breaking news
Historic Places
-
గాంధీ కొండ... చూద్దామా!
∙చెన్నాప్రగడ శర్మ, విజయవాడ విజయవాడ పేరు చెప్పగానే గుర్తొచ్చేవి ముచ్చటగా మూడు కొండలు. ఒకటి దుర్గ కొండ, రెండోది గాంధీ కొండ, మూడోది గుణదల కొండ. మహాత్మాగాంధీ మరణానంతరం ఆయన జ్ఞాపకార్థం గాంధీ కొండ పేరిట స్మారక చిహ్నాన్ని ఏర్పాటు చేశారు. రైల్వే స్టేషన్ పశ్చిమ ద్వారానికి కూతవేటు దూరంలో ఉంటుంది. ఒకప్పుడు పర్యాటకులతో కిటకిటలాడిన కొండ కొన్నేళ్లుగా నిర్లక్ష్యానికి గురైంది. మళ్లీ ఇప్పుడిప్పుడే పూర్వవైభవాన్ని సంతరించుకుంటోంది.నాటి ఓర్ కొండే నేటి గాంధీ కొండవిజయవాడ తారాపేటలో 500 అడుగుల ఎత్తున గాంధీ కొండ ఉంది. కెప్టెన్ చార్లెస్ ఓర్ అనే ఇంజినీరు 1852లో కృష్ణా నదిపై తొలి ఆనకట్ట నిర్మించినప్పుడు ఈ కొండపై నుంచే నిర్మాణ పనులను పర్యవేక్షించేవారు. అప్పట్లో దీన్ని ఓర్ కొండ అనేవారు. దీనిపై 1948లో బాపూజీ స్మారక స్థూపం ఏర్పాటు చేశారు. విజయవాడ వాసులతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల నుంచి ప్రజలు వచ్చి ఎంతో ఆసక్తిగా తిలకించేవారు. ఆ తర్వాత పలు జిల్లాలు, క్రమేణా ఇతర రాష్ట్రాల నుంచి పర్యాటకుల రాక ఊపందుకుంది. 1921లో స్వాతంత్య్ర పోరాట సమయంలో మహాత్మాగాంధీ బెజవాడ వచ్చి కొండ దిగువన నిర్వహించిన సభలో ప్రసంగించారు. అప్పటి నుంచి ఓర్ కొండ గాంధీ కొండగా పేరు పొందింది. గాంధీ స్మారక నిధి ఇక్కడ రూపొందించిన గాంధీ స్మారక చిహ్నానికి 1964 నవంబర్ 9న నాటి ప్రధాన మంత్రి లాల్ బహదూర్ శాస్త్రి పునాదిరాయి వేశారు. దేశంలో ఒక కొండపై ఉన్న మొట్టమొదటి గాంధీ స్మారక చిహ్నమిది. 1967లో అప్పటి ఉప ప్రధాని మొరార్జీదేశాయ్ గాంధీ హిల్ సొసైటీని స్థాపించారు. దశాబ్దం తర్వాత ఈ సొసైటీని గాంధీహిల్ ఫౌండేషన్ పేరిట ట్రస్టుగా మార్చారు. గాంధీజీ శత జయంతి ఉత్సవాల ప్రారంభం సందర్భంగా 1968 అక్టోబర్ 6న అప్పటి రాష్ట్రపతి డాక్టర్ జాకీర్ హుస్సేన్ 52 అడుగుల పొడవుగల స్మారక స్థూపాన్ని ఆవిష్కరించారు. చికుబుకు చికుబుకు రైలే...కొండపై ప్రధానంగా ఆకట్టుకునేది పిల్లల టాయ్ రైలు. 1969లో ఇండియన్ రైల్వేస్ రైలుమార్గాన్ని వేసింది. అప్పటి రాష్ట్ర ప్రభుత్వం రైలును బహూకరించింది. ఇది కొండను చుట్టివస్తుంది. లోపల కూర్చొని విజయవాడ నగరాన్ని చూడవచ్చు. ఒకప్పుడు ఈ రైలు ఎక్కేందుకు జనాలు పోటీపడేవారు. ఇప్పుడు రైల్వే ట్రాక్ పాడయింది. రైలు కూడా జీర్ణావస్థకు చేరడంతో ఏడాదిన్నరగా తిప్పడం లేదు. ప్రస్తుతం ఒకవైపు కొత్త ట్రాక్ పనులు, మరోవైపు విద్యుద్దీకరణ జరుగుతోంది.నేల మీదికి నింగి...అప్పటి రాష్ట్రపతి వి.వి.గిరి సౌండ్ అండ్ లైట్ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేయగా.. 1969లో సరిహద్దు గాంధీగా పేరొందిన ఖాన్ అబ్దుల్ గఫార్ఖాన్ ప్రదర్శన ప్రారంభించారు. ఇందులో గాంధీజీ జీవితం, స్వాతంత్య్రోద్యమ ఘట్టాలను ప్రదర్శిస్తారు. 1971లో ప్లానెటోరియంను ప్రారంభించారు. న్యూయార్క్కు చెందిన ఫోర్డు ఫౌండేషన్ దీనికి టెలిస్కోప్ బహూకరించింది. పిల్లలు, పెద్దలు ఎవరికైనా ప్రవేశ రుసుం 40 రూపాయలు. కనీసం పదిమందికి పైగా వస్తేనే ప్రదర్శన వేస్తారు. కొండపై గ్రంథాలయం ఒకటుంది. ఇందులో మహాత్మాగాంధీ జీవితానికి సంబంధించినవి, ఆయన స్వయంగా రాసిన పుస్తకాలు దాదాపు వెయ్యి ఉంటాయి. ఇంకా పలు ఛాయాచిత్రాలు చూడవచ్చు. పిల్లలు ఆడుకునేందుకు ప్రత్యేకంగా పార్కులున్నాయి. దశలవారీగా అభివృద్ధి...రాష్ట్ర విభజన అనంతరం 2017లో కొత్తగా ఆంధ్రప్రదేశ్ గాంధీ స్మారక నిధి పేరుతో రిజిస్టర్ అయింది. కొత్త కార్యవర్గం ఏర్పాటైంది. ప్రస్తుతం గాంధీ హిల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో అభివృద్ధి పనులను దశలవారీగా చేపట్టనున్నారు. ముందుగా కొండను సుందరీకరించనున్నారు. ఘాట్ రోడ్డు ప్రారంభంలో ఆర్చ్ని అందంగా తీర్చిదిద్దుతారు. అక్కడి నుంచి స్థూపం వరకు అప్రోచ్ రోడ్డును అభివృద్ధి చేస్తారు. పచ్చదనాన్ని మరింత పెంచుతారు. పిల్లలు ఆడుకునే ఆట ప్రదేశాల్లో కొత్త పరికరాలను అమర్చుతారు. ఇవన్నీ అక్టోబరు రెండు నాటికి పూర్తయితే గాంధీ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించాలని భావిస్తున్నారు. గాంధీ కొండను అంతర్జాతీయ పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దడానికి సమగ్ర ప్రణాళికతో ముందుకెళుతున్నామని గాంధీ స్మారక నిధి చైర్మన్ గాంధీ పి.సి. కాజా చెప్పారు.ఫొటోలు: కిశోర్ నడిపూడి సాక్షి–విజయవాడపర్యాటకానికి అండ గాంధీ కొండవిజయవాడ నగరంలో పర్యాటకంగా ప్రసిద్ధిగాంచిన ప్రదేశాల్లో గాంధీ కొండ ఒకటి. టాయ్ ట్రైన్ తిరిగినప్పుడు పిల్లలు పెద్ద సంఖ్యలో వచ్చేవారు. ఇప్పుడది మరమ్మతులకు గురైంది. మరో ఏడాదిన్నరకుగాని పట్టాలెక్కదు. ప్రతిరోజూ సాయంత్రం 4 గంటల నుంచి 8–30 గంటల వరకు కొండను సందర్శించవచ్చు. ఎంట్రన్్స టికెట్ 10 రూపాయలు. ప్రతి మంగళవారం సెలవు. రైల్వే స్టేషన్ పశ్చిమ ద్వారానికి అతి సమీపంలో ముఖ ద్వారం ఉంటుంది. కాలినడకన వెళ్లవచ్చు. పండిట్ నెహ్రూ బస్ స్టేషన్ నుంచి 1.9 కిలోమీటర్ల దూరంలో ఉంది. ∙ఉప్పలూరి రవితేజ, మేనేజర్–గాంధీ హిల్ -
నల్లగొండలో అద్భుతం: ‘కంచి’ శాసనచిహ్నాలు
రామగిరి (నల్లగొండ): తమిళనాడులోని కంచి పాలకుడైన 3వ వీరభల్లాలుడి శాసన చిహ్నాలు నల్లగొండలో వెలుగు చూశాయి. కొత్త చరిత్ర బృందం సభ్యుడు చిక్కుళ్ల యాదగిరి ఇటీవల నల్లగొండ పాతబస్తీలో ఉన్న కోట మైసమ్మ ఆలయంలోని ఏకశిల రాతిపలకను శుభ్రం చేసి పరిశీలించగా భైరవుడు, గండభేరుండం, పులి శిల్పాలు చెక్కి ఉన్నాయి. ఈ రాతిపలకం ఫొటోలను ప్రముఖ చరిత్రకారుడు రామోజు హరగోపాల్కు కొత్త తెలంగాణ చరిత్ర బృందం సభ్యులు యాదగిరి, సత్తయ్య, సట్టు నారాయణ, ఆమనగంటి వెంకన్న, నాగిళ్ల చక్రపాణి పంపగా భైరవుడు శైవమతానికి గుర్తయితే, గండభేరుండం వైష్ణవ మతచిహ్నమని, పులి రాజరికానికి, వీరత్వానికి ప్రతీక అని ఆయన వివరించారు. కంచి పాలకుడైన 3వ హోయసల వీరభల్లాలుడి శాసనాల మీద గండభేరుండం, పులి బొమ్మలు కనిపిస్తుంటాయని హరగోపాల్ తెలిపారు. తమిళనాడులోని భల్లాలుడి రాజ్యానికి తెలంగాణలోని నల్లగొండ పట్టణానికి 500 నుంచి 600 కిలోమీటర్ల దూరం ఉందని, ఇక్కడ కూడా ఆయన ప్రాతినిధ్యం ఉండొచ్చని అభిప్రాయపడ్డారు. వీరభల్లాలుడిని, అతని మిత్రులు శాంబువరాయుణ్ణి, చంద్రగిరి యాదవరాయుడిని కాకతీయ సేనాని రుద్రుడు ఓడించి కంచిని కాకతీయ సామ్రాజ్యంలో కలిపాడని పేర్కొన్నారు. ఇవి నల్లగొండ జిల్లా కేంద్రంలోని కాపురాలగుట్ట ముందు కనిపించాయని పేర్కొన్నారు. కాకతీయ సామ్రాజ్య పతనానంతరం వీరభల్లాలుడు కాపయనాయకుడితో కలసి యుద్ధా ల్లో పాల్గొన్నట్లు ఆధారాలున్నాయని చెప్పారు. -
శతాబ్దాల బాంధవ్యం
ఆగ్నేయాసియాతో భారతదేశం సుదీర్ఘకాలంగా సాంస్కృతిక, రాజకీయ, వాణిజ్య సంబంధాలను కలిగి ఉంది. ఈ ప్రాంతమంతటా భారతీయ ప్రభావాన్ని మనం చూడవచ్చు. కానీ ప్రస్తుత తరం ఆగ్నేయాసియా ప్రజలకు భారతీయుల గురించి, ప్రస్తుత తరం భారతీయులకు ఆగ్నేయాసియా ప్రజల గురించి చాలా తక్కువగానే తెలిసి ఉండటం దురదృష్టకరమైంది. అమెరికా, యూరప్ చరిత్ర గురించి మనకు బాగానే తెలుసు. పైగా గులాబీ యుద్ధం జరిగిన చోటు, బ్రిటిష్ రాజుల సమాధి స్థలాలు వంటి పాశ్చాత్య దేశాల్లోని అప్రాధాన్య ప్రాంతాలను సందర్శించడానికే ఎక్కువ ఆసక్తి చూపుతుంటాం కానీ, భారతదేశం నుంచి ఆగ్నేయాసియా వారసత్వంగా స్వీకరించిన హిందూ, బౌద్ధ చారిత్రక నిర్మాణాల గురించి మర్చిపోయాం. ఇండోనేషియాలోకి ఇస్లాం మతం కత్తితో కాకుండా వ్యాపారంతో విస్తరించింది. మతాన్ని తమతో పాటు ఇక్కడికి తీసుకొచ్చిన వ్యాపారులు అప్పటికే ఉన్న హిందూ, బౌద్ధ సంస్కృతి నుంచి ఇస్లాం మతానికి శాంతియుతంగా పరివర్తన చేశారు. అందుకే సీతా అనే అమ్మాయి ఇస్లాం మతాన్ని ఆచరించే అరుదైన దృశ్యం ఇండోనేషియాలోనే కనిపిస్తుంది. హిందూ మతంతో ముడిపడిన అనేక పౌరాణిక గాథలు వీరికి తెలుసు. నా పర్యటనలో నేను పాల్గొన్న శిక్షణా కార్యక్రమానికి పలు ఆగ్నేయాసియా దేశాలకు చెందిన అధికారులు హాజరయ్యారు. ఈ చర్చలో పాల్గొన్న వివిధ దేశాల ప్రతినిధులు తమ భాషలోని అక్షరాలు భారతీయ అక్షరమాలనే పోలి ఉంటాయని, వలసపాలనలోనే రోమన్ అక్షరాలు తమ అక్షరమాల స్థానంలో వచ్చి చేరాయన్నారు. నా పర్యటనలో భాగంగా యోగ్యకర్త పట్టణం (సౌభాగ్యనగరం అని అర్థం) సందర్శించాను. ఇది కూడా సంస్కృతపదమే. ఇక్కడే బోరోబుదుర్ అనే అద్భుతమైన ఆలయం ఉంది. ఇది 9వ శతాబ్దానికి చెందిన ప్రపంచంలోనే అతిపెద్ద బౌద్ధ దేవాలయం. యోగ్యకర్త పట్టణంలో దక్షిణభారత శిల్పశైలిని ప్రతి బింబించే అద్భుతమైన ఆలయాలను చూడవచ్చు. ఇండోనేషియాలో బౌద్ధం నిర్వహించిన ముఖ్య పాత్రకు బోరోబుదుర్ నిర్మాణాలు నిదర్శనాలు. అలాగే ఆ దేశ సాంస్కృతిక వారసత్వంలో రామాయణ జానపద గా«థలు ఓ అంతర్భాగం. ఆగ్నేయాసియాతో భారత్కున్న సన్నిహిత సాంస్కృతిక బాంధవ్యాలకు మరో చక్కటి నిదర్శనం కాంబోడియాలోని అంగ్కోర్ వాట్ ఆలయం. బోరోబుదుర్లో శిలలపై బుద్ధుడి జీవిత విశేషాలను చిత్రించినట్లుగానే, అంగ్కోర్ వాట్ ఆలయ శిలలపై వాటితోపాటు భీష్ముడి అంపశయ్య వివరాలను అత్యద్భుతంగా చిత్రించారు. ఈ ప్రాంతంలోని అనేక దేశాలు తమ ప్రాచీన రాజులు భారతీయ రాజరికపు కుదురు నుంచి వచ్చారని చెబుతుంటాయి. క్రీస్తుశకం తొలి శతాబ్దంలోనే అయోధ్యకు చెందిన కొందరు రాజకుమారిలు తమ దేశ చక్రవర్తిని పెళ్లాడారని కొరియన్ల విశ్వాసం. కొరియా పురాణాలు దీన్ని బలపరుస్తున్నాయి. ఈ కాలంలోనే కాంబోడియాలో నెలకొన్న ఒక సామ్రాజ్యానికి భారతీయ మూలాలున్నట్లు అక్కడి పురాణాలు చెబుతున్నాయి. ఈ ప్రాంతంలో బౌద్ధమతం వ్యాప్తిద్వారా భారత్తో మతపరమైన సంబంధాలు మరింతగా బలపడ్డాయి. దక్షిణ భారతంతోపాటు కళింగ రాజులు కూడా ఈ ప్రాంతంతో వాణిజ్య సంబంధాలు పెంపొందించుకున్నారు. బొరోబుదుర్ మహా శిల్ప నిర్మాణం ముందు, అంగ్కోర్ వాట్ అద్భుత దేవాలయం ముందు నిలబడినప్పుడు కలిగేటంత అనుభూతిని ఏ ఇతర దేశాన్ని కానీ లేక యూరప్ చారిత్రక నిర్మాణాలను, అమెరికా సహజ సౌందర్యాన్ని చూస్తున్నప్పుడు పొందలేం. పాశ్చాత్య దేశాలతో పోలిస్తే ఈ దేశాలకు తక్కువ ఖర్చుతోనే మనం పర్యటించవచ్చు. వాణిజ్య అవసరాల ప్రాతిపదిక కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన లుక్ ఈస్ట్ పాలసీని భారత ప్రజలకు ఆ ప్రాంతంతో ఉన్న చారిత్రక, సాంస్కృతిక అనుసంధాలను మరింత బలపర్చేవిధంగా మెరుగుపర్చాలి. అలాగే ఇరుప్రాంతాల ప్రజల మధ్య సంబంధాలను పెంచేవిధంగా పర్యాటక సంస్కృతిని మరింతగా పెంపొం దించాలి. భారతీయ ఉపఖండంతో ఈ ప్రాంతానికి ఉన్న సుదీర్ఘ చారిత్రక బాంధవ్యాన్ని ప్రజలు మరిం తగా తెలుసుకునేలా తగు చర్యలు తీసుకోవాలి. ఐవైఆర్ కృష్ణారావు : వ్యాసకర్త ఏపీ ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి -
టూర్ వెళ్లొద్దాం ఇలా..
సాక్షి, సిటీబ్యూరో: ప్రతి మనిషికి నిత్యం ఎన్నో బాధ్యతలు ఉంటాయి. ఇంటి బాధ్యతలు.. ఆఫీసు.. పిల్లలకు స్కూలు, కాలేజీ.. ఇలా చాలానే ఉంటాయి. ఎప్పుడూ ఒకేలా ఉండే జీవితం కొంత మార్పు కోరుకోవడం సహజం. చేస్తున్న పనికి విరామం ఇచ్చి ఎక్కడైనా వెళ్లి ఆనందంగా గడిపి రావాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. ప్రత్యేకించి నేటి ‘స్పీడ్’ యుగంలో ప్రతి మనిషి యాంత్రిక జీవనం నుంచి బయటపడి కొన్ని రోజులైనా సరదాగా గడపడం అవసరం కూడా. కుటుంబమంతా జాలీ ట్రిప్ వేసేందుకు ఈ వేసవి కాలమే సరైన సమయం. ఎప్పటి నుంచో చూడాలనుకుంటున్న ప్రదేశానికి వెళ్లి రావద్దామనుకుంటారు. ఈ సమయంలో కొంచెం ప్లాన్తో సిద్ధమైతే టూర్ను బాగా ఎంజాయ్ చేయవచ్చు. కలిసి చర్చించుకుంటే మేలు.. ఏ ప్రాంతానికి వెళ్లాలనుకుంటున్నారో.. ఆ ప్రదేశం గురించి కుటుంబ సభ్యులంతా కలిసి చర్చించుకొని ఏకాభిప్రాయానికి రండి. వెళ్లనున్న చోటికి సంబంధించిన సమాచారాన్ని తెలుసుకుని, బడ్జెట్ వేసి ఖర్చులు అంచనాకు సరిపోతుందో లేదో చూడండి. అంతా ఓకే అనుకున్నాక కొన్ని రోజుల ముందే రెండు వైపులా టికె ట్లు రిజర్వేషన్ చేయించుకుంటే ట్రిప్లో సగం సమస్యలు తీరిపోతాయి. బయలుదేరే ముందు.. వెళుతున్న ప్రదేశంలో దొరికే ఆహారం గురించి అప్పటికే ఒక అవగాహన ఉంటుంది. కనుక తదనుగుణంగా సిద్ధమవ్వాలి. పిల్లలు, వృద్ధులు కూడా ప్రయాణంలో ఉన్నప్పుడు వారిని అవసరమైన మందులు మర్చిపోవద్దు. ఫస్ట్ ఎయిడ్ బాక్స్ వెంట ఉండాల్సిందే. ఊరు వెళుతున్న సమాచారాన్ని సన్నిహితులకు, ఇరుగు పొరుగువారికి తెలియజేయడంతో పాటు ప్రస్తుత పరిస్థితిని బట్టి సమీప పోలీస్ స్టేషన్లో కూడా తెలియజేయడం తప్పనిసరి. అకస్మాత్తుగా గాలి మార్పు, నీటి మార్పు వలన కొన్ని ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. ఈ విషయంలో వైద్యుడిని సంప్రదించి ముందు జాగ్రత్తలు తీసుకోవాలి. మనం గడిపిన జాలీడేస్ని పదిలపరచుకోవడం కోసం కెమెరా, వీడియో ఉంటే మంచిది. కొన్ని చోట్ల సుదీర్ఘమైన ప్రయాణాలు చేయాల్సి రావచ్చు. వాటి గురించి కూడా ముందే తెలుసుకుని అందుకు తగ్గట్టు ప్రయాణంలో బోర్ కొట్టకుండా ప్లాన్ చేసుకోవాలి. ప్రతి ఖర్చుకు లెక్క ఉండాల్సిందే.. టూర్ సరికొత్త అనుభూతుల్ని పంచాలంటే ఉన్న సమస్యలను ఇంటి వద్దే మర్చిపోతే ఆనందంగా గడపవచ్చు. ఖర్చులకు అనుకున్న దానికన్నా కాస్త ఎక్కువ డబ్బులు తీసుకెళ్లండి. పరిస్థితిని బట్టి క్రెడిట్ కార్డ్స్, ఏటీఎం కార్డ్స్ను వినియోగించండి. చేసిన ప్రతి ఖర్చుకు లెక్క రాయండి. హోటల్లోని రూమ్లలో టైం వేస్ట్ చేయకుండా వీలైనంత సేపు సీయింగ్లో గడపండి. వీలైతే ఒక డైరీలో మీ ప్రయాణపు అనుభూతుల్ని అక్షరం బద్దం చేయండి. చారిత్రక ప్రదేశాలకు వెళ్లినప్పుడు వాటి గురించి పిల్లలకు వివరించండి. మీ టూర్ ప్లాన్కి ఏదైనా వివరాలు అవసరమైతే టీఎస్టీడీసీ ఎప్పుడూ అందుబాటులో ఉంటుంది. 040- 29801039/40, 9848540371, 9848125720, 040-23450165 నంబర్లలో సంప్రదిస్తే పర్యాటక ప్రాంతాల వివరాలు అందిస్తారు. లేదా ఐఆర్సీటీసీ వెబ్సైట్లో కూడా పొందవచ్చు.