ఒడిశాలో పేలిన మందుపాతర | Maoists attack BSF convoy in Odisha, four jawans killed | Sakshi
Sakshi News home page

ఒడిశాలో పేలిన మందుపాతర

Aug 28 2013 2:58 AM | Updated on Sep 1 2017 10:10 PM

ఆంధ్ర-ఒడిశా సరిహద్దులో మంగళవారం మావోయిస్టులు మందుపాతర పేల్చడంతో నలుగురు బీఎస్‌ఎఫ్ జవాన్లు మృతిచెందగా, మరో ఇద్దరు జవాన్లు తీవ్రంగా గాయపడ్డారు.

సాలూరు(విజయనగరం), న్యూస్‌లైన్/కొరాపుట్(ఒడిశా): ఆంధ్ర-ఒడిశా సరిహద్దులో మంగళవారం మావోయిస్టులు మందుపాతర పేల్చడంతో నలుగురు బీఎస్‌ఎఫ్ జవాన్లు మృతిచెందగా, మరో ఇద్దరు జవాన్లు తీవ్రంగా గాయపడ్డారు. ఒడిశాలోని కొరాపుట్ జిల్లాలో ఈ ఉదంతం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. 161వ బీఎస్‌ఎఫ్ బెటాలియన్‌కు చెందిన 18 మంది జవాన్లు మల్కన్‌గిరి నుంచి విశాఖపట్నానికి మూడు వాహనాల్లో బయలుదేరారు. ఉదయం 9.30కు కొరాపుట్-సాలూరు జాతీయ రహదారి సమీపంలోని సకిరాయి గ్రామం దగ్గరకు వాహనాలు వచ్చాయి. మొదటి వాహనం అక్కడి క ల్వర్టు దాటింది. రెండో వాహనం దాటుతుండగా కల్వర్టు కింద అమర్చిన మందుపాతరను మావోయిస్టులు పేల్చారు. పేలుడు ధాటికి వాహనం తునాతునకలైంది. అందులోని జవాన్లలో నలుగురు అక్కడికక్కడే మృతిచెందారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. పేలుడు తర్వాత మావోయిస్టులు భద్రతా బలగాలపై కాల్పులు జరిపారు. జవాన్లు కూడా ఎదురు కాల్పులు జరిపారు.   
 
 ఛత్తీస్‌గఢ్‌లో రెండు ఎన్‌కౌంటర్లు
 చింతూరు, న్యూస్‌లైన్:ఛత్తీస్‌గఢ్‌లోని బస్తర్ జిల్లాలో జరిగిన రెండు ఎన్‌కౌంటర్లలో ఇద్దరు పోలీసులు, ఇద్దరు మావోయిస్టులు మృతి చెందారు. లోండిగూడ పోలీస్‌స్టేషన్‌కు చెందిన ఎస్టీఎఫ్, డీఎఫ్ బలగాలు సోమవారం సాయంత్రం సమీప అడవుల్లో కూంబింగ్ చేపడుతుండగా మర్దాపాల్ గ్రామం వద్ద మావోయిస్టులు తారసపడ్డారు. అప్పుడు జరిపిన కాల్పుల్లో ఇద్దరు మహిళా మావోలు మృతి చెందారు.

Advertisement
 
Advertisement
Advertisement