కబడ్డీలో దళితుల చేతిలో ఓడిపోవడంతో.. | Upper caste men beat Dalits for defeating them in kabbadi | Sakshi
Sakshi News home page

కబడ్డీలో దళితుల చేతిలో ఓడిపోవడంతో..

Aug 18 2016 11:50 AM | Updated on Sep 27 2018 2:34 PM

స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా హరియాణాలో ప్రతి ఏడాది వివిధ కులాల మధ్య కబడీ పోటీలు జరుగుతాయి.

స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా హరియాణాలో ప్రతి ఏడాది వివిధ కులాల మధ్య కబడీ పోటీలు జరుగుతాయి. కులాల మధ్య ఐక్యత పెంచడం ఈ స్నేహపూర్వక పోటీల వెనుక ప్రధానోద్దేశం. కానీ, ఈసారి గురుగావ్‌లో జరిగిన క్రీడాపోటీలు మాత్రం కులాల మధ్య ఐక్యత పెంచడానికి బదులు చిచ్చు రాజేశాయి.

తాజా స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా దళితుల జట్టు, యాదవుల జట్టు మధ్య జరిగిన కబడ్డీ పోటీ హింసాత్మకంగా మారింది. దళితుల జట్టు యాదవుల జట్టుపై గెలుపొందింది. ఇదే విషయాన్ని నిర్వాహకులు ప్రకటించారు కూడా. అయితే, దీంతో యాదవుల జట్టు ఆగ్రహానికి లోనై.. దళితుల కబడ్డీ జట్టు సభ్యులపై దాడికి దిగినట్టు సమాచారం. ఈ దాడిలో ఓ ఆటగాడికి కాలువిరిగి, తీవ్ర గాయాలయ్యాయి. మరొకరికి తలపై గాయమైంది. ఇరు జట్లకు చెందిన మరో పదిమంది కూడా ఈ హింసలో గాయపడ్డారు.

ప్రస్తుతం క్షతగాత్రులు గురుగావ్‌లోని ఉమా సంజీవని ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. గురుగావ్‌ జిల్లా చక్కార్‌పూర్‌ గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో జరిగిన ఈ పోటీల్లో వివిధ గ్రామాలకు చెందిన దళితులు, యాదవులు, జాట్లు, గుజ్జర్లు, బెనియాలు, అగర్వాళ్ల జట్లు పాల్గొన్నాయని ఓ జాతీయ ఆంగ్లపత్రిక తెలిపింది. అయితే, రాష్ట్రంలో కులపరమైన క్రీడాపోటీలు జరుగడం లేదని, ఒకే కులం వారు ఒక జట్టు నిండా ఉన్నా అది యాదృచ్ఛికమే కానీ కులాలవారీగా జట్లు లేవని స్థానిక కౌన్సిలర్ సునీల్ యాదవ్‌ చెప్పుకొచ్చారు.

Advertisement
 
Advertisement
Advertisement