‘ఇంటిపంట’ల విత్తనాలమ్మే ‘ఏటీఎమ్!’ | Telangana state parks department | Sakshi
Sakshi News home page

‘ఇంటిపంట’ల విత్తనాలమ్మే ‘ఏటీఎమ్!’

Sep 29 2015 12:02 AM | Updated on Sep 3 2017 10:08 AM

‘ఇంటిపంట’ల విత్తనాలమ్మే ‘ఏటీఎమ్!’

‘ఇంటిపంట’ల విత్తనాలమ్మే ‘ఏటీఎమ్!’

సేంద్రియ పద్ధతుల్లో ఇంటిపంటలు సాగు చేసుకునే వారికి తిరిగి వాడుకోదగిన, నాణ్యమైన విత్తనాలు చిన్న ప్యాకెట్లలో అందుబాటులో లేకపోవడం పెద్ద సమస్య

సేంద్రియ పద్ధతుల్లో ఇంటిపంటలు సాగు చేసుకునే వారికి తిరిగి వాడుకోదగిన, నాణ్యమైన విత్తనాలు చిన్న ప్యాకెట్లలో అందుబాటులో లేకపోవడం పెద్ద సమస్య. ఈ సమస్యను అధిగమించేందుకు తెలంగాణ రాష్ట్ర ఉద్యాన శాఖ వినూత్న ప్రయత్నం చేసింది. 10-20 గ్రాముల విత్తనాల ప్యాకెట్లను అమ్మేందుకు ఏటీఎం మాదిరిగా పనిచేసే ప్రత్యేక యంత్రాన్ని హైదరాబాద్ పబ్లిక్ గార్డెన్స్‌లో ఏర్పాటు చేసింది. 8 రకాల కూరగాయలు, ఆకుకూరల సూటి రకాల విత్తన ప్యాకెట్లను జాతీయ విత్తన సంస్థ (ఎన్.ఎస్.సి.) నుంచి తెప్పించి ఈ యంత్రం ద్వారా విక్రయిస్తున్నారు. ఒక్కో ప్యాకెట్ ధర రూ. 20. వినియోగదారు తనకు కావాల్సిన ప్యాకెట్ / ప్యాకెట్లను ఎంపిక చేసుకొని.. కరెన్సీ లేదా నాణేలను ఈ యంత్రంలో వేస్తే.. కోరిన విత్తనాల ప్యాకెట్లతోపాటు చిల్లర తిరిగి వస్తుంది.

ఉదయం 5 గంటల నుంచి సాయంత్రం 8 గంటల వరకు ఈ యంత్రం పనిచేస్తున్నది. తమిళనాడు నుంచి తెప్పించి ప్రయోగాత్మకంగా నెల రోజుల క్రితం ఏర్పాటు చేసిన ఈ యంత్రం విజయవంతంగా పనిచేస్తున్నదని, ఇంటిపంటల సాగుదారుల నుంచి స్పందన బాగుందని డిప్యూటీ డెరైక్టర్ (పబ్లిక్ గార్డెన్స్) విజయప్రసాద్ (83744 49007) ‘సాక్షి’కి తెలిపారు. హైదరాబాద్ వాసుల కోసం ఇంటిపంటల సబ్సిడీ కిట్లు (రూ. 3 వేలు) అందుబాటులో ఉంచినట్లు ఆయన వివరించారు. ఇటువంటి యంత్రాలను తెలుగు రాష్ట్రాల్లోని అన్ని నగరాలు, పట్టణాల్లోని బస్టాండ్లు, రైల్వేస్టేషన్లు, రైతుబజార్ల వద్ద కూడా ఏర్పాటు చేస్తే ఇంటిపంటల సాగు మరింత ఊపందుకుంటుందనడంలో సందేహం లేదు.

Advertisement
 
Advertisement
Advertisement