Humpy Koneru
-
హంపి, గుకేశ్లకు మూడో స్థానం
స్టావెంజర్: కీలకదశలో తప్పిదాలు చేయడంతో... నార్వే ఓపెన్ చెస్ టోర్నమెంట్లో భారత స్టార్ క్రీడాకారులు కోనేరు హంపి, దొమ్మరాజు గుకేశ్ టైటిల్కు దూరమయ్యారు. మహిళల విభాగంలో హంపి... పురుషుల విభాగంలో క్లాసికల్ ఫార్మాట్ ప్రపంచ చాంపియన్ గుకేశ్ మూడో స్థానాన్ని దక్కించుకున్నారు. భారత కాలమానం ప్రకారం శుక్రవారం అర్ధరాత్రి దాటాక ముగిసిన ఈ టోర్నీలో హంపి 15 పాయింట్లు... గుకేశ్ 14.5 పాయింట్లు స్కోరు చేశారు. పురుషుల విభాగంలో నార్వే దిగ్గజం, ప్రపంచ నంబర్వన్ మాగ్నస్ కార్ల్సన్ (16 పాయింట్లు)... మహిళల విభాగంలో అనా ముజీచుక్ (16.5 పాయింట్లు) చాంపియన్స్గా అవతరించారు. పురుషుల విభాగంలో ఆరుగురు... మహిళల విభాగంలో ఆరుగురు చొప్పున పోటీపడగా... డబుల్ రౌండ్ రాబిన్ లీగ్ పద్ధతిలో గేమ్లను నిర్వహించారు. క్లాసికల్ గేమ్లోనే విజయం సాధిస్తే 3 పాయింట్లు లభిస్తాయి. ఒకవేళ క్లాసికల్ గేమ్ ‘డ్రా’గా ముగిస్తే విజేతను నిర్ణయించేందుకు అర్మగెడాన్ గేమ్ను నిర్వహిస్తారు. క్లాసికల్ గేమ్ను ‘డ్రా’ చేసుకొని, అర్మగెడాన్ గేమ్లో గెలిస్తే 1.5 పాయింట్లు లభిస్తాయి. క్లాసికల్ గేమ్ను ‘డ్రా’ చేసుకొని, అర్మగెడాన్ గేమ్లో ఓడిపోతే 1 పాయింట్ దక్కుతుంది. క్లాసికల్ గేమ్లో ఓడిపోతే ఎలాంటి పాయింట్లు లభించవు. పురుషుల విభాగం చివరి రౌండ్లో తెలంగాణ గ్రాండ్మాస్టర్, భారత నంబర్వన్ ఇరిగేశి అర్జున్, మాగ్నస్ కార్ల్సన్ గేమ్ 56 ఎత్తుల్లో ‘డ్రా’గా ముగిసింది. వీరిద్దరి మధ్య జరిగిన అర్మగెడాన్ గేమ్లో అర్జున్ 34 ఎత్తుల్లో కార్ల్సన్ను ఓడించాడు. ఫాబియానో కరువానా (అమెరికా)తో జరిగిన గేమ్లో గుకేశ్ 50 ఎత్తుల్లో ఓడిపోయాడు. ఒకవేళ కరువానాపై గుకేశ్ గెలిచి ఉంటే అతనికి టైటిల్ ఖరారయ్యేది. గుకేశ్పై నేరుగా క్లాసికల్ గేమ్లోనే నెగ్గడంతో కరువానా 15.5 పాయింట్లతో రెండో స్థానాన్ని దక్కించుకున్నాడు. 14 పాయింట్లతో హికారు నకముర (అమెరికా) నాలుగో స్థానంలో... 13 పాయింట్లతో అర్జున్ ఐదో స్థానంలో... 9.5 పాయింట్లతో వె యి (చైనా) చివరిదైన ఆరో స్థానంలో నిలిచారు. మహిళల విభాగంలో చివరి రౌండ్లో ప్రపంచ చాంపియన్ జు వెన్జున్ (చైనా)తో పోటీపడిన ఆంధ్రప్రదేశ్ క్రీడాకారిణి హంపి 51 ఎత్తుల్లో ‘డ్రా’ చేసుకుంది. వీరిద్దరి మధ్య విజేతను నిర్ణయించేందుకు అర్మగెడాన్ గేమ్ నిర్వహించగా... హంపి 40 ఎత్తుల్లో జు వెన్జున్ను ఓడించింది. భారత్కే చెందిన మరో గ్రాండ్మాస్టర్ వైశాలితో జరిగిన చివరి గేమ్ను అనా ముజీచుక్ 33 ఎత్తుల్లో ‘డ్రా’ చేసుకుంది. అర్మగెడాన్ గేమ్లో వైశాలి చేతిలో అనా ముజీచుక్ ఓడిపోయినా టైటిల్ను ఖరారు చేసుకుంది. 16 పాయింట్లతో లె టింగ్జీ (చైనా) రెండో స్థానాన్ని పొందగా... 13.5 పాయింట్లతో జు వెన్జున్కు నాలుగో స్థానం లభించింది. 11 పాయింట్లతో వైశాలి ఐదో స్థానంలో, 9 పాయింట్లతో సారా ఖాదెమ్ (స్పెయిన్) చివరిదైన ఆరో స్థానంలో నిలిచారు. ఎవరికెంత ప్రైజ్మనీ అంటే? నార్వే చెస్ టోర్నీలో ఈసారి పురుషుల, మహిళల విభాగం ప్లేయర్లకు సమాన ప్రైజ్మనీ కేటాయించారు. విజేతగా నిలిచిన కార్ల్సన్, అనా ముజీచుక్లకు 7 లక్షల నార్వేజియన్ క్రోన్ల (రూ. 59 లక్షల 36 వేలు) చొప్పున లభించాయి. రన్నరప్గా నిలిచిన కరువానా, లె టింగ్జీలకు 3 లక్షల 50 వేల క్రోన్ల (రూ. 29 లక్షల 68 వేలు) చొప్పున దక్కాయి. మూడో స్థానంలో నిలిచిన గుకేశ్, హంపి 2 లక్షల క్రోన్ల (రూ. 16 లక్షల 96 వేలు) చొప్పున అందుకున్నారు. నాలుగో స్థానం పొందిన నకముర, జు వెన్జున్లకు 1 లక్ష 70 వేల క్రోన్ల (రూ. 14 లక్షల 41 వేలు) చొప్పున లభించాయి. ఐదో స్థానంలో నిలిచిన అర్జున్, వైశాలిలకు 1 లక్ష 50 వేల క్రోన్ల (రూ. 12 లక్షల 72 వేలు) చొప్పున... ఆరో స్థానంలో నిలిచిన వె యి, సారాలకు 1 లక్ష 20 వేల క్రోన్ల (రూ. 10 లక్షల 17 వేలు) చొప్పున దక్కాయి. -
ముగింపు మెరవాలి!
న్యూయార్క్: ఈ ఏడాది భారత చెస్ క్రీడాకారులు విశ్వవేదికపై అదరగొట్టారు. ప్రతిష్టాత్మక ఒలింపియాడ్లో భారత పురుషుల, మహిళల జట్లు స్వర్ణ పతకాలతో మెరిపించగా... క్లాసికల్ ఫార్మాట్లో దొమ్మరాజు గుకేశ్ కొత్త ప్రపంచ చాంపియన్గా అవతరించాడు. క్యాడెట్ ప్రపంచ చాంపియన్షిప్లో హైదరాబాద్ చిన్నారి దివిత్ రెడ్డి పసిడి పతకాన్ని కైవసం చేసుకున్నాడు. ఇక పలు అంతర్జాతీయ టోర్నమెంట్లలో పలువురు భారత గ్రాండ్మాస్టర్లు టాప్–3లో నిలిచి తమ ఆధిపత్యాన్ని చాటుకున్నారు. ఈ నేపథ్యంలో ఈ ఏడాది చివరి అంతర్జాతీయ టోర్నమెంట్ అయిన ప్రపంచ ర్యాపిడ్, బ్లిట్జ్ చాంపియన్షిప్ పోటీలకు నేడు తెర లేవనుంది. న్యూయార్క్లో ఆరు రోజులపాటు ఈ ప్రతిష్టాత్మక ఈవెంట్ జరగనుంది. భారత్ నుంచి ఓపెన్ విభాగంలో 9 మంది గ్రాండ్మాస్టర్లు, మహిళల విభాగంలో 8 మంది క్రీడాకారిణులు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటారు. ప్రపంచ ర్యాపిడ్, బ్లిట్జ్ చాంపియన్షిప్ పోటీల్లో భారత్కు మంచి రికార్డే ఉంది. ఫలితంగా ఈ ఏడాది ఆఖరి టోర్నీలోనూ భారత క్రీడాకారులు పతకాలు సాధించి సూపర్ ఫినిషింగ్ ఇవ్వాలని ఆశిద్దాం. 2017లో విశ్వనాథన్ ఆనంద్ ర్యాపిడ్ ఫార్మాట్లో ప్రపంచ చాంపియన్ అయ్యాక మరో భారత ప్లేయర్ ఈ విభాగంలో టాప్–3లో నిలువలేదు. ఇక ఓపెన్ విభాగంలో ర్యాపిడ్, బ్లిట్జ్ ఫార్మాట్లలో నార్వే దిగ్గజం మాగ్నస్ కార్ల్సన్ డిఫెండింగ్ చాంపియన్గా బరిలోకి దిగనున్నాడు. మహిళల ర్యాపిడ్ విభాగంలో అనస్తాసియా బొడ్నారుక్ (రష్యా), బ్లిట్జ్ విభాగంలో వాలెంటీనా గునీనా (రష్యా) తమ ప్రపంచ టైటిల్స్ను కాపాడుకుంటారో లేదో వేచి చూడాలి. భారత్ నుంచి ఎవరెవరంటే.... ఓపెన్ విభాగం (ర్యాపిడ్, బ్లిట్జ్): ఇరిగేశి అర్జున్, ప్రజ్ఞానంద, రౌనక్ సాధ్వాని, సందీపన్ చందా, అరవింద్ చిదంబరం, హర్ష భరతకోటి, ప్రణవ్, దీప్తాయన్ ఘోష్, కార్తీక్ వెంకటరామన్. మహిళల విభాగం (ర్యాపిడ్, బ్లిట్జ్): కోనేరు హంపి, ద్రోణవల్లి హారిక, దివ్య, వైశాలి, వంతిక అగర్వాల్, సాహితి వర్షిణి, పద్మిని రౌత్, నూతక్కి ప్రియాంక. ఫార్మాట్ ఎలా అంటే... ప్రపంచ ర్యాపిడ్ చెస్ చాంపియన్షిప్ ఓపెన్ విభాగంలో మొత్తం 13 రౌండ్లను స్విస్ ఫార్మాట్లో... మహిళల విభాగంలో 11 రౌండ్లను స్విస్ ఫార్మాట్లో నిర్వహిస్తారు. నిర్ణీత రౌండ్ల తర్వాత రెండు విభాగాల్లో అత్యధిక పాయింట్లు సాధించిన ప్లేయర్లు విజేతగా నిలుస్తారు. ప్రపంచ బ్లిట్జ్ చాంపియన్షిప్ను రెండు దశల్లో నిర్వహిస్తారు.ముందుగా ఓపెన్ విభాగంలో 13 రౌండ్లను స్విస్ ఫార్మాట్లో... మహిళల విభాగంలో 11 రౌండ్లను స్విస్ ఫార్మాట్లో ఏర్పాటు చేశారు. నిర్ణీత రౌండ్ల తర్వాత టాప్–8లో నిలిచిన వారు రెండో దశ (నాకౌట్)కు అర్హత పొందుతారు. నాకౌట్ దశలో అజేయంగా నిలిచిన ప్లేయర్లు విజేతలుగా అవతరిస్తారు. టైమ్ కంట్రోల్ ఎంతంటే... ర్యాపిడ్ ఫార్మాట్లో ఒక్కో గేమ్ 15 నిమిషాలు జరుగుతుంది. తొలి ఎత్తు నుంచి ప్రతి ఎత్తుకు 10 సెకన్లు జత కలుస్తాయి. బ్లిట్జ్ ఫార్మాట్లో ఒక్కో గేమ్ 3 నిమిషాలు జరుగుతుంది. తొలి ఎత్తు నుంచి ప్రతి ఎత్తుకు 2 సెకన్లు జత కలుస్తాయి. నిర్ణీత రౌండ్ల తర్వాత ప్లేయర్లు సమంగా పాయింట్లు సాధిస్తే మెరుగైన టైబ్రేక్ స్కోరు ఆధారంగా ర్యాంకింగ్ను వర్గీకరించి విజేతలను నిర్ణయిస్తారు. ప్రైజ్మనీ ఎంతంటే... ర్యాపిడ్ ఫార్మాట్ ఓపెన్ విభాగంలో టాప్–40లో నిలిచిన ప్లేయర్లందరికీ ప్రైజ్మనీ ఇస్తారు. విజేతకు 90 వేల డాలర్లు (రూ. 76 లక్షలు), రెండో స్థానంలో నిలిచిన ప్లేయర్కు 70 వేల డాలర్లు (రూ. 59 లక్షలు), మూడో స్థానంలో నిలిచిన ప్లేయర్కు 56 వేల డాలర్లు (రూ. 47 లక్షలు) అందజేస్తారు. బ్లిట్జ్ ఫారామ్ట్ ఓపెన్ విభాగంలోనూ టాప్–40లో నిలిచిన ఆటగాళ్లకు ప్రైజ్మనీ లభిస్తుంది. చాంపియన్గా 90 వేల డాలర్లు (రూ. 76 లక్షలు), రెండో స్థానంలో నిలిచిన వారికి 70 వేల డాలర్లు (రూ. 59 లక్షలు), మూడో స్థానం పొందిన ఆటగాడికి 42 వేల డాలర్లు (రూ. 35 లక్షలు) అందజేస్తారు. ర్యాపిడ్ ఫార్మాట్ మహిళల విభాగంలో టాప్–20లో నిలిచిన వారందరికీ ప్రైజ్మనీ దక్కుతుంది. విజేతకు 60 వేల డాలర్లు (రూ. 51 లక్షలు), రెండో స్థానంలో నిలిచిన క్రీడాకారిణికి 40 వేల డాలర్లు (రూ. 34 లక్షలు), మూడో స్థానంలో నిలిచిన ప్లేయర్కు 28 వేల డాలర్లు (రూ. 23 లక్షలు) లభిస్తాయి. బ్లిట్జ్ ఫార్మాట్ మహిళల విభాగంలోనూ టాప్–20లో నిలిచిన ప్లేయర్ల ఖాతాలో ప్రైజ్మనీ చేరుతుంది. చాంపియన్కు 60 వేల డాలర్లు (రూ. 51 లక్షలు), రెండో స్థానంలో నిలిచిన ప్లేయర్కు 40 వేల డాలర్లు (రూ. 34 లక్షలు), మూడో స్థానం పొందిన ప్లేయర్కు 20 వేల డాలర్లు (రూ. 17 లక్షలు) లభిస్తాయి.4 ప్రపంచ ర్యాపిడ్, బ్లిట్జ్ చాంపియన్షిప్లో భారత స్టార్, ఆంధ్రప్రదేశ్ క్రీడాకారిణి కోనేరు హంపి సాధించిన పతకాలు. ర్యాపిడ్ ఫార్మాట్లో 2012లో కాంస్యం నెగ్గిన హంపి, 2019లో స్వర్ణ పతకాన్ని, 2023లో రజత పతకాన్ని సాధించింది. బ్లిట్జ్ ఫార్మాట్లో హంపి 2022లో రజతం సొంతం చేసుకుంది. -
హంపి, హారిక గేమ్లు ‘డ్రా’
ఖాంటీ మన్సిస్క్ (రష్యా): ప్రపంచ మహిళల చెస్ చాంపియన్షిప్లో రెండో రౌండ్లోని తొలి గేమ్ను భారత గ్రాండ్మాస్టర్స్ కోనేరు హంపి, ద్రోణవల్లి హారిక ‘డ్రా’గా ముగించారు. జొలాంటా జవద్జా్క (పోలాండ్)తో జరిగిన గేమ్ను నల్ల పావులతో ఆడిన కోనేరు హంపి 26 ఎత్తుల్లో ‘డ్రా’ చేసుకుంది. బేలా ఖొటెనాష్విలి (జార్జియా)తో జరిగిన గేమ్ను నల్ల పావులతో ఆడిన హారిక 64 ఎత్తుల్లో ‘డ్రా’గా ముగించింది. నేడు జరిగే రెండో గేమ్లో గెలిచిన వారు మూడో రౌండ్కు అర్హత సాధిస్తారు. ఒకవేళ రెండో గేమ్ ‘డ్రా’ అయితే మాత్రం గురువారం టైబ్రేక్లు నిర్వహించి విజేతను నిర్ణయిస్తారు. -
హంపి జట్టుకు టైటిల్
సాక్షి, హైదరాబాద్: ప్రతిష్టాత్మక యూరోపియన్ క్లబ్ కప్ చెస్ టోర్నీలో ఆంధ్రప్రదేశ్ గ్రాండ్మాస్టర్ కోనేరు హంపి ప్రాతినిధ్యం వహించిన సర్కిల్ డిచెక్స్ డి మోంటెకార్లో (మొనాకో) జట్టు విజేతగా నిలిచింది. హంపి క్లబ్ ఆడిన ఏడు రౌండ్లలో అజేయంగా నిలిచింది. మొత్తం 14 పాయింట్లతో అగ్రస్థానాన్ని దక్కించుకుంది. మొనాకో జట్టుకు యూరోపియన్ క్లబ్ కప్ దక్కడం ఇది ఐదోసారి కావడం విశేషం. మొనాకో జట్టులో హంపితోపాటు ప్రపంచ చాంపియన్ హూ ఇఫాన్ (చైనా), అన్నా ముజిచుక్ (స్లొవేనియా), పియా క్రామ్లింగ్ (స్వీడన్), అల్మీరా స్కిర్ప్చెంకో (ఫ్రాన్స్) సభ్యులుగా ఉన్నారు. వ్యక్తిగత విభాగాల్లో హంపి బోర్డు-2లో విజేతగా నిలిచింది. హంపి ఆడిన ఏడు గేముల్లో ఐదింటిలో గెలిచి మిగతా రెండింటిని ‘డ్రా’ చేసుకుంది. -
ఇక్కడితో ఆగను: హంపి
విజయవాడ స్పోర్ట్స్, న్యూస్లైన్: ‘గ్రాండ్ప్రి’ విజయాలతో సరిపెట్టుకోకుండా... తన చిరకాల స్వప్నం ప్రపంచ చాంపియన్షిప్ టైటిల్ లక్ష్యంగా ముందుకు సాగుతానని ఆంధ్రప్రదేశ్ గ్రాండ్మాస్టర్ కోనేరు హంపి తెలిపింది. సోమవారం ముగిసిన తాష్కెంట్ గ్రాండ్ప్రి టోర్నమెంట్లో విజేతగా నిలిచిన ఈ విజయవాడ అమ్మాయి మంగళవారం నగరానికి చేరుకుంది. ఈ సందర్భంగా మీడియాతో ముచ్చటించింది. ఈ ఏడాదిలో గ్రాండ్ప్రి టోర్నీలు ముగిశాయని... వచ్చే ఏడాది జరిగే మిగతా మూడు గ్రాండ్ప్రి టోర్నీలకుగాను తాను రెండింటిలో బరిలోకి దిగుతున్నట్లు వివరించింది. ఆ రెండు టోర్నీల్లోనూ రాణించి 2015 ప్రపంచ చాంపియన్షిప్ మ్యాచ్కు అర్హత పొందేందుకు కృషి చేస్తానని తెలిపింది. ‘తాష్కెంట్’ టోర్నీలో టాప్ సీడ్ హంపి స్థాయికి తగ్గట్టుగా ఆడి అగ్రస్థానాన్ని దక్కించుకుంది. ఈనెల 19 నుంచి గ్రీస్లో జరిగే యూరోపియన్ క్లబ్ కప్లో బరిలోకి దిగుతానని వెల్లడించింది. ప్రస్తుతం కెరీర్పైనే పూర్తి దృష్టి సారించానని ఇప్పటికైతే తనకు అకాడమీ పెట్టే ఆలోచన లేదని స్పష్టం చేసింది. -
ఆధిక్యంలో హంపి
తాష్కెంట్: నాలుగో విజయాన్ని నమోదు చేసిన ఆంధ్రప్రదేశ్ గ్రాండ్మాస్టర్ కోనేరు హంపి ‘ఫిడే’ మహిళల గ్రాండ్ప్రి చెస్ టోర్నమెంట్లో ఆధిక్యంలోకి వెళ్లింది. బుధవారం జరిగిన ఏడో రౌండ్లో హంపి 50 ఎత్తుల్లో నఫీసా ముమినోవా (ఉజ్బెకిస్థాన్)పై గెలిచింది. లాగ్నో (ఉక్రెయిన్)తో జరిగిన గేమ్ను మరో గ్రాండ్మాస్టర్ హారిక 34 ఎత్తుల్లో ‘డ్రా’గా ముగించింది. హంపి ఐదున్నర పాయింట్లతో అగ్రస్థానంలో ఉంది.