breaking news
excise task force
-
హైదరాబాద్లో కల్లు కాంపౌండ్లపై ఆకస్మిక దాడులు
సాక్షి, హైదరాబాద్: నగరంలో కల్లు కాంపౌండ్లపై ఎక్సైజ్ టాస్క్ ఫోర్స్ పోలీసులు ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. మూడు బృందాలుగా ఏర్పడి వేర్వేరు ప్రాంతాల్లో దాడులు నిర్వహించారు. అనుమతి లేకుండా నడిపిస్తున్న కల్లు దుకాణాలపై ఎక్సైజ్ పోలీసులు నాజర్ పెట్టారు. కల్తీ కల్లు ఘటనలపై తెలంగాణ ఎక్సైజ్ పోలీసులు అప్రమత్తం అయ్యారు.శేరిలింగంపల్లి సిద్ధిక్ నగర్లో కల్లు కాంపౌండ్పై దాడులు చేసిన ఎక్సైజ్ పోలీసులు.. అనుమతి లేకుండా కల్లు కాంపౌండ్ నిర్వహిస్తున్నట్లు గుర్తించారు. కల్లు కాంపౌండ్ సీజ్ చేయడంతో పాటు దుకాణ యజమానిపై కేసు నమోదు చేశారు. మూసాపేట్, బాలానగర్, కైతలాపూర్ ప్రాంతాల్లో కల్లు కాంపౌండ్లలో తనిఖీలు నిర్వహించారు. తనిఖీలు నిర్వహించి కల్లు కాంపౌండ్లో ఉన్న పలు శాంపిల్స్ సేకరించారు. ముషీరాబాద్లో మూడు, కాచిగూడలో రెండు కల్లు డిపోలపై ఎక్సైజ్ తనిఖీలు చేపట్టారు.కల్లు కాంపౌండ్లలో సేకరించిన శాంపిల్స్ను ల్యాబ్కు పంపించిన ఎక్సైజ్ అధికారులు.. తనిఖీల సమయంలో కల్లు కాంపౌండ్ నిర్వాహకులకు హెచ్చరికలు జారీ చేశారు. డిపోల నుంచి వచ్చే కల్లును మాత్రమే స్టోరేజ్ చేసి విక్రయించాలన్నారు. కల్లులో ఎలాంటివి కలిపిన చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. అల్ప్రోజలం లాంటివి మత్తు కోసం కలిపితే నేరమన్న పోలీసులు.. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తే ఉపేక్షించేది లేదన్నారు. ఒక్కసారి ఇలాంటివి చేసి పట్టుపడితే పర్మినెంట్గా లైసెన్స్ రద్దు చేస్తామని ఎక్సైజ్ పోలీసులు వార్నింగ్ ఇచ్చారు. -
HYD: సినిమావాళ్లకు ఫారిన్ గంజాయి సరఫరా!
హైదరాబాద్, సాక్షి: నగరంలో విదేశీ గంజాయి(Foreign Ganja) కలకలం రేగింది. అమెరికా నుంచి గంజాయి స్మగ్లింగ్ చేసి మరీ అమ్మే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో ఇద్దరు ఐటీ ఎంప్లాయిస్ను పోలీసులు రెడ్హ్యాండెడ్గా పట్టుకున్నారు. సినీ పరిశ్రమకు చెందిన కొందరికి వీటిని సరఫరా చేశారనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.గచ్చిబౌలి(Gachibowli)లో ఆదివారం రాత్రి ఎక్సైజ్ టాస్క్ఫోర్స్ తనిఖీలు నిర్వహించారు. ప్రశాంతి హిల్స్ టింబర్ లేక్ వ్యాలీ వద్ద గంజాయితో ఇద్దరిని పోలీసులు గుర్తించారు. ఒకరిని అదుపులోకి తీసుకోగా.. మరొకరు పరారయ్యారు. పట్టుబడిన వ్యక్తి బెంగళూరులో ఓ ప్రముఖ కంపెనీలో పని చేస్తున్న శివరామ్గా గుర్తించారు. పరారైన వ్యక్తి పేరు అజయ్గా తెలుస్తోంది.నిందితుల నుంచి గంజాయితో పాటు బైక్, మొబైల్ ఫోన్ స్వాధీనం చేసుకున్నారు. మొత్తం 170గ్రా. ఫారిన్ గంజాయితో పాటు కేజీ లోకల్ గంజాయి ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. కాలిపోర్నియా నుంచి ఈ గంజాయి అక్రమ రవాణా ద్వారా వచ్చినట్లు పోలీసులు నిర్ధారించుకున్నారు. ఐటీ ఉద్యోగులతో పాటు సీన, రాజకీయ ప్రముఖులకు కూడా ఫారిన్ గంజాయి విక్రయించి ఉంటారనే పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ క్రమంలో పట్టుబడ్డ నిందితుడి నుంచి కీలక సమాచారం రాబట్టే ప్రయత్నాల్లో ఉన్నారు. -
గం‘జాయింట్’గా కొడదామా?
‘హాయ్ మామా.. బాగా గ్యాప్ వచ్చింది. జాయింట్ కొడదాం పద..’.. ఇద్దరు ఇంజనీరింగ్ విద్యార్థుల మాటలివి..‘ఏం స్ట్రెస్రా బాబూ ఇది. టార్గెట్లతో తలపగిలిపోతోంది. చలో బయటికి వెళ్లి కాస్త స్కోర్ చేసొద్దాం’.. ఇద్దరు సాఫ్ట్వేర్ ఇంజనీర్ల సంభాషణ ఇది.... వాళ్లు ఏదో టీ తాగడానికో, టిఫిన్ చేయడానికో వెళ్లడం లేదు. గంజాయి తాగేందుకు వెళదామని కోడ్ భాషలో చెప్పుకొంటున్నారు. ఇక్కడా, అక్కడా అని కాదు హైదరాబాద్ మహా నగరంలో చాలా చోట్ల ఈ గంజాయి కల్చర్ కనబడుతోంది. కొందరిలో ఇదో సోషల్ స్టేటస్గా మారింది. నగరంలో గంజాయి అమ్మకాలు విచ్చలవిడిగా సాగుతున్నాయి. వివిధ పోలీసు విభాగాల మధ్య కొరవడిన సమన్వయాన్ని గంజాయి విక్రేతలు ఆసరాగా తీసుకుని, మరింతగా రెచ్చిపోతున్నారన్న ఆరోపణలు వస్తున్నాయి.సాక్షి, హైదరాబాద్: గంజాయి మహమ్మారి రాష్ట్రంలో చాప కింద నీరులా విస్తరిస్తోంది. ఈ మత్తుకు బానిస అవుతున్న వారి జాబితా క్రమంగా పెరుగుతోంది. గతంలో కొన్నివర్గాలకే పరిమితమైన గంజాయి.. ఇప్పుడు స్కూళ్లు, కాలేజీల విద్యార్థుల నుంచి సాఫ్ట్వేర్ ఇంజనీర్ల దాకా పాకింది. పెద్ద పెద్ద ఆస్పత్రుల వైద్యులు సైతం గంజాయి మత్తుకు బానిస అవుతుండటం విస్మయానికి గురిచేస్తోంది. ఆరు నెలల క్రితం హైదరాబాద్ నగరంలోని ఓ ప్రముఖ ఆస్పత్రికి చెందిన కొందరు వైద్యులు గంజాయి వాడుతున్నట్టు తెలియడంతో పోలీసులు వారిని అదుపులోకి తీసుకుని తమదైన శైలిలో మందలించి వదిలేయడం గమనార్హం. వాస్తవానికి రాష్ట్ర ప్రభుత్వం కొన్ని నెలల క్రితం గంజాయి, ఇతర మత్తు పదార్థాలపై యుద్ధం ప్రకటించింది. మత్తు దందాలపై ఉక్కుపాదం మోపాలని పోలీస్, ఎక్సైజ్, టీజీ యాంటీ నార్కోటిక్స్ బ్యూరో అధికారులకు సీఎం రేవంత్రెడ్డి పలుమార్లు బహిరంగంగానే ఆదేశాలు జారీ చేశారు. కానీ వివిధ విభాగాల మధ్య తగిన సమన్వయం లేకపోవడం, కొందరు అధికారులు దీనిని సీరియస్గా తీసుకోకపోవడం, గంజాయి సరఫరా దారులు కొత్తకొత్త మార్గాలు అనుసరిస్తూ, వినియోగదారులనే విక్రేతలుగా మారుస్తుండటం వంటివి గంజాయి దందా యథేచ్ఛగా సాగిపోవడానికి దారితీస్తున్నాయనే అభిప్రాయాలు ఉన్నాయి. ప్రస్తుతం గ్రేటర్ హైదరాబాద్తోపాటు రాష్ట్రవ్యాప్తంగా గంజాయి వాడుతున్న వారి సంఖ్య 10లక్షల వరకు ఉందని అంచనా వేస్తున్నారు. దందాలోకి దిగుతున్న విద్యార్థులు ఇంజనీరింగ్ కాలేజీల్లో గంజాయి వాడకం క్రమంగా పెరుగుతోంది. తొలుత ఒకరిద్దరితో మొదలయ్యే ఈ వ్యసనం స్నేహితుల మధ్య విస్తరిస్తోంది. ఇంజనీరింగ్ విద్యార్థుల్లో కొందరు బెట్టింగ్లకు, జల్సాలకు అలవాటు పడి డబ్బుల కోసం గంజాయి విక్రేతలుగా మారుతున్నారు. అలాంటి వారిని కట్టడి చేయడం పోలీసులు, దర్యాప్తు ఏజెన్సీలకు ఒకింత తలనొప్పిగా మారింది. ఈజీ మనీకి గంజాయి మార్గం! చాలా మంది కష్టపడకుండా డబ్బులు వస్తుండటంతో (ఈజీ మనీ) గంజాయి అమ్మకాలకు దిగుతున్నారు. ఆంధ్రా–ఒడిశా సరిహద్దుల (ఏఓబీ)కు వెళితే ఏడెనిమిది వేల రూపాయలకే రెండు కిలోల గంజాయి దొరుకుతుంది. దాన్ని హైదరాబాద్ వరకు తెస్తే.. ఆ రెండు కిలోల ప్యాకెట్ రూ.15 వేలకు కొంటారు. అదే ఒక్కో కిలో గంజాయిని 10 గ్రాముల చొప్పున 100 ప్యాకెట్లు చేసి.. ఒక్కో ప్యాకెట్ను రూ.300 చొప్పున అమ్ముతారు. అంటే కిలోకు రూ.30 వేలు వస్తాయి. రెండు కిలోల గంజాయి ప్యాకెట్ను రూ.15 వేలు పెట్టి కొంటే.. దాన్ని విక్రయించడం ద్వారా..రూ.45 వేలు మిగిలించుకుంటారు. ఇలా ఈజీ మనీ కోసం కొందరు గంజాయి అమ్మకంలోకి దిగుతున్నారు. నియంత్రణపై హడావుడికే పరిమితం హైదరాబాద్లో గంజాయికి ప్రధానంగా ధూల్పేట్, నానక్రామ్గూడ, సీతాఫల్మండి, ఫతేనగర్ హబ్లుగా ఉండేవి. ఇప్పుడు చాలా ప్రాంతాలు అడ్డాలుగా మారాయి. అంగోరి భాయ్, గాంజా కిశోర్, సునీతభాయ్, ముఖేశ్సింగ్, దీపు, సట్టా కిశోర్, రౌడీ గోపాల్, రౌడీ విశాల్ వంటి 25 మంది వరకు గంజాయి విక్రేతలు ఉన్నారని నిఘా వర్గాలు చెబుతున్నాయి. వారు 30, 40 కిలోల చొప్పున గంజాయి తెప్పించి.. రిటైల్గా విక్రయించేవారికి సరఫరా చేస్తున్నారు. దీనిపై దర్యాప్తు సంస్థలకు సమాచారం అందుతున్నా పైపైన హడావుడికే పరిమితం అవుతున్నాయన్న విమర్శలు ఉన్నాయి. గంజాయి కట్టడిలో టీజీ నార్కోటిక్స్ బ్యూరో, స్థానిక పోలీసులు, ఎక్సైజ్ సిబ్బంది, డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డీఆర్ఐ) వంటి విభాగాల మధ్య సమన్వయ లోపం కూడా గంజాయి స్మగ్లర్లకు కలిసి వస్తోందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఏఓబీ టు నార్త్ ఇండియా.. వయా తెలంగాణ! ఏఓబీ (ఆంధ్రా– ఒడిశా బార్డర్), ఛత్తీస్గఢ్, వైజాగ్ తదితర ప్రాంతాల్లో పండించే గంజాయిని.. ఉత్తర భారతదేశంతోపాటు ఇతర రాష్ట్రాలకు తరలించేందుకు తెలంగాణ కారిడార్గా మారిందనే విమర్శలు ఉన్నాయి. స్మగ్లర్లు రైలు, రోడ్డు మార్గాల్లో పెద్ద మొత్తంలో గంజాయిని తరలిస్తున్నారు. ప్రైవేటు వాహనాల్లోనూ రవాణా చేస్తున్నారు. టీజీ నార్కోటిక్స్ బ్యూరో, ఎక్సైజ్, స్థానిక పోలీసులు, డీఆర్ఐ అధికారుల తనిఖీల్లో తరచూ గంజాయి పట్టుబడుతోంది. ఇలా పట్టుబడుతున్నది స్వల్పమేనని, అంతకు ఎన్నో రెట్లు తరలుతోందని సమాచారం. ఇక వరంగల్, ఖమ్మం, ఆదిలాబాద్, కరీంనగర్ తదితర జిల్లాల్లోనూ గంజాయి ఏజెంట్లు నెట్వర్క్ ఏర్పాటు చేసుకుంటున్నారని.. వారి ద్వారా స్థానికంగా గంజాయి అమ్మకాలు జరుపుతూనే ఇతర రాష్ట్రాలకు రవాణా చేస్తున్నారని తెలిసింది. డ్రగ్స్పై ఫోకస్ పెరగడంతో గంజాయి వైపు.. కొకైన్, ఎల్ఎస్డీ వంటి సింథటిక్ డ్రగ్స్ అమ్మకాలపై టీజీ నార్కోటిక్స్ బ్యూరో, పోలీస్, ఎక్సైజ్ ఫోకస్ పెరగడంతో.. చాలా మంది తక్కువ ధరకు, వెంటనే అందుబాటులో ఉండే గంజాయివైపు దృష్టి పెడుతున్నారని పోలీసు వర్గాలు చెప్తున్నాయి. ఎక్కువగా హైదరాబాద్ శివారు ప్రాంతాల్లోని లేబర్ కాలనీలు, రాజీవ్ గృహకల్ప, సైదాబాద్లోని సింగరేణి కాలనీ, ధూల్పేట్, జీడిమెట్ల, చింతల్, సూరారం కాలనీ, దుండిగల్ సహా పలు పారిశ్రామిక ప్రాంతాల్లో గంజాయి వాడకం విస్తృతంగా పెరిగింది. గోల్కొండ, లక్ష్మీనగర్, ఎల్బీనగర్లతోపాటు హాస్టళ్లు ఎక్కువగా ఉన్న అమీర్పేట్, ఎస్సార్నగర్, నాంపల్లి, సికింద్రాబాద్ రైల్వేస్టేషన్లు, ఎంజీబీఎస్, జేబీఎస్, నెక్లెస్రోడ్, ఇతర పార్కులు వంటి చోట్ల గంజాయి విక్రయాలు సాగుతున్నట్టు తెలిసింది. శిక్షల భయం లేకపోవడంతో.. గంజాయి కేసులలో నిందితులపై శిక్షలు సరిగా లేకపోవడంతో వారిలో భయం ఉండటం లేదన్న వాదనలు ఉన్నాయి. కిలోకుపైన గంజాయి పట్టుబడితేనే దాన్ని కమర్షియల్ క్వాంటిటీగా గుర్తిస్తారు. ఆ కేసులలోనే కఠిన శిక్షలుంటాయి. ఈ క్రమంలోనే గంజాయి సప్లయర్లు చిన్నచిన్న ప్యాకెట్లలో విడివిడిగా సరఫరా చేస్తున్నారు. వారు పట్టుబడినా బలమైన కేసులు ఉండటం లేదు. సరైన దర్యాప్తు లేని కారణంగా కూడా చాలా వరకు కేసులు వీగిపోతున్నాయన్న విమర్శలు ఉన్నాయి. పోలీసులకు చిక్కిన గంజాయి విక్రేతలు.. బెయిల్పై వచ్చాక మళ్లీ దందా మొదలుపెడుతున్నారు. ఇలా మళ్లీ మళ్లీ నేరం చేస్తున్నవారిపై పీడీ యాక్ట్ తరహాలో.. ‘ప్రివెన్షన్ ఆఫ్ ఇల్లిసిట్ ట్రాఫిక్ ఇన్ నార్కోటిక్ డ్రగ్ సైకోట్రోపిక్’ చట్టాన్ని నమోదు చేస్తున్నారు. దీనితో రెండేళ్ల వరకు బెయిల్ లభించే అవకాశం ఉండదు. అంతేగాక స్థానిక కోర్టుల అనుమతితో ‘స్మగ్లింగ్ అండ్ ఫారిన్ ఎక్స్ఛేంజ్ మానిప్యులేటర్స్ యాక్ట్ (సఫెమా)’ ప్రయోగించేందుకూ పోలీసులు ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నారు. ఈ యాక్ట్ ప్రకారం.. దోషులుగా తేలినవారి ఆస్తులను జప్తు చేయవచ్చు. గతేడాది నమోదైన నాలుగు కేసుల్లో నిందితులకు చెందిన రూ.8 కోట్లు విలువైన ఆస్తులను టీన్యాబ్ జప్తు చేసింది. గంజాయి చాక్లెట్లు... రాజస్థాన్, ఒడిశా నుంచి గాంజా, బంగ్ చాక్లెట్లు హైదరాబాద్ వస్తున్నాయి. కూరగాయలు, పండ్ల రవాణా వాహనాల్లో వాటిని తరలిస్తున్నారు. ఒక్కో చాక్లెట్ను రూ.40 నుంచి రూ.50కి అమ్ముతున్నారు. ఇటీవలే రంగారెడ్డి జిల్లా ఎక్సైజ్ టాస్క్ఫోర్స్ టీమ్ 5 కిలోల బరువు గల 2,000 గాంజా బంగ్ చాక్లెట్స్ స్వా«దీనం చేసుకుంది. నాలుగు కేసులు రిజిస్టర్ చేసింది. -
లిక్కర్ చాకోలేట్ కేంద్రాలపై ఎక్సైజ్ దాడులు
నిబంధనలకు విరుద్ధంగా లిక్కర్ చాకోలేట్లు తయారుచేస్తోన్న కేంద్రాలపై ఎక్సైజ్ టాస్క్ఫోర్స్ పోలీసులు దాడులు చేశారు. మల్లేపల్లిలోని ఓ చాకోలేట్ హబ్లో భారీగా మద్యం సీసాలు స్వాధీనం చేసుకున్నారు. నిబంధనలకు విరుద్ధంగా ఆరు లీటర్ల కంటే ఎక్కువ మద్యం నిల్వ ఉన్నట్లు ఎక్సైజ్ అధికారులు గుర్తించారు. నిబంధనలకు విరుద్ధంగా నడుపుతున్న కేంద్రాలకు నోటీసులు జారీ చేయనున్నట్లు అధికారులు తెలిపారు. -
కల్తీతో కడతేరుతున్న బతుకులు
ఫార్స్గా తయారైన ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ విభాగం సాక్షి, హైదరాబాద్ మద్యం వ్యాపారుల స్వార్ధం అమాయకుల ఉసురు తీస్తోంది. మొన్న అనంతపురం.. నేడు విజయవాడలో కల్తీ మద్యం తాగి దినసరి కూలీలు మృత్యువాత పడుతున్నారు. కల్తీ మద్యం అరికట్టాల్సిన ఎక్సైజ్ ఎన్ఫోర్సుమెంటు విభాగం మామూళ్ల మత్తులో జోగుతోంది. ఇతర రాష్ట్రాల నుంచి ఎన్డీపీ లిక్కర్ భారీగా దిగుమతి అవుతున్నా.. స్టేట్ టాస్క్ఫోర్సు విభాగం (ఎస్టీఎఫ్) చేష్టలుడిగి చూస్తోంది. మరోవైపు చెక్పోస్టుల్లో 'నిఘా' నిద్దరోతోంది. ఎక్సైజ్ అధికారులు మామూళ్ల 'మత్తు'లో జోగుతున్నారు. ఫలితంగా సుంకం చెల్లించని మద్యం (నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్) రాష్ట్రంలో ఏరులై పారుతోంది. కర్ణాటక, తమిళనాడు, యానాంల నుంచి సరఫరా అవుతున్న ఎన్డీపీ మద్యం విక్రయాలు రాష్ట్రంలో జోరుగా సాగుతున్నాయి. ఇతర రాష్ట్రాల నుంచి మద్యం అక్రమంగా తరలిరాకుండా ఉండేందుకు ఎక్సైజ్ శాఖ 39 చెక్పోస్టుల్ని ఏర్పాటు చేసింది. వీటిలో రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణ రాష్ట్ర సరిహద్దులో కొత్తగా 14 చెక్పోస్టుల్ని ఏర్పాటుచేసింది. అయినా.. తెలంగాణ నుంచే భారీగా సుంకం చెల్లించని మద్యం ఏపీకి దిగుమతి చేసుకుంటున్నారు. రాష్ట్రంలో అబ్కారీ చెక్పోస్టులు పేరుకే ఏర్పాటయ్యాయే తప్ప ఇక్కడ మొక్కుబడిగానే విధులు నిర్వహిస్తున్నారు. రాష్ట్రంలోకి అక్రమ మద్యం ప్రవేశిస్తున్నట్లు ఎక్సైజ్ శాఖకు పూర్తి సమాచారమున్నా, కేసులు నమోదు, వాహనాల సీజ్ మాత్రం అంతంత మాత్రంగానే నిర్వహిస్తున్నారు. ఇప్పటివరకు అక్రమ మద్యంపై నమోదైన కేసులు, ఎన్ని వాహనాలు సీజ్ చేశారనే సమాచారం కూడా ఆ శాఖ వద్ద లేదంటే పరిస్థితి ఏంటో అర్థమవుతుంది. యానాం నుంచి ఉభయగోదావరి, ఉత్తరాంధ్ర ప్రాంతాలకు, తమిళనాడు నుంచి చిత్తూరు, నెల్లూరు, కర్ణాటక నుంచి కర్నూలు, అనంతపురం జిల్లాలకు అక్రమ మద్యాన్ని సిండికేట్లు దిగుమతి చేసుకుంటున్నారు. మద్యం డిమాండ్ను బట్టి ఒక రాష్ట్రం నుంచి మరో రాష్ట్రానికి మద్యం సరఫరా అవుతుంది. ఈ సరఫరాకు ట్రూ ట్రాన్స్పోర్టు పర్మిట్లు కేటాయిస్తారు. వీటిని అంతరాష్ట్ర చెక్పోస్టుల్లో తనిఖీలు చేస్తారు. ఏపీలో ఐదు అంతరాష్ట్ర చెక్పోస్టులున్నాయి. వీటిని ట్రాన్స్పోర్టు, కమర్షియల్ ట్యాక్స్ తదితర శాఖలతో కలిసి ఇంటిగ్రేటెడ్ చెక్పోస్టులుగా నిర్వహిస్తున్నారు. ఈ ట్రూ ట్రాన్స్పోర్టు పర్మిట్లను అడ్డుపెట్టుకుని మద్యం మాఫియా ఎన్డీపీ మద్యం దిగుమతి చేసుకుంటోంది. ఇవన్నీ తెలిసినా ఎక్సైజ్ అధికారులు నెలవారీ మామూళ్లతో చెక్పోస్టుల్లో తనిఖీలు చేపట్టడం లేదని విమర్శలున్నాయి. ఎక్సైజ్ శాఖ సమీక్షల్లో చెక్పోస్టుల్ని బలోపేతం చేసి అక్రమ మద్యం అడ్డుకుంటామని సర్కారు బీరాలు పలుకుతున్నా.. కార్యాచరణకు నోచుకోవడం లేదని విమర్శలు వినిపిస్తున్నాయి.