breaking news
credits
-
డ్యూయల్ మేజర్లతోనే పీజీ!
సాక్షి, అమరావతి: కూటమి ప్రభుత్వం డిగ్రీ విద్యలో గందరగోళం సృష్టిస్తోంది. గతంలో సింగిల్ మేజర్, మైనర్ విధానంపై బురదజల్లడమే కాకుండా తాము అధికారంలోకి వస్తే పాత పద్ధతి(మూడు కోర్ సబ్జెక్టులు)ని ప్రవేశపెడతామని చెప్పి.. ఇప్పుడు డ్యూయల్ మేజర్లతో విద్యార్థులను ఆందోళనకు గురి చేస్తోంది. తొలి సెమిస్టర్ నుంచే రెండు మేజర్ సబ్జెక్టులను అమలు చేయడమే కాకుండా రెండో ఏడాది నుంచి మైనర్ సబ్జెక్టును తప్పనిసరి చేసింది. కానీ మైనర్ సబ్జెక్టుకు క్రెడిట్లు తక్కువ కేటాయించడం ద్వారా అందులో పీజీకి అవకాశం లేకుండా చేసింది. అలాగే ఎలాంటి బోధన వనరులు లేకపోయినా.. క్వాంటం కంప్యూటింగ్ సబ్జెక్టును తప్పనిసరి చేసి విద్యార్థులను హడలెత్తిస్తోంది. ఇంటర్న్షిప్ సమయంలో కోత విధించి.. పుస్తకాల బట్టీకి ప్రాధాన్యమిచ్చింది.బోధన సాధ్యమేనా?బీకాం కోర్సులకు సంబంధించి కొత్త విధానంలో సబ్జెక్టుల కాంబినేషన్పై గందరగోళం నెలకొంది. బీకాంలో కంప్యూటర్ సైన్స్/అప్లికేషన్ల అనుబంధ మేజర్ సబ్జెక్టులుగా చదివే వారు తప్పనిసరిగా క్వాంటం టెక్నాలజీని మైనర్ సబ్జెక్టుగా అభ్యసించాలని నిబంధన పెట్టడంతో విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. క్వాంటం టెక్నాలజీ సబ్జెక్టును బోధించే వనరులు రాష్ట్రంలో జల్లెడ పెట్టి వెతికినా దొరకని పరిస్థితి ఉందని.. ప్రభుత్వం సొంత ప్రచారం కోసం విద్యార్థులను బలి చేస్తోందని విద్యావేత్తలు మండిపడుతున్నారు. వైఎస్ జగన్ ప్రభుత్వం విద్యార్థులకు అత్యాధునిక విద్యను అందించేందుకు ఎడెక్స్, మైక్రోసాఫ్ట్ వంటి ప్రపంచ దిగ్గజ సంస్థల ద్వారా ఆన్లైన్ వర్టికల్స్ చదువుకునే అవకాశం కల్పించిందని వారు గుర్తు చేస్తున్నారు. కానీ, కూటమి ప్రభుత్వంలో కాలేజీలో పాఠాలు చెప్పడానికే వనరుల కొరత ఉన్నప్పుడు ఈ టెక్నాలజీ కోర్సులను ఎలా బోధిస్తారని ప్రశ్నిస్తున్నారు. కాగా, మేజర్ 1, మేజర్ 2, మైనర్ సబ్జెక్టులకు కాంబినేషన్ సబ్జెక్టుల జాబితాను ప్రభుత్వం ఇంకా విడుదల చేయకపోవడంపై డిగ్రీ కాలేజీల యాజమాన్యాలు ఆందోళన చెందుతున్నాయి. గతంలో విద్యార్థులకు అనుకూలంగా..ఒక సబ్జెక్టులో విద్యార్థి సంపూర్ణ నైపుణ్యాలు సాధించాలనే లక్ష్యంతో యూజీసీ మార్గదర్శకాలకు అనుగుణంగా గత ప్రభుత్వం సింగిల్ మేజర్ విధానాన్ని తీసుకువచ్చింది. రెండో సెమిస్టర్ నుంచి 100కి పైగా సబ్జెక్టుల్లో నచ్చిన సబ్జెక్టును మైనర్ కింద చదువుకునేలా క్రెడిట్లు రూపొందించింది. అంటే మేజర్, మైనర్లో ఏదో ఒక సబ్జెక్టుతో పీజీలో ప్రవేశాలకు అర్హత పొందొచ్చు. దీంతో పాటు ఐచ్ఛికంగా మరో మైనర్ సబ్జెక్టును విద్యార్థి చదివితే దానికి కూడా క్రెడిట్లు ఇచ్చి అందులో సైతం పీజీ చేసేందుకు వీలు కల్పించింది. ఇక్కడ మేజర్కు 60, మైనర్కు 24 క్రెడిట్లు కేటాయించింది. నాలుగేళ్ల డిగ్రీ విధానంలో ఏడు సబ్జెక్టులు మాత్రమే ఉండేవి. అందులో ఒక సబ్జెక్టును కేవలం చివరి సంవత్సరంలో మాత్రమే చదవాల్సి ఉండేది.మైనర్ సబ్జెక్టులో పీజీకి అవకాశం లేదు..కూటమి ప్రభుత్వం సింగిల్ మేజర్ విధానం స్థానంలో డ్యూయల్ మేజర్ ప్రకటించింది. ఇందులో తొలి సెమిస్టర్ నుంచే విద్యార్థి ప్రధానంగా రెండు సబ్జెక్టులు(మేజర్1, 2) తీసుకోవాలి. మూడో సెమిస్టర్ నుంచి మైనర్ సబ్జెక్టును తప్పనిసరిగా చదవాలి. ఇక్కడ మేజర్ 1కు 48, మేజర్ 2కు 32, మైనర్కు 16 క్రెడిట్లు కేటాయించింది. యూజీసీ నిబంధనల ప్రకారం ఒక సబ్జెక్టులో కనీసం 24 క్రెడిట్లు ఉంటేనే.. అందులో పీజీ చేయొచ్చు. ఈ లెక్కన కేవలం 2 మేజర్లలో ఏదో ఒక దానిలో మాత్రమే పీజీ చదివేందుకు అర్హత ఉంటుంది. పైగా డ్యూయల్ మేజర్ నాలుగేళ్ల డిగ్రీలో 8 సబ్జెక్టులను చదవాల్సి ఉంటుంది.ఇంటర్న్షిప్, క్రెడిట్లలో కోత..వైఎస్ జగన్ ప్రభుత్వం విద్యార్థులకు తరగతి బోధనతో పాటు ఉద్యోగ నైపుణ్యాలు పెంపొందించేందుకు 10 నెలల ఇంటర్న్షిప్ను ప్రవేశపెట్టింది. తొలి ఏడాది అనంతరం 180 గంటల కమ్యూనిటీ సర్వీస్ ప్రాజెక్టు, రెండో ఏడాది తర్వాత 180 గంటల ఇంటర్న్షిప్, చివరి ఏడాది(విద్యార్థి వీలును బట్టి) ఏదో ఒక సెమిస్టర్లో పూర్తిగా లాంగ్టర్మ్ ఇంటర్న్షిప్ అవకాశం కల్పించింది. కానీ, ఇప్పుడు కూటమి ప్రభుత్వం విద్యార్థులను పూర్తిగా బట్టీ చదువులకే పరిమితం చేస్తోంది. కమ్యూనిటీ సర్వీసు ప్రాజెక్టును 120 గంటలకు, స్వల్పకాలిక ఇంటర్న్షిప్ను 120 గంటలకు, లాంగ్టర్మ్ ఇంటర్న్షిప్ను 10 వారాలకు(240 గంటలకు) కుదించింది. పైగా క్రెడిట్లను 20 నుంచి 16కు తగ్గించింది. -
బీటెక్లో ప్రమోషన్కు 20 క్రెడిట్స్..!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని అన్ని విశ్వవిద్యాలయాల్లో ఏకీకృత ప్రమోషన్ విధానాన్ని ప్రవేశ పెట్టనున్నారు. కనీసం 20 క్రెడిట్స్ ఉంటే ప్రమోట్ చేయనున్నారు. సాంకేతిక విద్య అధికారులతో కూడిన కమిటీ ఈ మేరకు తాజాగా ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది. దీన్ని కేబినేట్ ఉప కమిటీ ఆమోదించినట్టు, 2025–26 విద్యా సంవత్సరం నుంచే ఇది అమల్లోకి రానుందని విశ్వసనీయంగా తెలిసింది. కొన్ని రోజుల క్రితం అన్ని విశ్వవిద్యాలయాల వీసీలతో సమావేశం ఏర్పాటు చేశారు. ఏకీకృత విధానం అమలుపై ఇందులో ఏకాభిప్రాయం కుదిరింది. ఇంజనీరింగ్లో ఒక ఏడాది తర్వాత మరో ఏడాదికి వెళ్లేందుకు (ప్రమోట్ అయ్యేందుకు) ఒక్కో యూనివర్సిటీలో ఒక్కో విధానం ఉంది. దీనివల్ల ఇబ్బందులు ఎదురవుతున్నాయని వర్సిటీల అధికారులు చెబుతున్నారు. గత అసెంబ్లీ సమావేశాల్లో కొంతమంది సభ్యులు సైతం ఈ అంశం సభ దృష్టికి తెచ్చారు. దీనిపై స్పందించిన ప్రభుత్వం.. ఏకీకృత విధానం అమలుపై అధికారుల నుంచి నివేదిక కోరింది. ప్రస్తుతం హైదరాబాద్ జేఎన్టీయూహెచ్లో అనుసరిస్తున్న విధానాన్ని ప్రామాణికంగా తీసుకోవాలని వర్సిటీల ఉప కులపతులు అభిప్రాయపడ్డారు. రాష్ట్రంలో ప్రధానంగా ఉస్మానియా, మహాత్మాగాం«దీ, జేఎన్టీయూహెచ్, కాకతీయ యూనివర్సిటీల పరిధుల్లో ఇంజనీరింగ్ విద్య కొనసాగుతోంది. ఒక్కో చోట ఒక్కో విధానం ఉస్మానియా, మహాత్మాగాంధీ వర్సిటీల్లో బీటెక్ మొదటి ఏడాది నుంచి రెండో ఏడాదికి వెళ్లాలంటే విద్యార్థి ఫస్టియర్లో 50 శాతం క్రెడిట్స్ సాధించాలి. కానీ జేఎన్టీయూహెచ్, కాకతీయ విశ్వవిద్యాలయాల్లో 25 శాతం క్రెడిట్స్ పొందితే సరిపోతుంది. ఆ తదుపరి సంవత్సరాల్లో ప్రమోట్ కావాలన్నా ఒక్కో వర్సిటీలో ఒక్కో క్రెడిట్ విధానం ఉంది. ఒక్కో సెమిస్టర్కు 20 చొప్పున ఏడాదికి 40 క్రెడిట్స్, నాలుగేళ్ళకు కలిపి మొత్తం 160 క్రెడిట్స్ ఉంటాయి. ఒక్కో వర్సిటీకి ఒక్కో విభిన్నమైన సిలబస్ ఉండటం వల్ల కూడా క్రెడిట్ విధానంలో తేడా ఉంటోంది. సిలబస్, పీరియడ్స్ను బట్టి 3 లేదా 4 చొప్పున క్రెడిట్స్ ఉంటాయి. జేఎన్టీయూహెచ్లో ఫస్టియర్ ఇంజనీరింగ్లో ఐదు థియరీ సబ్జెక్టులు, 3 ల్యాబ్లు ఉంటాయి. ఒక సబ్జెక్టు పాసయితే దానికి సంబంధించిన క్రెడిట్స్ విద్యార్థి ఖాతాలో పడతాయి. అయితే ఎక్కడ తేలికగా ప్రమోట్ అవుతారో ఆ యూనివర్సిటీలను విద్యార్థులు ఎంచుకుంటున్నారు. జేఎన్టీయూహెచ్ కన్నా ఉస్మానియా యూనివర్సిటీలో ప్రమోట్ కావడం కష్టమని విద్యార్థులు భావిస్తున్నారు. 20 క్రెడిట్స్ ఉంటే ప్రమోట్ ప్రస్తుతం కనీసం 20 క్రెడిట్స్ ఉంటే తర్వాతసంవత్సరానికి ప్రమోట్ చేసే విధానంతెచ్చే యోచనలో ఉన్నారు. అంటే ఏటా ఆ ఏడాదికి సంబంధించిన సగం క్రెడిట్స్ విద్యార్థి సాధించాల్సి ఉంటుంది. దీంతోపాటే క్రెడిట్స్ విధానాన్ని మార్చాలని భావిస్తున్నారు. తొలి ఏడాది ఇంజనీరింగ్లో చేరిన విద్యార్థికి రెండో సంవత్సరంలో సబ్జెక్టుపై కాస్త అవగాహన ఉంటుంది. కాబట్టి రెండో సంవత్సరంలో ఫస్టియర్ బ్యాక్లాగ్స్ లేకుండా చూసుకోవాలి. మూడో సంవత్సరం నుంచి 40% క్రెడిట్స్ సాధించాలి. ఇక ఆఖరి ఏడాదిలో పూర్తి క్రెడిట్స్ పొంది ఉండాలనే విధానం ఖరారు చేసినట్టు సమాచారం. నాలుగు వర్సిటీల అధికారులు ఇప్పటికే ఈ విధానంపై కసరత్తు పూర్తి చేశారు. త్వరలో ప్రభుత్వానికి నివేదిక ఇవ్వనున్నారు. విద్యాశాఖ అంగీకారం పొందాక దీన్ని అమల్లోకి తెస్తారని ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. -
జస్ట్ మిస్.. బ్యాంక్ డబ్బులు మొత్తం ఖాళీ అయ్యేవి!
అంతర్జాతీయ బ్యాంకింగ్ దిగ్గజం సిటీగ్రూప్ సిబ్బంది చేసిన పొరపాటుతో బ్యాంక్లోని డబ్బులు మొత్తం ఖాళీ అయ్యేవి. ఫైనాన్షియల్ టైమ్స్ కథనం ప్రకారం.. సిటీ బ్యాంక్ గత ఏప్రిల్ నెలలో 280 డాలర్లకు బదులుగా 81 ట్రిలియన్ డాలర్లను (ప్రస్తుత మారక విలువ ప్రకారం భారతీయ కరెన్సీలో రూ.6,723 లక్షల కోట్లు) పొరపాటున ఓ ఖాతాదారుడి ఖాతాలో జమ చేసింది.ఈ పొరపాటును ఇద్దరు ఉద్యోగులు పట్టుకోలేకపోయారు. డబ్బులు జమ చేసిన 90 నిమిషాల తర్వాత మూడో ఉద్యోగి గుర్తించారని నివేదిక తెలిపింది. అయితే బ్యాంకు నుంచి నిధులు పూర్తిగా ఆ ఖాతాలోకి బదిలీ కాలేదని, తృటి తప్పిందని (near miss) ఫెడరల్ రిజర్వ్, కంప్ట్రోలర్ ఆఫ్ ది కరెన్సీ కార్యాలయానికి సీటీగ్రూప్ తెలియజేసింది."ఇంత పరిమాణంలో చెల్లింపు వాస్తవానికి పూర్తి కాలేదన్న విషయాన్ని పక్కన పెడితే మా డిటెక్టివ్ నియంత్రణలు రెండు సిటీ లెడ్జర్ ఖాతాల మధ్య ఇన్పుట్ దోషాన్ని వెంటనే గుర్తించాయి. మేము ఎంట్రీని తిప్పికొట్టాము" అని సిటీగ్రూప్ ప్రతినిధి ఈ-మెయిల్ ప్రతిస్పందనలో తెలిపారు. "మా నివారణ నియంత్రణలు పొరబాటున బ్యాంకు నుంచి నిధులు బయటకు వెళ్లకుండా నిలిపివేస్తాయి" అని పేర్కొన్నారు. ఈ సంఘటన బ్యాంకుపై గానీ, తమ క్లయింట్లపై గానీ ఎలాంటి ప్రభావం చూపలేదని బ్యాంక్ ప్రతినిధి తెలిపారు.ఇలాంటివి 10 పొరపాట్లుసిటీ బ్యాంక్లో 1 బిలియన్ డాలర్లు లేదా అంతకంటే ఎక్కువ మొత్తానికి సంబంధించి ఇలాంటి పొరపాట్లు గత ఏడాది మొత్తం 10 జరిగాయని అంతర్గత నివేదికను ఉటంకిస్తూ ఎఫ్టీ తెలిపింది. అంతకు ముందు ఏడాది నమోదైన 13 కేసులతో పోలిస్తే ఇది తగ్గినప్పటికీ, యూఎస్ బ్యాంక్ పరిశ్రమలో 1 బిలియన్ డాలర్ల కంటే ఎక్కువ మొత్తానికి సంబంధించిన పొరపాట్లు అసాధారణమని నివేదిక పేర్కొంది. -
‘ప్రమోట్’కు ఒకటే ప్రమాణం!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని అన్ని యూనివర్సిటీల్లోనూ ఒకే తరహా ప్రమోషన్ విధానం తీసుకురావాలని ప్రభుత్వం సాంకేతిక విద్య విభాగానికి సూచించింది. ఇంజనీరింగ్లో కనీసం 20 క్రెడిట్స్ ఉంటేనే తర్వాతి ఏడాదికి ప్రమోట్ చేసే విధానం తీసుకొచ్చే ఆలోచనలో ఉంది. దీనిపై త్వరలో అన్ని వర్సిటీల వీసీలతో విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి సమావేశం నిర్వహించనున్నారు. ఈ ఏడాది నుంచే దీనిని అమల్లోకి తేవాలని భావిస్తున్నారు. ఇప్పటికే క్రెడిట్ పాయింట్లను బట్టి మొదటి ఏడాది నుంచి రెండో ఏడాదికి ప్రమోట్ చేస్తున్నారు. అయితే ఈ విధానం ఒక్కో యూనివర్సిటీలో ఒక్కో రకంగా ఉంది. దీంతో కొన్ని వర్సిటీల విద్యార్థులు నష్టపోతున్నారు. రాష్ట్రంలో ఉస్మానియా, మహాత్మాగాంధీ, జేఎన్టీయూహెచ్, కాకతీయ యూనివర్సిటీల్లో ఇంజనీరింగ్ విద్య కొనసాగుతోంది. ప్రస్తుతం ఒక్కో చోట ఒక్కో విధానం వర్సిటీల్లో ఒక్కో సెమిస్టర్కు 20 చొప్పున, ఏడాదికి 40 క్రెడిట్స్ ఉంటాయి. ఉస్మానియా, మహాత్మాగాంధీ యూనివర్సిటీల్లో బీటెక్ మొదటి ఏడాది నుంచి రెండో ఏడాదికి వెళ్లాలంటే విద్యార్థి మొదటి సంవత్సరంలో 50 శాతం క్రెడిట్స్ సాధించాలి. కానీ జేఎన్టీయూహెచ్, కాకతీయ విశ్వవిద్యాలయాల్లో 25 శాతం క్రెడిట్స్ పొందితే సరిపోతుంది. మిగతా సంవత్సరాల విషయంలోనూ ఒక్కో వర్సిటీలో ఒక్కో క్రెడిట్ విధానం ఉంది. నాలుగేళ్లకు కలిపి మొత్తం 160 క్రెడిట్ పాయింట్లు ఉంటాయి. 4వ సంవత్సరంలో 160 క్రెడిట్స్ సాధించాల్సి ఉంటుంది. అయితే యూనివర్సిటీలకు వేర్వేరు సిలబస్ ఉండటం వల్ల కూడా క్రెడిట్ విధానంలో తేడా ఉంటోంది. సిలబస్, పీరియడ్స్ను బట్టి 3 లేదా 4 చొప్పున క్రెడిట్స్ ఉంటాయి. జేఎన్టీయూహెచ్లో ఫస్టియర్ ఇంజనీరింగ్లో ఐదు థియరీ సబ్జెక్టులు, మూడు ల్యాబ్లు ఉంటాయి. విద్యార్థి పాసయ్యే ఒక్కో సబ్జెక్టుకు దానికి సంబంధించిన క్రెడిట్ పాయింట్లు అతని ఖాతాలో పడతాయి. విద్యార్థులు ఎక్కడ తేలికగా ప్రమోట్ అవుతారో చూసుకుని ఆ వర్సిటీని ఎంచుకుంటున్నారు. -
విద్యార్థులకు ఏడబ్ల్యూఎస్ గుడ్ న్యూస్
న్యూఢిల్లీ: క్లౌడ్ కంప్యూటింగ్ కంపెనీ అమెజాన్ వెబ్ సర్వీసెస్ (ఏడబ్ల్యూఎస్) తాజాగా 100 మిలియన్ డాలర్ల క్లౌడ్ క్రెడిట్స్ను ప్రకటించింది. ప్రపంచవ్యాప్తంగా డిజిటల్ లెర్నింగ్ సొల్యూషన్స్ అభివృద్ధి, తదుపరి స్థాయికి చేర్చడంలో అర్హత కలిగిన విద్యా సంస్థలు, పేద విద్యార్థులకు సహాయం చేయడానికి రాబోయే ఐదేళ్లలో ఈ క్రెడిట్స్ను అందజేయనున్నట్లు వెల్లడించింది.ఏడబ్ల్యూఎస్ ఎడ్యుకేషన్ ఈక్విటీ ఇనిషియేటివ్ కింద గ్రహీతలకు నగదు వలె పనిచేసే క్లౌడ్ క్రెడిట్స్ను మంజూరు చేస్తారు. ఏడబ్ల్యూఎస్ క్లౌడ్ సేవలను ఉపయోగించినప్పుడు సంస్థలు వారి ఖర్చులను తగ్గించుకోవడానికి ఇది వీలు కల్పిస్తుందని కంపెనీ తెలిపింది.ఈ క్రెడిట్స్తో గ్రహీతలు ఏఐ అసిస్టెంట్స్, కోడింగ్ కరికులమ్స్, కనెక్టివిటీ టూల్స్, ఎడ్యుకేషనల్ ప్లాట్ఫామ్స్, మొబైల్ అప్లికేషన్స్, చాట్బాట్స్తోపాటు వివిధ సాంకేతిక ఆధారిత అభ్యాస అనుభవాల వంటి ఆవిష్కరణలను రూపొందించడానికి ఏడబ్ల్యూఎస్ క్లౌడ్ టెక్నాలజీ, అధునాతన ఏఐ సేవలను ఉపయోగించుకోవచ్చు. -
ఈపీఎఫ్ఓ వడ్డీ జమ షురూ: మీరూ చెక్ చేసుకోండిలా..!
న్యూఢిల్లీ: ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (ఈపీఎఎఫ్ఓ) వడ్డీ డిపాజిట్ కోసం ఎదురుచూస్తున్న ఖాతాదారులకు శుభవార్త. ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్ (పీఎఫ్) వడ్డీ జమలను ప్రారంభించినట్టు ఈపీఎఫ్వో ట్విటర్ ద్వారా సమాచారాన్ని అందించింది. ప్రక్రియ ప్రారంభమైంది త్వరలోనే మీ ఖాతాలోనే పూర్తిగా జమ అవుతుందని ఒక ప్రశ్నకు సమాధానంగా ట్వీట్ చేసింది. 2021-22 ఏడాదిగాను డిపాజిట్లపై వడ్డీరేటు నాలుగు దశాబ్దాల కనిష్టం వద్ద 8.1 శాతంగా ప్రభుత్వం జూన్లో ఆమోదించింది. అలాగే 2020-21 ఆర్థిక సంవత్సరానికి వడ్డీరేటు 8.5 శాతంగా ఉంది. The process of crediting interest is ongoing and it will get reflected into your account soon. Whenever the interest is credited, it will be paid in full. There will be no loss of interest. — EPFO (@socialepfo) October 31, 2022 పీఎఫ్ బ్యాలెన్స్ ఎలా చెక్ చేయాలి? సాధారణంగా బ్యాలెన్స్ను ఎస్ఎంఎస్ లేదా మిస్డ్ కాల్ ద్వారా చూసుకోవచ్చు. సంస్థ పోర్టల్లో లాగిన్ కావడం ద్వారానూ తెలుసుకోవచ్చు. ఖాతాదారులు అధికారిక వెబ్సైట్ లో ‘మా సేవలు’ ట్యాబ్కు వెళ్లాలి. ట్యాబ్లో, 'ఉద్యోగుల కోసం' ఆప్షన్ను ఎంచుకోండి..కొత్త పేజీ ఓపెన్ అయ్యాక సబ్స్క్రైబర్ తప్పనిసరిగా 'సభ్యుని పాస్బుక్'పై క్లిక్ చేసి, యూనివర్సల్ అకౌంట్ నంబర్ (UAN),పాస్వర్డ్ వంటి వివరాలను నమోదు చేయాలి. పాస్బుక్లో వడ్డీ క్రెడిట్ అయిందీ లేనిదీ చెక్ చెసుకోవచ్చు. అయితే ఒకటి కంటే ఎక్కువ సంస్థల్లో ఉద్యోగం చేసిన వారు వేర్వేరు ఐడీ ఆధారంగా చెక్ చేయాలి. మిస్డ్ కాల్: ద్వారా కూడా పీఎఫ్ బ్యాలెన్స్ తెలుసుకోవవచ్చు. 011-22901406 అనే నంబరుకు చందాదారుడు రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ కాల్ చేయాలి. ఎస్ఎంఎస్: పీఎఫ్ చందాదారుడు తన రిజిస్టర్ మొబైల్ నుంచి ఎస్ఎంఎస్ పంపడం ద్వారా ఈపీఎఫ్ ఖాతా బ్యాలెన్సును తెలుసుకోవచ్చు. పీఎఫ్ బ్యాలెన్స్ చెకింగ్ కోసం 7738299899 నంబరుకు ‘‘EPFOHO UAN ENG’’ అని ఎస్ఎంఎస్ పంపాలి. యూఏఎన్ అని ఉన్న చోట దాన్ని టైప్ చేయాలి. ఎస్ఎంఎస్ సెండ్ చేశాక పీఎఫ్ ఖాతా బ్యాలెన్స్ వివరాలతో మరో మెసేజ్ వస్తుంది. -
షావోమికి షాక్, రియల్మి కూడా
సాక్షి, న్యూఢిల్లీ: చైనా మొబైల్ దిగ్గజం షావోమికి షాకిచ్చేలా మరో చైనా మొబైల్ మేకర్ ఒప్పో రంగం సిద్ధం చేసింది. భారత వినియోగదారులకు చిన్న చిన్న అప్పులిచ్చేందుకు షావోమి తీసుకొచ్చిన ‘ఎంఐ క్రెడిట్’ మాదిరిగా ఆర్థిక సేవల ప్లాట్ఫాంను రియల్మి తాజాగా లాంచ్ చేసింది. రియల్ మి పేసా పేరుతో భారత మార్కెట్లో రుణాల విభాగంలోకి ఎంట్రీ ఇచ్చింది. ఇందుకోసం ఫిన్టెక్ స్టార్టప్ఫిన్షెల్తో భాగస్వామ్యం కుదుర్చుకుంది. దీనిద్వారా దేశంలోని వినియోగదారులకు, సూక్ష్మ, చిన్న, మధ్యతరహా సంస్థలకు (ఎస్ఎంఇ) లావాదేవీలను సులభతరం చేయడంతోపాటు, తమ వృద్ధిని బలపేతం చేసుకోవాలనేది రియల్మి లక్ష్యం. కస్టమర్లకు ఆర్థిక సేవలను సులభతరం చేయడమే తమ లక్ష్యమని రియల్మి ఇండియా సీఈవో మాధవ్ సేత్ ప్రకటించారు. టైర్-1, టైర్- 2 పట్టణాలను మాత్రమే లక్ష్యంగా పెట్టుకున్నామని క్రమంగా ఇతర పట్టణాలకు విస్తరిస్తామన్నారు. రియల్మి పేసా వ్యక్తులు, సంస్థలకు అనేక రకాల ఆర్థిక సేవలను అందిస్తుంది. చిన్న వ్యాపారాలు భారత ఆర్థిక వ్యవస్థలో కీలకమైన భాగమనే విషయాన్ని గుర్తించిన తాము తొలిసారిగా ఇలాంటి సదుపాయాన్ని తీసుకొచ్చిన మొబైల్ సంస్థతామేనని రియల్మి వెల్లడించింది. గూగుల్ ప్లే నుండి నేరుగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. రియల్మి పేసా వెబ్సైట్ వివరాల ప్రకారం వినియోగదారులు రూ .50 వేల పర్సనల్ లోన్ పొందే అవకాశం కూడా ఉంది. పేసాలోని లెండింగ్కార్ట్ ద్వారా సంస్థలు రూ. 50 వేల నుంచి రూ. 20 లక్షల వరకు రుణం పొందవచ్చు. అంతేకాదు ఐసీఐసీఐ లాంబార్డ్ జనరల్ ఇన్సూరెన్స్తో కలిసి రియల్మి పేసా ప్లాట్ఫామ్ ద్వారా మొబైల్ స్క్రీన్ ప్రొటెక్షన్ను అందిస్తుంది. సంవత్సరానికి రెండుసార్లు క్లెయిమ్ చేసుకోవచ్చట. కాగా ఇండియా మార్కెట్లో చిన్న అప్పులు ఇచ్చేందుకు చైనీస్ స్మార్ట్ఫోన్ దిగ్గజం షావోమి ఎంఐ క్రెడిట్ పేరుతో లెండింగ్ సొల్యూషన్ను ప్రవేశ పెట్టిన సంగతి తెలిసిందే. ఎంఐ పే తర్వాత రెండో పేమెంట్ సొల్యూషన్గా దీన్ని తీసుకొచ్చింది. ఎంఐ క్రెడిట్ద్వారా రూ. లక్ష దాకా వ్యక్తిగత రుణసదుపాయాన్ని కల్పిస్తోంది. 2023 నాటికి ఇండియాలో ఆన్లైన్ క్రెడిట్ లెండింగ్ మార్కెట్ రూ. 70 లక్షల కోట్లకు చేరుతుందనే అంచనాల నేపథ్యంలో 2019 ఆర్థిక సంవత్సరం చివరి నాటికి ఎంఐ క్రెడిట్ ద్వారా భారతదేశంలో 19,000 పిన్ కోడ్లను కవర్ చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. -
‘అప్పు’డే వద్దు!
ముంబై: బ్యాంకులు ఒకపక్క వడ్డీరేట్లు తగ్గిస్తున్నప్పటికీ.. రుణాలు తీసుకోవడానికి మాత్రం పెద్దగా ఎవరూ ఆసక్తి చూపడంలేదు. వినియోగ డిమాండ్ బలహీనంగా ఉందనడానికి, అదేవిధంగా ఆర్థిక వ్యవస్థ తీవ్ర మందగమనానికి బలమైన నిదర్శనంగా బ్యాంకింగ్ రుణ వృద్ధి ఘోరంగా పడిపోతోంది. సెప్టెంబర్ 27తో ముగిసిన పక్షానికి(15 రోజుల వ్యవధి) రుణ వృద్ధి రేటు సింగిల్ డిజిట్కు పరిమితమైంది. వృద్ధి ఈ స్థాయికి పడిపోవడం ఈ ఏడాది ఇదే తొలిసారి. ఆర్బీఐ తాజాగా విడుదల చేసిన గణాంకాల్లో కొన్ని ముఖ్యాంశాలను చూస్తే... ► 2019 సెప్టెంబర్ 27తో ముగిసిన పక్షానికి (అప్పటికి వార్షిక ప్రాతిపదికన చూస్తే) బ్యాంకింగ్ రుణాలు 97.71 లక్షల కోట్లు. ► 2018 ఇదే కాలానికి రుణాల పరిమాణం రూ.89.82 లక్షల కోట్లు. ► అంటే వృద్ధి రేటు 8.79 శాతమన్నమాట. ► వృద్ధి రేటు సింగిల్ డిజిట్కు పడిపోవడం ఈ ఏడాది ఇదే తొలిసారి. ► 2019 సెప్టెంబర్ 13 ముగిసిన పక్షం రోజులకు చూస్తే, రుణాల పరిమాణం రూ.97.01 లక్షల కోట్లుగా ఉంది. 2018 ఇదే కాలంలో పోల్చితే వృద్ధి రేటు 10.26 శాతంగా ఉంది. డిపాజిట్లూ మందగమనమే... ఇక బ్యాంకుల్లో డిపాజిట్ల విషయానికి వస్తే, ఈ విభాగంలో కూడా వృద్ధిరేటు మందగమనంలోకి జారిపోయింది. 2019 సెప్టెంబర్ 27తో ముగిసిన పక్షం రోజులకు డిపాజిట్లు రూ. 129.06 లక్షల కోట్లు. 2018 ఇదే కాలానికి ఈ మొత్తం రూ.118 లక్షల కోట్లుగా ఉంది. అంటే ఇక్కడ వృద్ధి రేటు 9.38 శాతంగా ఉంది. 2019 సెప్టెంబర్ 13తో ముగిసిన పక్షం రోజులకు చూస్తే, వృద్ధి రేటు 10.02 శాతంగా ఉంది. -
అప్పుల్లేవ్.. తిప్పలే
ఏలూరు (మెట్రో) : కొత్త రుణాలు అందక.. పాత రుణాలు చెల్లించలేక డ్వాక్రా సంఘాల నిర్వహణ గాడి తప్పుతోంది. పకడ్బందీగా నడిచే వ్యవస్థ క్రమంగా బీటలువారుతోంది. సంఘాల పటిష్టత కోసం ఎప్పటికప్పుడు క్షేత్రస్థాయిలో సమావేశాలు, అవగాహన సదస్సులు నిర్వహించాల్సిన సిబ్బంది మొక్కుబడి తంతుగా ముగిస్తున్నారు. మరోవైపు రుణాలు అందక మహిళలు అవస్థలు పడుతున్నారు. జిల్లాలో 65 వేల మహిళా సంఘాలు ఉండగా.. దాదాపు సగం సంఘాలకు ఇప్పటికీ రుణాలు ఇవ్వలేదు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో జిల్లాలోని సంఘాలకు రూ.1,200 కోట్లను రుణాలుగా ఇవ్వాలని లక్ష్యంగా నిర్ణయించగా.. రూ.660 కోట్లు మాత్రమే ఇచ్చేందుకు చర్యలు చేపట్టారు. గత ఏడాది కూడా ఇదే పరిస్థితి. 2015–16 ఆర్థిక సంత్సరంలో రూ.వెయ్యి కోట్లను రుణాలివ్వాలని నిర్ణయించగా.. ప్రభుత్వం రూ.500 కోట్లు ఇచ్చి చేతులు దులుపుకుంది. ఈ ఏడాది కూడా ఇదే పరిస్థితి ఎదురుకావడంతో మహిళా సంఘాల మనుగడ ప్రశ్నార్థకంగా మారింది. లక్ష్యం మేరకు రుణాలిస్తామని అధికారులు చెబుతున్నప్పటికీ ప్రçస్తుత ఆర్థిక సంవత్సరం నెలన్నర రోజుల్లో ముగిసిపోనుంది. ఈలోగా రూ.540 కోట్లను రుణాలుగా ఇచ్చే అవకాశం ఉండదని పలువురు పేర్కొంటున్నారు. మొండి బకాయిలను తగ్గించామని అధికారులు పేర్కొంటున్నా.. ఇంకా వసూలు కావా ల్సిన మొత్తం రూ.40 కోట్ల వరకు ఉంది. చర్యలు చేపడతాం జిల్లాలోని మహిళా సంఘాలకు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.660 కోట్లను బ్యాంకుల ద్వారా రుణాలు అందించాం. మొండి బకాయిల వసూళ్లకు చర్యలు తీసుకున్నాం. ఈ ఆర్థిక సంవత్సరం ముగిసే సమయానికి లక్ష్యాన్ని చేరుకునేలా చర్యలు తీసుకుంటున్నాం. – కె.శ్రీనివాసులు, డిఆర్డిఎ ప్రాజెక్టు డైరెక్టర్ -
అప్పుల పాలై కౌలు రైతు ఆత్మహత్య
విజయపురిసౌత్ (గుంటూరు) : మాచర్ల మండలంలోని అనుపు చెంచుకాలనీకి చెందిన కౌలు రైతు వేసిన పంటపొలం పండకపోవడంతో పురుగుమందు తాగి ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన గురువారం చోటు చేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి. గ్రామానికి చెందిన నూన్సావత్ హనుమానాయక్(47) గత మూడేళ్లుగా 9 ఎకరాల పొలం కౌలుకు తీసుకొని పండిస్తున్నాడు. గత మూడేళ్లుగా వర్షాలు సరిగ్గా కురవకపోవడంతో పంట చేతికి రాక అప్పలపాలయ్యాడు. ఈ ఏడాది తొమ్మిది ఎకరాల కౌలు పొలంలో పత్తి, మిర్చి వేయగా, సొంత పొలం అయిన ఒకటిన్నర ఎకరంలో కంది పంట వేశాడు. వర్షాలు ఆలస్యంగా కురవడంతో పంట ఎండిపోయిందనే బాధతో ఆత్మహత్యకు పాల్పడినట్టు గ్రామస్తులు తెలిపారు. ఉదయం పొలంకు వెళ్లి వస్తానని ఇంటి నుంచి బయలుదేరిన హనుమానాయక్ వెంట తెచ్చుకున్న పురుగుమందును తాగడంతో వాంతులు చేసుకున్నాడు. పక్క పొలంలో పొలం దున్నతున్న మోతీలాల్ అది గమనించి దగ్గరకు వెళ్లి చూడగా నోటి నుంచి నురుగులు వస్తుండడంతో హనుమానాయక్ సెల్ఫోన్ నుంచి కుటుంబ సభ్యులకు సమాచారం అందించాడు. దీంతో హనుమానాయక్ కుటుంబ సభ్యులు గ్రామానికి నాలుగు కిలో మీటర్ల దూరంలో ఉన్న పొలానికి హుటాహుటిన చేరుకొని హనుమానాయక్ను గ్రామంలోకి తీసుకువస్తుండగా మృతి చెందాడు. మృతుడికి భార్య భారతి, ఇద్దరు కుమారులు, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. -
నిబద్ధతకు ప్రశంస
ఒంగోలు క్రైం: కృష్ణా పుష్కరాల సందర్భంగా నిబద్ధతతో విధులు నిర్వర్తించిన 1,850 మంది పోలీసులకు గుంటూరు రేంజ్ ఐజీ ఎన్.సంజయ్ ప్రశంస పత్రాలు అందించారు. ఈ మేరకు స్థానిక పోలీస్ కల్యాణ మండపంలో శుక్రవారం రాత్రి జరిగిన అభినందన సభకు ఐజీ ముఖ్య అతిథిగా హాజర య్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కృష్ణ పుష్కరాల్లో జిల్లా పోలీసులు కూడా నిబద్ధతతో విధులు నిర్వర్తించారని కొనియాడారు. హోంగార్డు మొదలుకొని ఎస్పీ డాక్టర్ సీఎం త్రివిక్రమ వర్మ వరకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా విజయవంతంగా పనిచేశారన్నారు. పోలీసులతో పాటు ఎన్సీసీ, ఎన్ఎస్ఎస్ వలంటీర్లు కూడా బాగా పనిచేశారని కీర్తించారు. ఎన్సీసీ, ఎన్ఎస్ఎస్ వలంటీర్లు పోలీస్ డిపార్ట్మెంట్లో చేరాలనుకోవాలంటే ఆయా కాలేజీల నుంచి కోరితే అలాంటి వారికి పోలీస్ డిపార్ట్మెంట్ తరుపున ప్రత్యేకంగా అవగాహనా సదస్సులు నిర్వహిస్తామని భరోసా ఇచ్చారు. జిల్లా ఎస్పీ డాక్టర్ సీఎం త్రివిక్రమ వర్మ మాట్లాడుతూ జిల్లాలో పుష్కరాల సందర్భంగా ట్రాఫిక్కు ఎలాంటా ఆటంకాలు కలుగకుండా సిబ్బంది పనిచేశార న్నారు. ఎవరికి అప్పగించిన విధులు వారు నిర్వర్తించటంలో నిమగ్నమై సాధారణ ప్రయాణీకులతో పాటు పుష్కర భక్తులకు అసౌకర్యం లేకుండా చేశారని కొనియాడారు. ఓఎస్డి అడ్మిన్ ఏ.దేవదానం, మార్కాపురం ఓఎస్డి కె.లావణ్య లక్ష్మి, ఎన్ఎస్ఎస్ అధికారి సుబ్బారావు, ఎన్సీసీ లెఫ్ట్నెంట్ కల్నల్ అబ్దుల్ రహీం, డీఎస్సీలు, సీఐ, ఎస్సై, ఎన్సీసీ, ఎన్ఎస్ఎస్ వలంటీర్లు పోలీసులు పాల్గొన్నారు.