-
సాయంలో కొత్త ఒరవడి
వరద కష్టాల్లో ఉన్న ప్రజలకు తక్షణ సాయం అందాలి. వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించాలి. భోజనం, నీరు, వైద్యం అందించాలి. తొలుత ఆ పని చేయండి. ఆ తర్వాతే ఆయా గ్రామాల్లో ఉన్న నా అన్నదమ్ములను, అక్కచెల్లెమ్మలను నేనే స్వయంగా వచ్చి అడుగుతాను. ఏ ఒక్కరి నుంచి కూడా నాకు అందాల్సింది అందలేదు.. కలెక్టర్ సరిగా స్పందించ లేదు.. వ్యవస్థలు సరిగా పని చేయలేదన్న మాట ఎక్కడా వినపడకూడదని కలెక్టర్లకు ఆదేశాలు ఇచ్చాం. ఇందులో భాగంగానే ఇప్పుడు పరిశీలించడానికి వచ్చాను. దీన్నొక సరికొత్త విధానంగా అమలు చేస్తూ కొత్త ఒరవడి సృష్టించాం. తక్షణ సాయం పట్ల మీరు సంతృప్తిగా ఉన్నందుకు ఆనందంగా ఉంది. – లంక వాసులతో సీఎం జగన్ సాక్షి అమలాపురం: ‘గతంలో చాలాసార్లు వరదలు వచ్చాయి. నాయకులు అప్పటికప్పుడు రావడం, అధికారులంతా వారి చుట్టూ తిరగటం జరిగేది. పేపర్లలో.. టీవీల్లో ఫొటోల కోసం పోజులిచ్చి వెళ్లిపోయేవారు. ప్రతి ఒక్కరికీ మంచి జరగాలి. కానీ వారు మంచి జరిగిందా లేదా అని చూడలేదు. మన ప్రభుత్వం వచ్చాక ఆ పరిస్థితిని మార్చాం. ప్రతి బాధితునికి సాయం అందుతోంది. నాలుగేళ్లుగా ఈ మార్పు కనిపిస్తోంది. సాయం చేయడం, ఆదుకోవడం అంటే ఇదీ..’ అని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. గోదావరి వరదల బారిన పడిన డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో మంగళవారం ఆయన పర్యటించారు. ముమ్మిడివరం, పి.గన్నవరం నియోజకవర్గ పరిధిలోని గురజాపులంక, లంకాఫ్ ఠానేల్లంక, కొండుకుదురులంకల్లో బాధితులతో మమేకమయ్యారు. వారి కష్టనష్టాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం వారిని ఉద్దేశించి మాట్లాడుతూ.. ఇలాంటి ప్రతి సందర్భంలో కలెక్టర్లకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చామన్నారు. ప్రజలకు తక్షణ సహాయ కార్యక్రమాలు చేపట్టేందుకు కావాల్సిన డబ్బులు వారి చేతుల్లో పెట్టామని చెప్పారు. వరద నష్టం ఎక్కువా, తక్కువా అని చూడకుండా బాధితులను ఉదారంగా ఆదుకోండని చెప్పామని తెలిపారు. ‘ఆయా జిల్లాల్లో కలెక్టర్లకు వారం రోజుల సమయం ఇచ్చాం. ప్రతి గ్రామంలోకి వెళ్లాలని, ప్రతి గ్రామంలో ఉన్న వ్యవస్థను చైతన్యం చేయాలని చెప్పాం. ఆ తర్వాత నేను స్వయంగా వచ్చి బాధితులకు సాయం అందిందీ లేనిదీ చూస్తానని చెప్పాను. నేను వచ్చినప్పుడు నాకు సహాయం అందలేదని ఏ ఒక్కరి నోటి నుంచి రాకూడదు’ అని స్పష్టమైన ఆదేశాలు ఇచ్చానని చెప్పారు. వరదలు వచ్చినప్పుడే మిమ్మల్ని పలకరించేందుకు వస్తే సహాయక చర్యలకు ఆటంకం కలుగుతుందని భావించే ఇలా చేశానని వివరించారు. కష్టాలలో ఉన్నప్పుడు మీ బిడ్డ వేగంగా ఆదుకుంటాడని పునరుద్ఘాటించారు. తొత్తరమూడివారిపేటలో స్థానికులను ఉద్దేశించి ప్రసంగిస్తున్న సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఉదారంగా ఉండాలన్నాను.. పేదలకు సాయం అందించడంలో ఉదారంగా ఉండాలన్న తన సూచన మేరకు జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో యంత్రాంగం పనిచేసిందని సీఎం కొనియాడారు. ఈ రోజు ప్రతి వ్యక్తికి పరిహారం అందించామంటే అందుకు మీ బిడ్డ జగన్ గ్రామీణ స్థాయిలో గొప్ప వ్యవస్థను ఏర్పాటు చేయడమేనన్నారు. సచివాలయాలు, విలేజ్ హెల్త్ క్లినిక్లు, ఆర్బీకేలు, వలంటీర్ల వ్యవస్థ వల్ల వరదల సమయంలో వేగంగా సాయం అందించడానికి మార్గం సుగమం అయిందన్నారు. ఈ వ్యవస్థ వల్లే ప్రతి పనిలోను పారదర్శకత చూపిస్తున్నామని తెలిపారు. నెలాఖరుకు పంట నష్ట పరిహారం పంట నష్టపోయిన రైతులకు నెలాఖరుకు పరిహారం అందించేలా చర్యలు తీసుకుంటామని సీఎం జగన్ రైతుల హర్షధ్వానాల మధ్య ప్రకటించారు. ‘రైతులకు ఏ సీజన్లో పంట నష్టం జరిగితే అదే సీజన్లో పరిహారం ఇస్తున్న ఏకైక ప్రభుత్వం మనదే’ అని అన్నారు. మూడు నాలుగు రోజుల్లో జాబితా సిద్ధమవుతుందని, రైతుల పేరు, విస్తీర్ణం, పంట నష్టం వివరాలు ఆర్బీకేలలో ఉంటాయన్నారు. ఎవరి పేరు అయినా కనిపించకపోతే ఆర్బీకేలో ఫిర్యాదు చేస్తే, తిరిగి పరిశీలిస్తారని చెప్పారు. నష్టపోయిన ప్రతి రైతుకు పరిహారం అందిస్తామన్నారు. అనంతరం గురజాపులంక, కూనలంకల్లో నష్టపోయిన వంగ, మునగ, బెండ, ఇతర కూరగాయ పంటలను పరిశీలించారు. అక్కడి రైతులతో మాట్లాడారు. విలేజ్ క్లినిక్ల ద్వారా గ్రామీణుల ముంగిటకే వైద్య సేవలు అందిస్తున్నామన్నారు. పశువులకు కూడా మెరుగైన వైద్యం అందిస్తున్నామని, టీఎంఆర్ (టోటల్ మిక్స్డ్ రేషన్–సమగ్ర పశు దాణా) దాణా అందిస్తున్నామని చెప్పారు. గతంలో ఎన్నడూ లేని సచివాలయం, వలంటీర్ వ్యవస్థలు, విలేజ్ క్లినిక్లు మన కళ్లెదుటే కనిపిస్తున్నాయని వివరించారు. ‘ఓఎన్జీసీ పరిహారం గురించి మీ అందరికీ తెలుసు. మీ బిడ్డ ప్రభుత్వం వచ్చాక అది మీకు అందింది. అన్ని విధాలా మీకు మంచి చేసే విషయంలో దేవుడు మరింత అవకాశం ఇవ్వాలని కోరుకుంటున్నాను’ అని సీఎం జగన్ అన్నారు. సీఎం జగన్ను చూసేందుకు మహిళలు, యువత ఆసక్తి చూపించారు. సీఎం.. సీఎం.. అంటూ నినా దాలు చేశారు. గురజాపులంకలో పలువురు యువ కులు జగన్ను చూసి ‘వైనాట్ 175 జగనన్నా..’ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. సీఎం జగన్ చిరునవ్వుతో అభివాదం చేస్తూ ముందుకు సాగారు. గురజాపులంకలో ఓ కుటుంబంతో మాట్లాడుతున్న సీఎం జగన్ సీఎంకు ఘన స్వాగతం జిల్లా పర్యటనకు వచ్చిన సీఎం వైఎస్ జగన్కు ప్రజలు, నేతల నుంచి ఘన స్వాగతం లభించింది. సీఎం వెంట రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ, జిల్లా ఇన్చార్జి మంత్రి జోగి రమేష్, మంత్రులు పినిపే విశ్వరూప్, చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ, తానేటి వనిత, ప్రభుత్వ విప్, కొత్తపేట ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి, జెడ్పీ చైర్మన్ విప్పర్తి వేణుగోపాలరావు, అమలాపురం ఎంపీ చింతా అనూరాధ, ఎమ్మెల్సీలు తోట త్రిమూర్తులు, బొమ్మి ఇజ్రాయెల్, కుడుపూడి సూర్యనారాయణరావు, ఎమ్మెల్యేలు పొన్నాడ వెంకట సతీష్ కుమార్, కొండేటి చిట్టిబాబు, రాపాక వరప్రసాద్, పెండెం దొరబాబు, కలెక్టర్ హిమాన్షు శుక్లా, జేసీ నపూర్ అజయ్లు పాల్గొన్నారు. నేరుగా జనం మధ్యకే.. మంగళవారం ఉదయం సీఎం వైఎస్ జగన్ నేరుగా గురజాపులంకకు హెలికాప్టర్లో చేరుకున్నారు. సాధారణంగా వరదల సమయంలో బాధితులను పరామర్శించేందుకు గతంలో చాలా మంది ముఖ్యమంత్రులు, కేంద్ర మంత్రులు జిల్లాకు వచ్చారు. అప్పట్లో డివిజన్ కేంద్రమైన అమలాపురం, వరద ప్రభావిత ప్రాంతాల మండల కేంద్రాలలో వరద నష్టంపై ఏర్పాటు చేసిన ఫొటో ఎగ్జిబిషన్ను తిలకించి, ఎంపిక చేసిన బాధితులను పరామర్శించి వెనుదిరిగేవారు. సీఎం జగన్ ఇందుకు భిన్నంగా నేరుగా లంక గ్రామాలలోకే రావడం బాధి తులను, పంట నష్టపోయిన రైతులను పరా మర్శించడంతోపాటు జరిగిన నష్టాన్ని స్వయంగా వీక్షించడం గమనార్హం. ఐదారు గంటలపాటు లంకవాసులతో సీఎం మమేకమ య్యారు. ఇదే విషయాన్ని లంకవాసులు, వరద బాధితులు గొప్పగా చెప్పుకున్నారు. తమ బాధలను తెలుసుకునేందుకు వచ్చిన తొలి ముఖ్యమంత్రి వైఎస్ జగనే అని వారు సంబర పడ్డారు. 1996లో పెను తుపానుకు తమ గ్రామాలు ధ్వంసమైనప్పుడు అప్పటి సీఎం చంద్రబాబు తమ గ్రామాలకు రానేలేదని వారు గుర్తు చేశారు. తమనే ఠానేలంకకు పిలిపించి మాట్లాడారని చెప్పారు. గత ఏడాది గోదావరికి రికార్డు స్థాయిలో వరద వచ్చిన సమయంలో కూడా సీఎం జగన్ జిల్లాలోని పి.గన్నవరం మండలంలోని జి.పెదపూడిలంక, ఉడుముడిలంక, అరిగెలవారిపేట, బూరుగులంక గ్రామాల్లో పర్యటించారని గుర్తు చేశారు. -
సీఎం కేసీఆర్ ప్లాన్.. అలా చేస్తే అకాల వర్షం ముప్పు తప్పుతుందా?
దేశీ రకాలతో ప్రయోజనం ► అన్నిరకాల కాలాలను తట్టుకునే దేశీ రకాల వరిని వేయడమే అకాల వర్షాల సమస్యకు పరిష్కారం. భారీ వర్షం, వడగళ్లతో పంట నేలకొరిగినా.. దేశీ వరి మళ్లీ నిలబడుతుంది. మొక్క గట్టిగా ఉంటుంది. వడగళ్లు, ఈదురుగాలులకు గింజలు రాలవు. ఇప్పు డు సాగుచేస్తున్న హైబ్రీడ్ రకాల్లో ఎరువులు ఎక్కువ వాడుతారు. మొక్కలు బలహీనంగా ఉంటాయి. నేలకొరుగుతాయి, గింజలు రాలిపోతాయి. స్థానిక వాతావ రణ పరిస్థితులను తట్టుకునేలా.. జిల్లా, మండలాల వారీగా వరి రకంపై నిర్ణయం జరగాలి. – డి.నర్సింహారెడ్డి, జాతీయ వ్యవసాయ నిపుణుడు సాక్షి, హైదరాబాద్: వరుసగా అకాల వర్షాలు.. వడగళ్ల వానలు.. ఈదురు గాలులు.. కోతకు వచ్చిన వరి రాలిపోయింది, కోసి పెట్టిన ధాన్యం నానిపోయింది. ఈ ఒక్కసారే కాదు.. ఏటా ఇదే పరిస్థితి. ఈ సమస్యను తప్పించుకునేందుకు వ్యవసాయ సీజన్నే ముందుకు జరిపే ఆలోచన చేయాలని సీఎం కేసీఆర్ ఆదేశించడంతో వ్యవసాయ శాఖ కసరత్తు మొదలుపెట్టింది. సాధ్యాసాధ్యాల పరిశీలనతోపాటు రైతుల్లో అవగాహన కల్పించేందుకూ ఏర్పాట్లు చేస్తోంది. వానాకాలం పంటను మే చివరివారంలో, యాసంగిని అక్టోబర్ తొలి వారంలో ప్రారంభిస్తే.. అకాల వర్షాల ముప్పు నుంచి తప్పించుకోవచ్చని అధికారులు చెప్తున్నారు. ఇక యాసంగి వరి కోతలను మార్చి నాటికే పూర్తిచేస్తే.. ధాన్యం మిల్లింగ్లో నూకలు పెరిగే సమస్య తప్పుతుందని సీఎం కేసీఆర్ సూచించడం గమనార్హం. అయితే సీజన్లను ముందుకు జరిపితే వచ్చే లాభనష్టాలపై వ్యవసాయ నిపుణులు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. సాగును ముందుకు జరపడం ఇబ్బందికరమని కొందరు చెప్తుంటే.. ప్రత్యామ్నాయ వంగడాలను వాడటం వంటివి మేలని మరికొందరు సూచిస్తున్నారు. మే చివరిలోనే సాగు మొదలైతే.. రాష్ట్రంలో నీటి వనరులు, భూగర్భ జలాలు పెరగడం వరి సాగుకు సానుకూలంగా మారిందని.. ఏటా మే నెలాఖరు, జూన్ తొలివారంలో వానాకాలం వరి సాగు మొదలయ్యేలా చూడాలని వ్యవసాయ అధికారులు భావిస్తున్నారు. దీనివల్ల సెప్టెంబర్ చివర, అక్టోబర్ ప్రారంభానికల్లా వరి చేతికి వస్తుందని.. అక్టోబర్లో వచ్చే అకాల వర్షాల ప్రభావం నుంచి బయటపడొచ్చని అంటున్నారు. ఇక వానాకాలం వరి కోతలు పూర్తికాగానే, అక్టోబర్ తొలివారంలోనే యాసంగి సాగు ప్రారంభిస్తే.. ఫిబ్రవరి నెలాఖరు, మార్చి తొలివారం నాటికే పంట చేతికి వచ్చే అవకాశం ఉందని చెప్తున్నారు. మార్చి నెల మధ్య నుంచి అకాల వర్షాల ప్రభావం నుంచి తప్పించుకోవచ్చని పేర్కొంటున్నారు. ఈ మేరకు రైతులను సమాయత్తం చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. నాట్లు వేసే విధానానికి బదులు నేరుగా ధాన్యం వెదజల్లే పద్ధతి పాటించడంపై రైతుల్లో అవగాహన పెంచాలని నిర్ణయించారు. క్లిష్టమైన వ్యవహారం! వానాకాలం సీజన్లో నీటి వసతి ఉన్న ప్రాంతాల్లో జూన్ 15 నుంచి జూలై 15 వరకు నాట్లు వేస్తారు. నీటి వసతి లేని ప్రాంతాల్లో ఆగస్టు 15 వరకు కూడా నాట్లు కొనసాగుతాయి. జూన్–జూలైలో వేసిన పంట నవంబర్ చివరి నాటికి చేతికి వస్తుంది. ఆగస్టులో వేసేవి డిసెంబర్ నాటికి చేతికి వస్తాయి. వానాకాలం పంటలు కోసిన తర్వాత 20 రోజులు ఆరబెట్టాల్సి ఉంటుంది. ఇక యాసంగి సీజన్కు సంబంధించి నవంబర్ 15 నుంచి నాట్లు వేయాలి. కానీ వానాకాలం పంట ఆలస్యం వల్ల యాసంగి ఆలస్యం అవుతోంది. డిసెంబర్, జనవరిలో కూడా నాట్లు వేస్తున్నారు. దీనివల్ల ఏప్రిల్, మే వరకు పంటలు చేతికి రావడం లేదు. ► మొత్తంగా నీటి వసతి, కాల్వల నుంచి విడుదల, వరి వంగడాల్లో రకాలు, మార్కెటింగ్ వంటి సమస్యలు ఉన్నాయి. ఈ పరిస్థితులే పంటలు చేతికి వచ్చే కాలాన్ని నిర్దేశిస్తాయని వ్యవసాయ శాస్త్రవేత్తలు అంటున్నారు. ► ఉదాహరణకు నల్లగొండ జిల్లా రైతులకు ఆగస్టులో కాల్వల నుంచి నీళ్లు విడుదల చేస్తారు. అదే నిజామాబాద్ రైతులకు జూన్, జూలై నెలల్లోనే నీళ్లు అందుతాయి. దీనివల్ల రాష్ట్రంలో ఒక్కోచోట ఒక్కో సమయంలో వరి చేతికి వస్తుంది. ► నిజామాబాద్ జిల్లాలో అనేక చోట్ల మేలోనే నారు పోస్తారు. కొన్నిచోట్ల ఆ నెల చివరి నాటికే నాట్లు కూడా వేస్తారు. ఇదే పరిస్థితి ఇతర జిల్లాల్లో ఉండదు. దేశీ రకాలతో ప్రయోజనం మార్చిలోగా వరి కోతలు పూర్తికావాలంటున్నారు. మార్చిలో కూడా వడగళ్ల వర్షాలు పడుతున్నాయి కదా.. దీనికి వరిలో అన్నిరకాల కాలాలను తట్టుకునే దేశీ రకాలను వేయడమే పరిష్కారం. అదికూడా స్థానిక వాతావరణ పరిస్థితులను తట్టుకునే వరి రకాలు వేసుకోవాలి. జిల్లా, మండలాల వారీగా నిర్ణయం జరగాలి. ఆ ప్రకారం రైతులను సన్నద్ధం చేయాలి. దేశీ రకాల్లో మొక్క గట్టిగా ఉంటుంది. భారీ వర్షం, వడగళ్లు పడినప్పుడు పంట నేలకొరిగినా దేశీ రకం మళ్లీ నిలబడుతుంది. వడగళ్లు, ఈదురుగాలులకు గింజలు రాలవు. హైబ్రీడ్ రకంలో మొక్క బలహీనంగా ఉంటుంది. సహజ వ్యవసాయం, దేశీ వరి రకాలు వేస్తే ఖర్చు తక్కువ వస్తుంది. దేశంలో 300 నుంచి 400 దేశీ వరి రకాలు ఉన్నాయి. దిగుబడి కూడా ఎక్కువ వస్తుంది. రైతులకు అవగాహన కల్పించకపోవడం వల్ల వీటి గురించి తెలియడంలేదు. తమిళనాడులో ఒక రైతు దేశీ రకం వరి వేస్తూ అక్కడి వ్యవసాయ వర్సిటీలో బోధన చేస్తున్నాడు. ఎకరాకు 40–50 క్వింటాళ్ల వరి దిగుబడి సాధిస్తున్నాడు. ఇక వెదజల్లే పద్ధతికి సంబంధించి జర్మినేషన్పై అనుమానాలు ఉన్నాయి. కాబట్టి దానిపై రైతులు ఆసక్తి చూపరు. ఒక్కో ప్రాంతంలో పరిస్థితిని బట్టి ఒక్కో రకం వరి వేసుకోవాలి. గంపగుత్తగా ఒకే విధంగా, ఒకే సమయంలో వేసుకోవాలని చెప్పడం సరికాదు. – డి.నర్సింహారెడ్డి, జాతీయ వ్యవసాయ నిపుణుడు ముందస్తు సీజన్లు సాధ్యంకాదు సంక్రాంతికి అంటే జనవరి 15 సమయంలో యాసంగి పంట వేస్తారు. మార్చి చివరికి అంటే 120 రోజుల్లో పంట చేతికి వస్తుంది. డిసెంబర్లో చలి ఎక్కువగా ఉంటుంది. కాబట్టి అప్పుడు నారు పెరగదు. మొక్క పెరగదు. అప్పుడు వరి వేయకూడదని రైతులకు చెప్పాలి. పైగా తెలంగాణ పీఠభూమి. పీఠభూమి మీద క్యుములోనింబస్ మేఘాల కారణంగా వడగళ్ల వర్షాలు పడతాయి. రైతులు జనవరి 15కు ముందు యాసంగి నారు వేయరు. అంతేకాదు ఫిబ్రవరిలోనూ రాళ్ల వర్షం వస్తుందనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. తర్వాత మార్చి, ఏప్రిల్ నెలల్లోనూ వస్తాయి. ఈ విషయాలను పరిగణనలోకి తీసుకోవాలి. అంతేతప్ప ఇష్టారాజ్యంగా నిర్ణయాలు తీసుకుంటే రైతులు నష్టపోతారు. – సారంపల్లి మల్లారెడ్డి, రైతు సంఘం జాతీయ నాయకుడు నెలలో రెండు సార్లు దెబ్బ గత నెల రోజుల్లో రెండుసార్లు కురిసిన భారీ వడగళ్ల వానల ధాటికి రాష్ట్రంలో లక్షల ఎకరాల్లో పంటలకు నష్టం వాటిల్లింది. తొలివానలకు 5 లక్షల ఎకరాల్లో, రెండోసారి ఏకంగా 12 లక్షల ఎకరాల్లో నష్టం జరిగినట్టు ప్రాథమికంగా అంచనా వేశారు. ఇంకా వ్యవసాయ శాఖ సర్వే కొనసాగుతోంది. పూర్తి అంచనాలపై త్వరలో స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఈ అకాల వర్షాలపై మంగళవారం సమీక్షించిన సీఎం కేసీఆర్.. పంటల సీజన్లను కాస్త ముందుకు జరపాలని, యాసంగి సీజన్ వరి కోతలు మార్చిలోగా పూర్తయ్యేలా చూడాలని వ్యవసాయ శాఖను ఆదేశించారు. ఈ నేపథ్యంలో పలు అంశాలపై వ్యవసాయ శాఖ దృష్టిపెట్టింది. -
Telangana: కల్లాల్లో కన్నీళ్లు
సాక్షి, హైదరాబాద్/సాక్షి, నెట్వర్క్: రాష్ట్రంలో నాలుగు రోజులుగా కురుస్తున్న అకాల వర్షాలు రైతులకు కన్నీళ్లు మిగుల్చుతున్నాయి. ఈదురుగాలులు, వడగళ్లతో కూడిన వర్షాలతో కోతకు వచ్చిన వరి పొలంలోనే నేలరాలింది. కోసి పెట్టిన ధాన్యం నీట మునిగింది. కొనుగోలు కేంద్రాల్లో కుప్పలు వరదకు కొట్టుకుపోయాయి. 4.5 లక్షల ఎకరాల్లో వివిధ పంటలకు నష్టం వాటిల్లినట్లు వ్యవసాయశాఖ ప్రాథమికంగా అంచనా వేసినా.. ఒక్క వరి పంటే ఐదు లక్షల ఎకరాలకుపైగా దెబ్బతిన్నట్టు క్షేత్రస్థాయి పరిశీలనలో తెలుస్తోంది. కొన్నిచోట్ల ఎకరా పొలంలో కనీసం క్వింటాల్ ధాన్యం కూడా వచ్చే పరిస్థితి లేదని రైతులు వాపోతున్నారు. ఒక్క వరి మాత్రమే కాదు.. మామిడి, నువ్వులు, మిరప, మొక్కజొన్న, టమాటా వంటి ఇతర పంటలు కూడా వడగళ్ల బీభత్సానికి తీవ్రంగా దెబ్బతిన్నాయి. వడగళ్లు, ఈదురుగాలుల కారణంగా సంగారెడ్డి, జగిత్యాల, సిద్దిపేట, కరీంనగర్, ఖమ్మం, సూర్యాపేట తదతర జిల్లాల్లో మామిడి భారీగా నేలరాలింది. ఉమ్మడి కరీంనగర్, వరంగల్, నల్లగొండ, నిజామాబాద్, మెదక్ జిల్లాల్లో పంట నష్టం అత్యధికంగా.. ఖమ్మం, ఆదిలాబాద్, రంగారెడ్డి, మహబూబ్నగర్ ఉమ్మడి జిల్లాల్లో కాస్త తక్కువగా ఉంది. ఈదురుగాలులు, వడగళ్లతో అధిక నష్టం వేసవిలో అకాల వర్షాలు మామూలే అయినా.. ఈసారి తీవ్రమైన ఈదురుగాలులు, వడగళ్లతో ఒక్కసారిగా భారీ వర్షాలు కురుస్తుండటం తీవ్ర నష్టానికి కారణం అవుతోందని వ్యవసాయ నిపుణులు చెప్తున్నారు. పెద్దపల్లి, కరీంనగర్, జగిత్యాల, ఉమ్మడి వరంగల్ జిల్లాల్లో పలుచోట్ల ఎకరానికి క్వింటాల్ వడ్లు కూడా వచ్చే పరిస్థితి లేదని.. వరికోత కోసం తెచ్చే హార్వెస్టర్ అద్దెకు సరిపడా ధాన్యం కూడా వచ్చేలా లేదని రైతులు వాపోతున్నారు. పొలాలను కౌలుకు తీసుకొని వరిసాగు చేసిన రైతులకు మరింత దెబ్బపడింది. కౌలు, పెట్టుబడి కలిపి ఒక్కో ఎకరాకు 20వేలకుపైనే నష్టపోతున్నామని, ప్రభుత్వమే ఆదుకోవాలని వారు కోరుతున్నారు. తడిసిన ధాన్యం ముందుగా వరి సాగు చేసిన నిజామాబాద్, కామారెడ్డి, సూర్యాపేట, నల్లగొండతోపాటు వరంగల్, కరీంనగర్, పెద్దపల్లి తదతర జిల్లాల్లో కోతలు మొదలయ్యాయి. 2వేలకుపైగా కేంద్రాలను ఏర్పాటు చేసినా ఇంకా కొనుగోళ్లు మొదలుపెట్టలేదు. రైతులు తెచ్చిన పంటను కొనుగోలు కేంద్రాల వద్ద ఆరబోశారు. అకాల వర్షాలతో అంతా తడిసిపోయింది. పలుచోట్ల కొట్టుకుపోయింది. మొత్తంగా 5 లక్షల టన్నుల ధాన్యం తడిసినట్టు పౌరసరఫరాల సంస్థ అధికారులు అంచనా వేస్తున్నారు. ప్రకృతి బీభత్సం నేపథ్యంలో వరి దిగుబడి భారీగా తగ్గే అవకాశం ఉందని.. కోటి టన్నుల సేకరణ అంచనా వేసుకున్నా, అందులో సగమైనా వస్తుందా అన్న అనుమానాలు ఉన్నాయని అంటున్నారు. ఏడెకరాల్లో నష్టపోతే అర ఎకరమే రాశారు నేను ఏడెకరాల్లో మొక్కజొన్న సాగు చేశా. గత నెలలో కురిసిన వానలకు పంట పూర్తిగా నేలవాలింది. అయినా అధికారులు అర ఎకరమే నష్టం జరిగినట్లు రాశారు. మిగిలిన కాసింత పంటనూ వ్యాపారులు తక్కువ ధరకే అడుగుతున్నారు. నష్టమెలా పూడ్చుకోవాలో తెలియడం లేదు. – వరి మేకల నాగయ్య, రైతు, సువర్ణాపురం, ముదిగొండ మండలం రాళ్లవాన ముంచింది మూడెకరాల్లో వరి వేసిన. తెల్లారి కోద్దామనుకుంటే.. రాత్రి మాయదారి రాళ్లవాన నిండా ముంచింది. గింజలన్నీ మట్టిలో కలిసిపోయాయి. సర్కారు ఆదుకోవాలి. లేకుంటే కుటుంబం రోడ్డుపడుతుంది. – గుగులోతు నీల, మహిళా రైతు, ఆంధ్ర తండా, జనగామ జిల్లా పావు మందమే వడ్లు మిగిలాయి ఎనిమిది ఎకరాల్లో వరి సాగు చేసిన. వడగళ్ల వానతో పంటంతా నేలవాలి గింజలు రాలిపోయాయి. పావు మందమే వడ్లు మిగిలాయి. మిషిన్ పెట్టి కోయిస్తే గడ్డి మాత్రమే మిగులుతుంది. – రైతు ఆవుల మహేందర్, గర్రెపల్లి, సుల్తానాబాద్ పంట నష్టం అంచనాలివీ.. ఉమ్మడి కరీంనగర్లో.. కరీంనగర్ ఉమ్మడి జిల్లా పరిధిలో లక్ష ఎకరాలకుపైగా వివిధ పంటలకు నష్టం వాటిల్లింది. ఇందులో వరి పంటే 80 వేల ఎకరాల్లో నష్టపోయింది. ఒక్క జగిత్యాల జిల్లాలోనే 50వేల ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయి. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 60వేల మంది రైతులపై వర్షం ప్రత్యక్ష ప్రభావం చూపినట్టు అంచనా. మెదక్ ఉమ్మడి జిల్లాలో.. సిద్దిపేటలో పంట నష్టం అధికంగా ఉంది. ఈ జిల్లాలో 86,203 ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయని, ఇందులో 79,350 ఎకరాల్లో వరికి నష్టం జరిగిందని వ్యవసాయ అధికారులు ప్రాథమిక అంచనా వేశారు. మెదక్లో 13,632 ఎకరాల్లో వరి, 342 ఎకరాల్లో మామిడి దెబ్బతిన్నాయి. మెదక్ జిల్లా పరిధిలోని కొనుగోలు కేంద్రాల్లో లక్షన్నర టన్నుల ధాన్యం తడిసినట్లు అనధికారిక అంచనా. సంగారెడ్డి జిల్లాలో నష్టం తక్కువగా ఉంది. ఉమ్మడి నిజామాబాద్లో.. కామారెడ్డి జిల్లాలో 22 వేల మంది రైతులకు సంబంధించిన పంటలు దెబ్బతిన్నట్టు వ్యవసాయ శాఖ అంచనా వేసింది. మొత్తంగా 32 వేల ఎకరాల్లో పంటలు నష్టపోయినట్టు పేర్కొంది. నిజామాబాద్ జిల్లాలో వరి, మొక్కజొన్న, నువ్వు, పొద్దుతిరుగుడు, పసుపు, ఉద్యాన పంటలకు 600 ఎకరాల్లో నష్టం జరిగింది. నిజామాబాద్ మార్కెట్ యార్డులో పసుపు తడిసింది. ఉమ్మడి వరంగల్ జిల్లాలో.. వరంగల్ ఉమ్మడి జిల్లా పరిధిలో లక్షన్నర ఎకరాల వరకు వివిధ పంటలు నష్టపోయినట్టు సమాచారం. అయితే 75,603 ఎకరాల్లో వరి, మొక్కజొన్న, ఇతర పంటలు దెబ్బతిన్నట్టు అధికారులు అంచనా వేశారు. ఇందులో 58 వేల ఎకరాల్లో వరి, 10 వేల ఎకరాల్లో మొక్కజొన్న, 7,603 ఎకరాల్లో ఇతర పంటలు ఉన్నట్టు పేర్కొన్నారు. జనగామలో వరి బాగా దెబ్బతింది. ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలో.. మంచిర్యాల జిల్లాలో 2,379 ఎకరాల్లో వరి, 309 ఎకరాల్లో మామిడి.. ఆదిలాబాద్ జిల్లాలో 2వేల ఎకరాల్లో జొన్న పంటలకు నష్టం జరిగినట్టు అంచనా వేశారు. ఆసిఫాబాద్లో 3,419 ఎకరాల మేర పంటలు దెబ్బతిన్నట్టు గుర్తించారు. నల్లగొండ ఉమ్మడి జిల్లాలో.. సూర్యాపేట జిల్లాలో 25వేల ఎకరాలకుపైగా వరికి నష్టం వాటిల్లగా, సుమారు 1,000 ఎకరాల్లో మామిడి తోటలు నాశనమయ్యాయి. యాదాద్రి జిల్లాలో 11వేల ఎకరాల్లో వరి దెబ్బతిన్నది. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో.. ఖమ్మం జిల్లాలో వరి 8,169 ఎకరాల్లో, మొక్కజొన్న 1751 ఎకరాల్లో నష్టపోయినట్టు కలెక్టర్కు వ్యవసాయ శాఖ నివేదించింది. -
పంటలన్నీ వర్షార్పణం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో భారీ వర్షాలు, వరదల కారణంగా అనేక జిల్లాల్లో పంటలు తుడిచిపెట్టుకుపోయాయి. మొలక దశలో ఉండటం వల్ల అనేక పంటలు కొట్టుకుపోగా కొన్నిచోట్ల వాటిపై పూర్తిగా ఇసుక మేటలు వేసింది. మరికొన్నిచోట్ల నీటిలో మొలకలు మురిగిపోయాయి. ప్రాథమిక అంచనా ప్రకారమే 11 లక్షల ఎకరాల్లో పంటలు నీట మునిగి నష్టం సంభవించింది. మరోవైపు ఇప్పటికే సాగు దశలో ఉన్న వరితోపాటు మొలక దశలో ఉన్న పత్తి నాశనమైంది. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు రూ. 1,200 కోట్ల మేర నష్టం వాటిల్లినట్లు అధికారులు ప్రాథమికంగా చెబుతున్నారు. అయితే అధికారికంగా పూర్తిస్థాయిలో అంచనాలు ఇంకా రూపొందించలేదు. ఈ నేపథ్యంలో మళ్లీ విత్తనాలను వేయాలంటే రాష్ట్రవ్యాప్తంగా రైతులు రూ. వెయ్యి కోట్లకుపైగా ఖర్చు చేయాల్సిన పరిస్థితి నెలకొంది. జూన్ మొదటి వారం నుంచే రైతులు పత్తి, మొక్కజొన్న విత్తడంతో మళ్లీ నష్టం ఏర్పడినట్లు తెలుస్తోంది. ఇప్పటికే రెండోసారి నాటిన రైతులు వానలతో మూడోసారి విత్తనాలను విత్తాల్సిన పరిస్థితి. దీంతో ఖర్చు పెరిగిపోతుందని వాపోతున్నారు. భారీగా పత్తి నష్టం... ఈ సీజన్లో ఇప్పటివరకు పత్తి 38.48 లక్షల ఎకరాల్లో సాగు అయింది. వానలతో సుమారు 8 లక్షల ఎకరాల్లో నష్టం వాటిల్లిందని ప్రాథమిక అంచనా. ఇప్పటివరకు ఒక్కో ఎకరానికి సుమారు రూ. 10 వేల వరకు సరాసరి రైతులు పెట్టుబడిగా పెట్టారు. మొత్తం పత్తి సాగుకు ఎకరానికి రెండు విత్తన ప్యాకెట్ల చొప్పున సుమారు 76.96 లక్షల విత్తన ప్యాకెట్లను రైతులు కొనుగోలు చేశారు. ఇప్పటివరకు పెట్టిన పెట్టుబడి ప్రకారం పరిశీలిస్తే 8 లక్షల ఎకరాల్లో సుమారు రూ. 800 కోట్ల నష్టం ఒక్క పత్తిలోనే సంభవించిందని వ్యవసాయ నిపుణులు అంచనా వేస్తున్నారు. అలాగే వరి, కంది, సోయాబీన్, మొక్కజొన్న పంటలకూ భారీగానే నష్టం వాటిల్లిందని చెబుతున్నారు. సోయాబీన్కు అధిక వానలు మరింత నష్టాన్ని కలిగించాయి. వరి చాలా వరకు వరద నీటిలో మునగడంతో ఎర్రబారిపోయింది. కంది, మొక్కజొన్న మొలక దశకు చేరుకున్నప్పటికీ అధిక పదును, వరద నీరు పారడంతో కొట్టుకుపోయింది. ఈ పంటలన్నింటికీ కలిపి సుమారు రూ. 400 కోట్లకుపైగా నష్టం వాటిల్లినట్లు సమాచారం. జిల్లాలవారీగా... నిజామాబాద్ జిల్లాలో 49,591 ఎకరాల్లో పంట నష్టం జరిగింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 143 గ్రామాల్లో 2,900 మంది రైతులు 5,620 ఎకరాల్లో పంటను నష్టపోయారు. మంచిర్యాల జిల్లాలో 27,592 ఎకరాల్లో పంట నష్టం జరిగింది. ఆసిఫాబాద్ జిల్లాలో మొత్తం 45,420 ఎకరాల్లో నష్టం వాటిల్లింది. ఆదిలాబాద్ జిల్లాలో మొత్తం 1.03 లక్షల ఎకరాల్లో పంట నష్టం జరిగింది. 29,085 మంది రైతులు నష్టపోయారు. నిర్మల్ జిల్లాలో మొత్తం 20,293 ఎకరాల్లో నష్టం వాటిల్లింది. మళ్లీ విత్తనాలు వేయాల్సిందే... వర్షాలకు పంటలు దెబ్బతిన్న సుమారు 11 లక్షల ఎకరాల్లోనూ తిరిగి విత్తనాలు వేయాల్సిన పరిస్థితి ఉంటుందని వ్యవసాయ శాఖ వర్గాలు అంటున్నాయి. అయితే రెండోసారి విత్తాల్సి ఉన్నా కొన్నిచోట్ల భూమి అనుకూలిస్తుందా లేదా అనే చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఇతర పంటల వైపు మళ్లాలా లేదా అనేది వ్యవసాయశాఖ అంచనా వేయాల్సి ఉంటుంది. విత్తనాలు సిద్ధంగా ఉంచాం.. రాష్ట్రంలో వర్షాలు, వరదల వల్ల ఎక్కడైనా రెండోసారి విత్తాల్సి వస్తే ఆ మేరకు అవసరమైన అన్ని రకాల విత్తనాలను సిద్ధంగా ఉంచాం. పత్తి, వరి విత్తనాలను ప్రైవేటు కంపెనీలు సిద్ధం చేసినందున ఎక్కడా ఇబ్బంది తలెత్తదు. పంట నష్టం అంచనాపై ఇప్పటివరకు జిల్లాలకు ఎలాంటి ఆదేశాలు జారీ చేయలేదు. కొన్నాళ్లుగా విత్తనాలకు సబ్సిడీ ఇవ్వడంలేదు. కాబట్టి ఈసారి అలాంటి ప్రశ్నే ఉత్పన్నం కాదు. – రఘునందన్రావు, కార్యదర్శి, వ్యవసాయశాఖ ప్రభుత్వం ఆదుకోవాలి... మూడెకరాల్లో పత్తి వేశా. విత్తనాలు, దుక్కులు, ఇతరత్రా ఖర్చులకు ఎకరానికి రూ. 30 వేల పెట్టుబడి పెట్టా. గోదావరి బ్యాక్వాటర్తో ఈసారి పంటంతా నీట మునిగింది. ఇసుక మేటలు వేసింది. పొలంలో విద్యుత్ స్తంభాలు నేలకూలడంతో కరెంట్ బంద్ చేశారు. ప్రభుత్వం ఆదుకోవాలి. – బోగిరి ప్రభాకర్, పోతారం, మంథని నష్టపరిహారం చెల్లించాలి... నాలుగు ఎకరాల్లో పత్తి వేశా. విత్తనాలు, కూలీలకు కలిపి మొత్తం రూ. 30 వేలు ఖర్చయింది. విత్తనాలు మొలకెత్తకముందే వర్షానికి కొట్టుకుపోయాయి. ప్రభుత్వం ఆదుకొని నష్టపరిహారం చెల్లించాలి. పంబలి సాయిలు, జంగంరెడ్డిపల్లి, అమ్రాబాద్ మండలం, నాగర్కర్నూల్ జిల్లా -
Heavy Rains: పొలాల్లో నీళ్లు.. రైతు కన్నీళ్లు
పై చిత్రంలోని మహిళా రైతు పేరు బొలిశెట్టి రుక్కమ్మ పాత మంచిర్యాల శివారులో 11 ఎకరాలు కౌలుకు తీసుకుని పత్తి పంట వేసింది. ఈ ఏడాది జూలైలో వచ్చిన గోదావరి వరదతో చేను నీట మునగడంతో.. రెండోసారి విత్తనాలు వేసింది. కలుపు తీసి, ఎరువులు వేసి.. కంటికి రెప్పలా కాపాడుకుంటూ వచ్చింది. తీరా ఇప్పుడు పంట చేతికొచ్చే దశలో కురిసిన వానలు మళ్లీ దెబ్బతీశాయి. ఎల్లంపల్లి నుంచి భారీగా నీటిని వదలడంతో గోదావరి పోటెత్తి పంట మొత్తం నీట మునిగింది. ఇప్పటివరకు రూ. 4 లక్షలకుపైగా పెట్టుబడి పెట్టామని.. రెక్కలు ముక్కలు చేసుకుని సాగు చేసిన పంట మొత్తం నీటిపాలైందని రుక్కమ్మ కన్నీళ్లు పెట్టుకుంది. నిండా మునిగి పోయిన తమను ప్రభుత్వం ఆదుకోవాలని వేడుకుంటోంది. సాక్షి, హైదరాబాద్/ నెట్వర్క్: రాష్ట్రంలో కొద్దిరోజులుగా కురుస్తున్న వానలతో వాగులు, వంకలు ఉప్పొంగి, చెరువులు అలుగులు పారి పొలాలు, చేన్లలో నీళ్లు చేరాయి. రాష్ట్రవ్యాప్తంగా ఏకంగా 6.20 లక్షల ఎకరాల్లో పంటలు నీట మునిగినట్టు వ్యవసాయ శాఖ ప్రాథమికంగా అంచనా వేసింది. ఇందులో 1.20 లక్షల ఎకరాల్లో పంటలు ఇప్పటికే పూర్తిగా దెబ్బతిన్నాయని అధికారవర్గాలు చెప్తున్నాయి. పొలాల నుంచి నీళ్లు తొలగిస్తే.. మిగతా పంటలు గట్టెక్కే అవకాశం ఉందని అంటున్నాయి. (చదవండి: బీజేపీని గెలిపిస్తే.. వంటగ్యాస్ రూ.1,500 దాటుతుంది) 14 జిల్లాల్లో అత్యధికంగా.. రాష్ట్రవ్యాప్తంగా 18 జిల్లాల్లో పంటలు నీట మునిగినట్టు అధికారులు గుర్తించారు. ఇం దులో 14 జిల్లాల్లో అత్యధికంగా, నాలుగు జిల్లాల్లో పాక్షికంగా పంటలు దెబ్బతిన్నట్టు అంచనా వేశారు. ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, వరంగల్, హన్మకొండ, మహబూబాబాద్, ములుగు, జయశంకర్ భూపాలపల్లి, జనగాం, కరీంనగర్, పెద్దపల్లి, రాజన్న సిరి సిల్ల, జగిత్యాల, నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల్లో అనేక చోట్ల పంటలు నీట మునిగినట్టు తేల్చారు. ఈ జిల్లాల్లో కుంభవృష్టి కురవడంతో వాగులు, వంకలు ఉప్పొం గాయి. పలుచోట్ల చెరువులు, ఒర్రెలు తెగడంతో నీళ్లన్నీ పొలాల్లో చేరాయి. పత్తి, వరి, పసుపుతో పాటు పునాస పంటలు మొక్కజొన్న, కందులు, నువ్వులు, వేరుశనగ దెబ్బతిన్నాయి. ► ఆదిలాబాద్, కొమురంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్ జిల్లాల్లో పాక్షికంగా పంటలు నీట మునిగాయని అధికారులు అంచనా వేశారు. మిగతా జిల్లాల్లోనూ స్వల్పంగా పంటలు నీట మునిగాయని, కొన్నిచోట్ల దెబ్బతిన్నాయని పేర్కొంటున్నారు. అయితే ఈ వివరాలను వ్యవసాయశాఖ వర్గాలు అధికారికంగా వెల్లడించడం లేదు. పంట నష్టం వివరాలను సేకరిస్తున్నామని.. ప్రభుత్వం అడిగితే పైఅధికారులకు పంపిస్తామని చెప్తున్నారు. (చదవండి: TSRTC: కారుణ్యం లేదు.. కనికరం లేదు) 1.22 కోట్ల ఎకరాల్లో సాగు ఈసారి వానలు ముందే మొదలవడంతో జూన్ తొలివారంలోనే రాష్ట్రవ్యాప్తంగా పంటల సాగు మొదలైంది. 1.22 కోట్ల ఎకరాల్లో సాగు జరిగిందని.. అందులో 50.85 లక్షల ఎకరాలలో పత్తి, 49.87 లక్షల ఎకరాలలో వరి, 6.12 లక్షల ఎకరాల్లో మొక్కజొన్న, 8.98 లక్షల ఎకరాల్లో కంది, 1.34 లక్షల ఎకరాల్లో పెసర, 3.48 లక్షల ఎకరాల్లో సోయా పంటలు వేసినట్టు అధికారులు చెప్తున్నారు. పలు జిల్లాల్లో నష్టం తీరు ► పెద్దపల్లి జిల్లాలో 450 ఎకరాల్లో పత్తి, 50 ఎకరాల్లో వరి పంటలు నీట మునిగినట్టు అధికారులు ప్రాథమికంగా అంచనా వేశారు. ► సంగారెడ్డి జిల్లాలో 5,387 ఎకరాల్లో పంట నష్టం జరిగింది. నారాయణఖేడ్ డివిజన్ పరిధిలో పెసర, మినుము, సోయాబీన్ పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయి. పత్తి చేన్లలో నీళ్లు నిలవడంతో మొక్కలు రంగు మారుతున్నాయి. ► మెదక్ జిల్లాలో 641 ఎకరాల్లో పంట నష్టం జరిగినట్లు వ్యవసాయ శాఖ అధికారులు తెలిపారు ► సిద్దిపేట జిల్లాలో 7,117 ఎకరాల్లో నష్టం జరిగినట్లు అధికారులు అంచనా వేశారు. ఇందులో వరి 4,325 ఎకరాలు, పత్తి 1,870, మొక్కజొన్న 593, కంది 329 ఎకరాల్లో దెబ్బతిన్నట్టు పేర్కొన్నారు. ► రాజన్న సిరిసిల్ల జిల్లాలో 6,890 ఎకరాల్లో పంట నష్టం జరిగినట్టు గుర్తించారు. ► నిజామాబాద్ జిల్లావ్యాప్తంగా 3,729 ఎకరాల్లో వివిధ పంటలకు నష్టం వాటిల్లిందని వ్యవసాయశాఖ అధికారులు వెల్లడించారు. మరో 7,311 ఎకరాల్లో పంటలు పాక్షికంగా దెబ్బతిన్నాయని తెలిపారు. అయితే క్షేత్రస్థాయిలో పంట నష్టం మరింత ఎక్కువగా ఉంటుందని రైతులు చెప్తున్నారు. నష్ట పరిహారం ఎలా? రాష్ట్రవ్యాప్తంగా పంట నష్టపోయిన రైతులకు బీమా అందే పరిస్థితి కూడా లేకుండా పోయింది. కేంద్రం అమలు చేసే ‘ప్రధాన మంత్రి ఫసల్ బీమా యోజన (పీఎంఎఫ్బీవై)’ నుంచి రాష్ట్ర ప్రభుత్వం వైదొలగడమే దీనికి కారణం. కేంద్రం ఫసల్ బీమాను 2016–17లో ప్రారంభించింది. భారీ వర్షాలు, తుఫాన్లు వంటివాటితో జరిగే పంట నష్టాలకు పరిహారం అందుతుంది. ప్రీమియం సొమ్ములో రైతులు 2–5 శాతం వరకు చెల్లిస్తే.. మిగతా మొత్తంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చెరో సగం భరించాలి. తెలంగాణ ప్రభుత్వం 2020 వర్షాకాలం నుంచి ఫసల్ బీమాను రాష్ట్రంలో నిలిపివేసింది. రైతు యూనిట్గా ఇవ్వాలని..: ఫసల్ బీమా పథకం కొన్ని పంటలకు గ్రామం యూనిట్గా, మరికొన్నింటికి మండలం యూనిట్గా అమలవుతుంది. కొందరికే నష్టం జరిగితే బీమా పరిహారం వచ్చే అవకాశం ఉండదు. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం అభ్యంతరం వ్యక్తం చేసింది. రైతు యూనిట్గా ఫసల్ బీమాను అమలు చేయాలని డిమాండ్ చేసింది. కానీ కేంద్రం మార్చలేదు. అంతేగాకుండా బీమా ప్రీమియం కింద ఎక్కు వగా సొమ్ము చెల్లించాల్సి రావడంతోనూ రాష్ట్ర ప్రభుత్వం ఆ పథకాన్ని ఆపేయాలన్న నిర్ణయా నికి వచ్చిందని అధికార వర్గాలు చెప్తున్నాయి. అయితే.. ఫసల్ బీమాను వద్దనుకున్న బిహార్, పశ్చిమ బెంగాల్, గుజరాత్, జార్ఖండ్ వంటి రాష్ట్రాలు సొంత పథకాలను ప్రారంభించాయి. ఏపీ కూడా కేవలం రూపాయి ప్రీమియంతో ఉచితంగా కేంద్ర పథకాన్ని అమలు చేస్తోంది. కానీ రాష్ట్రంలో ఎలాంటి పంటల బీమా పథకం చేపట్టక ఇప్పుడు పంట నష్టపోయిన రైతులకు ఎలాంటి పరిహారం అందే పరిస్థితి లేదని అధికార వర్గాలు చెప్తున్నాయి. మూడుసార్లు మునిగి.. నాకు మూడెకరాల పొలం ఉంది. జూలైలోనే వరినాట్లు వేసినా అప్పట్లో కురిసిన కుంభవృష్టితో నారు మొత్తం కొట్టుకుపోయింది. వెంటనే మరోసారి నాట్లు వేశాను. మరో వారం తర్వాత కురిసిన వానలకు రెండోసారీ వృధా అయింది. నాకు వ్యవసాయమే బతుకుదెరువు. అందుకే మూడోసారి వరి నారు కొని నాట్లు వేసిన. పంట ఏపుగా పెరిగింది. కానీ ఇప్పుడు మళ్లీ కురిసిన భారీ వర్షాలతో వరి మొత్తం కొట్టుకుపోయింది. ఏం చేయాలో అర్థంకావడం లేదు. ప్రభుత్వమే ఏదో ఒక విధంగా ఆదుకోవాలి. -నిమ్మ రాజారెడ్డి, మోర్తాడ్, నిజామాబాద్ జిల్లా పంట జాడే లేకుండా పోయింది యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన్ నారాయణపురం మండలం సిత్యా తండాలో ఇసుక మేటలు వేసిన వరి పొలం ఇది. వాంకుడోతు సోమ అనే రైతు రెండున్నర ఎకరాల్లో వరి వేశాడు. ఇటీవలి వర్షాలకు బుంగ వాగు ఉప్పొంగి ఈ పంట నీట మునిగింది. ఒకటిన్నర ఎకరాల్లో ఇసుక, మట్టి మేట వేసి.. అసలు పంట వేసిన ఆనవాళ్లే లేకుండా పోయాయి. నెల రోజులైతే పంట చేతికి వచ్చేదని.. తమ శ్రమ అంతా మట్టిలో కలిసిపోయిందని సోమ ఆవేదనలో మునిగిపోయాడు. పొలంలో ఇసుక, మట్టి మేటలను తొలగించాలంటే లక్ష రూపాయలదాకా ఖర్చువుతుందని, ప్రభుత్వమే ఆదుకోవాలని ఆయన కోరుతున్నాడు. కూతురి పెళ్లి అప్పు తీర్చాలనుకుంటే.. ఈ ఫొటోలో కనిపిస్తున్న రైతు పేరు మూడు వీరు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలం టాక్యా తండాకు చెందిన ఆయన.. నాలుగు ఎకరాల్లో పత్తి సాగు చేశాడు. ఈసారి పంట బాగుంటే.. తన కుమార్తె పెళ్లి కోసం చేసిన అప్పులు తీర్చవచ్చని ఆశపడ్డాడు. కానీ భారీ వర్షాలతో పత్తి చేను నీట మునిగింది. ఇప్పుడు అప్పులెలా తీర్చాలె, బతుకెట్లా గడవాలి అంటూ ఆందోళనలో పడ్డాడు. పంట పోయింది.. ఏం చేయాలె? మెదక్ జిల్లా రేగేడు మండల కేంద్రానికి చెందిన కుమ్మరి సాయిలు పత్తి చేను ఇది. సాయిలు తనకున్న రెండు ఎకరాలతోపాటు మరో ఐదు ఎకరాలను కౌలుకు తీసుకుని పత్తి వేశాడు. భారీ వర్షాలకు పంటంతా నీట మునిగింది. పత్తి కాయలు రాలిపోవటంతోపాటు రంగు మారింది. కనీసం పెట్టుబడి కూడా చేతికందే పరిస్థితి లేకుండా పోయిందని సాయిలు ఆందోళన చెందుతున్నాడు. ఇప్పుడేం చేయాలని ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. నిజామాబాద్ జిల్లా బాల్కొండ మండలం బోదేపల్లికి చెందిన రైతు నోముల శ్రీధర్కు చెందిన మొక్కజొన్న చేను ఇది. ఆయన వేసిన రెండెకరాల మొక్కజొన్న ఇటీవలి భారీ వర్షాలకు నేలకొరిగింది. వానలు ఇంకా కొనసాగుతుండటంతో ఇక పంట ఏ మాత్రం చేతికందే పరిస్థితి లేదంటూ శ్రీధర్ ఆవేదనలో మునిగిపోయాడు. ప్రభుత్వం ఆదుకోవాలని వేడుకుంటున్నాడు.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తప్పక చదవండి
- అమోథీ.. రాహుల్, ప్రియాంకల సంపద
- అదిరిపోయిన అందాలు.. తృప్తి అలా ఆయేషా ఇలా!
- ఓటుకు నోటు..అజిత్ పవార్ వర్గంపై నాన్ కాగ్నిజబుల్ కేసు నమోదు
- తెలంగాణ: రైతుబంధుకు ‘ఈసీ’ బ్రేక్
- ‘చార్ సౌ పార్’ ఎందుకంటే... క్లారిటీ ఇచ్చిన ప్రధాని
- దేశంలో పెరిగిన బంగారం ధరలు.. ఎంతంటే?
- PK: అన్నయ్య ప్రచారం చేస్తే తప్ప గెలవలేడా?
- రోహిత్కు ఇంగ్లిష్ రాదు.. ఏడిపించేవాళ్లం.. కానీ: యువీ
- తుప్పు పట్టిన సైకిల్లో మిగిలింది బెల్ మాత్రమే: సీఎం జగన్
- LS Elections: కొనసాగుతున్న మూడో విడత పోలింగ్.. ఓటింగ్ శాతం ఎంతంటే..
Advertisement