Estates
-
రెండుగా విశాఖ ఏపీఐఐసీ జోన్
విశాఖ కేంద్రంలో ఉండే ఆంధ్రప్రదేశ్ మౌలిక సదుపాయాల సంస్థ(ఏపీఐఐసీ)ని ఇప్పుడు రెండు జోన్లుగా చేయడానికి ఆ సంస్థ అధికారులు కసరత్తు చేస్తున్నారు. రాష్ట్రంలోని 13 జిల్లాల్లో ఏడు జోన్లు ఉన్నాయి. విశాఖలో రెగ్యులర్, స్పెషల్తో పాటు విజయవాడ, కాకినాడ, నెల్లూరు, తిరుపతి, కడప, అనంతపురం జోన్లు ఉన్నాయి. ఒక్కో జోన్ కింద రెండు జిల్లాలు ఉండేవి. అయితే పాలనా సౌలభ్యం కోసం తాజాగా నెల్లూరు జోన్లో ఉండే ప్రకాశం జిల్లాను వేరు చేసి ఒంగోలు కేంద్రంగా జోన్ ఏర్పాటు చేశారు. అలాగే అనంతపురం జోన్లో ఉండే కర్నూలును వేరు చేసి కొత్త జోన్ ఇచ్చారు. వాటి మాదిరిగా విశాఖ జోన్లో ఉండే మూడు జిల్లాలను ఇప్పుడు రెండుగా చేయడానికి ఆలోచన చేస్తున్నారు. విశాఖ స్పెషల్ జోన్గా జిల్లాలో పరిశ్రమలు చూసేందుకు ప్రత్యేకంగా ఒక జోన్ను ఏర్పాటు చేసుకుని విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలను కలిపి ఒక జోన్ ఏర్పాటు చేయాలని ఆలోచన చేస్తున్నారు. ప్రస్తుతం విశాఖ జోన్ పరిధిలోని మూడు జిల్లాల్లోనూ 31 ఎస్టేట్లున్నాయి. వీటి పరిధిలో సుమారు 27 వేల ఎకరాల భూమి ఉంది. విశాఖ స్పెషల్ ఎస్ఈజెడ్(ప్రత్యేక ఆర్థిక మండలి) పరిధిలో 11,500 ఎకరాల్లో పరిశ్రమలున్నాయి. అలాగే విశాఖ జిల్లాలో 12 ఎస్టేట్లలో 518 ప్లాట్లలో పరిశ్రమలున్నాయి. రెండు జిల్లాల్లో పది ఎస్టేట్లు ఇక విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో పది ఎస్టేట్లున్నాయి. వాటి లో అధిక విస్తీర్ణంలో ప్లాట్లు ఉన్నది బొబ్బిలి గ్రోత్సెంటరులోనే. విజయనగరం జిల్లాలోని విజయనగరంలో 49 ప్లాట్లు, నెల్లిమర్లలో 83 ప్లాట్లు, కంటకాపల్లిలో ఏడు ప్లాట్లు, బొబ్బిలిలో 515 ప్లాట్లతో పారిశ్రామికవాడలున్నాయి. అలాగే శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలసలో 55 ప్లాట్లు, పైడి భీమవరంలో 61 ప్లాట్లు, పలాసలో 111 ప్లాట్లు, శ్రీకాకుళంలో 56, బలగలో 7, సంతబొమ్మాళిలో 3 ప్లాట్లు ఉన్నాయి. -
ఎస్టేట్స్ దివాలా
విజయవాడ సెంట్రల్ : ‘సందడి ఎక్కువ.. సంపాదన తక్కువ’ చందంగా ఎస్టేట్స్ విభాగం పనితీరు తయారైంది. కోట్లాది రూపాయల ఆదాయానికి అక్రమార్కులు వ్యూహాత్మకంగా గండికొడుతున్నారు. పూర్తిస్థాయి అధికారి లేకపోవడంతో కింది సిబ్బంది ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. కోర్టు కేసులు ఏళ్ల తరబడి కొనసాగుతున్నాయి. షాపింగ్ కాంప్లెక్స్ల్లోని షాపులు, కూరగాయల మార్కెట్, కమ్యూనిటీ హాళ్లు, పార్కింగ్ ప్రదేశాలకు టెండర్లు పిలిచేందుకు కమిషనర్ జి.వీరపాండియన్ కసరత్తు చేస్తున్నారు. ఈ మేరకు అధికారులు ఫైల్ను సిద్ధం చేశారు. ఎప్పటివలే ఈసారీ టెండర్లు ఓ ఫార్సుగా మిగులుతాయా.. ఆశించిన స్థాయిలో ఆదాయాన్ని తెచ్చిపెడతాయా అనే చర్చ నడుస్తోంది. నీరసంగా వసూళ్లు.. మూడు సర్కిళ్ల పరిధిలో డిమాండ్ రూ.15,53,90,305 కాగా కలెక్షన్ రూ. 3,10,48,513. రావాల్సిన బకాయిలు రూ.12,43,41,792.26 కేసులకు సంబంధించి 593 షాపులు కోర్టులో పెండింగ్లో ఉన్నాయి. వస్త్రలతకు సంబంధించిన కేసులే అధికంగా ఉన్నాయి.నగరంలోని వివిధ కాంప్లెక్స్ల్లో 183 షాపులు ఖాళీగా ఉన్నట్లు సమాచారం. తెగని వివాదం వస్త్రలత కాంప్లెక్స్ నుంచి రూ.11 కోట్లు బకాయిలు రావాల్సి ఉంది. అసోసియేషన్ ప్రతినిధులతో ఎంపీ కేశినేని నాని, మేయర్ కోనేరు శ్రీధర్ రెండు విడతలుగా చర్చలు సాగించారు. రూ.4 కోట్లకు మించి ఒక్క రూపాయి కూడా కట్టలేమని అసోసియేషన్ ప్రతినిధులు స్పష్టం చేశారు. ఈ ప్రతిపాదనను కమిషనర్ తిరస్కరించారు. 90 శాతం బకాయిలు చెల్లిస్తే 10 శాతం రాయితీ ఇస్తామని చెప్పారు. అయినా బకాయిల బండ ముందుకు కదలడం లేదు. దిక్కులేని దివాణం అధికారులు విజిటింగ్ ప్రొఫెసర్లలా ఎస్టేట్స్కు వచ్చిపోతున్నారు. పూర్తిస్థాయి అధికారి లేకపోవడంతో ఈ విభాగం దిక్కులేని దివాణంలా మారింది. గతంలో నగరపాలక సంస్థ ప్రధాన కార్యాలయంలో ఉండే ఎస్టేట్స్ సెక్షన్ను గదుల కొరత కారణంగా సర్కిల్-2 కార్యాలయానికి తరలించారు. కమిషనర్, మేయర్ల పర్యవేక్షణ కొరవడింది. ఎస్టేట్స్ అధికారి విక్టర్బాబు నాలుగు నెలలుగా సెలవులో ఉన్నారు. అసలు వస్తారో రారో కూడా తెలియని పరిస్థితి. డిప్యూటీ కమిషనర్ (రెవెన్యూ) డి.వెంకటలక్ష్మి కొన్ని నెలలు ఇన్చార్జిగా వ్యవహరించారు. మొక్కుబడిగానే ఆమె ఎస్టేట్స్ ఫైళ్లు చూసేవారని సమాచారం. కేజీ మార్కెట్ సెల్లార్ విషయంలో అక్రమాలకు పాల్పడడంతో సూపరింటెండెంట్, ఆర్ఐలను కమిషనర్ సస్పెండ్ చేశారు. ఆ తర్వాత డీసీఆర్ను ఇన్చార్జి బాధ్యతల నుంచి తప్పించారు. రీజినల్ ఫైర్ ఆఫీసర్ చౌదరికి ప్రస్తుతం ఇన్చార్జి బాధ్యతలు అప్పగించారు. ఎస్టేట్స్ పద్మవ్యూహాన్ని ఛేదించడం ఆషామాషీ వ్యవహారం కాదు. గాడిలో పెట్టేందుకు విక్టర్బాబు తనవంతు కృషి చేశారు. షాపుల ఖాళీలు, కోర్టు కేసులపై దృష్టిసారించారు. శృతిమించి రాజకీయ ఒత్తిళ్లు రావడంతో దీర్ఘకాలిక సెలవుపై వెళ్లిపోయారని తెలుస్తోంది. పూర్తిస్థాయి అవగాహన ఉంటే కానీ కింది ఉద్యోగులతో పనిచేయించలేని పరిస్థితి. ఎస్టేట్స్ రాజకీయాల్లో చౌదరి ఎంతవరకు నెగ్గుకొస్తారో వేచిచూడాలి.