ఉమామహేశ్వరికి న్యాయం చేయాలి | want to justice for uma maheshwari | Sakshi
Sakshi News home page

ఉమామహేశ్వరికి న్యాయం చేయాలి

Feb 10 2018 11:52 AM | Updated on Feb 10 2018 3:58 PM

want to justice for uma maheshwari - Sakshi

పశ్చిమగోదావరి, కొవ్వూరు : ప్రేమించి, పెళ్ళి చేసుకుని ఐదేళ్లు కాపురం చేసిన వ్యక్తి ఇపుడు తనను కాదని కట్నంకోసం వేరే యువతిని వివాహం చేసుకునేందుకు సిద్దపడుతున్నాడని ఆరోపిస్తూ పశ్చిమ గోదావరి జిల్లా మద్దూరులో బండి ఉమామహేశ్వరి అనే యువతి నిరాహారదీక్ష చేపట్టింది. తనకు న్యాయం చేయాలంటూ  ఎనిమిదిరోజులుగా భర్త ఇంటి ఎదుటే కూర్చుని దీక్ష కొనసాగిస్తోంది. నిరసన దీక్ష చేపట్టిన బండి ఉమామహేశ్వరికి వెంటనే న్యాయం చేయాలని వైఎస్సార్‌ సీపీ నేతలు, ఆమె బంధువులు డిమాండ్‌ చేశారు. ఆర్డీఓ, డీఎస్పీలకు ఫిర్యాదు చేసినా ఫలితం లేకపోవడంతో ఆమె బంధువులు, మద్దతుదారులు కొవ్వూరు జాతీయ రహదారిపై శుక్రవారం రాస్తారోకో నిర్వహించారు. గోదావరిపై నాలుగో వంతెన సమీపంలో జరిగిన ఈ ఆందోళన కార్యక్రమంలో కొవ్వూరు, రాజమండ్రితో పాటు తూర్పుగోదావరి జిల్లా కడియం, ఆలమూరు మండలాలకు చెందిన ఉమామహేశ్వరి బంధువులు, మద్దతుదారులు భారీగా తరలివచ్చారు. వైఎస్సార్‌ సీపీ కేంద్రపాలక మండలి సభ్యురాలు జక్కంపూడి విజయలక్ష్మి, కొవ్వూరు, రాజమండ్రి రూరల్‌ నియోజకవర్గ కన్వీనర్లు తానేటి వనిత, గిరిజాల బాబు, మాజీ ఎమ్మెల్సీ కందుల దుర్గేష్‌  బాధితురాలికి న్యాయం చేయాలని ఆందోళనకారులకు మద్దతుగా నిలిచారు. ఈ కార్యక్రమాన్ని కాపు సంఘం నేత మారిశెట్టి వెంకటేశ్వరరావు పర్యవేక్షించారు.

కిలోమీటర్ల మేర నిలిచిన వాహనాలు
సుమారు నాలుగు గంటల పాటు జాతీయ రహదారిని దిగ్భందం చేశారు. దాదాపుగా పది కిలోమీటర్ల మేర వాహనాలు రహదారిపై నిలిచిపోయాయి. బాధితురాలికి న్యాయం చేయాలంటూ నినాదాలు హోరెత్తాయి. మంత్రి కేఎస్‌ జవహర్, కలెక్టర్, ఎస్పీలు రావాలంటూ నినాదాలు చేశారు. మంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్న కొవ్వూరులో మహిళలకు రక్షణ లేకుండా పోయిందని బాధితురాలి బంధువులు ఆరోపించారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు రాస్తారోకో కొనసాగింది. డీఎస్పీ ఎస్‌.వెంకటేశ్వరరావు, తహసీల్దార్‌ ఘటనాస్థలానికి చేరుకుని ఉమామహేశ్వరి భర్త దుబాయ్‌ వెళ్లినట్టు చెప్పారు. అతడిని ఇండియా రప్పించేందుకు ప్రయత్నాలు చేస్తున్నామన్నారు. సోమవారంలోపు దోషులపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

భార్యభర్తల వివాదాల్లో సుప్రీంకోర్టు నిబంధనలు ఉన్నందున్న కొంత  ఇబ్బందులున్నాయన్నారు. దోషులను సత్వరం అరెస్ట్‌ చేయిస్తామని హామీ ఇవ్వడంతో నిరసనకారులు ఆందోళన విరమించారు. వైఎస్సార్‌ సీపీ రాజమండ్రి రూరల్‌ కన్వీనర్‌ గిరిజాల బాబు, కడియం మండల టీడీపీ అధ్యక్షుడు, ఎంపీపీ మార్గాని లక్ష్మీ సత్యనారాయణ, టీడీపీ జెడ్పీటీసీ సభ్యుడు పాలపర్తి కుమారి  రోజా ప్రకాష్, కడియపు లంక సర్పంచ్‌ వారా పాపా రాము, మండల పరిషత్‌ ఉపాధ్యక్షుడు వెలుగుబంటి నాని, తాడాల వీరన్న, ఆలిండియా నర్సరీ ప్రెసిడెంట్‌ పల్లా సుబ్రహ్మణ్యం, వైఎస్‌ఆర్‌సీపీ మండల కన్వీనర్‌ గురుజు బాలమురళీకృష్ణ, నాయకులు నగళ్లపాటి శ్రీనివాస్, యాళ్ల నరిసింహ రావు, కొయ్యల భాస్కరరావు, అడ్డూరి సుబ్బారావు,కొవ్వూరు, తాళ్లపూడి మండల కాపు అధ్యక్షులు ఉప్పులూరి రాజేంద్రప్రసాద్, నామా ప్రకాశం పాల్గొన్నారు.

న్యాయం చేసేంత వరకూ పోరాటం
బాధితురాలికి సోమవారంలోపు న్యాయం చేయకపోతే తానే స్వయంగా ఆమరణ నిరాహార దీక్ష చేపడతానని వైఎస్సార్‌ సీపీ నేత జక్కంపూడి విజయలక్ష్మి ప్రకటించారు. న్యాయం చేయాలని ఒక ఆడ బిడ్డ తొమ్మిది రోజుల నుంచి దీక్ష చేస్తున్నా స్థానిక మంత్రి కేఎస్‌ జవహర్‌ కనీసం పరామర్శించకపోవడం బాధాకరమన్నారు. బాధితురాలికి అండగా నిలుస్తామని  మాజీ ఎమ్మెల్సీ కందుల దుర్గేష్, వైఎస్సార్‌ సీపీ నియోజకవర్గ సమన్వయకర్త తానేటి వనిత తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement