బాలికపై అత్యాచారం.. అమెరికాకు భారతీయుడి అప్పగింత | Indian extradited to US to face charges of raping teenage girl | Sakshi
Sakshi News home page

బాలికపై అత్యాచారం.. అమెరికాకు భారతీయుడి అప్పగింత

Oct 2 2013 12:23 PM | Updated on Apr 8 2019 6:21 PM

పాఠశాలకు వెళ్తున్న టీనేజి అమ్మాయిపై అత్యాచారం చేసిన కేసు (2009)లో ఓ భారతీయుడిని ప్రభుత్వం అమెరికాకు అప్పగించింది.

పాఠశాలకు వెళ్తున్న టీనేజి అమ్మాయిపై అత్యాచారం చేసిన కేసు (2009)లో ఓ భారతీయుడిని ప్రభుత్వం అమెరికాకు అప్పగించింది. అమిత్ సింగ్ను నేరగాళ్ల మార్పిడి ఒప్పందంలో భాగంగా భారతదేశం అమెరికాకు అప్పగించింది. అత్యాచారం, లైంగిక వేదింపులు, పిల్లల సంక్షేమాన్ని ప్రమాదంలో పడేయడం లాంటి నేరాల కింద అతడిపై విచారణ జరుగుతోంది. ఇప్పటికే అతడికి జడ్జి యాంజెలో డెలిగటి రిమాండ్ విధించారు. ఈనెల 11న మళ్లీ విచారణ నిమిత్తం కోర్టు ముందుకు అమిత్ వస్తాడని నసావు కౌంటీ జిల్లా అటార్నీ కాథలీన్ రైస్ తెలిపారు. నేరాలు నిరూపితమైతే అతడికి 25 ఏళ్ల జైలుశిక్ష పడుతుంది.

ఇంటి నుంచి స్కూలుకు వెళ్తున్న బాలిక (14)పై 2009 మార్చి 11వ తేదీన అమిత్ సింగ్ అత్యాచారం చేశాడు. ఆమెను తన ఇంట్లోకి లాక్కెళ్లేందుకు ప్రయత్నించాడు. ఆమె నిరాకరించగా బలవంతంగా తీసుకపెళ్లాడు. తర్వాత ఆమెపై అత్యాచారం జరిపి, అనంతరం స్కూలు వద్ద విడిచిపెట్టాడు. బాధితురాలు ఒక టీచర్కు ఈ విషయం తెలిపింది. ఐదురోజుల అనంతరం అమిత్ సింగ్ అమెరికా నుంచి భారత్ వచ్చేశాడు. ఆ తర్వాతి రోజే బాధితురాలు అతడి ఫొటోను పోలీసుస్టేషన్లో గుర్తించింది.

అమిత్ సింగ్ ఆ బాలికను శారీరకంగా, మానసికంగా తీవ్రంగా వేధించి, ఆపై అత్యాచారానికి పాల్పడినట్లు న్యాయవాది రైస్ తెలిపారు. ఈ కేసును పలు సంస్థలు దర్యాప్తు చేసి, ఎట్టకేలకు అమిత్ సింగ్ను అరెస్టు చేసి అమెరికాకు తీసుకొచ్చాయి. డీఎన్ఏ శాంపిళ్లను కూడా పోల్చి చూసి అతడి నేరాన్ని నిర్ధారించాయి. అతడిపై ఇంటర్పోల్ సంస్థ 2011 ఫిబ్రవరిలో అంతర్జాతీయ వారంటు జారీచేసింది.

Advertisement
 
Advertisement
Advertisement