breaking news
Bhakta
-
వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో భక్త కనకదాసు జయంతి వేడుకలు
సాక్షి, తాడేపల్లి: సాహిత్యంతో సామాజిక విప్లవం సాధించవచ్చని నిరూపించిన మహానుభావుడు భక్త కనకదాసు అని కురుబ సంఘం నాయకులు కీర్తించారు. వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో భక్త కనకదాసు 538వ జయంతి వేడుకలను శనివారం ఘనంగా నిర్వహించారు. పార్టీ కార్యాలయ ఇన్చార్జి, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఏపీ కురుబ కురుమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గడ్డం రామకృష్ణతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల నుంచి వచ్చిన కురుబ నాయకులు పాల్గొన్నారు.భక్త కనకదాసు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన అనంతరం పుష్పాంజలి ఘటించారు. వైఎస్సార్సీపీ అధ్యక్షులు వైఎస్ జగన్ ఆదేశాలతో భక్త కనకదాసు జయంతి వేడుకలను పార్టీ కేంద్ర కార్యాలయంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని జిల్లా కార్యాలయాల్లో నిర్వహిస్తున్నందుకు వారు ధన్యవాదాలు తెలియజేశారు.భక్త కనకదాసు స్ఫూర్తితోనే మాజీ సీఎం వైయస్ జగన్ సామాజిక అంతరాలు తొలగించేలా పాలన అందించారని కొనియాడారు. వెనుకబడిన బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలకు రాజకీయ పదవులు ఇచ్చి ప్రోత్సహించారని గుర్తు చేసుకున్నారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక భక్త కనకదాసు విగ్రహంతో పాటు ఆయన పేరుతో సామాజిక భవనం ఏర్పాటు చేయాలని కురుబ సోదరులు కోరగా ఈ విషయాన్ని పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్ దృష్టికి తప్పకుండా తీసుకెళ్తానని ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి వారికి హామీ ఇచ్చారు. గడ్డం రామకృష్ణ మాట్లాడుతూ.. పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్ ఆదేశాలతో భక్త కనకదాసు 538వ జయంతి వేడుకలు పార్టీ కేంద్ర కార్యాలయంతోపాటు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని జిల్లా కార్యాలయాల్లో నిర్వహిస్తున్నందుకు సంతోషంగా ఉంది. వచ్చే ఏడాది నుంచి రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గంలోనూ భక్త కనకదాసు జయంతి వేడుకలు నిర్వహించబోతున్నాం. మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ మాట్లాడుతూ.. ప్రముఖ రచయిత, కవి, ఆధ్యాత్మిక వేత్త భక్త కనకదాసు కుల దురహంకారంపై సాహిత్యమనే ఆయుధంతో పోరాడి సామాజిక విప్లవం తీసుకొచ్చారు. భక్త కనకదాసు స్ఫూర్తితోనే మాజీ సీఎం వైయస్ జగన్ సైతం కులదురహంకారంపై పోరాడి తన పాలన ద్వారా వెనుకబడిన వర్గాలకు అండగా నిలిచారు. కులాల మధ్య అంతరాలు తొలగించడానికి బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాలను రాజకీయంగా ప్రోత్సహించారు. పార్టీ, ప్రభుత్వంలో ఉన్నత పదవులు కల్పించి ముందుకు నడిపించారు.ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి మాట్లాడుతూ.. సాహిత్యంతో సామాజిక విప్లవం సాధించవచ్చని నిరూపించిన మహానుభావుడు శ్రీ భక్త కనకదాసు. కురుబ గౌడ దాస సమాజానికి ఆరాధ్య ధైవంగా నిలిచారు. పార్టీ అధ్యక్షులు శ్రీ వైయస్ జగన్ ఆదేశాలతో శ్రీకృష్ణ భగవానుడికి గొప్ప భక్తుడైన శ్రీ భక్త కనకదాసు జయంతి వేడుకలను పార్టీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించడం జరుగుతోంది. రానున్న రోజుల్లో వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చాక భక్త కనకదాసు విగ్రహం ఏర్పాటుతో పాటు భవన నిర్మాణం చేయాలని కురుబ సోదరులు కోరుతున్నారు. ఈ విషయాన్ని ఖచ్చితంగా పార్టీ అధ్యక్షులు శ్రీ వైయస్ జగన్ దృష్టికి తీసుకెళతానని హామీ ఇస్తున్నాను. భక్త కనకదాసు స్ఫూర్తితో మాజీ సీఎం వైయస్ జగన్ తన ఐదేళ్ల పాలనలో వెనుకబడిన వర్గాల ఉన్నతికి ఎంతగానో కృషిచేశారు. రాజకీయంగా అవకాశాలు కల్పించి అండగా నిలిచారు. రానున్న రోజుల్లోనూ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇదే సాంప్రదాయాన్ని కొనసాగిస్తోందని ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి స్పష్టం చేశారు. -
భక్త కనకదాసకు వైఎస్ జగన్ నివాళి
సాక్షి, తాడేపల్లి: భక్త కనకదాస జయంతి సందర్భంగా వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నివాళులర్పించారు. ‘‘కులమత భేదాల గోడల్ని చెరిపేసిన భక్తి యోధుడు, శ్రీకృష్ణ భగవానుడికి గొప్ప భక్తుడు శ్రీ భక్త కనకదాస. సాహిత్యంతో సామాజిక విప్లవం సాధించవచ్చని నిరూపించిన మహానుభావుడు ఆయన. ఎన్నో భక్తి కీర్తనలతో కవిత్వానికి కొత్త ఊపిరి పోశారు. కురుబ గౌడ దాస సమాజానికి ఆరాధ్య ధైవంగా నిలిచిన శ్రీ భక్త కనకదాస జయంతి సందర్భంగా నివాళులు’’ అంటూ వైఎస్ జగన్ ట్వీట్ చేశారు.వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో..వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో ఘనంగా భక్త కనకదాస జయంతి నిర్వహించారు. కనకదాస చిత్ర పటానికి వైఎస్సార్సీపీ నేతలు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్, కుము-కురబ నేత గడ్డం రామకృష్ణ తదితరులు హాజరయ్యారు.కులమత భేదాల గోడల్ని చెరిపేసిన భక్తి యోధుడు, శ్రీకృష్ణ భగవానుడికి గొప్ప భక్తుడు శ్రీ భక్త కనకదాస. సాహిత్యంతో సామాజిక విప్లవం సాధించవచ్చని నిరూపించిన మహానుభావుడు ఆయన. ఎన్నో భక్తి కీర్తనలతో కవిత్వానికి కొత్త ఊపిరి పోశారు. కురుబ గౌడ దాస సమాజానికి ఆరాధ్య ధైవంగా నిలిచిన శ్రీ భక్త… pic.twitter.com/5y5o1f6IP7— YS Jagan Mohan Reddy (@ysjagan) November 8, 2025 -
దండుకునేందుకేనా..
మేడారం జాతర పనుల్లో అదనపు ప్రతిపాదనలు కాంట్రాక్టర్ల కోసమే ఇంజనీర్ల నివేదికలు అవసరం లేకున్నా కొత్తగా పైప్లైన్లు, ఇన్ఫిల్టరేషన్ బావులు ఈ-టెండర్ల దాఖలుకు నేడు చివరి రోజు వరంగల్ : మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర పనులు.. భక్తుల సౌకర్యం కోసం కాకుండా కాంట్రాక్టర్ల మేలు కోసమే అన్నట్లు ప్రతిపాద నలు రూపొందించినట్లు విమర్శలు వస్తున్నాయి. అతిపెద్ద గిరిజన ఉత్సవంగా ప్రసిద్ధిగాంచిన మేడారం జాతరకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులూ కలగకుండా అన్ని రకాల ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ పనుల కోసం రూ.101 కోట్ల నిధులు కూడా విడుదల చేసింది. ప్రభుత్వ శాఖల వారీగా పనులను గుర్తించి.. వాటిని చేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. అరుుతే ఈ పనుల గుర్తింపు పూర్తిగా కాంట్రాక్టర్లకు లబ్ధి కలిగే తీరుగా సాగిందని, నిధులను ఖర్చు చేయడం ఒక్కటే లక్ష్యంగా అధికారులు పనులను రూపొందించినట్లు విమర్శలు వస్తున్నాయి. గతంలో చేసిన పనులనే మళ్లీ కొత్తగా ప్రతిపాదనల్లో పెట్టడం ఈ విమర్శలకు బలం చేకూరుతోంది. భక్తులకు తాగునీరు అందించేందుకు 2002 జాతర నుంచి పనులు చేపడుతున్నారు. ఇప్పటికే వేల కిలోమీటర్ల మేరకు తాగునీటి పైపు లైన్లు వేశారు. ఇలా పనులు పూర్తి చేసిన ప్రాంతంలోనే మళ్లీ కొత్తగా పైపులైన్లు నిర్మించేందుకు అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. మేడారం జాతరకు వచ్చే భక్తుల తాగునీటి అవసరాలను తీర్చేందుకు గ్రామీణ తాగునీటి సరఫరా(ఆర్డబ్ల్యూఎస్), సమగ్ర గిరిజన అభివృద్ధి సంస్థ(ఐటీడీఏ), సాగునీటి శాఖలు జంపన్నవాగులో ఇప్పటికే 21 చిన్నబావు(ఇన్ఫిల్టరేషన్)లను ఏర్పాటు చేశాయి. భక్తులకు తాగునీటితో పాటు స్నానఘట్టాల్లోని షవర్లకు నీటిని అందించేందుకు వీటిని ఏర్పాటు చేశారు. ప్రభుత్వ శాఖలు సరఫరా చేసే నీరు శుద్ధి చేసినది కాకపోవడంతో జాతరకు వచ్చే భక్తులు సొంతంగానే ఏర్పాట్లు చేసుకుంటున్నారు. మేడారంలో 2012, 2014 జాతరలో భక్తులకు తాగునీటి పరంగా ఎలాంటి ఇబ్బందులూ రాలేదు. భక్తులకు శుద్ధిచేసిన తాగునీటిని సరఫరా చేసే విషయాన్ని పక్కనబెట్టి అవసరం లేకున్నా కొత్తగా పైప్లైన్లు ఏర్పాటు చేసేందుకు అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేయడంపై ఆరోపణలు వస్తున్నాయి. ఆర్డబ్ల్యూఎస్ విభాగం నీటి శుద్ధి ప్రక్రియను ఆలోచించకుండా ప్రతిజాతరకు కొత్తగా వందల కిలో మీటర్ల పొడవున పైప్లైన్లు ఎవరి కోసం నిర్మిస్తున్నారో అర్థంకావడం లేదు. ఆర్డబ్ల్యూఎస్ అధికారుల సహకారంతో కొందరు కాంట్రాక్టర్లు... పాత లైన్లను మరమ్మతులు చేసి, కొత్తగా ఏర్పాటు చేసినట్లు చూపిస్తూ ప్రభుత్వ నిధులను కాజేస్తున్నారనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. నేడు టెండర్లు మేడారం జాతర ఏర్పాట్ల కోసం గ్రామీణ నీటి సరఫరా(ఆర్డబ్ల్యూఎస్) విభాగం కొత్తగా నాలుగు ఇన్ఫిల్టరేషన్ బావులను నిర్మిస్తోంది. వీటి కోసం రూ.28 లక్షలు కేటాయించింది. ఇప్పటికే నిర్మించిన పైపులైన్లకు, కొత్తగా నిర్మించబోయే పైపులైన్ల సామర్థ్యానికి సరిపోయే స్థాయిలో ఇన్ఫిల్టరేషన్ బావులు ఉన్నాయి. అయినా కొత్తగా ఇన్ఫిల్టరేషన్ బావులను తవ్వేందుకు అధికారులు ప్రతిపాదనలు తయారు చేయడం విమర్శలకు తావిస్తోంది. అలాగే తాగునీటి సరఫరా పైపులైన్ల ఏర్పాటు, నిర్వహణ కోసం రూ.4 కోట్లు కేటాయించారు. తాత్కాలిక మరుగుదొడ్ల నిర్మాణానికి రూ.4 కోట్లు ఖర్చు చేయనున్నారు. జాతరకు వచ్చే వీఐపీల కోసం రూ.60 లక్షల వ్యయంతో వెస్ట్రన్ టైపు టాయిలెట్లు నిర్మిస్తారు. సుమారు రూ.8.50 కోట్లతో చేపట్టే ఈ 29 పనులకు ఆర్డబ్ల్యూఎస్ విభాగం ఈ-ప్రొక్యూర్మెంట్ పద్ధతిలో టెండరు ప్రక్రియ చేపట్టింది. పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ విభాగం ఆధ్వర్యంలో రూ.2 కోట్ల వ్యయంతో రోడ్లకు ప్రత్యేక మరమ్మతులు చేపట్టనున్నారు. రెండు శాఖలకు సంబంధించిన పనులకు ఈ-ప్రొక్యూర్మెంట్ టెండరు ప్రక్రియ దాఖలు సోమవారంతో ముగియనుంది. ఏ పనులు ఎవరు చేపట్టాలన్నది రెండుమూడు రోజుల్లో అధికారికంగా తేలనుంది. కాగా, ఈ పనుల చేసే విషయంలో కాంట్రాక్టర్ల మధ్య ఇప్పటికే అంతర్గతంగా ఒప్పందాలు కుదిరినట్టు ప్రచారం జరుగుతోంది.


