లతా మంగేష్కర్‌కు యశ్ చోప్రా అవార్డు | Lata Mangeshkar gets Yash Chopra memorial award | Sakshi
Sakshi News home page

లతా మంగేష్కర్‌కు యశ్ చోప్రా అవార్డు

Oct 21 2013 1:16 AM | Updated on Sep 1 2017 11:49 PM

లతా మంగేష్కర్‌కు యశ్ చోప్రా అవార్డు

లతా మంగేష్కర్‌కు యశ్ చోప్రా అవార్డు

ప్రఖ్యాత గాయని లతా మంగేష్కర్‌కు మరో అరుదైన గౌరవం లభించింది. హిందీ సినిమా రంగానికి చేసిన సేవలకుగాను యశ్ చోప్రా స్మారక అవార్డుతో ఆమెను ఘనంగా సత్కరించారు.

ముంబై: ప్రఖ్యాత గాయని లతా మంగేష్కర్‌కు మరో అరుదైన గౌరవం లభించింది. హిందీ సినిమా రంగానికి చేసిన సేవలకుగాను యశ్ చోప్రా స్మారక అవార్డుతో ఆమెను ఘనంగా సత్కరించారు. శనివారం రాత్రి ముంబైలో జరిగిన ఓ కార్యక్రమంలో కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి మనీష్ తివారీ చేతుల మీదుగా ఆమెకు ఈ పురస్కారం ప్రదానం చేశారు. ప్రముఖ దర్శక నిర్మాత యశ్ చోప్రా స్మారకార్థం టీఎస్సార్ ఫౌండేషన్ తరఫున కాంగ్రెస్ నేత టి.సుబ్బరామిరెడ్డి ఈ అవార్డును ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా లతా మంగేష్కర్ మాట్లాడుతూ.. తనకు యశ్‌చోప్రా ఎంతో సన్నిహితుడని తెలిపారు.
 
 ‘‘మూడు రోజులుగా జ్వరంతో బాధపడుతున్నాను. డాక్టర్లు బయటకు వెళ్లకుండా విశ్రాంతి తీసుకోవాలని సూచించారు. కానీ ఈ కార్యక్రమానికి ఎలాగైనా రావాలనుకున్నాను. అవార్డు కోసమో లేదా రూ.10 లక్షల నగదు కోసమో నేను ఇక్కడకు రాలేదు. యశ్‌జీ నాకు చాలా ప్రత్యేకమైన వ్యక్తి. నాకు ఎంతో సన్నిహితుడు’’ అని తెలిపారు. చోప్రా భార్య పమేలా కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. సినిమా రంగానికి చేసిన సేవలకు గాను లతా మంగేష్కర్‌ను తొలి యష్ చోప్రా స్మారక అవార్డుతో సత్కరించాలని నిర్ణయించినట్టు సుబ్బరామిరెడ్డి తెలిపారు. హేమమాలిని, సిమి గారేవల్, అనిల్ కపూర్‌లతో కూడిన కమిటీ.. ఈ అవార్డుకు లతను ఎంపిక చేసింది. బాలీవుడ్ సెలబ్రిటీలు శ్రీదేవి, బోనీకపూర్, అనుష్కా శర్మ, జితేంద్ర, రాణీ ముఖర్జీ, అక్షయ్ కుమార్, సుభాష్ ఘాయ్, సోనాలి బింద్రె  తదితరులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.
 

Advertisement
 
Advertisement
Advertisement