breaking news
High-speed rail
-
వడోదరలో హైస్పీడ్ రైల్ ట్రైనింగ్ సెంటర్
సాక్షి, వడోదర : గుజరాత్లోని వడోదరలో 600 కోట్ల రూపాయలతో మొదటి హైస్పీడ్ రైల్ ట్రైనింగ్ సెంటర్ను ఏర్పాటు చేస్తున్నట్లు నేషనల్ హై స్పీడ్ రైల్ కార్పొరేషన్ (ఎన్హెచ్ఎస్ఆర్సీ) బుధవారం ప్రకటించింది. ఈ సెంటర్ మొత్తం 5 హెక్టార్ల విస్తీర్ణంలో ఏర్పాటు చేస్తున్నట్లు సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ అస్కాత్ ఖరే చెప్పరు. ట్రైనింగ్ సెంటర్ నేషనల్ అకాడమీ ఆఫ్ ఇండియన్ రైల్వేస్ ప్రాంగణంలో ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. ట్రైనింగ్ సెంటర్లో ఓవర్హెడ్ ఎలక్ట్రికల్ సిస్టమ్, బుల్లెట్ ట్రైన్ ట్రాక్ ఏర్పాటు వంటివాటిపై ప్రాథమిక శిక్షణ ఉంటుందని చెప్పారు. -
హైదరాబాద్ టు వైజాగ్.. గంటలోపే?
గూడ్సు బండిలో వెళ్లేవాణ్ణి గోదావరి ఎక్కిస్తే ఎలా ఉంటుంది? గమ్మత్తుగా ఉంటుంది. అమ్మో!! ఎంత స్పీడో! అనిపిస్తుంది. మరి గోదావరిలో వెళ్లేవారు కాస్తా... భోపాల్ శతాబ్ది ఎక్కితేనో? ఆశ్చర్యానికి అంతుండదు. ఆ వేగానికి కళ్లు తిరుగుతాయి!!. అవును మరి! దేశంలో గూడ్సు రైలు స్పీడు గంటకు పాతిక కిలోమీటర్లు. అదే గోదావరి అయితే రెట్టింపు... అంటే 57 కిలోమీటర్లు. ఇక భోపాల్ శతాబ్ది అయితే ఏకంగా గంటకు 150 కిలోమీటర్లు. దేశంలో అత్యధిక వేగంతో వెళుతున్న రైలు ఇదే. ఒకరకంగా హైస్పీడ్ రైలన్న మాట. ఇలాంటి రైళ్లను ఇంకా తెస్తామని, మరింత వేగంగా వెళ్లే హైస్పీడ్ రైళ్లను నడుపుతామని ప్రభుత్వాలు కొన్నేళ్లుగా చెబుతూనే ఉన్నాయి. ఈ మధ్యే చర్యలు ఊపందుకున్నాయి కూడా. మన దేశంలో ఇవి అందరికీ ఎప్పుడు అందుబాటులోకొస్తాయో తెలీదు. కొన్ని దశాబ్దాలు పట్టినా ఆశ్చర్యం లేదు. ఇదంతా ఎందుకంటే... మనం హైస్పీడ్ రైళ్ల కోసం మాట్లాడుకుంటుంటే... ప్రపంచం హైపర్లూప్ టెక్నాలజీవైపు పరుగు పెడుతోంది. అంటే... భూమ్మీద అతివేగంగా వెళ్లే రైలన్నమాట. ఇంకా చెప్పాలంటే... భూమ్మీదే కాదు. ఆకాశంలో వెళ్లే విమానాలూ దీని వేగాన్ని అందుకోలేవు. మూడేళ్ల కిందట టెక్ దిగ్గజం ఇలాన్ మస్క్ బయటపెట్టిన ఈ ఆలోచన... మరో మూడేళ్లలో అమెరికాలోని లాస్ ఏంజిలిస్లో పట్టాలెక్కడానిక్కూడా సిద్ధమవుతోంది. భారతదేశ నాయకత్వం చెబుతున్న హైస్పీడ్ రైళ్లు ఒట్టి దండగని, అవి భవిష్యత్తు తరాలకు పెను భారంగా మారతాయని కూడా ఈ హైపర్లూప్ టెక్నాలజీ కంపెనీలు చెబుతున్నాయి. ఇండియాలో రెండు కారిడార్లు దీన్ని అమలు చేయటానికి పనికొస్తాయని తాము గుర్తించినట్లు కూడా తెలియజేశాయి. ఈ నేపథ్యంలో... అసలు ఈ టెక్నాలజీ ఏంటి? ఎలా పనిచేస్తుంది? ఏఏ కంపెనీలు పనిచేస్తున్నాయి? ఎన్నాళ్లలో అమల్లోకి రావచ్చు? అసలు ఇండియాపై ఇలాంటి వ్యాఖ్యలు చేసిందెవరు? అవన్నీ నిజమేనా...? ఈ వివరాల విశ్లేషణే ఈ వారం ‘ఫోకస్’. భూమి మీద విమానాన్ని మించిన వేగం హైపర్లూప్ సొంతం * గంటకు వెయ్యి కిలోమీటర్ల వేగంతో ప్రయాణానికి వీలు- వాక్యూమ్ ట్యూబ్తో ట్రాక్... దానిపై ట్యూబుల్లాంటి పెట్టెలు- గాలి నిరోధం ఉండకపోవటంతో తక్కువ ఇంధనం చాలు * ట్రాక్పై సోలార్ ప్యానెళ్లు... గాలి మరలతో విద్యుదుత్పత్తి * సొంత అవసరాలకు పోగా 30 శాతం ఇంధనం మిగిలే అవకాశం- 2013లో ఆవిష్కరించిన స్పేస్ ఎక్స్ అధిపతి ఇలాన్ మస్క్ * రెండేళ్ల కిందట నిధులతో సహా ఆవిర్భవించిన రెండు కంపెనీలు * అమెరికాలోని కాలిఫోర్నియా, నెవెడాల్లో చురుగ్గా టెస్ట్ ట్రాక్ నిర్మాణం * 2019 నాటికి ప్రయోగాత్మక పరుగు పూర్తి! * యూరప్, అమెరికాల్లో పలు లైన్ల నిర్మాణానికి ప్రతిపాదనలు * ఇండియాలోనూ రెండు లైన్లను గుర్తించామన్న హెచ్టీటీ * హైస్పీడ్ రైళ్లు దండగని, భవిష్యత్తు తరాలకు భారమని వ్యాఖ్య * దానిబదులు హైపర్లూప్ నిర్మిస్తే మంచిదన్న హెచ్టీటీ సీఓఓ * స్లొవేకియాతో హెచ్టీటీ ఒప్పందం; దుబాయ్తో కూడా? ఇలాన్ మస్క్. టెక్నాలజీ ప్రపంచంలో ఈయన గురించి తెలియని వారుండరంటే అతిశయోక్తి కాదు. దక్షిణాఫ్రికాలో పుట్టి, కెనడాలో చదివిన ఈ టెక్ మేధావి... 12 ఏళ్లకే ఓ గేమ్ను తయారుచేసి విక్రయించాడు. పాతికేళ్లకే ఓ సాఫ్ట్వేర్తో... న్యూయార్క్ టైమ్స్, షికాగో ట్రిబ్యూన్ వంటి పత్రికల్ని తన క్లయింట్లుగా చేసుకున్నాడు. పేమెంట్ దిగ్గజం ‘పే పాల్’, ఎలక్ట్రిక్ కార్ల సంచలనం ‘టెస్లా’... ప్రయివేటు ‘నాసా’గా మారిన ‘స్పేస్ ఎక్స్’... ఇవన్నీ మస్క్ సంచలనాలే. చౌక అంతరిక్ష ప్రయాణాన్ని సుసాధ్యం చేస్తానని, అంగారకుడిపై కాలనీ నిర్మిస్తానని చెప్పటమే కాదు... అందుకోసం రాకెట్ల తయారీ సంస్థ ‘స్పేస్ఎక్స్’ను ఏర్పాటు చేసి, విజయవంతంగా రాకెట్లను తయారు చేసి చూపించాడు మస్క్. వాక్యూమ్ ట్యూబ్ల వంటి సాధనాల్లో భూమ్మీద అతి వేగంగా ప్రయాణించొచ్చుననే కాన్సెప్ట్ను 2013లో మస్క్ బయటపెట్టి... దానికి ‘హైపర్లూప్’ అనే పేరు పెట్టాడు. ఈ ఓపెన్ సోర్స్ టెక్నాలజీని ఎవరైనా అభివద్ధి చేయొచ్చునని ప్రకటించాడు. అది జరిగిన ఏడాదికి... ఈ టెక్నాలజీ కోసం తాము నిధులు సమీకరించామని ‘హైపర్లూప్ ట్రాన్స్పోర్ట్ టెక్నాలజీస్ (హెచ్టీటీ)’ సంస్థ ప్రకటించింది. తరవాత... తామూ రేసులో ఉన్నట్లు ‘హైపర్లూప్ ఒన్’ అనే మరో సంస్థ ప్రకటించింది. వైమానిక రంగంలో బోయింగ్, ఎయిర్బస్ల మాదిరి హైపర్లూప్ రంగంలో ప్రస్తుతం ఈ రెండే క్రియాశీలకంగా పనిచేస్తున్నాయి. ఎక్కడెక్కడ ఏర్పాటు చేస్తారు? ♦ హైపర్లూప్ టెక్నాలజీని అమలు చేయటానికి ప్రపంచ వ్యాప్తంగా కొన్ని మార్గాల్ని ప్రతిపాదించారు. వాటిలో మొదటిది అమెరికాలోని లాస్ ఏంజిలిస్ - శాన్ఫ్రాన్సిస్కో బే ఏరియా. దూరం 560 కిలోమీటర్లు. 35 నిమిషాల్లో ప్రయాణించొచ్చనేది ఆలోచన. ♦ ఈ ఏడాది జనవరిలో... పారిస్ - ఆమ్స్టర్డ్యామ్ హైపర్లూప్ ప్రతిపాదన తెరపైకి వచ్చింది. ♦ పోలండ్లోని క్రాకో నుంచి గాన్స్క్ వరకూ 581 కిలోమీటర్ల మార్గాన్ని హైపర్ పోలండ్ సంస్థ ప్రతిపాదించింది. ♦ ఫిన్లండ్లోని హెల్సింకీ నుంచి స్వీడన్ రాజధాని స్టాక్హోమ్ వరకూ సముద్ర మార్గంలో టన్నెల్ ద్వారా 484 కిలోమీటర్ల హైపర్లూప్ వేయాలనే ప్రణాళికలూ ఊపందుకున్నాయి. ♦ హెచ్టీటీ సంస్థ లాస్ ఏంజిలిస్- శాన్ఫ్రాన్సిస్కో మార్గంతో పాటు ఇతర మార్గాలనూ చూస్తోంది. ♦ హైపర్లూప్ ఒన్ సంస్థ మాత్రం లాస్ ఏంజిలిస్- లాస్వెగాస్ మార్గాన్ని ప్రతిపాదిస్తోంది. ♦ బ్రటిస్లావా - బుడాపెస్ట్ - వియెన్నా మధ్య హైపర్లూప్ను నడిపితే ప్రభావం ఎలా ఉంటుందో అధ్యయనం చెయ్యటానికి ఈ మధ్యే స్లొవేకియా ప్రభుత్వంతో హెచ్టీటీ ఒక ఒప్పందంపై సంతకాలు కూడా చేసింది. ♦ దుబాయ్ ప్రభుత్వం కూడా హెచ్టీటీతో సంప్రతింపులు జరుపుతోందని, ఒప్పందం కుదిరితే తొలి హైపర్లూప్ అక్కడే పరుగు పెడుతుందని ఇంటర్నెట్లో జోరుగా చర్చలు జరుగుతున్నాయి. ♦ ఇండియాలో దీనికి అనుకూలమైన రెండు కారిడార్లను గుర్తించినట్లు హెచ్టీటీ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ బిబోప్ గ్రేష్టా ఇటీవలే చెప్పారు. ఇదీ టెక్నాలజీ..? హైస్పీడ్ రైళ్లలో ఉండే ఇబ్బందుల్లో ప్రధానమైనవి... 1. యంత్ర పరికరాల మధ్య ఘర్షణ, 2. గాలి నిరోధం. వేగం పెరుగుతున్న కొద్దీ గాలి నిరోధం ఎక్కువవుతుంది. దాన్ని అధిగమించాలంటే భారీ ఇంధనం కావాలి. ఇక ఘర్షణ వల్ల యంత్రపరికరాలు దెబ్బతినటం, నిర్వహణ వ్యయం భారీగా పెరగటం జరుగుతోంది. హైపర్లూప్లో వాడే ‘వాక్ట్రయిన్’లో ఈ రెండు సమస్యలూ ఉండవు. ఎందుకంటే వాక్ట్రయిన్ ఒక ట్యూబ్లో నడుస్తుంది. ఆ ట్యూబ్లో గాలి ఉండదు. వాక్యూమ్ లేదా పాక్షిక వాక్యూమ్ ఉంటుంది. దీంతో ఎంత వేగంగా వెళ్లినా గాలి నిరోధం ఉండదు. ఇక యంత్రపరికరాల మధ్య ఘర్షణ ఉండదు కనక నిర్వహణ వ్యవయమూ తక్కువే ఉంటుంది. పైలాన్లపై గానీ, భూగర్భంలో గానీ ట్యూబ్ లాంటి నిర్మాణం చేసి... ఆ ట్యూబ్లో చిన్న చిన్న ‘పోడ్’లాంటి వాక్ ట్రయిన్లు నడుపుతారన్న మాట. తొలి డిజైన్ ప్రకారం... ఈ పోడ్ల ఎత్తు కేవలం 7.4 అడుగులే ఉంటుంది. గరిష్ఠ వేగం గంటకు 1,220 కి.మీ. హెచ్టీటీ.. అమెరికాలోని పలు రాష్ట్రాల్లో ఉన్న 500 మంది ఇంజినీర్ల బందమే ఈ కంపెనీ. వీరంతా వారానికోసారి టెలికాన్ఫరెన్స్ ద్వారా కలుస్తుంటారు. వీరికి జీతాల్లేవు కానీ కంపెనీలో వాటాలున్నాయి. 2015లోనే సాంకేతిక సాధ్యాసాధ్యాల అధ్యయనాన్ని పూర్తి చేయాలనుకుంది. కానీ కుదరలేదు. అయితే కాలిఫోర్నియాలో టెస్ట్ ట్రాక్ను నిర్మించడానికి సంబంధించి స్థానిక భూ యజమానులతో ఒప్పందాలు పూర్తయినట్లు గతేడాదే సంస్థ ప్రకటించింది. ట్రాక్ నిర్మాణంలో సహకారినికి ఓర్లికాన్ లేబోల్డ్ వాక్యూమ్, ఏకామ్ సంస్థలతో ఒప్పందాలు కూడా చేసుకుంది. గతేడాది నవంబరులో పనలు మొదలయ్యాయి. 150 మిలియన్ డాలర్ల వ్యయంతో (రూ.1,000 కోట్లు) రెండున్నరేళ్లలో ప్రయోగం పూర్తి చేయాలనేది లక్ష్యంగా పెట్టుకుంది. హైపర్లూప్ ఒన్.. లాస్ ఏంజిలిస్- లాస్వెగాస్ మధ్య హైపర్లూప్ నడపాలని ఆలోచిస్తున్నామంటూ 2015లో ప్రకటించటం ద్వారా ఈ సంస్థ తెరమీదికొచ్చింది. ఇంజినీర్లు, డెరైక్టర్లతో సమావేశాన్ని ఏర్పాటు చేసి... నిర్వహణ ఖర్చుల కోసం 9 కోట్ల డాలర్ల నిధులను సమీకరించినట్లు కూడా ప్రకటించింది. 100 మంది ఇంజినీర్లున్న ఈ సంస్థకు... ఇలాన్ మస్క్తో గట్టి సంబంధాలున్న షెర్విన్ పిషేవర్ సహ వ్యవస్థాపకుడు. స్పేస్ ఎక్స్కు లీడ్ ఇంజినీర్గా వ్యవహరించిన బ్రోగన్ బాంబ్రోగన్ మరో వ్యవస్థాపకుడు. అంతేకాదు! మస్క్కు నేరుగా దీంతో సంబంధాలు లేకున్నా ఆయన సన్నిహితులు పలువురు దీన్లో ఉన్నారు. ఎప్పకటిప్పుడు ఆయనకు అన్నీ తెలియజేస్తున్నారు. ఈ ఏడాది మే 11న హైపర్లూప్ ఒన్ తొలిసారిగా ఈ టెక్నాలజీని ప్రత్యక్షంగా పరీక్షించింది. జులైలో... హెల్సింకీ- స్టాక్హోమ్ మధ్య హైపర్లూప్కు అవకాశాలు బాగున్నాయంటూ తమ అధ్యయన నివేదికను బయటపెట్టింది. ఈ రెండింటి మధ్య ప్రయాణ సమయం అర్ధగంటకు పరిమితమవుతుందని, నిర్మాణ వ్యయం 19 బిలియన్ యూరోలుంటుందని అంచనా వేసింది. అంటే మన కరెన్సీలో రూ.1,430 కోట్ల పైమాటే. ట్రాన్స్పాడ్.. ఈ సంస్థ ట్యూబ్లో నడిచే వాహనాల్ని (పాడ్) డిజైన్ చేస్తున్నట్లు చెబుతోంది. ఈ ఏడాది మార్చిలో కొత్త డిజైన్ను విడుదల చేసింది. వచ్చే నెల బెర్లిన్లో జరిగే ఇన్నో ట్రాన్స్రైల్ షోలో పూర్తిస్థాయి డిజైన్ను ఆవిష్కరిస్తామని చెబుతోంది. ఈ పాడ్ను వెయ్యి కిలోమీటర్లకన్నా ఎక్కువ వేగంతో వెళ్లేలా డిజైన్ చేశారు. నియంత్రణ పూర్తిగా కంప్యూటర్ ఆధారంగానే ఉంటుంది. సోలార్ పవర్తో నడిచేలా చూస్తున్నారు. 2020 నాటికి తొలి పాడ్ను ఉత్పత్తి చేస్తామని సంస్థ చెబుతోంది. టొరంటో కేంద్రంగా పనిచేస్తున్న ఈ సంస్థ... మాంట్రియల్ -టొరంటో మధ్య దీన్ని నడపాలని కూడా ప్రతిపాదిస్తోంది. ఇది యూరప్లోని పలు వర్సిటీలు, ఏరోస్పేస్ కంపెనీలతో కలిసి పనిచేస్తోంది. ప్రయోగాలకు ట్రాక్లు... ⇒ హెచ్టీటీ, హెచ్ఒన్లతో పాటు హైపర్లూప్ టెక్నాలజీ కాన్సెప్ట్ను బయటపెట్టిన స్పేస్ ఎక్స్ కూడా ప్రయోగాలకు సిద్ధమయింది. ⇒ కాలిఫోర్నియాలోని క్వే వ్యాలీలో 8 కిలోమీటర్ల టెస్ట్ ట్రాక్ను హెచ్టీటీ నిర్మిస్తోంది. ⇒ కాలిఫోర్నియాలోని హాతోర్న్లో 1.6 కిలోమీటర్ల టెస్ట్ట్రాక్ను స్పేస్ఎక్స్ చేపట్టింది. ⇒ నెవెడాలోని నార్త్ లాస్ వెగాస్లో హైపర్లూప్ ఒన్ టెస్ట్ ట్రాక్ను ఏర్పాటు చేస్తోంది. -
‘హైస్పీడ్ రైలు’కు రెక్కలు!
సాక్షి, ముంబై: కొద్ది నెలలుగా అటకెక్కిన ముంబై-అహ్మదాబాద్ మధ్య ప్రవేశపెట్టనున్న హై స్పీడ్ రైలు ప్రతిపాదన మరోసారి తెరమీదకు వచ్చింది. ఈ రెండు కీలక నగరాల మధ్య రాకపోకలు సాగించే వ్యాపారులు, పారిశ్రామిక వేత్తల విలువైన సమయాన్ని తగ్గించేందుకు పశ్చిమ రైల్వే ముందుకు వచ్చింది. అందుకు గంటకు 160 కి.మీ. వేగంతో పరుగులు తీసే హైస్పీడ్ రైళ్లు నడిపేందుకు అవసరమైన రూ.1,200 కోట్ల పెట్టుబడి పెట్టేందుకు సిద్ధంగా ఉన్నట్లు పశ్చిమ రైల్వే స్పష్టం చేసింది. అత్యంత కీలకమైన ఈ ప్రాజెక్టు ప్రతిపాదన మంజూరు కోసం త్వరలో రైల్వే బోర్డుకు పంపించనుంది. బోర్డు ద్వారా మంజూరు లభించగానే అధ్యయనం, భూ సేకరణ లాంటి కీలకమైన పనులు ప్రత్యక్షంగా ప్రారంభమవుతాయి. ఈ పనులు పూర్తిచేయడానికి సంవత్సర కాలం పట్టవచ్చని అధికారులు అంచనావేశారు. ఆ తర్వాత కాంట్రాక్టర్ల నియామకం పనులు పూర్తిచేస్తారు. 495 కి.మీ. పొడవైన ఈ మార్గం కార్యరూపం దాలిస్తే ప్రయాణికుల విలువైన సమయం దాదాపు రెండు గంటలకుపైగా ఆదా కానుందని పశ్చిమ రైల్వే చీఫ్ పీఆర్వో శరత్ చంద్రాయన్ తెలిపారు. సాధారణంగా ముంబై-అహ్మదాబాద్ల మధ్య ఎక్స్ప్రెస్, సూపర్ ఫాస్ట్ రైళ్లలో వెళితే ఏడు నుంచి ఎనిమిది గంటల సమయం పడుతుంది. అదే గంటకు 160 కి.మీ. వేగంతో హైస్పీడ్ రైళ్లను నడిపితే సుమారు ఐదు గంటలలోపు తమ గమ్యాన్ని చేరుకోవచ్చని చంద్రాయన్ అభిప్రాయపడ్డారు. కాగా ఇలాంటి హైస్పీడ్ రైళ్లను నడపాలంటే ఇప్పుడున్న రైల్వే ట్రాక్స్, ఓవర్ హెడ్ వైర్ సామర్థ్యాన్ని పెంచాల్సి ఉంటుంది. అదేవిధంగా ప్రమాదకర మలుపులను తగ్గించాలి. ఇదిలాఉండగా, రైల్వే బోర్డు దేశవ్యాప్తంగా సెమీ హై స్పీడ్ రైళ్లను ప్రవేశపెట్టేందుకు తొమ్మిది ప్రాంతాలను ఎంపిక చేసింది. అందులో ముంబై-గోవా, ముంబై-అహ్మదాబాద్ మార్గాలు కూడా ఉన్నాయి. ప్రస్తుతం పశ్చిమ రైల్వేలో గంటకు 130 కి.మీ. వేగం లోపు నడిచే రైళ్లు కొన్ని ఉన్నాయి. మొదటి దశలో శతాబ్ధి, దురంతో, రాజధాని ఎక్స్ప్రెస్ రైళ్లను గంటకు 160 కి.మీ. నడిపేందుకు ప్రయత్నాలు చేయనున్నారు. ఆ తర్వాత విడతల వారీగా మిగతా రైళ్లను కూడా నడిపే ప్రయత్నం చేస్తామని చంద్రాయన్ అన్నారు. భారత దేశంలో మొట్టమొదటి బుల్లెట్ ట్రైన్ ముంబై-అహ్మదాబాద్ నగరాల మధ్య నడిపేందుకు ఇదివరకే సన్నహాలు ప్రారంభించిన విషయం తెలిసిందే. అందుకు జపాన్ కంపెనీ ఈ మార్గానికి సంబంధించిన తుది నివేదిక 2015లో సమర్పించనుంది.