జైలులో ప్రేమ కథ.. బెంగుళూరు గజగజ..! | Rowdy's sister falls for cat-eyed inmate, is now leader of his gang | Sakshi
Sakshi News home page

జైలులో ప్రేమ కథ.. బెంగుళూరు గజగజ..!

Dec 25 2016 6:22 PM | Updated on Sep 4 2017 11:35 PM

జైలులో ప్రేమ కథ.. బెంగుళూరు గజగజ..!

జైలులో ప్రేమ కథ.. బెంగుళూరు గజగజ..!

జైలులో బీజం పడిన ప్రేమ కథ కారణంగా ఇప్పుడు బెంగుళూరు నగరం గజగజలాడుతోంది.

జైలులో బీజం పడిన ఓ ప్రేమ కథ కారణంగా ఇప్పుడు బెంగుళూరు నగరం గజగజలాడుతోంది. దొంగతనాలే జీవిత పరమార్ధంగా ఎంచుకున్న ఇద్దరు ప్రేమించుకుంటే ఏం జరుగుతుంది అనే కోణంలో సినిమా తీస్తే ఈ కథకు వంద మార్కులు పడతాయనడంలో ఆశ్చర్యమే లేదు. 2011లో పరప్పనా అగ్రహారా జైలులో ఈ ప్రేమ కథ మొదలైంది. పట్టపగలు దోపిడీలకు పాల్పడే ముఠా నాయకుడు కోటి రెడ్డిని కలవడానికి అతని సోదరి సుమ(25) తరచూ పరప్పనా అగ్రహారా జైలుకు వెళ్లేది. అదే సమయంలో ఓ రోజు జైలులో ఉన్న పేరుమోసిన రౌడీ షీటర్ రాజా అలియాస్ క్యాట్ రాజా(28)ని చూసింది.
 
పిల్లికళ్లతో ఉండే రాజా.. తనకంటూ ప్రత్యేకతను మెయింటైన్ చేసేవాడు. అతని కళ్లు పిల్లి కళ్లలా ఉండటంతో అందుకు తగిన బ్రాండ్ల టీ షర్ట్ లనే ధరించేవాడు. రాజా తీరు నచ్చిన సుమ అప్పటికప్పుడు జైల్లోనే అతనికి ప్రపోజ్ చేసింది. సుమ ప్రపోజల్ ను ఒప్పుకున్న రాజా జైలు నుంచి విడుదల కాగానే (మూడేళ్ల క్రితం) వివాహం చేసుకున్నాడు. దీంతో కోటి రెడ్డి సామ్రాజ్యానికి రాజా వారసుడయ్యాడు. జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత రాజా వేగంగా ఎదిగాడు. 
 
పోలీసులను ముప్ప తిప్పలను పెడుతున్న రాజా ఈ ఏడాది జులైలో ఓ రాజకీయ నాయకుడి హత్య కేసులో అరెస్టు అయ్యాడు. భర్త అరెస్టుతో గ్యాంగ్ పగ్గాలను చేపట్టిన సుమ.. జైలు నుంచి భర్త చెబుతున్న సూచనలను పాటిస్తూ క్రిమినల్ యాక్టివిటీస్ ను కొనసాగిస్తోంది. రాజా అరెస్టు తర్వాత గ్యాంగ్ లోని ఎనిమిది మంది సభ్యులను పోలీసులు అరెస్టు చేసినా సుమ మాత్రం పోలీసులకు ఇంకా చిక్కలేదు. ప్రతి దోపిడీ తర్వాత ఆ డబ్బు మొత్తాన్ని గ్యాంగ్ సుమకు అప్పజెప్తుందని బెంగళూరు రూరల్ డిప్యూటీ ఎస్పీ ఎస్ కే ఉమేశ్ చెప్పారు.
 
ఆ తర్వాత ఎవరెవరికీ ఎంతెంత ఇవ్వాలనేది ఆమె నిర్ణయిస్తుందని వెల్లడించారు. పేరు మోసిన రౌడీ భార్య కావడంతో ఆమె తరచూ స్ధావరాలను మారుస్తూ ఉంటుందని చెప్పారు. రాజా అరెస్టు తర్వాత ఇప్పటివరకూ అతని గ్యాంగ్ 40కు పైగా దోపిడీలకు పాల్పడిందని తెలిపారు. గ్యాంగ్ సభ్యులు అరెస్టు అవుతున్నా సుమ సాయంతో రాజా కొత్తవారిని సభ్యులుగా నియమించుకుంటూ కార్యకలాపాలు సాగిస్తున్నట్లు చెప్పారు.

Advertisement
 
Advertisement
Advertisement