breaking news
collection agents
-
‘యాప్’సోపాలు.. యువతకు తిప్పలు
సాక్షి, న్యూఢిల్లీ: ‘మీ ఫ్రెండ్ రాజేందర్కు యాక్సిడెంటైంది. అర్జంటుగా డబ్బులు పంపండి’ అంటూ సందేశాలు రావడంతో అవాక్కయిన మిత్రులు వెంటనే రాజేందర్కు ఫోన్ చేశారు. బాగానే ఉన్నాడని తెలిసి ఊపిరి పీల్చుకున్నారు కానీ, ఆ మెసేజ్లు ఎవరు పంపారో మొదట అర్థం కాలేదు. ఆరాతీస్తే రాజేందర్ ఓ యాప్ ద్వారా తీసుకున్న అప్పు సకాలంలో చెల్లించలేదని దాని తాలూకు మనుషులు ఇలా బద్నాం చేశారని తేలింది. ‘మీ కొడుకు తీసుకున్న అప్పు తీర్చకపోతే ఇంట్లో ఏదుంటే అది ఎత్తుకు పోతాం..’ అంటూ ఫోన్లో వచ్చిన బెదిరింపుతో ఓ తండ్రి హతాశుడు అయ్యాడు. ఇంజనీరింగ్ చదివే తన కొడుకు రూ. లక్షలు అప్పు చేసిన ఫలితమని తెలిసి ఆయన తలపట్టుకున్నాడు. ఈ రెండు సందర్భాల్లోనూ కాల్ చేసింది కలెక్షన్ ఏజెంట్లు. వీరంతా వివిధ మనీలెండింగ్ యాప్స్ (అప్పులు ఇచ్చే యాప్స్) కోసం పని చేస్తుంటారు. ఏం చేసైనా ఇచ్చిన అప్పును వడ్డీతో సహా రాబట్టుకునేందుకు ఇటీవల హద్దుమీరుతున్నారు. అప్పు తీసుకున్న వ్యక్తి ఫోన్ కాంటాక్ట్స్ను యాక్సెస్ చేస్తూ, ఆ నంబర్లకు ఫోన్లుచేసి, తప్పుడు సందేశాలు పంపి సమాజంలో చులకన చేస్తున్నారు. వారిపై మానసిక ఒత్తిడి పెంచేందుకు దూకుడుగా వ్యవహరిస్తూ బ్లాక్మెయిల్, బెదిరింపులకు పాల్పడుతున్నారు. ఇలా అప్పిచ్చి.. అలా వేధిస్తూ.. మనీ లెండింగ్ యాప్స్కు మొబైల్ ప్లేస్టోర్స్లో కొదవేం లేదు. ఇవి రూ.1,000–రూ.15 లక్షల దాకా అప్పులిస్తూ, రూ.1 నుంచి రూ.3 వరకు వడ్డీ వసూలు చేస్తున్నాయి. వీటిని డౌన్లోడ్ చేసుకునే క్రమంలో కంపెనీ షరతులను అంగీకరించాల్సి ఉంటుంది. చిరునామా, వ్యక్తిగత వివరాలు, ఆధార్, పాన్ నంబర్ అందించాలి. విద్యార్థులకైతే ఆధార్, కాలేజీ ఐడీ కార్డు సరిపోతుంది. అలాగే, ఫోన్ కాంటాక్ట్స్ను యాక్సెస్ చేయమంటారా? అని అడుగు తుంది. దీన్ని వినియోగదారులు పట్టించుకోక ‘ఓకే’ కొడుతున్నారు. దీంతో రుణగ్రహీతల ఫోన్ నంబర్లన్నీ యాప్ యాజమాన్యానికి యాక్సెస్ అవుతున్నాయి. దీన్ని అవకాశంగా తీసుకుంటున్న కలెక్షన్ ఏజెంట్లు.. అప్పు తీసుకున్న వ్యక్తి కాంటాక్ట్స్లోని ఆత్మీయులు, కుటుంబసభ్యులకు ఫోన్చేసి ఇబ్బందుల పాల్జేస్తున్నారు. అప్పు మీద అప్పు.. పెరుగుతున్న ముప్పు లాక్డౌన్తో సూక్ష్మ, చిన్న తరహా పరిశ్రమల్లోని ఉద్యోగులు, కార్మికులు ఆర్థిక సంక్షోభంలో పడ్డారు. టీచర్లు, సినిమా టాకీస్ఉద్యోగులు, ఔట్సోర్సింగ్ కార్మికులు ఇతర రంగాలకు చెందినవారు ఏడు నెలలుగా వేతనాల్లేక అల్లాడుతున్నారు. ఇలాంటి వారు తెలిసిన వారి దగ్గర అప్పులు చేసి ఇంతకాలం నెట్టుకొచ్చారు. వాటిని తిరిగి తీర్చలేక, ఇంటి అవసరాల కోసమని మరోసారి అప్పులు చేసేందుకు అప్పుల యాప్లపై ఆధారపడుతున్నారు. చిన్నమొత్తంలో అప్పు చేసేవారికి ఫర్వాలేదు గానీ, భారీ మొత్తాల్లో అప్పుచేస్తే ఆ అప్పుల వసూళ్లకు కలెక్షన్ ఏజెంట్లు రంగంలోకి దిగుతున్నారు. ఇటీవల ఐపీఎల్ మొదలైనప్పటి నుంచి ఈ యాప్ల ద్వారా అప్పుచేసే యువకులు పెరిగారు. వీరు ఆన్లైన్ గేమ్స్ కోసం కూడా భారీగా అప్పులు చేస్తున్నారు. ఇటీవల లక్సెట్టిపేటలో ఓ యువకుడు రూ.15 లక్షలు ఇదే తరహాలో అప్పుచేసి.. తీర్చే మార్గంలేక ఆత్మహత్య చేసుకున్నాడు. ఆర్బీఐ నిబంధనలకు వ్యతిరేకం అప్పు వసూలుకు వేధించడం, ఫోన్ కాంటాక్టులను యాక్సెస్చేసి బ్లాక్మెయిల్ చేయడం ఆర్బీఐ నిబంధనలకు వ్యతిరేకం. రూ.20 వేలలోపు ఉండే చిన్న రుణాల వసూలులోనూ కలెక్షన్ ఏజెంట్లు ఇష్టానుసారం వ్యవహరించడంపై బాధితులు వాపోతున్నారు. దీనిపై యాప్ల యాజమాన్యాలకు ఫిర్యాదు చేస్తే, ‘మా దృష్టికి రాలేదంటూ’ తప్పించుకునే యత్నం చేస్తున్నారు. వాస్తవానికి కంపెనీ సహకారం లేకుండా.. కాంటాక్ట్స్ కలెక్షన్ ఏజెంట్ల చేతుల్లోకి వెళ్లడం అసాధ్యమని పలువురు అంటున్నారు. బ్లాక్మెయిల్ చేస్తే సంప్రదించండి అప్పు తీసుకున్న వారి కాంటాక్టులు యాక్సెస్ చేసి బ్లాక్మెయిల్ చేయడం చట్టవిరుద్ధం, నేరం. ఇలాంటి వేధింపులకు పాల్పడితే మౌనంగా భరించవద్దు. వెంటనే సైబర్ సెల్ను సంప్రదించాలి. బాధితులు విద్యార్థినులు, మహిళలైతే విమెన్ సేఫ్టీవింగ్ను ఆశ్రయించాలి. – స్వాతి లక్రా, ఏడీజీ ఆ ఉచ్చులో పడనీయొద్దు నేటి విద్యార్థులు ప్రమాదకర టెక్నాలజీ మధ్య ఉన్నారు. సెలబ్రిటీల జీవితాలను కాపీ కొట్టేందుకు బెట్టింగ్, మనీలెండింగ్ యాప్లు డౌన్లోడ్ చేసుకుం టున్నారు. యాంటీ ర్యాగింగ్ స్క్వాడ్ తరహాలోనే ప్రతీ కాలేజీలో ప్రత్యేక సెల్స్ ఏర్పాటుచేసి విద్యార్థులు ఇలాంటి ఉచ్చులో పడకుండా చూడాలి. –డాక్టర్ శారద, ప్రొఫెసర్, ఓయూ -
అమ్మకానికి పదవులు
నామినేటెడ్ కోసం తమ్ముళ్ల ఆరాటం చక్రం తిప్పుతున్న పుత్రరత్నాలు పోస్టుకో రేటు..భారీగా వసూళ్లు సాక్షి, విశాఖపట్నం: ప్రతిపక్షంలో ఉండగా పదేళ్లపాటు పార్టీ జెండా మోసి..గడిచిన ఎన్నికల్లో పార్టీ విజయం కోసం రేయింబవళ్లు శ్రమించిన సీనియర్లకు సంక్రాంతిలోగా నామినేటెడ్ పదవులు కట్టబెట్టాలని టీడీపీ అధినాయకత్వం భావించింది. కానీ ఎన్నికల్లో చేసిన ఖర్చులో కాసింతైయినా ఈ పదవుల కేటాయింపు ద్వారా భర్తీ చేసుకోవాలని ఆలోచనతో జిల్లా నాయకత్వం చేస్తున్న జాప్యం పట్ల పార్టీలోనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మరీ ముఖ్యం గా జిల్లా పార్టీలో చక్రం తిప్పుతున్న ప్రభుత్వ ‘పెద్దల’ కుటుంబ సభ్యులు ఈ పదవుల పందేరానికి కలెక్షన్ ఏజెంట్లుగా అవతారమెత్తి అందినకాడకి దండుకుంటున్నారన్న ఆరోపణలున్నాయి. అధినేతే స్వయంగా ఆదేశించడంతో సంక్రాంతిలోగానే నామినేటెడ్ పదవుల పందారం కొలిక్కివస్తుందని పార్టీ శ్రేణులు కళ్లల్లో ఒత్తులేసుకుని నిరీక్షించారు. కానీ జిల్లా ప్రజా ప్రతినిధులు వారి ఆశలపై నీళ్లు చల్లారు. ఎడముఖం..పెడముఖంగా ఉన్న ప్రభుత్వ పెద్దలిద్దరూ ఎవరికి వారు జాబితాలు సిద్ధం చేశారు. సొంత నియోజకవర్గాలకు పరిమితం కాకుండా తమ వెంట తిరిగే ఎమ్మెల్యేల నియోజకవర్గాల పరిధిలోని పదవులకు కూడా తమ పెత్తనమే సాగేలా చక్రం తిప్పారు. దీంతో ఆశావహులంతా తమ ప్రజాప్రతినిధుల ద్వారా వీర్ని ప్రసన్నం చేసుకునేందుకు మూడు నెలలుగా చెప్పులరిగేలా తిరిగారు. తీరా సమయం వచ్చేసరికి మా అబ్బాయిని కలవండి..మా ఆవిడిని కలవండంటూ వారికి సంకేతాలివ్వడంతో చేసేది లేక వార్ని కూడా కలుస్తూ ప్రసన్నం చేసుకునేందుకు పడరాని పాట్లు పడుతున్నారు. యువనేతలైతే ఏకంగా హుండీలు పెట్టేసి పదవికింత అని వసూళ్లకు పాల్పడుతున్నారనే విమర్శలు పార్టీలోనే బలంగా వినిపిస్తున్నాయి. సింహాచలం దేవస్థానం ట్రస్టీ పదవుల నుంచి వ్యవసాయ మార్కెట్ కమిటీ అధ్యక్ష పదవుల వరకు పోస్టుకో రేటు చొప్పున వసూలు చేస్తున్నట్టుగా పార్టీలోనే గుసగుసలు వినిపిస్తున్నాయి. ఒక్క భీమిలి మార్కెట్ కమిటీ చైర్మన్ పదవి కోసం ఏకంగా రూ.15 లక్షల వరకు చేతులుమారినట్టుగా పార్టీలో చర్చసాగుతోంది. ఇదే రీతిలో మిగిలిన మార్కెట్ కమిటీ అధ్యక్ష పదవుల ద్వారా తమ గళ్లాపెట్టె నింపుకునేందుకు ఈ ప్రభుత్వ పెద్దల కుటుంబ సభ్యులు వసూళ్లకు పాల్పడుతున్నట్టు తెలుస్తోంది. పోటీ ఎక్కువగా ఉన్న పదవులకైతే ఏకంగా వేలం పాటలు సైతం పెట్టినట్టుగా వినికిడి. ఈ విధంగా దాదాపు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ పదవులన్నింటికి రూ.10లక్షల నుంచి రూ.15 లక్షల వరకు చేతులు మారినట్టుగా పార్టీలోనే అంతర్గతంగా చర్చ జరుగుతోంది. సింహాచలం దేవస్థానం మినహా ఇతర పేరొందిన దేవస్థానాల పాలక మండళ్ల విషయంలో ఇదే రీతిలో కలెక్షన్స్ సాగిస్తున్నట్టుగా చెబుతున్నారు. రాష్ర్టస్థాయి పదవుల భర్తీ కోసం పార్టీ యువనేత రాజధానిలో హుండీపెడితే ఆయన్ని ఆదర్శంగా తీసుకుని జిల్లా స్థాయి పదవుల పందారం కోసం ఇక్కడి యువనేతలు స్థానికంగా హుండీలు పెట్టి వసూలు చేస్తున్నారనే విమర్శలున్నాయి. ఇలాగైతే పదేళ్ల పాటు పార్టీ కోసం రెక్కలు ముక్కలు చేసుకుని అప్పుల పాలై పోయిన మాబోటి వాళ్ల పరిస్థితి ఏమిటని పార్టీ సీనియర్ కార్యకర్తలు ప్రశ్నిస్తున్నారు. నిన్నమొన్నటి వరకు నామినేటెడ్ పదవులు మీవే అంటూ ఊరించిన ప్రభుత్వ పెద్దలు ఇప్పుడు ముఖం చాటేస్తున్నారని వారు మండిపడుతున్నారు. ఎన్నికల ముందు తమతో పాటు వలస వచ్చిన..ఎన్నికలనంతరం తమతో అంటకాగే వారికి పదవులు కట్టెబెట్టేందుకు వీరు సిద్ధమవుతుండడం పట్ల పార్టీ సీనియర్లు అగ్గిమీదగుగ్గిలమవుతున్నారు.