వరిపైనా ‘మొగి’ దాడి | Mogi worm attacked on paddy crop | Sakshi
Sakshi News home page

వరిపైనా ‘మొగి’ దాడి

Aug 25 2014 3:03 AM | Updated on Sep 2 2017 12:23 PM

ఇప్పటికే మొక్కజొన్న కాండం తొలిచేసిన పురుగు ఇప్పుడు వరి పంటపైనా దాడి చేస్తోంది.

 లింగంపేట/బాల్కొండ : ఇప్పటికే మొక్కజొన్న కాండం తొలిచేసిన పురుగు ఇప్పుడు వరి పంటపైనా దాడి చేస్తోంది. దీం తో రైతన్నలు ఆందోళన చెందుతున్నారు. వర్షాభావ పరిస్థితులతో ఈ ఏడాది వరి సాగు విస్తీర్ణం గణనీయంగా పడిపోయింది. ఖరీఫ్‌లో జిల్లాలో 1.50 లక్షల హెక్టార్లలో వరి సాగవుతుందని గతంలో అధికారులు అంచనా వేశారు. అయితే సరైన వర్షాలు కురియకపోవడంతో లక్ష హెక్టార్లలో కూడా పంట సాగు కాలేదని తెలుస్తోంది.

 వేసిన పంటను మొగి పురుగు ఆశించడంతో దిగుబడులు తగ్గే అవకాశాలున్నాయని అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. వరి నారుమడి దశ, పిలకలు వేసే దశ, ఈనే దశల్లో కాండం తొలుచు పురుగు ఆశించి పంటను నష్ట పరిచే అవకాశాలుంటాయని వ్యవసాయ శాఖ అధికారులు తెలిపారు. తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు.

 నష్టాలు
 మొగి పురుగు వల్ల వరి కర్ర ఎరుపు రంగులోకి మారుతుంది. కర్ర పిలకలు పై భాగాన కోతకు గురవుతాయి. ప్రధానంగా 20 రోజుల నుంచి 60 రోజుల మధ్య కాలంలో ఆశించే మొగి పురుగు పంటను కోలుకోకుండా దెబ్బతీస్తుంది. 60 రోజుల తర్వాత ఆశించే మొగి గింజల్లో రసాన్ని పీల్చేస్తుంది. నారు మడి దశలో పురుగు ఆశిస్తే నారు మొలకలు, పిలకలు వేసే సమయంలో ఆశిస్తే పిలకలు చనిపోతాయి. పైరు చిరు పొట్ట దశలో పురుగు ఆశిస్తే తెల్ల కంకులు వచ్చి పంట దిగుబడి తగ్గుతుంది.

 నివారణ చర్యలు
వరి పంటలో మొగి పురుగు నివారణకు ప్రధానంగా పెటిరో గుళికలు వినియోగించాలని వ్యవసాయ అధికారులు సూచిస్తున్నారు. ఎకరానికి 4 కేజీ ల పెటిరో గుళికలు సరిపోతాయి. ఈ గుళికలు చల్ల డం వల్ల మొగి పురుగు నివారణ జరగడంతోపాటు వరి పిలకలు కూడా వేస్తుంది.

మొగి నివారణకు లీటర్ వేప నూనె, క్లోరాంత్రన్ మెనోప్రాస్ 60 ఎంఎల్ 200 లీటర్లలో కలిపి పిచికారి చేయాలి.

టకుమి 60 గ్రాములు 200 లీటర్లలో కలిపి పిచికారి చేయొచ్చు.

క్లోరోపైరిఫాస్ 2.5 మిల్లీ లీటర్లు, లేదా ఫాస్ఫామిడాన్ 2 మి.లీ.లేక ఎసిఫేట్ 1.5 గ్రాములు, లేదా కార్టాప్ హైడ్రో క్లోరైడ్ 2 గ్రాముల మందును లీటర్ నీటికి కలిపి ఎకరాకు 2 వంద ల లీటర్ల మందును ఉదయం, సాయంత్రం వేళల్లో పిచికారి చేసినా ప్రయోజనం ఉంటుంది.

వరి పైరు చిరు పొట్ట దశలో కార్టాప్ హైడ్రోక్లోరైడ్ 4జీ గుళికలు ఎకరాకు 8 కిలోలు, లేదా కార్బోప్యూరాన్ 3జీ గుళికలు ఎకరానికి 10 కిలోలు వాడితే కాండం తొలుచు పురుగు ఉధృతిని పూర్తి స్థాయిలో అరికట్టవచ్చు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement