ఫైనాన్షియల్ టెక్ నుంచి మరో ఇద్దరు డెరైక్టర్ల రాజీనామా | Two more Financial Technologies' directors resign | Sakshi
Sakshi News home page

ఫైనాన్షియల్ టెక్ నుంచి మరో ఇద్దరు డెరైక్టర్ల రాజీనామా

Aug 29 2013 1:12 AM | Updated on Sep 1 2017 10:12 PM

ఫైనాన్షియల్ టెక్నాలజీస్ బోర్డు నుంచి మరో ఇద్దరు డెరైక్టర్లు రాజీనామా చేశారు. దీంతో కంపెనీలో ప్రధాన ప్రమోటర్ జిగ్నేష్ షాతోపాటు మొత్తం ఐదుగురు డెరైక్టర్లు మాత్రమే మిగిలారు.

న్యూఢిల్లీ: ఫైనాన్షియల్ టెక్నాలజీస్ బోర్డు నుంచి మరో ఇద్దరు డెరైక్టర్లు రాజీనామా చేశారు. దీంతో కంపెనీలో ప్రధాన ప్రమోటర్ జిగ్నేష్ షాతోపాటు మొత్తం ఐదుగురు డెరైక్టర్లు మాత్రమే మిగిలారు. తాజాగా రాజీనామా చేసిన డెరైక్టర్లలో సీఎం మణ్యర్, ఎన్.బాలసుబ్రమణ్యన్ ఉన్నారు. ఫైనాన్షియల్ టెక్నాలజీస్ ప్రమోట్ చేసిన నేషనల్ స్పాట్ ఎక్స్ఛేంజీ(ఎన్‌ఎస్‌ఈఎల్) కమోడిటీ కాంట్రాక్ట్‌లకు సంబంధించిన చెల్లింపుల సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే.
 
 ప్రస్తుతం ఫైనాన్షియల్ టెక్నాలజీస్ బోర్డులో షాతోపాటు ఇద్దరు హోల్‌టైమ్ డెరైక్టర్లు దేవంగ్ నేరెళ్ల, మంజయ్ షా, మరో ఇద్దరు డెరైక్టర్లు చంద్రకాంత్ కామ్దార్, రవి కె.సేథ్ సభ్యులుగా కొనసాగుతున్నారు. ఈ విషయాన్ని కంపెనీ బీఎస్‌ఈకి తెలియజేసింది. గత వారం కూడా కంపెనీ నుంచి ఆర్.దేవరాజన్, పీఆర్ బార్పండే డెరైక్టర్ల పదవులకు రాజీనామా చేసిన విషయం విదితమే. వరుసగా రెండో అంచె చెల్లింపుల్లోనూ ఎన్‌ఎస్‌ఈఎల్ విఫలమైన నేపథ్యంలో ఫైనాన్షియల్ టెక్నాలజీస్ డెరైక్టర్ల రాజీనామాలకు ప్రాధాన్యత ఏర్పడింది. కాగా, తమ ప్రమోటర్ కంపెనీ ఫైనాన్షియల్ టెక్నాలజీస్ రూ. 177 కోట్లమేర రుణాన్ని అందించినట్లు ఎన్‌ఎస్‌ఈఎల్ తెలిపింది. ఈ నిధులను చిన్న ఇన్వెస్టర్లకు చెల్లించాల్సిన బకాయిలకు వినియోగించనున్నట్లు పేర్కొంది.

Advertisement
 
Advertisement
Advertisement