రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచేందుకు దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖరరెడ్డి ఎంతో కృషిచేశారని విజయవాడ ఎంపీ లగడపాటి రాజగోపాల్ తెలిపారు.
సాక్షి, న్యూఢిల్లీ: రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచేందుకు దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖరరెడ్డి ఎంతో కృషిచేశారని విజయవాడ ఎంపీ లగడపాటి రాజగోపాల్ తెలిపారు. కాంగ్రెస్ అధిష్టానం 2009లో విభజనకు అనుకూలంగా ఉన్నా వైఎస్ అడ్డుకున్నారని చెప్పారు. ఆయన బుధవారం సాయంత్రం ఢిల్లీలోని తన నివాసంలో విలేకరులతో మాట్లాడారు.‘‘2009లో తెలంగాణకు అన్నిపార్టీలు మద్దతునిచ్చి మహాకూటమిగా ఏర్పడ్డాయి. ఈ దశలో విభజనకు మనం సైతం అంగీకరిద్దామని కాంగ్రెస్ అధిష్టానం ఒత్తిడి చేసింది. కానీ వైఎస్ గట్టిగా వ్యతిరేకించారు. అనేక సర్వే నివేదికలు చూపి, విభజన జరగకుండా అడ్డుకున్నారు’’ అని తెలిపారు. 2009 ఫిబ్రవరి అసెంబ్లీ తీర్మాన సమయంలోనూ తెలంగాణకు సూత్రప్రాయంగా అభ్యంతరం లేనప్పటికీ ఇతర ప్రాంతాల్లో అనేక అపోహలు, సమస్యలు తలెత్తే అవకాశమున్నందున వాటిని పరిశీలించేందుకు రోశయ్య కమిటీ వేస్తున్నట్టు మాత్రమే చెప్పారన్నారు.