breaking news
gauramma
-
కూతురి మృతదేహంతో మోపెడ్పై 30 కి.మీ
తుమకూరు: తీవ్రమైన జ్వరంతో ఓ యువతి మరణించగా మృతదేహాన్ని తరలించేందుకు డబ్బుల్లేక 30 కి.మీ మోపెడ్పై తీసుకెళ్లిన ఘటన కర్ణాటకలో జరిగింది. తుమకూరు జిల్లా కోడిగేనహళ్ళి వీరాపుర గ్రామానికి చెందిన రైతు కూలీలు తిమ్మప్ప, గౌరమ్మ దంపతుల కుమార్తె నాగరత్న (25) పుట్టుకతోనే మూగచెవిటి. మూడురోజుల నుంచి ఆమె తీవ్రమైన జ్వరంతో బాధపడుతూ ఆదివారం ఓ ఆర్ఎంపీ వైద్యుడి ఆసుపత్రి వద్ద మరణించింది. 108 అంబులెన్సు అందుబాటులో లేకపోగా మృతదేహాన్ని ఆటోలో తరలించేందుకు వారి వద్ద ఉన్న డబ్బులు సరిపోలేదు. దీంతో 30 కి.మీ.ల దూరంలోని ఇంటికి మృతదేహాన్ని మోపెడ్పై తీసుకెళ్లినట్లు నాగరత్న తండ్రి తిమ్మప్ప తెలిపాడు. -
మహిళ ఏఎస్ఐపై కానిస్టేబుల్ దాడి
మకూరు : మహిళ ఏఎస్ఐపై కానిస్టేబుల్ దాడి చేసి గాయపరచిన ఘటణ తుమకూరు జిల్లా, కొరటిగెరె పొలిసుస్టేషన్లో గురువారం రాత్రి చోటు చేసుకుంది. గురువారం రాత్రి పోలీస్స్టేషన్ పరిధిలో ఎవరు ఎక్కడ డ్యూటీ చేయాలన్న విషయంలో ఏఎస్ఐ మంగళ గౌరమ్మ కానిస్టేబుళ్లకు నిర్దేశం చేసింది. అయితే ‘మేము మాత్రమే రాత్రి డ్యుటీ చేయాలా, మీరు కూడా వచ్చి రాత్రి డ్యూటీ చేయండి’ అంటూ కానిస్టేబుల్ ఎస్. జబీవుల్లా ఆగ్రహం వ్యక్తం చేశాడు. ‘నాకు పని చెప్పడానికి నీవు ఎవరు? ఎదైన ఉంటె ఉన్నతాధికారులకు చెప్పుకో, ఏమి చేయాలో వారు చెబుతారు, మొదట నీకు చెప్పిన పని చేయి’ అని ఏఎస్ఐ సూచించింది. దీంతో ఆగ్రహానికి గురైన జబీవుల్లా దుర్భాషలాడుతూ మంగళగౌరిపై దాడి చేశాడు. ఘటనలో ఏఎస్ఐ చేతికి గాయమై రక్తం రావడంతో సిబ్బంది హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. కొద్ది సేపటికి జబిఉల్లా తనకు ఛాతిలో నొప్పి వస్తోందని చెప్పడంతో అతన్ని మరో ఆస్పత్రిలో చేర్పించారు. అనంతరం రాత్రికి రాత్ర ఉడాయించాడు. అనంతరం దాడి ఘటనపై ఏఎస్ఐ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసింది. సీఐ మునిరాజు పోలీస్స్టేషన్కు వచ్చి వివరాలు సేకరించారు. జబిఉల్లాపై చర్యలు తీసుకుంటామ ఏఎస్ఐకు హామీ ఇచ్చారు. ఇదిలా ఉండగా ఏఎస్ఐపైకి దాడికి పాల్పడిన కానిస్టేబుల్పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ప్రజా సంఘాలనాయకులు పోలీస్స్టేషన్ వద్దకు చేరుకొని ధర్నా చేశారు. -
అభాగ్యురాలికి చేయూత
ఆదర్శంగా నిలిచిన యువజన సంఘం అంధురాలికి రూ.40వేలతో ఇంటి నిర్మాణం మంగపేట : నిరుపేదలకు సాయం అందించిన వారు జీవితాంతం గుర్తుం టారని పెద్దలు చెప్పిన మాటలను ఈ యువకులు అక్షరాల పాటించారు. చదువే కాదు.. సమాజాభివృద్ధి కూడా తమకు ముఖ్యమని భావించారు. ప్రభుత్వ ఆసరా లేక అవస్థలు పడుతున్న ఓ అంధురాలికిఇల్లు కట్టించి పలువురికి ఆదర్శంగా నిలిచారు. వివరాల్లోకి వెళితే.. మంగపేట మండల కేంద్రంలోని పొదుమూరుకు చెందిన ఎర్రావుల గౌరమ్మ భర్త సమ్మయ్య 15 ఏళ్ల క్రితం మృతిచెందాడు. పదేళ్ల క్రితం ఆకస్మికంగా గౌరమ్మ కంటిచూపు కూడా పోయింది. కూతురుకు వివాహం చేయగా.. ఆమెను భర్త వదిలేసి వెళ్లాడు. దీంతో కూతరు గౌరమ్మ వ ద్దనే ఉంటోంది. వ్యవసాయ కూలీ పనులకు వెళ్తూ తల్లిని పోషిస్తోంది. ఈ క్రమంలో సొంత ఇల్లు లేక అద్దె గుడిసెలో తలదాచుకుంటున్న తల్లీకూతుళ్ల ఇబ్బందులను గ్రామంలోని చర్చి పాస్టర్ శ్రీనివాస్ గమనించారు. ఈ విషయూన్ని ఆయన స్థానిక జ్వాల యువజన సంఘం అధ్యక్షుడు కోడెల నరేష్కు విషయాన్ని వివరించారు. గౌరమ్మ కుటుంబ దీనస్థితిపై స్పందించిన నరేష్ సంఘం సభ్యులతో చర్చించి ఆమెకు సాయం అందించాలని నిర్ణయించుకున్నాడు. ఈ క్రమంలో మూడు నెలల నుంచి సంఘం సభ్యులు వివిధ గ్రామాల్లో పర్యటించి రూ.40 వేల విరాళాలు సేకరించి పొదుమూరులోని ఆమె సొంత స్థలంలో కొత్త ఇల్లు కట్టించారు. ఈ మేరకు నూతన ఇల్లును యూత్ అధ్యక్షుడు నరేష్.. పాస్టర్ శ్రీనివాస్ సమక్షంలో గురువారం గౌరమ్మకు అప్పగించారు. ఈ సందర్భంగా నరేష్ మాట్లాడుతూ అంధత్వంతో బాధపడుతున్న గౌరమ్మకు రేషన్ కార్డు లేదని చెప్పారు. ప్రజాప్రతినిధులు స్పందించి ఆమెకు న్యాయం చేయాలని కోరారు. కార్యక్రమంలో సంఘం సభ్యులు అజయ్, చరణ్, చందు, ఇంతియాజ్, వినయ్, శ్రీను తదితరులు పాల్గొన్నారు. -
చికెన్ చేయలేదని భార్య హత్య
శివమొగ్గ : భోజనానికి చికెన్ వండలేదంటూ కట్టుకున్న భార్యను హతమార్చిన వైనం శికారిపుర తాలూకాలో ఆదివారం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే... మత్తికోటె గ్రామంలో నివసిస్తున్న మునియబోవి, గౌరమ్మ(45) దంపతులు. హాసన్ జిల్లాలోని కాళేహళ్లికి చెందిన వీరు కొన్ని నెలల క్రితం మత్తికోటె చేరుకుని అల్లం సాగు చేస్తున్నారు. పొలం వద్దే రేకుల షెడ్ వేసుకుని జీవిస్తున్నారు. ఆదివారం సాయంత్రం మునియబోవి మద్యం తీసుకుని ఇంటికి చేరుకున్నాడు. అనంతరం దంపతులిద్దరూ కలిసి మద్యం తాగారు. అనంతరం భోజనానికి కూర్చొన్నారు. ఆ సమయంలో చికెన్ ఎందుకు వండలేదంటూ గౌరమ్మను మునియబోవి నిలదీశాడు. మాటామాట పెరిగి పక్కనే ఉన్న దుడ్డుకర్రతో భార్య తలపై బలంగా కొట్టాడు. దీంతో ఆమె అక్కడికక్కడే మరణించింది. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడకు చేరుకుని పరిశీలించి నిందితుడిని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు. -
బస్సులో మహిళ ప్రసవం
బళ్లారి టౌన్, న్యూస్లైన్ : ఆర్టీసీ బస్సులో సోమవారం మధ్యాహ్నం గౌరమ్మ అనే మహిళ ఓ మగ బిడ్డకు జన్మనిచ్చింది. తాలూకాలోని హరగినడోణి గ్రామానికి చెందిన యన్నప్ప, బెంకమ్మ దంపతుల కుమార్తె గౌరమ్మకు పురిటినొప్పులు రావడంతో ఆస్పత్రిలో చేరేందుకు సోమవారం తమ గ్రామం నుంచి బళ్లారికి ఆర్టీసీ బస్సులో బయలుదేరారు. వారు ప్రయాణిస్తున్న బస్సు నగర శివార్లలోని బెళగల్లు క్రాస్ వద్దకు చేరుకునేటప్పటికి ఆమెకు పురిటి నొప్పులు తీవ్రమై విలవిలలాడుతుండటంతో బస్సును ఆపి ప్రయాణికులందరినీ దింపేశారు. అదే ప్రాంతంలో ఉన్న ఓ మంత్రసాని సహాయంతో ఆమె బస్సులోనే పండంటి మగబిడ్డను ప్రసవించింది. వెంటనే 108కి ఫోన్ చేయడంతో అంబులెన్స్ సహాయంతో తల్లీబిడ్డలను విమ్స్ ఆస్పత్రికి తరలించారు. బిడ్డ 2.5 కిలోల బరువు ఉన్నాడని, తల్లీబిడ్డ ఆరోగ్యంగా ఉన్నట్లు విమ్స్ వైద్యులు తెలిపారు. -
చిగురంత ఆశ.. జగమంత వెలుగు
(బి.ఎస్.రామచంద్రరావు) బీద రైతు బతుకులో జడివాన నిప్పులు కురిపించింది. పొలాలపై విరుచుకు పడ్డ వరద అన్నదాత నోట మట్టికొట్టింది. చేను నీటిపాలై కర్షకుడి జీవితం విషాదానికి ప్రతిరూపమైంది. ఈ చిమ్మచీకట్లు కమ్ముకున్న వేళ వెలుగుల పండగ దీపావళి వచ్చింది.. నిరాశలో చిక్కిన బతుకులకు ఇప్పుడు చిగురంత ఆశే వెలుగిస్తుందన్న విశ్వాసంతో ప్రతి రైతూ జీవితాన్ని స్పృశిస్తూ రాసిన కథ ఇది.. కష్టజీవుల వ్యథకు అద్దం పట్టే గాథ ఇది.. గాలివాన.. ‘ఓలమ్మ.. ఏటీ వోన.. ఏటీ గాలి’.. వందోసారి అనుకుంది గౌరమ్మ ఆరిపోతున్న దీపానికి అరచెయ్యి అడ్డుపెడుతూ.. అప్పటికి నాలుగు రోజులుగా భోరున కురుస్తున్నాయి వర్షాలు. భూమ్మీద పగబట్టినట్టు కమ్ముకుంటున్నాయి కారుమేఘాలు. ఉండీ ఉం డీ విరుచుకు పడుతున్నా యి ఈదురుగాలులు. గాలి వేసినప్పుడల్లా తాటాకు పాక గజగజ వణుకుతోంది. చూరు మీంచి నీరు బొట్లుబొట్లుగా ఇంటి మధ్యలోకి కారి మట్టి నేలలోకి ఇంకుతోంది. ‘పెనక మీద ముచ్చి గుడ్డ కప్పరోరయ్యా అని నెత్తీనోరూ కొట్టుకు సెప్పేను. మొగోడు ఇనిపించుకోకుండా ఇద్దిలాడాడు.. ఇప్పుడు సూరు కారిపోతన్నాది. గిన్నిలడ్డు ఎట్టలేక సత్తన్నాను.’ ధుమధుమలాడుతూ నీటి ధార కింద గిన్నె ఉంచింది గౌరమ్మ. ఆమె దృష్టి మరల్చడానికన్నట్టు పెరట్లో ఆవు అంబా అని అరిచింది. ‘వస్తున్నానొస్తున్నా’ అని గౌరమ్మ కుడితి బాల్చీ తీసుకెళ్లి పెరట్లో ఆవు ముందించింది. ‘గాలోనలో ఈనేస్తాదో ఏటో.. గోవు మాలచ్చిమి నిండు సూలుతో ఉంది.. సాల సిన్నది.. కారిపోద్దో ఏటో’ దిగులుగా అనుకుంది. దృష్టి మొగుడి మీదకు పోయింది.. ‘కాల్వ గట్టు తెగిందట..పొట్ట మీదుంది వొరి.. పొలం ముంచీసింది.. ముష్టోన’ శపించింది. ‘ఏకువనే ఎల్లిపోనాడు.. సేల్లోకి నీరొచ్చిందట.. కాల్వ గట్టు కప్పనానికి తంటాలొడుతున్నారట.. ఈ పాలి పంటేటవుద్దో’ గుబులుపడింది. ‘దీపావలి పండగొస్తంది. ఆ సందడే లేదు.. రైతులంతా సచ్చి ఉన్నారు. ‘ఇంకేటి పండగ’.. నిట్టూర్చింది.. గౌరమ్మ ఇంకా ఇంకా ఇంట్లోకి అడుగు పెట్టిందో లేదో... అమ్మా.. అంటూ సుడిగాలిలా పరుగులు తీసుకుంటూ వచ్చి కాళ్లకు చుట్టేసుకుంది తొమ్మిదేళ్ల మాలక్ష్మి.. తల మీంచి నీరు ధారాపాతంగా కారిపోతోంది. ‘సెస్.. ఒదులే పాడు మొకమా.. సీరంతా తడిపీసినావు.. అంత వోనలో తడుసుకొచ్చీసినావు’ అని కూతురి మీద గౌరమ్మ గయ్ మంది. ఆమె కోపాన్ని పట్టించుకోకుండా ‘బడంతా నీరొచ్చీసింది.. వోన తగ్గీదాకా స్కూలుకి సెలవిచ్చీసినారు’ అంది మాలక్ష్మి సంబరంగా.. ‘చాల్లే సంబరం.. తల తుడుసుకో.. ఊష్టమొస్తాది’ గదమాయించింది గౌరమ్మ. వాన జోరు పెరుగుతోందే తప్ప తగ్గడం లేదు. గాలీ అలాగే ఉంది. రాజయ్య కోసం గౌరమ్మ వీధిలోకి వచ్చిపోతూనే ఉంది. ఎప్పటికో సాయంత్రానికి నిలువునా నీళ్లోడుతూ వచ్చిన మొగుడు ఉలుకూ పలుకూ లేకుండా అలానే గడపలో నులకమంచం మీద కూలబడేసరికి పలకరించే ధైర్యం కూడా లేకపోయిందామెకు. ఆమె ఏమీ అనకుండానే ‘ఈ ఏడూ పంట మట్టి కల్సిపోయినట్టే’ లోగొంతుకలో అన్నాడు రాజయ్య. ఆ చీకట్లో అతన్ని చూస్తే దిగులు గడ్డ కట్టినట్టు ఉన్నాడు. దుఃఖాన్ని గొంతులోనే ఒడిసిపట్టి ‘ఏటి శేత్తాం.. ఏటికేడూ ఇలా బతుకు కాలిపోతంది.. దవిర్యం తెచ్చుకో’ అని తొట్రుపడుతున్న గొంతుకతో అంది గౌరమ్మ. ‘ఇంకేటి దవిర్యం.. పొలమంతా నీరు పోటెత్తీసినాది.. కాల్వ గట్టు కప్పినాం.. కానీ ఆకాసాన్ని, ఆపేత్తామా ఏటి.. వొరి ఏపాటి సేతికొత్తాదో అర్దం కాకుండా ఉంది’ అన్నాడు రాజయ్య. అర్ధరాతి ‘అంబా’ అన్న అరుపుతో గౌరమ్మ దిగ్గున లేచింది. ‘మావా.. లెగులెగు ఆవు ఈనినట్టుంది’ గబగబా లేపింది. ఇద్దరూ ఒక్క ఉదుటున పెరట్లోకి వెళ్లారు.. ఆవు అవస్థ పడుతోంది. గిరగిరా తిరుగుతోంది. వాన, గాలి పెద్దగా లేకపోవడంతో కాస్త పొడిగా ఉన్నచోట ఆవును కట్టారు. మొత్తానికి ఆ పనంతా అయ్యేసరికి వెలుగొచ్చేసింది. ఆవు ఈనినందుకు సంతోషంగానే ఉన్నా ‘ ఈ వానలో దాని పేనానికీ మాకూ బోల్డు కట్టమొచ్చి పడింది’ అనుకుంది గౌరమ్మ. ఓసారి నడుం వాల్చబోతూ ఉంటే నులకమంచం మీద పడుకున్న కూతురు మూలిగినట్టునిపించి అనుమానంగా వెళ్లి ఒంటిమీద చెయ్యేసింది. ‘బగవంతుడా.. మావా సూడు.. దీనొల్లు కాలిపోతంది’ అరిచినట్టే పిలిచింది. ‘ఏటయిందే.. రాత్తిరి బాగానే ఉంది కదేటే’ గాభరాగా అన్నాడు రాజయ్య. ‘పగలంతా సుబ్బరంగా తడిసింది. ఏటీ బాదలు..పిల్ల లెగ్గానే ఆస్పత్రికి తీసుకెల్లు.. ఆలీసం సెయ్యకు’ వొణుకుతున్న గొంతుకతో చెప్పింది. త గ్గినట్టే తగ్గి విరుచుకు పడుతోంది వర్షం. ‘ ఈపాలికి పొలానికెల్లక్కర్లేదులే.. నిన్నటికే సేను నీట్లో తేల్తంది. బగమంతుడి దయ.. సేతిలో దేనికీ రూపాయి డబ్బు నేదు.. వొర్సానికి ఇంటి గోడ సుబ్బరంగా నానీసింది. పడిపోద్దో ఏటో.. వోనెలిస్తే తాపీమేస్త్రీని పిలిసి సిమెంటు పామించడమో.. ఏదో సెయ్యాల .. ఆవుకి తవుడో, సిట్టో కొనాల.. పిల్లకి మందులు కొనాలనీ, ఇండీషన్లు ఇప్పించాలని డాకుటేరు సెప్పాడు.. ఎవుర్ని అడిగితే ఎవురిత్తారు.. అందరి బాదా ఒకేనాగ ఉంది. ఏటీ తోసడం నేదు’ నిట్టూర్చాడు రాజయ్య. ‘బాగున్నోల్లు బాగుంటున్నారు.. మనలాటోల్లనే వోనలు, వొరదలు .. సిక్కులు .. సీకాకులు.. దేముడేటి సేత్తన్నాడో’ ఉసూరంది గౌరమ్మ. దీపావళి.. ముసురు తగ్గింది.. వాన తెరిపిచ్చింది.. చెయ్యాల్సిందంతా చేసి, ఇక చాలన్నట్టు ఆకాశంలో మబ్బులు తేలిపోతున్నాయి. వరదల తర్వాత పరామర్శకు వచ్చే పెద్దల్లా సూర్యుడు అలనల్లన తొంగిచూస్తున్నాడు. పొలానికెళ్లిన రాజయ్య కోసం గౌరమ్మ ఎదురుచూస్తూనే ఉంది. మధ్యాహ్నమయింది.. సాయంత్రం కావస్తోంది.. ఆమెలో దిగులు పెరిగింది. సందె చీకట్లు కాసేపట్లో కమ్ముకుంటాయనగా, దూరంగా కాళ్లీడ్చుకుంటూ వస్తున్న పెనిమిటిని చూసి కోపం, కన్నీరు ఒకేసారి ఉప్పొంగాయి. ‘పగలనగా ఎల్లావు.. ఎటయ్యావో తెల్దు.. ఇక్కడ సచ్చి సచ్చి ఉన్నాను. ఎక్కడికెల్లిపోయావు.. కబురయినా ఎట్టావా.. మనిసివేనా నువ్వు’ దులిపేసింది. రాజయ్య మాట్లాడలేదు. ‘ముంగినాగున్నావు.. నోరు పడిపోయిందేటి’ ‘నోర్ముయ్యే.. ఏటి సావమంటావు.. నాకు మాత్రం తెల్దా ఏటి?.. పొద్దెక్కిన కాడి నుంచి తెలిసినోల్లందరి దగ్గిరికి తిరుగుతున్నాను .. సేతిలో ఏగానీ లేదు.. పండగపూట .. నాను బతిమాలనోడు లేడు.. రెండు ఏల రూపాయలైనా కావాలి.. కూలోడినెట్టాలి.. మందులు కొనాలి.. గోడ బాగు సేయించాలి.. పిల్లకి మందులు.. ఆవుకు తిండి దేన్ని మానీమంటావు? నేదునేదన్నోడే కానీ ఒక్కడయినా అప్పిచ్చినోడు నేడు.. ఏటి సావమంటావు? పేనం సోలొచ్చి ఇంటికొత్తే సంపేత్తన్నావు’ అరిచేశాడు రాజయ్య. మౌనంగా ఉండిపోయింది గౌరమ్మ. ‘ఏటి మాటాడవేటి.. ఏటి సెయ్యాల?’ వెటకారంగా అన్నాడు రాజయ్య. గౌరమ్మ మౌనంగానే వంటగదిలోకి వెళ్లింది. నీళ్లు నిండుకున్న ఆమె కళ్లకు ఫొటోలో సీతారాములు మసకమసగ్గా కనిపించారు. ఓ నిర్ణయానికొచ్చిన ఆమె ఫొటో ముందు నిలబడింది. దండం పెట్టి.. ‘తల్లీ,తండ్రీ... మరో దారి లేకపోయింది.. తప్పు కాయండి’ అని మెళ్లో శతమానం తీసింది. పుట్టింటి వాళ్లు పెట్టిన రెండు తులాల గొలుసు తీస్తున్నప్పుడు ఆమె చేయి వణికింది. నులక మంచం మీద కూర్చున్న రాజయ్య చేతిలో దాన్ని ఉంచింది మౌనంగా.. ఏదో ఆలోచిస్తున్న రాజయ్య చీకట్లో చేతిలో గొలుసు చూసి నిర్ఘాంతపోయాడు. ‘ఏటే ఇది.. పండగేల.. ఏటయింది నీకు.. నేను లేననుకున్నావా?’ వణుకుతున్న గొంతుకతో అడిగాడు. ‘మావా మరేటనక.. నీకూ, నాకూ మరో దారి లేదు.. ఎల్లి తనకా ఎట్టు.. రోజులు బాగుంటే ఇడిపించుకోకపోం’ స్థిరంగా అంది గౌరమ్మ. స్పృహలోకొచ్చిన దాన్లా ‘సాయంత్రం పిల్ల ఏటో కొనుక్కుంటానని వయిదు రూపాయిలొట్టుకెల్లింది. సీకటొడిపోతంది.. ఎక్కడికెల్లిందో తెల్దు’ అని ఆందోళనగా అంది.’ దానికి బాగునేదు కదా.. బయటకెందుకెల్లనిచ్చినావు’ కసిరాడు రాజయ్య. గబగబా ఇద్దరూ గ డపలోకొచ్చారు.. ఆ మూల.. చీకట్లో.. మాలక్ష్మి.. ఒద్దిగ్గా కూర్చుని.. సీసాతో తాను తెచ్చుకున్న నూనె నాలుగు ప్రమిదల్లో పోసి.. చిరుదీపాలు వెలిగిస్తోంది. గాలి వీస్తున్నా నిశ్చలంగా వెలుగుతున్న దీపాలు కమ్ముతున్న చీకట్లను తరిమేస్తున్నాయి. ఆ వెలుగులో పసిదాని మొహంలో నవ్వు ధగధగలాడుతోంది. కళ్లారా కూతుర్ని చూసి భార్య వైపు చూపు తిప్పిన రాజయ్యకు గౌరమ్మ ముక్కు నత్తు పక్కనే అశ్రు బిందువు మంచి ముత్యంలా కనిపించి అబ్బురమనిపించింది.