2న ఈ- పంచాయత్ ప్రారంభం | On 2 e- Panchayat Start | Sakshi
Sakshi News home page

2న ఈ- పంచాయత్ ప్రారంభం

Sep 19 2015 4:38 AM | Updated on Aug 30 2019 8:24 PM

2న ఈ- పంచాయత్ ప్రారంభం - Sakshi

2న ఈ- పంచాయత్ ప్రారంభం

గ్రామ పంచాయతీల్లో పౌరసేవలు అందించేందుకు ప్రభుత్వం తల పెట్టిన ఈ-పంచాయత్ వ్యవస్థను గాంధీ జయంతి రోజు(అక్టోబర్ 2)న ప్రారంభించనున్నట్లు...

తొలి దశలో జనన, మరణ ధ్రువపత్రాలు
సాక్షి, హైదరాబాద్: గ్రామ పంచాయతీల్లో పౌరసేవలు అందించేందుకు ప్రభుత్వం తల పెట్టిన ఈ-పంచాయత్ వ్యవస్థను గాంధీ జయంతి రోజు(అక్టోబర్ 2)న ప్రారంభించనున్నట్లు పంచాయతీరాజ్‌శాఖ మంత్రి కె.తారక రామారావు తెలిపారు. దీనిద్వారా గ్రామీణ ప్రజలకు ఈ-గవర్నెన్స్ ఫలాలు అందుతాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా ఈ-పంచాయత్‌ల ఏర్పాట్లకు సంబంధించి పంచాయతీరాజ్, ఐటీశాఖ అధికారులతో శుక్రవారం కేటీఆర్ సమీక్షించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మొదటి దశలో జనన, మరణ ధ్రువపత్రాల వంటి పౌరసేవలను అందిస్తారని, ఆపై జాతీయ ఉపాధి హామీ పథకం వేతన చెల్లింపులు, ఆసరా పింఛన్ల పంపిణీ అందించనున్నట్లు చెప్పారు. ఆర్థిక సేవల విషయమై పలు బ్యాంకులతో చర్చిస్తున్నామని, ప్రభుత్వం తరఫున బిజినెస్ కరస్పాండెంట్లను ఏర్పాటు చేసి వారి ద్వారా బ్యాంకింగ్ సేవలను అందించే ఏర్పాటు చేస్తున్నామన్నారు.

ఈ-పంచాయత్‌ల నిర్వహణ నిమిత్తం విలేజ్ లెవల్ ఎంట్రెప్రెన్యూర్ (వీఎల్‌ఈ)లను నియమిస్తామని, ఆయా గ్రామాల్లో డిగ్రీ అర్హత కలిగిన మహిళలకే వీఎల్‌ఈలుగా అవకాశం కల్పించాలని నిర్ణయించినట్లు కేటీఆర్ చెప్పారు. ఈ- పంచాయత్‌లకు సంబంధించిన సాఫ్ట్‌వేర్ టెస్టింగ్ పూర్తయిందని, ఐటీశాఖ ద్వారా ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి వీఎల్‌ఈలకు శిక్షణ పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.

రాష్ట్రంలోని ప్రతి ఇంటికీ ఇంట ర్నెట్ ఇవ్వాలన్న ప్రభుత్వ సంకల్పం నెరవేరేలా వాటర్‌గ్రిడ్  పనులతోపాటు ఫైబర్ ఆ ప్టిక్ కేబుల్ వేయాలని, ఇందుకోసం త్వరగా పూర్తిస్థాయి డిజైన్‌ను రూపొందించాలన్నా రు. సమావేశంలో పంచాయతీరాజ్ ము ఖ్య కార్యదర్శి రేమండ్ పీటర్, కమిషనర్ అనితా రాంచంద్రన్, సెర్ప్ సీఈవో మురళి, ఐటీశాఖ కార్యదర్శి జయేశ్ రంజన్ పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement