డ్రమ్ సీడర్‌తో వరిసాగు మేలు | paddy cultivation good with cedar drum | Sakshi
Sakshi News home page

డ్రమ్ సీడర్‌తో వరిసాగు మేలు

Nov 28 2014 1:50 AM | Updated on Sep 2 2017 5:14 PM

ఈ పరిక రాన్ని ఫైబర్‌తో తయారు చేస్తారు. సుమారు 9-10 కిలోల బరువు ఉంటుంది.

 డ్రమ్ సీడర్ గురించి..
 ఈ పరిక రాన్ని ఫైబర్‌తో తయారు చేస్తారు. సుమారు 9-10 కిలోల బరువు ఉంటుంది. కావాల్సిన ప్రదేశానికి తీసుకెళే ్లందుకు వీలుగా ఉంటుంది. రెండు చక్రాలు ఇరుసు ద్వారా కలిసి ఉంటాయి. ఇరుసు మీద నాలుగు డ్రమ్ములు బిగించి ఉంటాయి. ప్రతి డ్రమ్ము 60 సెం.మీ చుట్టుకొలత, 27 సెం.మీ పొడవు కలిగి ఉండి, దానిపై 2 వరుసల్లో 9 మి.మీ వ్యాసం గల రంధ్రాలు, సాళ్ల మధ్య 20 సెం.మీ దూరం ఉంటుంది.

విత్తనాలు వేసే సమయంలో మొక్కల మధ్య దూరాన్ని తగ్గించాలంటే రంధ్రాలను మూసేయవచ్చు. కానీ సాళ్ల మధ్య దూరం మాత్రం 20 సెం.మీ ఉంటుంది. ప్రతి డ్రమ్ము పైన విత్తనాలు వేసేందుకు, తీసేందుకు అనుకూలంగా మూత ఉంటుంది. డ్రమ్ సీడర్‌ను ఒక మనిషి సునాయసంగా పొలంలో లాగవచ్చు. డ్రమ్ సీడర్ ధర రూ.4,400 కాగా ప్రభుత్వం రైతులకు రూ.2,200కే అందజేస్తోంది.

 ఉపయోగాలు
 డ్రమ్ సీడర్  పద్ధతిలో వరి సాగుకు నార్లు పెంచుకోవాల్సిన అవసరం లేదు. నాటు వేసే పని లేదు. కాబట్టి నాటుకు అవసరమైన కూలీల ఖర్చును ఆదా చేయవచ్చు. సంప్రదాయ పద్ధతిలో వరి సాగుకు ఎకరానికి 25 నుంచి 30 కిలోల విత్తనం అవసరమవుతుంది. అదే డ్రమ్ సీడర్ పద్ధతిలో అయితే ఎకరానికి 8 నుంచి 12 కిలోల విత్తనం సరిపోతుంది. ఒక నిర్ధిష్ట దూరంలో డ్రమ్‌సీడర్ ద్వారా విత్తనం వేయవచ్చు. కాబట్టి గాలి, వెలుతురు బాగా ప్రసరించి చీడపీడల సమస్య తగ్గుతుంది.

ముఖ్యంగా సుడిదోమ ఉధృతి తక్కువగా ఉంటుంది. కలుపు నివారణకు వరిసాళ్ల మధ్య కోనో వీడర్(కలుపు తీసే యంత్రం) నడపవచ్చు. దీని ద్వారా కలుపును సేంద్రియ ఎరువుగా మార్చుకోవడానికి అవకాశం ఉంది. అంతర కృషి వల్ల పిలకల శాతం బాగా పెరిగి అధిక దిగుబడి పొందవచ్చు. వర్షాలు కురవడం ఆలస్యమైనా, కాలువల ద్వారా నీటి విడుదల సకాలంలో జరగకపోయినా, ముదురు నార్లు నాటిన వరిలో దిగుబడి గణనీయంగా తగ్గుతుంది. అలాంటి పరిస్థితుల్లో డ్రమ్‌సీడర్ పద్ధతిని అనుసరించవచ్చు. నాటు వేసిన వరి కన్నా 8 నుంచి 10 రోజులు ముందే డ్రమ్ సీడర్‌తో వేసిన వరి కోతకు వస్తుంది.

 విత్తనాల తయారీ.. శుద్ధి
 కిలో విత్తనానికి ఒక గ్రాము కార్బండిజంతో విత్తన శుద్ధి చేసుకోవాలి. విత్తుకునే వడ్లను ఒక గోనె సంచిలో నింపి వదులుగా ఉండేలా మూట కట్టి 24 గంటలపాటు నీటిలో నానబెట్టాలి. ఆ తర్వాత  నానిన వడ్లను బయటకు తీసి సన్న రకాలైతే 12 గంటలు.. లావు రకాలైతే 24 గంటలపాటు మండె కట్టాలి. మండె కట్టే విధానం ఇక్కడ చాలా కీలకమైనది. డ్రమ్ సీడర్ పద్ధతిలో వరి సాగుకు.. వరి విత్తనాల ముక్కు పగిలి తెల్ల పూత కొద్దిగా వస్తే సరిపోతుంది. మొలక ఎక్కువ వస్తే డ్రమ్ సీడర్‌లో విత్తనాలు పోసినప్పుడు రంద్రాల ద్వారా కిందకు రాలవు. తెల్ల పూత రంధ్రాల్లో చిక్కుకుని ఇరిగిపోతుంది. దీనివల్ల విత్తనాలు మొలకెత్తవు. ఈ విషయంలో జాగ్రత్త వహించాలి.
 
పొలం తయారీ  
  పొలానికి కొద్దిగా నీరు పెట్టి భూమి బాగా గుల్లబారేలా దున్నుకోవాలి. బాగా చివికిన పశువుల ఎరువు, పచ్చిరొట్ట ఎరువులను వేసుకోవాలి. విత్తనాలు వే యడానికి 15 రోజుల ముందు పొలాన్ని దమ్ము చేసి ఉంచాలి. ఆ తర్వాత విత్తనాలు వేసే నాలుగు రోజుల ముందు మరోసారి దమ్ము చేసి సమానంగా చదును చేయాలి. నీరు నిల్వ ఉంటే విత్తనం మురిగిపోతుంది. కాబట్టి మురుగు పోవడానికి తగిన ఏర్పాటు చేయాలి. నీటి వసతిని బట్టి డ్రమ్ సీడర్ ద్వారా వరి నాటుకోవచ్చు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement