సీమాంధ్ర బంద్ సంపూర్ణం | Seemandhra Bandh success | Sakshi
Sakshi News home page

సీమాంధ్ర బంద్ సంపూర్ణం

Sep 25 2013 2:26 AM | Updated on Sep 1 2017 11:00 PM

సమైక్యాంధ్ర పరిరక్షణోద్యమంలో భాగంగా ఏపీఎన్జీవోల పిలుపుమేరకు కోస్తా, రాయలసీమ జిల్లాల్లో మంగళవారం చేపట్టిన బంద్ విజయవంతమైంది.

సాక్షి నెట్‌వర్క్: సమైక్యాంధ్ర పరిరక్షణోద్యమంలో భాగంగా ఏపీఎన్జీవోల పిలుపుమేరకు కోస్తా, రాయలసీమ జిల్లాల్లో మంగళవారం చేపట్టిన బంద్ విజయవంతమైంది. విద్యాసంస్థలు, వర్తక, వాణిజ్యసంస్థలు, సినిమాహాళ్లు, ప్రభుత్వ కార్యాల యాలు, బ్యాంకులు, పెట్రోలుబంకులు మూసివేశారు. సమైక్యవాదులు ఎక్కడికక్కడ జాతీయరహదారులను దిగ్బంధించారు.. తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో పోర్టు కార్యకలాపాలను  అడ్డుకున్నారు. జిల్లావ్యాప్తంగా సోమవారం అర్ధరాత్రి నుంచి ఆర్ అండ్ బీ ఉద్యోగులు నిరవధిక సమ్మెకు దిగారు. ఉభయగోదావరి జిల్లాల మధ్య గల చించినాడ బ్రిడ్జిపై జాతీయ రహదారిని దిగ్బంధించారు.
 
  దీంతో రాకపోకలు గంటలతరబడి నిలిచిపోయూరుు. కలకత్తా-చెన్నయ్ జాతీయ రహదారిని జిల్లాలో పలుచోట్ల దిగ్బంధించారు. విశాఖనగరంలో ఈపీడీసీఎల్ కార్యాల యంలో చేపట్టే బోర్డు మీటింగ్‌ను విద్యుత్ జేఏసీ, ఆర్టీసీ నేతలు అడ్డుకున్నారు.  విజయనగరంలో ముస్లింలు నిరసన ర్యాలీ నిర్వహించగా. శ్రీకాకుళం జిల్లా పాతపట్నంలో ఆంధ్రా-ఒడిశా సరిహద్దు ప్రాంతమైన మహేంద్రతనయ వంతెనపై సమైక్యవాదులు ైటె ర్లు కాల్చి నిరసన తెలిపారు. హౌరా-చెన్నై జాతీయ రహదారిపై అనేక ప్రాంతాల్లో వాహనాల రాకపోకలను ఆందోళనకారులు అడ్డుకోవడంతో వేలాది వాహనాలు నిలిచిపోయాయి. కృష్ణాజిల్లాలోని బంటుమిల్లి రోడ్డు, బందరు వెళ్లే రోడ్డు, గుడివాడ రోడ్డులపై ట్రాక్టర్లను అడ్డుగా పెట్టి వంటావార్పు చేశారు. విజయవాడలోని గొల్లపూడి, కనకదుర్గమ్మ వారధి, రామవరప్పాడు రింగ్, బెంజిసర్కిల్ వద్ద  ఎన్జీవో నేతలు రోడ్లపై బైఠాయించి వాహనాలను నిలిపివేశారు. తిరువూరులో విజయవాడ- జగదల్‌పూర్ జాతీయ రహదారిపై కట్టెలేరు వంతెన వద్ద బైఠాయించిన జేఏసీ నాయకులు వాహనాల రాకపోకలను అడ్డుకున్నారు. గుంటూరులోని ఆటోనగర్,  వీఎస్సార్ కళాశాల, కఠెవరం గ్రామాల వద్ద తెనాలి విజయవాడ రహదారిపై రాస్తారోకోలు నిర్వహించారు. నెల్లూరు జిల్లా  సూళ్లూరుపేటలో జాతీయ రహదారిపై రాస్తారోకో చేపట్టారు. ప్రకాశంజిల్లా కేంద్రమైన ఒంగోలు చర్చి సెంటర్‌లో క్రైస్తవులు మానవహారం నిర్వహించి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. చీరాలలో లారీ అసోసియేషన్ ఆధ్వర్యంలో రోడ్డుపై వంటా-వార్పు నిర్వహించారు.
 
 ఎనిమిది వేల మంది ట్రిపుల్ ఐటీ విద్యార్థులు వైఎస్సార్ జిల్లా ఇడుపులపాయ నుంచి గండికి పాదయాత్రను చేపట్టారు. కర్నూలు జిల్లా నంద్యాలలో 24 మంది వికలాంగులు 24 గంటల దీక్ష చేపట్టారు. బంద్ నేపథ్యంలో బెంగళూరు-హైదరాబాద్(44వ), కర్నూలు-చెన్నై(18) జాతీయ రవాహదారులను సమైక్యవాదులు దిగ్బంధించి వాహనల రాకపోకలను అడ్డుకున్నారు. డోన్‌లో జేఏసీ నేతలు 44వ జాతీయ రహదారిని దిగ్బంధించారు.  తిరుపతి మున్సిపల్ కార్యాలయం కూడలిలో దర్జీలు నడిరోడ్డుపై కుట్టు మిషన్లతో నిరసన తెలిపారు. యూనివర్సిటీ మొదటి గేట్ వద్ద రోడ్డుకు అడ్డంగా ట్రాక్టర్, ద్విచక్ర వాహనాలను పెట్టి రాకపోకలను అడ్డుకున్నారు.  అనంతపురం జిల్లావ్యాప్తంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలతో పాటు పాఠశాలలు, వాణిజ్య సముదాయాలు మూత పడ్డాయి.
 
 11న ఒంగోలులో ‘విద్యుత్ గర్జన’
 సమైక్యాంధ్ర ప్రకటనే ప్రధాన డిమాండ్‌గా సీమాంధ్ర విద్యుత్ ఉద్యోగులు అక్టోబర్ 11న ఒంగోలులో ‘విద్యుత్ గర్జన’ నిర్వహించనున్నారు. 13 జిల్లాల్లోని విద్యుత్ ఉద్యోగులతో పాటు హైదరాబాద్ విద్యుత్‌సౌధలోని ఉద్యోగులందరూ కుటుంబ సమేతంగా గర్జన కార్యక్రమానికి హాజరు కావాలని  గుంటూరులో జరిగిన రాష్ట్ర విద్యుత్ జేఏసీ సమావేశం నిర్ణయించింది.
 
 నేడు అనంత రైతు రంకె
 అనంతపురం: సమైక్యాంధ్ర వాణిని వినిపించేందుకు బుధవారం అనంతపురంలో వ్యవసాయశాఖ ఆధ్వర్యంలో ‘అనంత రైతు రంకె’ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement