‘పెద్దలు’న్నా జైల్లో పెట్టాల్సిందే: హైకోర్టు | Sand mafia on police order | Sakshi
Sakshi News home page

‘పెద్దలు’న్నా జైల్లో పెట్టాల్సిందే: హైకోర్టు

Sep 1 2015 1:27 AM | Updated on Aug 31 2018 8:24 PM

మహబూబ్‌నగర్ జిల్లాలో ఇసుక మాఫియా వెనకున్న వాళ్లు ఎంత పెద్ద వారైనా ఉపేక్షించవద్దని, వారిని జైలుకు పంపాల్సిందేనని...

సాక్షి, హైదరాబాద్: మహబూబ్‌నగర్ జిల్లాలో ఇసుక మాఫియా వెనకున్న వాళ్లు ఎంత పెద్ద వారైనా ఉపేక్షించవద్దని, వారిని జైలుకు పంపాల్సిందేనని పోలీసులకు హైకోర్టు స్పష్టం చేసింది. దీనికి సంబంధించి ఇప్పటి వరకు ఒక్కరినీ అరెస్ట్ చేయకపోవడాన్ని ప్రశ్నించింది. పూర్తిస్థాయిలో దర్యాప్తు చేసి అందుకు సంబంధించిన వివరాలను తమ ముందుంచాలని ఎస్పీ పి.విశ్వప్రసాద్‌ను ఆదేశించింది. తదుపరి విచారణను ఈ నెల 14కు వాయిదా వేసింది.

ఈ మేరకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దిలీప్ బి.బొసాలే నేతృత్వంలోని ధర్మాసనం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. తమ భూముల నుంచి అక్రమంగా ఇసుకను తరలిస్తుండటాన్ని ప్రశ్నిస్తున్న రైతులను ఇసుక మాఫియా హతమారుస్తున్నా ప్రభుత్వం స్పందించట్లేదంటూ స్వచ్ఛంద సంస్థ వాచ్ వాయిస్ ఆఫ్ పీపుల్ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలు చేసింది.

దీనిపై సోమవారం జరిగిన విచారణ సందర్భంగా ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది అండపల్లి సంజీవ్‌కుమార్ వాదనలు వినిపించారు. ధర్మాసనం గత వారం ఇచ్చిన ఆదేశాల మేరకు పిటిషనర్ చెప్పిన ఆధారాలను బట్టి ఆ తరువాత పలువురు రైతులు, అధికారులు సహా 44 మంది వాంగ్మూలాలను నమోదు చేశామన్నారు. వీటన్నింటిపై జిల్లా ఎస్పీ అదనపు అఫిడవిట్ దాఖలు చేశారని దానిని ధర్మాసనం ముందుంచారు.

వాంగ్మూ లం ఆధారంగా వివిధ పోలీస్‌స్టేషన్ల పరిధిలో 12 కేసులు నమోదు చేశామని ఎస్పీ తన అఫిడవిట్‌లో పేర్కొన్నారు. కల్వకుర్తి ఎమ్మెల్యే వంశీచంద్‌రెడ్డి, మక్తల్ ఎమ్మెల్యే చిట్టెం రామ్మెహన్‌రెడ్డి, గద్వాల్‌కు చెందిన కృష్ణమోహన్‌రెడ్డి, ఆలంపూర్ ఎమ్మెల్యే సంపత్‌కుమార్, జె.అరుణ్, వారి అనుచరులు అక్రమంగా ఇసుక తవ్వకాలు, రవాణా చేస్తున్నారని ఆరోపించిన పిటిషనర్... అందుకు ఒక్క ఆధారం కూడా చూపలేకపోయారని పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement