breaking news
China Open Badminton
-
ఐదులో నాలుగు చైనాకే...
చాంగ్జౌ: బ్యాడ్మింటన్ సీజన్లోని చివరి వరల్డ్ టూర్ సూపర్–1000 టోర్నీ చైనా ఓపెన్లో చైనా క్రీడాకారులు తమ ఆధిపత్యాన్ని చాటుకున్నారు. మొత్తం ఐదు విభాగాలకుగాను నాలుగు విభాగాల్లో టైటిల్స్ దక్కించుకున్నారు. పురుషుల సింగిల్స్, మహిళల సింగిల్స్, డబుల్స్, మిక్స్డ్ డబుల్స్ విభాగాల్లో చైనా క్రీడాకారులే ఫైనల్ చేరుకున్నారు. ఫలితంగా విన్నర్స్, రన్నరప్గా చైనా ప్లేయర్లే నిలిచారు. పురుషుల సింగిల్స్ ఫైనల్లో ప్రపంచ రెండో ర్యాంకర్ షి యు కి (చైనా) 64 నిమిషాల్లో 14–21, 21–14, 21–15తో ప్రపంచ 23వ ర్యాంకర్ వాంగ్ జెంగ్ జింగ్ (చైనా)పై గెలిచాడు.మహిళల సింగిల్స్ ఫైనల్లో ప్రపంచ రెండో ర్యాంకర్ వాంగ్ జి యి (చైనా) 39 నిమిషాల్లో 21–8, 21–13తో ప్రపంచ మూడో ర్యాంకర్ హాన్ యువె (చైనా)పై విజయం సాధించింది. మహిళల డబుల్స్ ఫైనల్లో ప్రపంచ నంబర్వన్ జోడీ లియు షెంగ్ షు–టాన్ నింగ్ (చైనా) 69 నిమిషాల్లో 24–22, 17–21, 21–14తో ప్రపంచ ఏడో ర్యాంక్ జాంగ్ షు జియాన్–జియా యి ఫాన్ (చైనా) ద్వయంపై నెగ్గింది. మిక్స్డ్ డబుల్స్ ఫైనల్లో ప్రపంచ నంబర్వన్ జంట ఫెంగ్ యాన్ జె–హువాంగ్ డాంగ్ పింగ్ 47 నిమిషాల్లో 23–21, 21–17తో ప్రపంచ రెండో ర్యాంక్ జోడీ జియాంగ్ జెన్ బాంగ్–వె యా జిన్ (చైనా)పై గెలుపొందింది. పురుషుల డబుల్స్ విభాగంలో ప్రపంచ 210వ ర్యాంక్ జోడీ ఫజర్ అల్ఫీయాన్–మొహమ్మద్ షోహిబుల్ ఫిక్రీ (ఇండోనేసియా) ద్వయం 21–15, 21–14తో ప్రపంచ రెండో ర్యాంక్ జోడీ ఆరోన్ చియా–సో వుయ్ యిక్ (మలేసియా)పై సంచలన విజయం సాధించి టైటిల్ను దక్కించుకుంది. పురుషుల, మహిళల సింగిల్స్ విజేతలకు 1,40,000 డాలర్ల చొప్పున (రూ. 1 కోటీ 21 లక్షలు) ప్రైజ్మనీతోపాటు 12,000 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి. పురుషుల డబుల్స్, మహిళల డబుల్స్, మిక్స్డ్ డబుల్స్ విజేత జోడీలకు 1,48,000 డాలర్ల చొప్పున (రూ. 1 కోటీ 28 లక్షలు) ప్రైజ్మనీతోపాటు 12,000 ర్యాంకింగ్ పాయింట్లు దక్కాయి. -
సెమీస్లో ఓడిన సాత్విక్ జోడీ
చాంగ్జౌ: భారత అగ్ర శ్రేణి బ్యాడ్మింటన్ జోడీ సాత్విక్ సాయిరాజ్ –చిరాగ్ షెట్టి చైనా ఓపెన్ సూపర్–1000 బ్యాడ్మింటన్ టోర్నమెంట్ సెమీఫైనల్లో నిష్క్రమించింది. శనివారం జరిగిన పురుషుల డబుల్స్ సెమీఫైనల్లో సాత్విక్–చిరాగ్ జంట 13–21, 17–21తో మలేసియాకు చెందిన రెండో సీడ్ ఆరోన్ చియా–సో వుయి యిక్ ద్వయం చేతిలో పరాజయం చవిచూసింది. 2022 ప్రపంచ చాంపియన్ జోడీ ఆరోన్–సో వుయి మ్యాచ్ ఆరంభం నుంచే పట్టుదలగా ఆడటంతో భారత షట్లర్లకు పుంజుకునే అవకాశం లేకపోయింది. ఆసియా క్రీడల చాంపియన్ జోడీ అయిన సాత్విక్–చిరాగ్లకు మలేసియన్ జంట కొరకరాని కొయ్యగా మారింది. ఇప్పటివరకు 14 సార్లు ఈ రెండు జోడీలు పోటీపడగా ఏకంగా 11 సార్లు మలేసియన్ జంటే గెలుపొందింది. భారత జోడీ 3 సార్లు గెలిచింది. ఓవరాల్గా ఈ సీజన్లో భారత షట్లర్ల జోడీ నిలకడగా రాణిస్తోంది. ఇండియా ఓపెన్, సింగపూర్ ఓపెన్, మలేసియా ఓపెన్లలోనూ సాత్విక్–చిరాగ్ ద్వయం సెమీఫైనల్లోకి ప్రవేశించింది. -
చైనా ఓపెన్లో భారత షట్లర్లకు చుక్కెదురు.. తొలి రౌండ్లోనే ముగ్గురు ఇంటిముఖం
చైనా ఓపెన్లో భారత షట్లర్లకు భారీ షాక్ తగిలింది. పురుషుల సింగిల్స్ తొలి రౌండ్లోనే ఏకంగా ముగ్గురు ఇంటిముఖం పట్టారు. వీరిలో స్టార్ షట్లర్లు హెచ్ఎస్ ప్రణయ్, లక్ష్యసేన్, ప్రియాన్షు రజావత్ ఉన్నారు. ప్రపంచ ఆరో ర్యాంకర్ ప్రణయ్కు మలేసియా ఆటగాడు, వరల్డ్ నంబర్ 22 ప్లేయర్ జీ యంగ్ చేతిలో పరాభవం (21-12, 13-21, 21-18) ఎదురవగా.. లక్ష్యసేన్ను డెన్మార్క్ ఆటగాడు, వరల్డ్ నంబర్ 10 షట్లర్ ఆండర్స్ ఆంటన్సన్ 23-21, 16-21, 21-9 తేడాతో ఓడించాడు. గతేడాది జరిగిన వరల్డ్ ఛాంపియన్షిప్స్లో కాంస్య పతకం సాధించి జోరు మీదున్న ప్రణయ్ను జీ యంగ్ 66 నిమిషాల్లో ఓడించగా.. లక్ష్యసేన్ను ఆంటన్సన్ 78 నిమిషాల్లో మట్టికరిపించాడు. అంతకుముందు ప్రియాన్షు రజావత్ను ఇండొనేసియాకు చెందిన షెసర్ హిరెన్ వరుస సెట్లలో (21-13, 26-24) ఓడించాడు. మరోవైపు ఈ టోర్నీలో పాల్గొంటున్న ఏకైక భారత మహిళల డబుల్స్ జోడీ గాయత్రి గోపీచంద్-ట్రీసా జాలీ కూడా ఇంటీబాట పట్టారు. ఈ జోడీ చైనా టాప్ సీడ్ పెయిర్ చెన్ కింగ్ చెన్-జియా ఇ ఫాన్ చేతిలో 18-21, 11-21 వరుస సెట్లలో ఓటమిపాలైంది. పురుషుల డబుల్స్ విభాగంలో అర్జున్-దృవ్ కపిల (భారత్) జోడీ.. జపాన్ ద్వయం కెయ్చిరో మట్సుయ్-యోషినోరి టెకుచీ చేతిలో పోరాడి ఓడింది (23-21, 21-19). కాగా, భారత స్టార్ షట్లర్ పీవీ సింధు ఈ టోర్నీ నుంచి నిన్ననే నిష్క్రమించింది. -
సింధు జోరుకు బ్రేక్
చాంగ్జౌ (చైనా): ప్రపంచ చాంపియన్ హోదాలో... మరో ప్రతిష్టాత్మక బ్యాడ్మింటన్ టైటిల్ లక్ష్యంగా చైనా ఓపెన్లో అడుగుపెట్టిన పీవీ సింధు ఆ అంచనాలను అందుకోలేకపోయింది. ర్యాంకింగ్స్లో తన కంటే కింది స్థానంలో ఉన్న పొర్న్పవీ చొచువోంగ్ (థాయ్లాండ్) చేతిలో ఓడి నిరాశ పరిచింది. గురువారం జరిగిన వరల్డ్ టూర్ సూపర్–1000 బ్యాడ్మింటన్ టోర్నీ మహిళల సింగిల్స్ రెండో రౌండ్ మ్యాచ్లో సింధు 21–12, 13–21, 19–21తో ప్రపంచ 15వ ర్యాంక్ షట్లర్ చొచువోంగ్ చేతిలో కంగుతింది. ఆధిక్యం ప్రదర్శించినా... ప్రస్తుత ఫామ్ దృష్ట్యా చొచువోంగ్పై సింధు విజయం ఖాయం అని అందరూ అనుకున్నారు. దీనికి తగ్గట్లే చక్కటి స్మాష్లతో విరుచుకుపడ్డ సింధు... వరుసగా పాయింట్లు సాధించి 21–12తో తొలి గేమ్ను గెల్చుకుంది. రెండో గేమ్ నుంచి మాత్రం సీన్ రివర్స్ అయింది. అనూహ్యంగా గాడి తప్పిన సింధు ఆట ప్రత్యర్థికి వరంలా మారింది. వరుసగా 5 పాయింట్లు సాధించిన చొచువోంగ్ 5–1తో, ఆ తర్వాత మరోసారి వరుసగా ఆరు పాయింట్లు కొల్లగొట్టి 15–7తో తిరుగులేని ఆధిక్యంలోకి వెళ్లింది. ఈ పట్టును నిలుపుకున్న థాయ్లాండ్ షట్లర్ రెండో గేమ్ను సొంతం చేసుకుంది. ఇది ఆమెలో ఆత్మవిశ్వాసాన్ని పెంచింది. నిర్ణాయక మూడో గేమ్లో తొలి 12 పాయింట్ల తర్వాత ఇద్దరూ సమంగా నిలిచారు. ఈ దశలో సింధు వరుసగా పాయింట్లు సాధిస్తూ 19–15తో ఆధిక్యంలో నిలిచింది. విజయానికి కేవలం రెండు పాయింట్ల దూరంలో ఉన్న సమయంలో థాయ్ అమ్మాయి అనూహ్యంగా పుంజుకుంది. చొచువోంగ్ వరుసగా 6 పాయింట్లు సాధించి సింధు కళ్ల ముందే మ్యాచ్ను లాగేసుకుంది. క్వార్టర్స్లో సాయి ప్రణీత్ పురుషుల సింగిల్స్ రెండో రౌండ్ మ్యాచ్లో ప్రపంచ చాంపియన్షిప్ కాంస్య పతక విజేత భమిడిపాటి సాయిప్రణీత్ 21–19, 21–19తో లూ గాంగ్ జూ (చైనా)పై విజయం సాధించి క్వార్టర్స్లో ప్రవేశించాడు. మరో భారత అటగాడు పారుపల్లి కశ్యప్ 21–23, 21–15, 12–21తో ఆంథోని సింసుక గింటింగ్ (ఇండోనేసియా) చేతిలో పోరాడి ఓడాడు. డబుల్స్లోనూ నిరాశే.. డబుల్స్ విభాగాల్లో పోటీ పడుతున్న భారత జోడీలు రెండో రౌండ్లో ఓడి నిరాశ పరిచాయి. పరుషుల డబుల్స్లో సాత్విక్ సాయిరాజ్– చిరాగ్ శెట్టి (భారత్) 19–21, 8–21తో తకెషి కముర– కిగో సొనొడ (జపాన్) చేతిలో వరుస గేమ్లలో చిత్తయ్యారు. అనంతరం జరిగిన మిక్స్డ్ డబుల్స్లోనూ సాత్విక్ సాయిరాజ్– అశ్విని పొన్నప్ప ద్వయం 11–21, 21–16, 12–21తో ప్రపంచ నాలుగో ర్యాంక్ యూకి కనెకొ– మిసాకి మట్సుటొమొ (జపాన్) జంట చేతిలో పోరాడి ఓడింది. మహిళల డబుల్స్లో సిక్కిరెడ్డి– అశ్విని పొన్నప్ప జోడి 12–21, 17–21తో మిసాకి మట్సుటొ మొ– అయక తకహాషి (జపాన్) చేతిలో ఓడింది. -
సింధు విన్.. సైనా అవుట్
ఫుజూ (చైనా): చైనా ఓపెన్ సూపర్ సిరీస్ ప్రీమియర్ బ్యాడ్మింటన్ టోర్నీ మహిళల సింగిల్స్ లో భారత కు మిశ్రమ ఫలితాలు వచ్చాయి. సైనా నెహ్వాల్ ఓడిపోగా, పీవీ సింధు శుభారంభం చేసింది. తొలి మ్యాచ్ లో పోర్న్టిప్ బురానాప్రాసెర్ట్సుక్ (థాయ్లాండ్)తో తలపడిన సైనా 16-21, 21-19, 14-21తో పరాజయం పాలైంది. మొదటి గేమ్ లో వెనుబడిన సైనా రెండో గేమ్ లో పుంజుకుంది. నిర్ణయాత్మక మూడో గేమ్ లో తడబడడంతో ఆమె పోరాటం ముగిసింది. దాదాపు గంటసేపు మ్యాచ్ జరిగింది. మోకాలికి శస్త్ర చికిత్స చేయించుకొని కోలుకున్నాక సైనా ఆడిన తొలి టోర్నీ ఇదే. మరో మ్యాచ్ లో చైనీస్ తైపీ క్రీడాకారిణి చియా సిన్ లీపై పీవీ సింధు విజయం సాధించింది. వరుస గేముల్లో సిన్ లీని 21-12, 21-16తో ఓడించి రెండో రౌండ్ లోకి దూసుకెళ్లింది. 34 నిమిషాల్లోనే మ్యాచ్ ముగించింది. పురుషుల సింగిల్స్లో అజయ్ జయరాం, హెచ్ఎస్ ప్రణయ్ శుభారంభం చేశారు. జు సియాఉన్ (చైనా)పై జయరాం 21-19, 20-22, 21-17తో విజయం సాధించాడు. ఎన్జీ కా లాంగ్ అంగుస్ (హాంకాంగ్)తో తలపడిన ప్రణయ్ 21-13, 21-13తో గెలిచి రెండో రౌండ్ లోకి దూసుకెళ్లాడు.