breaking news
GAJWEL Area Hospital
-
'అధికారుల వేధింపులే నా భర్త మృతికి కారణం'
-
ఎస్ఐ రామకృష్ణారెడ్డి సూసైడ్!
-
ఎస్ఐ రామకృష్ణారెడ్డి ఆత్మహత్య!
మెదక్: మెదక్ జిల్లా కుకునూరుపల్లిలో ఎస్ఐ రామకృష్ణారెడ్డి (45) ఆత్మహత్య కలకలం రేపింది. పోలీస్ క్వార్టర్స్లో తెల్లవారుజామున 3.30 గంటల ప్రాంతంలో తన సర్వీసు రివాల్వర్తో కాల్చుకుని ఆయన బలవన్మరణానికి పాల్పడ్డారు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఎస్ఐ ఆత్మహత్య చేసుకున్నట్టు తెలిసింది. సంఘటనా స్థలంలో సూసైడ్ నోట్ లభ్యమైంది. ఉన్నతాధికారుల వేధింపులు తాళలేక తాను ఆత్మహత్య చేసుకుంటున్నట్టు ఎస్ఐ సూసైడ్ నోట్లో పేర్కొన్నారు. తన భార్యను రెండు రోజుల క్రితం ఎస్ఐ పుట్టింటికి పంపారు. చనిపోయే ముందు ఇద్దరు కానిస్టేబుళ్లకు ఆయన ఫోన్ చేశారు. జాగ్రత్త నేను వెళ్లిపోతున్నా.. బాయ్ అంటూ రామకృష్ణారెడ్డి చెప్పారు. దాంతో కానిస్టేబుల్స్ ఇద్దరూ ఈ విషయాన్ని గజ్వేల్ ఎస్ఐ కమలాకర్కి ఫోన్ చేసి చెప్పారు. ఎస్ఐ రామకృష్ణారెడ్డితో కమలాకర్ ఫోన్లో మాట్లాడారు. కమలాకర్ కుకునూరుపల్లి చేరుకోగానే తన సర్వీస్ రివాల్వర్తో కాల్చుకుని ఎస్ఐ ఆత్మహత్య చేసుకున్నారు. తాను ఉద్యోగం మానేస్తానని నిన్న (మంగళవారం) రాత్రి భార్యకు రామకృష్ణారెడ్డి ఫోన్ చేసినట్టు కుటుంబ సభ్యులు తెలిపారు. ఎస్ఐ రామకృష్ణారెడ్డి ఆత్మహత్య ఘటనతో బక్కమంత్రగూడెంలో విషాద ఛాయలు అలముకున్నాయి. రామకృష్ణారెడ్డి పుష్కరాలకు వస్తానని చెప్పాడని కానీ ఇలా ఆత్మహత్య చేసుకోవడాన్ని తాము జీర్ణించుకోలేకపోతున్నామని బంధువులు, స్నేహితులు వాపోతున్నారు. రామకృష్ణారెడ్డి ఆత్మహత్య చేసుకునేంత పిరికివారు కాదన్నారు. ఉన్నతాధికారుల వేధింపుల వల్లే ఎస్ఐ ఆత్మహత్యకు పాల్పడ్డాడనీ, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఆందోళనకు దిగారు. ఇదిలా ఉండగా, ఉన్నతాధికారుల వేధింపులే తన భర్త మృతికి కారణమని ఆయన భార్య ఆరోపిస్తున్నారు. ఎస్ఐ రామకృష్ణారెడ్డిది నల్లగొండ జిల్లా, మఠంపల్లి మండలం బక్కమంత్రగూడెం స్వస్థలం, ఆయనకు భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. ఎస్ఐ మృతదేహాన్ని గజ్వేల్ ఏరియా ఆస్పత్రికి తరలించినట్టు సమాచారం. -
దయలేని అమ్మలు
సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: అమ్మా నన్ను అమ్మకే.. ఓ యమ్మా... నాన్నా నీకు దండ మే... నవ మాసాలు నన్ను మోశావమ్మా.. పురిటి నొప్పుల బాధ పడ్డావమ్మా.. పేగు తెంచుక నన్ను గన్నావమ్మా.. పేరు పెట్టకుండ వేరు చేయకమ్మా.. నిన్ను విడిచి ఉండలేనమ్మా...ఓయమ్మా..! నన్ను దూరంజేయబోకమ్మా... అని మెతుకుసీమలో బతుకమ్మ ఆడుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. ప్రకృతిని.. ఆడపిల్లలను ప్రేమించడమే బతుకమ్మ... పర్యావరణాన్ని రక్షించుకోవడం.. అమ్మను, ఆడబిడ్డను బతికించుకోవడమే ‘బతుకమ్మ’కు అర్థం. పరమార్థం. తెలంగాణ సాకారమై బంగారు బతుకమ్మ నిండు పండగ శోభ సంతరించుకున్న వేళ ఇంకా ముళ్ల పొదల్లో పుత్తడి బొమ్మల మృత్యు కేకలు వినిపిస్తున్నాయి. ఆడపిల్ల పుడితే తప్పు, నట్టిట్లో నడిస్తే ముప్పు.. పెరిగితే అప్పు అనే ధోరణి పల్లెను ఇంకా వదల్లేదు. మెతుకు సీమలో పేదరికం రక్తబంధాన్ని కూడా హేళన చేస్తోంది. అమ్మ వెచ్చని పొత్తిళ్లలో నిద్రపోవాల్సిన పసికందులు ముళ్ల పొదల్లో.. మురికి కాల్వల్లో పడి కన్ను మూస్తున్నారు. జిల్లాలో నెల రోజులుగా వరుసగా ఆడ శిశువును విసిరేసిన సంఘటనలు అందరినీ కలచివేస్తున్నాయి. కేవలం నెల రోజుల్లోనే 10 మంది శిశువులను అమ్మలు నిర్దయగా వదిలేసుకున్నారు. గత చేదు సంఘటనలు మరవకముందే బుధవారం గజ్వేల్ ఏరియా ఆస్పత్రిలో మరో సంఘటన చోటుచేసుకుంది. 15 రోజుల ఆడ శిశువులను గజ్వేల్ ఏరియా ఆస్పత్రిలో ఖాళీగా ఉన్న వార్డులో ఎవ్వరూ లేని సమయంలో గుర్తుతెలియని వ్యక్తులు వదిలేసి వెళ్లారు. పాప గుక్కపెట్టి ఏడుస్తుండటంతో ఆస్పత్రి సిబ్బంది గుర్తించి విషయాన్ని పోలీసులు, శిశు సంక్షేమశాఖ అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. స్థానిక ఐసీడీఎస్ అధికారి విమల జిల్లా కేంద్రంలోని శిశుగృహ అధికారులకు సమాచారం చేరవేశారు. దీంతో శిశు గృహ అధికారులు ఏరియా ఆస్పత్రికి చేరుకుని చిన్నారిని సురక్షితంగా సంగారెడ్డిలోని శిశు గృహానికి చేర్చారు. ఇలాంటి సంఘటనే మంగళవారం జిన్నారం మండలం వావిలాల గ్రామంలోనూ చోటుచేసుకుంది. వావిలాల గ్రామానికి చెందిన ఇద్దరు మహిళలు బతుకమ్మ తయారు చేసేందుకు తంగేడు పూల కోసం అటవీప్రాంతంలోకి వె ళ్లగా అక్కడ పొదల మధ్య పసికందు కనిపించటంతో మాన్పడిపోయారు. ఎవరో గుర్తుతెలియని వ్యక్తులు నెలరోజుల ఆడ శిశువును పొదలమాటున వదిలేసి వెళ్లిపోయినట్లు గుర్తించారు. దీంతో ఇద్దరు మహిళలు విషయాన్ని గ్రామపెద్దలకు తెలిపారు. చివరకు శిశు సంక్షేమశాఖ అధికారులు ఆడశిశువును సంగారెడ్డిలోని శిశు గృహానికి చేర్చారు. గత నెల 9వ తేదీన మెదక్-చేగుంట రహదారిపై కొర్విపల్లి శివారులో అప్పుడే పుట్టిన మగశిశువును సైతం న్యూస్పేపర్లో చుట్టి మొక్కజొన్న చేనులో వదిలేయగా, స్థానికుల చొరవతో అధికారులు శిశువును సంగారెడ్డిలోని శిశు గృహానికి తరలించారు. ఇక ఐదు నెలల క్రితం వెల్దుర్తి మండలం మాసాయిపేట గ్రామంలోని విఠలేశ్వర ఆలయంలో అప్పుడే పుట్టిన ఆడశిశువును గుర్తుతెలియని వ్యక్తులు వదిలేసి పోయారు. ఇలా జిల్లాలో ఆడ శిశువులను అటవీ ప్రాంతాల్లో, నిర్జన ప్రదేశాల్లో, ఆస్పత్రుల్లో వదిలేసి వెళ్తున్న సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి. అభం శుభం ఎరుగని, లోకం పోకడ తెలియని పసికందులను వదిలించుకుంటూ మాతృత్వానికి మాయని మచ్చలను మిగులుస్తున్నారు. ఏదిఏమైనా ఆడ శిశువులను వదిలేసి వెళ్లటం సమాజానికి పట్టిన రోగమని సామాజిక కార్యకర్త యాదగిరి ఆవేదన వ్యక్తం చేశారు. ఆడ కూతుళ్లను విక్రయించటం, పొత్తిళ్లలోని ఆడశిశువులను వదిలి వేయటం సమాజంపై దుష్ర్ఫభావం చూపుతుందన్నారు. ఆడ శిశులను వదిలివేసే నీచ సంస్కృతికి అడ్డుకట్ట వేసేందుకు ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని, ప్రజల్లో అవగాహన కల్పించాలని స్వచ్ఛంద సంస్థలు, సామాజిక కార్యకర్తలు కోరుతున్నారు.