breaking news
Best journalist award
-
జర్నలిస్టుల హత్యలు పెరిగిపోతున్నాయి
హైదరాబాద్: జర్నలిస్టులకు భద్రత లేకుండా పోయిందని రామన్ మెగసెసె అవార్డు గ్రహీత, ప్రముఖ పాత్రికేయుడు పాలగుమ్మి సాయినాథ్ ఆందోళన వ్యక్తం చేశారు. మంగళవారం రాత్రి హైదరాబాద్ తెలుగు వర్సిటీ ఎన్టీఆర్ కళా మందిరంలో ప్రముఖ జర్నలిస్ట్ అరుణ్సాగర్ జయంతి వేడుకలు జరిగాయి. ఈ సందర్భంగా ప్రెస్ అకాడమీ అధ్యక్షుడు అల్లం నారాయణ అధ్యక్షతన జరిగిన సభలో సాయినాథ్ మాట్లాడారు. అవినీతికి, కుంభకోణాలకు వ్యతిరేకంగా కథనాలు రాసే జర్నలిస్టులు హత్యకు గురవుతున్నారని.. ఈ హత్యలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. స్ట్రింగర్లు, ఫ్రీలాన్స్ జర్నలిస్టులే హత్యకు గురైన వారిలో ఎక్కువగా ఉన్నారని పేర్కొన్నారు. 1992–2016 మధ్యకాలంలో 50 మంది జర్నలిస్టులను పొట్టన పెట్టుకున్నారని అన్నారు. అనంతరం మీడియా సంక్షోభం గురించి మాట్లాడారు. విద్య సంస్కారాన్ని, సామాజిక బాధ్యతను నేర్పుతుందని.. ఈ రెండు అంశాలకు అరుణ్ సాగర్ జీవితం నిలువుటద్దమని భారీ నీటిపారుదల మంత్రి హరీశ్రావు అన్నారు. ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య జర్నలిస్టులు వారధి వంటి వారన్నారు. పెరిగిపోయిన పోటీతత్వంతో జర్నలిస్టులు ఒత్తిడికి గురై ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారన్నారు. అందుకే దేశంలో ఎక్కడా లేనివిధంగా వారికి హెల్త్కార్డులు ఇచ్చామన్నారు. అరుణ్సాగర్ మరణం జర్నలిజానికి తీరని లోటని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. ఉత్తమ జర్నలిస్టులకు అవార్డుల ప్రదానం ఉత్తమ జర్నలిస్టులకు ఈ సందర్భంగా మంత్రి హరీశ్ అవార్డులు ప్రదానం చేశారు. ప్రముఖ కవి, గాయకుడు గోరటి వెంకన్నకు అరుణ్ సాగర్ సాహితీ పురస్కారం ప్రదానం చేశారు. ఎలక్ట్రానిక్ మీడియాలో ప్రథమ బహుమతి ‘సాక్షి’టీవి అసోసియేట్ ఔట్ పుట్ ఎడిటర్ యాజులు (ఖాకీలు చింపిన బస్తర్)కు, ప్రింట్ మీడియాలో తృతీయ బహుమతి ‘సాక్షి’పెద్దపల్లి ఆర్సీ ఇన్చార్జి కట్ట నరేంద్రచారి (వారికి ఒక రోజు వెలుగులు)కి లభించాయి. అలాగే ఎలక్ట్రానిక్ మీడియాలో ద్వితీయ బహుమతి హెచ్ఎంటీవీ మహబూబ్నగర్ స్టాఫ్ రిపోర్టర్ నరేంద్రచారి (ఆ నలుగురు పిల్లల కథనం)కు, తృతీయ బహుమతి ఈటీవీ ఆదిలాబాద్ విలేకరి మాణికేశ్వర రావు (అరణ్యవాసం)కు లభించాయి. ప్రింట్ మీడియాలో ప్రథమ బహుమతి ‘నమస్తే తెలంగాణ’అంబర్పేట్ జోన్ విలేకరి వర్కాల కిష్టయ్య (మరణము శాపమేనా)కు, ద్వితీయ బహుమతి ‘నవ తెలంగాణ’మహబూబ్నగర్ విలేకరి శివరామ కృష్ణ (తెలంగాణ ఎడారి బతుకు చిత్రం)కు, మరో తృతీయ బహుమతి ‘ఆంధ్రజ్యోతి’హుజూరాబాద్ విలేకరి కోల నాగేశ్వరరావు (గిరిజన కన్నీటి సాగరం)ను వరించాయి. వీరందరినీ హరీశ్రావు అవార్డులతో సత్కరించారు. కార్యక్రమంలో ప్రభుత్వ విప్ పల్లా రాజేశ్వరరెడ్డి, ఎమ్మెల్యే వెంకటేశ్వర రెడ్డి, ఆంధ్రజ్యోతి సంపాదకుడు కె. శ్రీనివాస్, నమస్తే తెలంగాణ సంపాదకుడు కట్టా శేఖర్రెడ్డి, టీవీ–5 ప్రతినిధి వసంత్, కవి కె.శివారెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
‘సాక్షి’ చీఫ్ రిపోర్టర్ శ్రీనివాస్కు అవార్డు
సాక్షి, హైదరాబాద్: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2008, 2009, 2010 సంవత్సరాల్లో ఎంపిక చేసిన ఉత్తమ జర్నలిస్టులకు అవార్డుల ప్రదానోత్సవం జరిగింది. ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాలో ప్రతిభ కనబరిచిన తెలంగాణకు చెందిన 15 మంది జర్నలిస్టులకు రాష్ట్ర ప్రభుత్వం అవార్డులను అందించింది. రాష్ట్ర విభజనతో ఎనిమిదేళ్ల పాటు ఈ అవార్డుల ప్రదానోత్సవం వాయిదా పడింది. ఎట్టకేలకు మంగళవారం సమాచార భవన్ మీటింగ్ హాల్లో అవార్డుల ప్రదానోత్సవం జరిగింది. తెలంగాణ ప్రెస్ అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ, సమాచార శాఖ కమిషనర్ నవీన్ మిట్టల్ ఎంపికైన జర్నలిస్టులకు ప్రశంసా పత్రంతో పాటు నగదు పురస్కారం అందజేశారు. సాక్షి చీఫ్ రిపోర్టర్ బొల్గం శ్రీనివాస్ 2009 సంవత్సరానికి గాను ఖాసా సుబ్బారావు ఉత్తమ గ్రామీణ జర్నలిస్టు అవార్డు అందుకున్నారు. కరీంనగర్లో పని చేసిన సమయంలో రాసిన ‘జోల పాట‘మానవీయ కథనానికి ఈ అవార్డును గెలుచుకున్నారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ను ‘సాక్షి’ చైర్పర్సన్ వైఎస్ భారతి, ఎడిటోరియల్ డైరెక్టర్ రామచంద్రమూర్తి, ఎడిటర్ వి.మురళి అభినందించారు. -
ఆ ఉత్తమ జర్నలిస్టులకూ అవార్డులివ్వండి
ఉభయ రాష్ట్ర ప్రభుత్వాలకు హైకోర్టు ఆదేశం సాక్షి, హైదరాబాద్: ఉమ్మడి రాష్ట్రంలో ఉత్తమ జర్నలిస్టులకు ప్రకటించిన నగదు అవార్డులను 8 వారాల్లోపు చెల్లించాలని ఉభయ రాష్ట్ర ప్రభుత్వాలను హైకోర్టు ఆదేశించింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ చల్లా కోదండరామ్ బుధవారం ఉత్తర్వులు జారీచేశారు. 2012లో అప్పటి రాష్ట్ర ప్రభుత్వం కొందరు పాత్రికే యులను ఉత్తమ జర్నలిస్టులుగా ఎంపిక చేసిందని, కొందరికి నగదు అవార్డు లిచ్చి, మరికొందరికి ఇవ్వకపోవడం వివక్ష చూపడమేనంటూ కొండూరి రమేశ్ బాబు, వనం వెంకటేశ్వర్లు పిటిషన్ దాఖలు చేశారు. ఉత్తమ జర్నలిస్టుల ఎంపికకు ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీ 33 మందిని ఎంపిక చేసిందని పిటిషనర్ తరఫు న్యాయవాది ఎస్.ఎస్.అర్జునకుమార్ తెలిపారు. వీరిలో ఇద్దరికే నగదు అవార్డును అందజేసి, మిగిలిన వారికి ఇవ్వలేదన్నారు. ఈ వాదనలను పరిగణ నలోకి తీసుకున్న న్యాయమూర్తి అవార్డులు ఇవ్వనివారికి 8 వారాల్లోపు వాటిని చెల్లించాలని ఉభయ రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.