సాహిత్య అకాడమీకి గుడ్ బై! | Sakshi
Sakshi News home page

సాహిత్య అకాడమీకి గుడ్ బై!

Published Fri, Oct 9 2015 7:18 PM

సాహిత్య అకాడమీకి గుడ్ బై!

న్యూఢిల్లీ: దేశంలో పెరుగుతున్న అసహనం, భావ వ్యక్తీకరణ స్వేచ్ఛకు ఆంక్షలు విధిస్తుండటంపై మరో రచయిత్రి నిరసనబాటపట్టారు. దేశంలోని ఈ అశాంతిపూరితమైన వాతావరణాన్ని నిరసిస్తూ ప్రముఖ నవలా రచయిత్రి శశి దేశ్పాండే కేంద్ర సాహిత్య అకాడమీ జరనల్ కౌన్సిల్కు రాజీనామా చేశారు. ఇదేకారణంతో ఇప్పటికే ప్రముఖ రచయితలు నయనతార, కవి అశోక్ వాజపేయి తమకు లభించిన సాహిత్య పురస్కారాలను ప్రభుత్వానికి తిరిగి ఇచ్చేశారు.  దేశంలో సృజనాత్మక స్వేచ్ఛకు గడ్డుకాలం దాపురించడం, కళాకారులపై దాడులు జరుగుతుండటంపై ఆందోళన వ్యక్తం చేశారు. ప్రముఖ ఉర్దూ నవలా రచయిత రెహమాన్ అబ్బాస్ కూడా తనకు ప్రదానం చేసిన మహారాష్ట్ర ఉర్దూ సాహిత్య అకాడమీ పురస్కారాన్ని వాపస్ ఇస్తానని ప్రకటించారు. సమాజంలో చుట్టూ జరుగుతున్న అన్యాయానికి నిరసనగానే ఈ నిర్ణయం తీసుకున్నట్టు చెప్పారు.

హేతువాద రచయిత ఎంఎం కల్బుర్గి హత్యపై సాహిత్య అకాడమీ మౌనం వహించడం తనను తీవ్రంగా కలిచివేసిందని అకాడమీ చైర్మన్కు రాసిన లేఖలో శశి దేశ్పాండే ఆవేదన వ్యక్తం చేశారు. 'రాజీనామా చేసినందుకు బాధగానే ఉంది. అయినా కేవలం కార్యక్రమాలు నిర్వహించడం, పురస్కారాలు ఇవ్వడే మాత్రమే కాకుండా భారతీయ రచయితలకు వాక్, రచన స్వేచ్ఛకు సంబంధించి కూడా సాహిత్య అకాడమీ కృషి చేస్తుందనే ఆశతో ఈ పనిచేశాను' అని ఆమె తెలిపారు.
 

Advertisement
Advertisement