మంత్రికి చేసిన ఒక ఫోన్.. 3 ప్రాణాలు కాపాడింది | Sakshi
Sakshi News home page

మంత్రికి చేసిన ఒక ఫోన్.. 3 ప్రాణాలు కాపాడింది

Published Mon, Jul 11 2016 7:10 PM

మంత్రికి చేసిన ఒక ఫోన్.. 3 ప్రాణాలు కాపాడింది - Sakshi

సాధారణంగా ఏదైనా అపాయంలో ఉన్నామని మంత్రులకు ఫోన్ చేస్తే.. వాళ్లు స్పందిచడం చాలా అరుదు. కానీ మహారాష్ట్రలోని ఓ మంత్రికి అర్ధరాత్రి 1.30 గంటల సమయంలో ఫోన్ చేసినా.. వెంటనే స్పందించి అధికారులను అప్రమత్తం చేసి, స్థానికులను కూడా పంపి వరదల్లో కొట‍్టుకుపోతున్న మూడు నిండు ప్రాణాలను కాపాడారు. మహారాష్ట్రలో భారీ వర్షాలు పడుతున్నాయి. దాంతో పలు ప్రాంతాల్లో ఉన్నట్టుండి వరదలు వస్తున్నాయి. ఇలాంటి సమయంలో డాక్టర్ సురేంద్ర ముందాడ, ఆయన భార్య పుష్ప తమ డ్రైవర్ను తీసుకుని అమరావతి పర్యటనకు వెళ్లారు. అర్ధరాత్రి తర్వాత అక్కడకు వంద కిలోమీటర్ల దూరంలో ఉన్న అకోలాకు బయల్దేరారు.

వాళ్లు తమ ఐ20 కారులో వెళ్తుండగా.. అది వరద నీటిలో చిక్కుకుంది. వెంటనే డాక్టర్ సురేంద్ర తమ బంధువులకు ఫోన్ చేయగా, వాల్లు మహారాష్ట్ర మంత్రి రంజిత్ పాటిల్కు ఫోన్ చేశారు. అర్ధరాత్రి 1.30 గంటలకు ఫోన్ వచ్చే సమయానికి తాను నిద్రలో ఉన్నానని, ఎస్ఓఎస్ కాల్ కావడంతో వెంటనే అధికారులకు ఫోన్ చేసి బోట్లలో అక్కడకు పంపానని ఆయన చెప్పారు. స్థానికులు, ఓ స్వచ్ఛంద సంస్థ సాయంతో రెండు సహాయ బృందాలు నాలుగు గంటల పాటు కష్టపడి ఆ ముగ్గురినీ తాళ్ల సాయంతో బయటకు లాగి కాపాడాయి. గోదావరి నదికి భారీ వరదలు రావడంతో ఇప్పటికి మూడు కార్లు కొట్టుకుపోయాయి.

Advertisement
Advertisement