ సేవలపై ఇప్పటికిప్పుడు ఆదాయం రాకపోయినా... రెన్యూవల్స్, రెవెన్యూ పెరగవచ్చని, దీర్ఘకాలంలో ధరలు పెంచడానికి కూడా అవకాశముందని చెబుతోంది. భవిష్యత్లో కేవలం జాబ్ పోర్టల్గా మిగిలిపోకుండా రెజ్యుమ్లు, ఇంటర్వ్యూలు, శాలరీ అంచనాలు, కోచ్, రిక్రూట్మెంట్ వంటివన్నీ ఏఐతోనే పూర్తిచేసే ప్లాట్ఫామ్గా నౌఖ్రీ మారుతుందని అంచనా వేస్తోంది. ఈ కంపెనీ తన ‘99ఏకర్స్’ పోర్టల్లో కూడా ప్రాపర్టీ సెర్చ్లో ఏఐ హోమ్ అడ్వయిజర్ను ప్రవేశపెట్టింది. ఇది రుణాలు, రిజిస్ట్రేషన్, ఇంటీరియర్, సొసైటీ మేనేజిమెంట్లో సహకరిస్తుంది. కాకపోతే నౌఖ్రీ కాస్త వేగంగా మారాల్సిన అవసరమైతే కనిపిస్తోంది. ఆరమ్ ప్రాప్టెక్2020 వరకూ రివ్వుమంటూ ఎగసిన ఈ కంపెనీ షేరు కోవిడ్తో కుదేలయిపోయింది. మళ్లీ మెల్లగా కోలుకున్న కంపెనీ... ఇపుడు రియల్టీలో పూర్తిస్థాయి ఎకోసిస్టమ్పై దృష్టిపెట్టింది. నెస్ట్ ఎవే, హౌసింగ్, హలో వరల్డ్ వంటివన్నీ దీని చేతుల్లో ఉండటంతో... ఇళ్ల ధర, ఇన్వెంటరీ, బ్రోకర్లు, అద్దెలు, కో–లివింగ్, తనఖాలు, నిర్మాణ వ్యవస్థ డేటా ఈ కంపెనీ చేతుల్లో ఉంది. వీటి సాయంతో దేశంలో తొలి పూర్తిస్థాయి నేటివ్ రియల్ ఎస్టేట్ ఆపరేటింగ్ సిస్టమ్గా ఎదిగే ప్రయత్నాలు చేస్తోంది. కంపెనీ ప్రయత్నాలు కనక ఫలిస్తే... ఇదో ఏఐ ఆధారిత ప్లాట్ఫామ్గా మారుతుంది. ఉదాహరణకు ఓ ఇంటికోసం హౌసింగ్ యాప్ తెరిస్తే... మీ బడ్జెట్, వాస్తు, స్కూల్కి– ఆసుపత్రికి దూరం, సౌకర్యాలు, బిల్డర్ చరిత్ర, ఎంత లోన్ వస్తుంది, బేరమాడితే ధర ఎంత తగ్గొచ్చు, రిజిస్ట్రేషన్ వివరాలు వంటివన్నీ కనిపించాయనుకోండి. అపుడిక సాధారణ ప్రాపర్టీ పోర్టల్స్కు ఎవరైనా ఎందుకు వెళతారు? అదే జరిగితే ఈ సంస్థ దేశీ ‘జిల్లో’గా మారినా ఆశ్చర్యపడాల్సిన పనిలేదుగా!!.ఇండియా మార్ట్ఈ కంపెనీ బలం... పాతికేళ్లుగా ఇది సేకరించిన డేటాయే. నెలకు 9 కోట్ల మంది సందర్శించే ఈ వెబ్సైట్లో 2.2 లక్షల మంది సప్లయర్లున్నారు. కోట్లకొద్దీ ఎంక్వయిరీలు వస్తుంటాయి. ఇవన్నీ కలిపితే భారీ బీ2బీ డేటా దీని సొంతం. ఏఐ యుగంలో దీని విలువ అమూల్యం. ఒక పంప్కోసం ఇండియా మార్ట్లో వెదికే బదులు ఏఐని నేరుగా అడిగితే సరైన సమాధానం రావచ్చు. కానీ అది కరెక్టో కాదో తెలియదు. అందుకే ఇండియా మార్ట్ సంస్థ వినియోగదారుల నమ్మకమే లక్ష్యంగా ఏఐపై భారీగా ఇన్వెస్ట్ చేస్తోంది. తద్వారా నకిలీ లిస్టింగ్లు, మోసపూరిత విక్రయదార్లను కనిపెడుతోంది. ఆటోమేటిక్ వాయిస్– టు–టెక్ట్స్ను ప్రవేశపెట్టింది. దీనివల్ల వినియోగదార్ల అవసరాలు అర్థం చేసుకుని సప్లయర్స్ను వెతికి, చర్చలు జరిపి ఆర్డర్ పెట్టే మొత్తం ప్రక్రియ ఏఐ పూర్తి చేస్తుంది. ఇది పూర్తిగా విజయవంతమైతే ఇండియా మార్ట్... ఏఐ కొనుగోళ్లకు వీలు కల్పించే ఇన్ఫ్రా సంస్థగా మారొచ్చు. జస్ట్ డయల్లోకల్ సెర్చ్కు అడ్రస్గా నిలిచిన జస్ట్ డయల్కు అర్బన్కంపెనీ వంటి సంస్థలతో మొదటి ముప్పు ఎదురైంది. ఇపుడు ఏఐతో. ఎందుకంటే స్థానిక వ్యాపారాల వివరాలు, ఫోన్ నంబర్లు, చిరునామాల వంటి సాధారణ సమాచారాన్ని ఏఐ ఏజెంట్లూ అందిస్తున్నాయి. కాకపోతే జస్ట్ డయల్కు భారీ స్థాయిలో స్థానిక వ్యాపారాల డేటాబేస్ ఉంది. వెరిఫై చేసిన లక్షలకొద్దీ వ్యాపారాల వివరాలు, వినియోగదారుల రేటింగ్లు, రివ్యూలు దీని సొంతం. ఈ సమాచారాన్ని ఏఐతో అనుసంధానించి, వినియోగదార్ల అవసరాలకు సరిపోయేలా సంస్థలను ఎంపిక చేసి, అపాయింట్మెంట్లు బుక్ చేసి, నేరుగా సేవలందించే ప్లాట్ఫామ్గా మారితేనే భవిష్యత్తు బాగుంటుందని చెప్పాలి. కాబట్టి ఏఐని ఉపయోగించి ఈ సెర్చ్ కంపెనీ ట్రాన్సాక్షన్ ప్లాట్ఫామ్గా ఎదుగుతుందా? లేదా? అన్నదే ఇన్వెస్టర్లు గమనించాల్సిన అంశం. కార్ట్రేడ్సెకండ్ హ్యాండ్ కార్ల క్రయవిక్రయాల్లో కార్ట్రేడ్కు గతంతో పోలిస్తే పోటీ పెరిగింది. కార్ల తయారీ కంపెనీలు ‘సర్టిఫైడ్ యూజ్డ్ కార్ల’ విభాగాలను సొంతగా ఆరంభించగా.. స్పిన్నీ, డ్రూమ్, కార్స్24 వంటి ఆన్లైన్ ప్లాట్ఫామ్లు, ఆఫ్లైన్లో లోకల్ డీలర్లు వేగంగా విస్తరిస్తున్నారు. శ్రీరామ ఆటోమాల్, కార్వాలే, బైక్వాలే, వాహనాల వేలం వంటి ఇతర వ్యాపారాలున్న కార్ట్రేడ్... కేవలం లిస్టింగ్లకే పరిమితం కాకుండా ధరల విశ్లేషణ, వాహన చరిత్ర, తనిఖీ రిపోర్ట్లు, రుణాలు, బీమా, ఓనర్షిప్ బదిలీ వంటివన్నీ ఏఐ ద్వారా చేసే ప్లాట్ఫామ్గా మారితే తన ప్రత్యేకతను నిలబెట్టుకునే అవకాశం ఉంటుంది. ఈజీ ట్రిప్ఆన్లైన్ ట్రావెల్లో పోటీ అంతాఇంతా కాదు. కష్టమర్లను ఆకట్టుకోవటానికి ప్రత్యేక ఆఫర్లిస్తూ ఉండటంతో ఈ సంస్థలకు లాభాలు తక్కువే ఉంటున్నాయి. పైపెచ్చు ఏఐ వచ్చాక ట్రావెల్ ప్రణాళికలను ఏఐ ఏజెంట్లే సిద్ధం చేస్తున్నాయి. ‘రూ.లక్ష లోపులో నాలుగు రోజులు బాలి వెళ్లి రావాలి. సాధ్యమేనా?’ అని చాట్జీపీటీని అడిగితే పూర్తి ప్లాన్ను ఇస్తుంది. దానిప్రకారం ఆన్లైన్ ప్లాట్ఫామ్లో టికెట్లు బుక్ చేసుకుంటే చాలు. అలా బుకింగ్ చేసుకోవటానికి వీటిని అశ్రయించినపుడు వీటికి వచ్చే లాభాలు తక్కువ. మొత్తం ప్లాన్ను ఈ ఆన్లైన్ సంస్థలే ఇచ్చి, దానిప్రకారం బుక్ చేసినపుడు ఉండే లాభాలు... కేవలం టికెట్లు బుక్చేయటం వల్ల రావు. కాబట్టి భవిష్యత్తులో ఏఐని అనుసంధానించి ఎవరి అవసరాలకు తగ్గట్టుగా వారికి ప్యాకేజీలు రూపొందించి... ఈ డైనమిక్ ప్యాకేజీలతో పాటు వీసా, బీమా, లోకల్ ఎక్స్పీరియన్స్లు అందించే సంస్థలే ఆన్లైన్ ట్రావెల్ రంగంలో నిలబడతాయని చెప్పొచ్చు. ఏఐని తట్టుకోగలిగేవేంటి? కేవలం సెర్చ్తోనే మనుగడ సాగించే సంస్థలు మనగలగటం కష్టం. కానీ లావాదేవీలు అవసరమయ్యే మార్కెట్ప్లేస్లు దృఢంగా ఉంటాయి. ట్రస్ట్, ధ్రువీకరణ, పేమెంట్, సపోర్ట్ వంటి అంశాల్లో ఏఐ వీటికి సహకరిస్తుంది. ఏఐతో భాగస్వామ్యాలు కుదుర్చుకోవటం ద్వారా కూడా ఇలా సొంత డేటా ఉన్న కంపెనీలకు రెవెన్యూ రావచ్చు. ఉదాహరణకు ‘రెడిట్’ తన డేటాను ఏఐ కంపెనీలకు వాడుకునేందుకు లైసెన్స్ ఇచ్చింది. వార్తా సంస్థలు ఏఐతో లైసెన్సింగ్ ఒప్పందాలు చేసుకున్నాయి. ఫైనాన్షియల్ డేటా అందించే సంస్థలు చిరకాలంగా తమ ఏపీఐని యాక్సెస్ చేసుకున్నందుకు ఫీజు వసూలు చేస్తున్నాయి. ఏఐ రాకతో వీటి ఫీడ్కు విలువ పెరిగింది. ఇండియా మార్ట్, పీబీ ఫిన్టెక్, ఇన్ఫో ఎడ్జ్ వంటి ఇంటర్నెట్ ఎకానమీకి చెందిన కంపెనీల షేర్లు కొనేముందు ఇన్వెస్టర్లు చూడాల్సిన అంశాలు కొన్ని ఉన్నాయి. అవి... → ఈ కంపెనీకి ప్రత్యేకమైన డేటా ఏమైనా ఉందా? దాన్ని వేరేవాళ్లు తేలిగ్గా క్రియేట్ చేయగలరా? → ఈ డేటా నిరంతరం అప్డేట్ అవుతోందా? లేక ఒకసారి సేకరిస్తే ఇక మారకుండా అలానే ఉండిపోతుందా? → ఏఐ ఈ డేటా యాక్సెస్ చేసుకోవాలంటే ఈ కంపెనీ అనుమతి తప్పనిసరిగా ఉండాలా? లేక ఏఐ కంపెనీలు ఈ డేటాను సొంతగా క్రియేట్ చేసుకోగలవా? → ఈ డేటాను ఆదాయవనరుగా మార్చుకోవటానికి కంపెనీ ఏపీఐలు, సబ్్రస్కిప్షన్లు, రిఫరల్స్, ఎంటర్ప్రైజ్ సర్వీసుల వంటివాటిపై దృష్టిపెడుతోందా లేదా? అని చూడాలి. ఏఐ యుగంలో ఎక్కువ ట్రాఫిక్ను ఆకర్షించే కంపెనీలన్నీ విజేతలు కాకపోవచ్చు. డేటా.. కస్టమర్ల నమ్మకం... లావాదేవీలు భారీగా ఉన్న కంపెనీలే బావుంటాయి. అవే భవిష్యత్ దిగ్గజాలవుతాయి. అందుకే ఇంటర్నెట్ కంపెనీల విలువను ఇకపై సందర్శకుల సంఖ్యతో కాకుండా వాటి డేటా, ఏఐ సామర్థ్యం, లావాదేవీల లోతుతో కొలవాల్సి ఉంటుంది.భవిష్యత్ విజేతలెవరు...?వచ్చే పదేళ్లలో ఇంటర్నెట్ కంపెనీలు రెండు రకాలుగా విడిపోవచ్చు. వాటిలో ఒకటి ట్రాఫిక్పైనే ఆధారపడే పోర్టల్స్ అయితే రెండోవి ఏఐ ఆధారిత ప్లాట్ఫామ్లు. పాలసీ బజార్ ఫిన్టెక్, ఆరమ్ ప్రాప్టెక్, ఇండియా మార్ట్ వంటి కంపెనీలకు భారీగా సొంత డేటా ఉంది. దాంతో పాటు లావాదేవీలు, కస్టమర్లతో సంబంధాలు ఉంటాయి. ఇవి ఏఐ ఆధారిత ఇన్ఫ్రా సంస్థలుగా మారటం వల్ల వీటి పనితీరు మరింత సమర్థంగా మారే అవకాశం ఉంటుంది. సొంత డేటా ఉన్న కంపెనీలు మున్ముందు ఊహించని విధంగా రూపాంతరం చెందొచ్చు. ఉదాహరణకు ఇండియా మార్ట్నే తీసుకుంటే అది కేవలం కంపెనీల జాబితా అందించే డైరెక్టరీ కాదు. పాతికేళ్లుగా... లక్షలకొద్దీ సిసలైన సప్లయర్ల వివరాలు సేకరించింది. ప్రొడక్ట్ కేటలాగ్లు, ధరల తీరు, కొటేషన్లకు అడిగే అభ్యర్థనలు, రెస్పాన్స్ రేటింగ్లు, లావాదేవీల ప్యాటర్న్లు, సప్లయర్ రేటింగ్లు, ప్రతి పరిశ్రమకూ సంబంధించిన టర్మినాలజీ... ఫొటోలు.. వస్తువుల స్పెసిఫికేషన్లు, కాంటాక్ట్లు ఇవన్నీ భారీ స్థాయిలో ఉన్నాయి. ఇవన్నీ ఆ కంపెనీకే ప్రత్యేకం. వీటిని మరొకరు మళ్లీ క్రియేట్ చేయాలంటే అంత తేలికకాదు. పబ్లిక్ వెబ్పేజ్లలో ఉండే సమాచారం వరకూ జెమినై, చాట్జీపీటీ వంటివి యాక్సెస్ చేసుకుని మనకు సమాధానమిస్తాయి. కానీ ప్రయివేటు డేటా కావాలంటే మాత్రం ఇండియా మార్ట్ సంస్థ తన ‘ఏపీఐ’ ద్వారానో, అగ్రిమెంట్ ద్వారానో వీటికి ఇవ్వాల్సి ఉంటుంది. దానికి ఇండియామార్ట్ సంస్థ ఫీజు వసూలు చేసే అవకాశాలూ ఉంటాయి. -రమణమూర్తి మంథా -
ఎడెల్వీజ్ ఇంటర్నెట్ ఎకానమీ ఇండెక్స్ ఫండ్
ఎడెల్వీజ్ మ్యూచువల్ ఫండ్ దేశంలో మొదటి ‘ఇంటర్నెట్ ఎకానమీ ఇండెక్స్ ఫండ్’ను ఆవిష్కరించింది. ఈ నూతన ఫండ్ ఆఫర్ ఈ నెల 25న ప్రారంభమైంది. వచ్చే నెల 9వ తేదీ వరకు పెట్టుబడులను స్వీకరించనుంది. బీఎస్ఈ ఇంటర్నెట్ ఎకానమీ టోటల్ రిటర్న్ ఇండెక్స్లో మొత్తం 20 స్టాక్స్ ఉన్నాయి. సూచీలో వెయిటేజీ ఆధారంగా ఆయా స్టాక్స్లో ఈ పథకం ఇన్వెస్ట్ చేస్తుంది. దేశ డిజిటల్ ఆర్థిక వ్యవస్థలో భాగమైన కంపెనీల్లో పెట్టుబడులకు ఈ పథకం వీలు కల్పిస్తుంది. కనీసం రూ.100 నుంచి ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. -
లక్ష కోట్ల డాలర్లకు ఇంటర్నెట్ ఎకానమీ
న్యూఢిల్లీ: ఈ–కామర్స్ విభాగం దన్నుతో దేశీ ఇంటర్నెట్ ఎకానమీ 2030 నాటికి ఆరింతలు పెరగనుంది. 1 లక్ష కోట్ల డాలర్లకు చేరనుంది. గూగుల్, టెమాసెక్, బెయిన్ అండ్ కంపెనీ విడుదల చేసిన సంయుక్త నివేదికలో ఈ అంశాలు వెల్లడయ్యాయి. దీని ప్రకారం 2022లో భారత ఇంటర్నెట్ ఎకానమీ 155–175 బిలియన్ డాలర్ల స్థాయిలో ఉంది. బీ2సీ ఈ–కామర్స్ విభాగం, బీ2బీ ఈ–కామర్స్, సాఫ్ట్వేర్ యాజ్ ఎ సర్విస్ ప్రొవైడర్లు, ఓవర్ ది టాప్ సంస్థల (ఓటీటీ) వంటి ఆన్లైన్ మీడియా దేశీ ఇంటర్నెట్ ఎకానమీకి వృద్ధి కారకాలుగా ఉండగలవని గూగుల్ ఇండియా కంట్రీ మేనేజర్ సంజయ్ గుప్తా తెలిపారు. భవిష్యత్తులో చాలా మటుకు కొనుగోళ్లు డిజిటల్గానే జరగనున్నాయని పేర్కొన్నారు. డిజిటల్ ఆవిష్కరణలకు అంకుర సంస్థలు బాటలు వేయగా, కోవిడ్ మహమ్మారి అనంతరం చిన్న–మధ్య–భారీ తరహా సంస్థలు మార్కెట్లో దీటుగా పోటీపడేందుకు డిజిటల్ సాంకేతికతలను గణనీయంగా ఉపయోగించడం ఆరంభించాయన్నారు. ప్రపంచ జీడీపీ వృద్ధికి భారత్ కొత్త ఆశాదీపంగా మారిందని టెమాసెక్ ఎండీ (ఇన్వెస్ట్మెంట్స్) విశేష్ శ్రీవాస్తవ్ తెలిపారు. డిజిటల్ సాంకేతికతలను ఆర్థిక కార్యకలాపాల్లో విస్తృతంగా వినియోగించే ఆర్థిక వ్యవస్థను ఇంటర్నెట్ ఎకానమీగా పరిగణిస్తారు. నివేదిక ప్రకారం.. ♦ బీ2సీ ఈ–కామర్స్ 2022లో 60–65 బిలియన్ డాలర్లుగా ఉండగా 2030 నాటికి 5–6 రెట్లు పెరిగి 350–380 బిలియన్ డాలర్లకు చేరనుంది. ♦ బీ2బీ ఈ–కామర్స్ 8–9 బిలియన్ డాలర్ల నుంచి 13–14 రెట్లు పెరిగి 105–120 బిలియన్ డాలర్లకు ఎగియనుంది. ♦ సాఫ్ట్వేర్–యాజ్–ఎ–సర్వీస్ విభాగం 5–6 రెట్లు వృద్ధి చెంది 12–13 బిలియన్ డాలర్ల నుంచి 65–75 బిలియన్ డాలర్లకు చేరనుంది. -
ఇంటర్నెట్ ఎకానమీ @ 250 బిలియన్ డాలర్లు
⇒ 2020 నాటికి భారత మార్కెట్పై బీసీజీ–టీఐఈ అంచనా ⇒ భారీగా పెరుగుతున్న ఆన్లైన్ యూజర్లు, డేటా వినియోగం ⇒ ఈ–కామర్స్, ఆర్థిక సేవల ఊతం న్యూఢిల్లీ: ఆన్లైన్ యూజర్లు, డేటా వినియోగం వేగంగా ఎదుగుతున్న నేపథ్యంలో 2020 నాటికి భారత ఇంటర్నెట్ ఎకానమీ 250 బిలియన్ డాలర్ల స్థాయికి (సుమారు రూ.16,25,000 కోట్లు) చేరనుంది. ప్రస్తుతం ఇది 100–130 బిలియన్ డాలర్ల (స్థూల దేశీయోత్పత్తిలో దాదాపు 5 శాతం వాటా) స్థాయిలో ఉంది. ఈ–కామర్స్, ఆర్థిక సేవల ఊతంతో గణనీయంగా వృద్ధి చెంది 2020 నాటికల్లా ఇంటర్నెట్ ఎకానమీ 215–265 బిలియన్ డాలర్ల స్థాయికి (జీడీపీలో 7.5 శాతం) చేరవచ్చని కన్సల్టెన్సీ సంస్థ బీసీజీ, ది ఇండస్ ఎంటర్ప్రెన్యూర్స్ (టీఐఈ) సంయుక్తంగా రూపొందించిన ఒక నివేదికలో అంచనా వేశాయి. ఈ వృద్ధిలో .. ఈ–కామర్స్, ఆర్థిక సేవల వాటా 40–50 బిలియన్ డాలర్లు, ఈ–కామర్స్ ఉత్పత్తుల వాటా 45–50 బిలియన్ డాలర్లు, డిజిటల్ మీడియా .. అడ్వర్టైజింగ్ వాటా 5–8 బిలియన్ డాలర్ల స్థాయిలో ఉండనుంది. ఇందులో అత్యధికంగా ఇన్ఫ్రాపై ప్రైవేట్, ప్రభుత్వ వ్యయాల రూపంలో (50–60 బిలియన్ డాలర్లు) ఉండవచ్చని నివేదిక వివరించింది. ఇక కనెక్టివిటీపరమైన వాటా 45–55 బిలియన్ డాలర్ల స్థాయిలో, డివైజ్ల వాటా 30–40 బిలియన్ డాలర్ల మేర ఉండగలదని పేర్కొంది. 65 కోట్లకు మొబైల్ ఇంటర్నెట్ యూజర్లు .. నివేదిక ప్రకారం సుమారు 39.1 కోట్ల మంది యూజర్లతో భారత్ ఇప్పటికే మొబైల్ ఇంటర్నెట్ వినియోగదారులపరంగా అంతర్జాతీయంగా రెండో స్థానంలో ఉంది. 2020 నాటికల్లా ఈ సంఖ్య 65 కోట్లకు చేరనుంది. అదే సమయంలో డేటా వినియోగం 10–14 రెట్లు పెరగనుంది. అప్పటికల్లా ప్రతి యూజరు డేటా వినియోగం సగటున నెలకు 7–10 జీబీ స్థాయికి చేరనుంది. హై స్పీడ్ ఇంటర్నెట్ వాడకం పెరగడం వల్ల యూజర్లు ఆన్లైన్లో గడిపే సమయం కూడా 3–4 రెట్లు పెరిగిపోనుంది. 4జీ డివైజ్లు, విశ్వసనీయమైన హై స్పీడ్ డేటా, డిజిటల్ కంటెంట్ విస్తరణ మొదలైనవి భారత్లో ఇంటర్నెట్ వినియోగం పెరుగుదలకు దోహదపడగలవని బీసీజీ పార్ట్నర్ నిమిష జైన్ తెలిపారు. -
ఆన్లైన్ బస్ బుకింగ్స్ జోరు
న్యూఢిల్లీ: ఆన్లైన్ బస్, హోటల్ బుకింగ్స్ జోరుగా పెరుగుతున్నాయని తాజాగా ఒక నివేదిక వెల్లడించింది. ఇంటర్నెట్ అండ్ మొబైల్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా(ఐఏఎంఏఐ), ఐఎంఆర్బీలు సంయుక్తంగా ఈ నివేదికను రూపొందించాయి. జనవరిలో 2.5 లక్షలుగా ఉన్న బస్ బుకింగ్స్ జూలైలో 185 శాతం వృద్ధితో 7.2 లక్షలకు చేరాయని పేర్కొంది. హోటల్ బుకింగ్స్ 60,000 నుంచి 135 శాతం వృద్ధితో 1.3 లక్షలకు పెరిగాయని వివరించింది. గతంలో ఇంటర్నెట్ ద్వారా విమాన, రైల్వే టికెట్లు మాత్రమే బుక్ చేసేవారని, ఇప్పుడు బస్సు టికెట్లను కూడా ఆన్లైన్ ద్వారా బుక్ చేస్తున్నారని, ఇది ఇంటర్నెట్ విస్తరణకు అద్దం పడుతోందని ఐఏఎంఏఐ ప్రెసిడెంట్ సుభో రే చెప్పారు. నగదురహిత లావాదేవీల నిర్వహణ చెప్పుకోదగిన స్థాయిలో పెరుగుతోందని వివరించారు. మొబైల్ ఇంటర్నెట్ కూడా చెప్పుకోదగ్గ స్థాయిలో వృద్ధి చెందుతోందని పేర్కొన్నారు.


