
హైదరాబాద్లో గోవర్ధన్ ఫ్రెష్ పాలు
పాలు, పాల ఉత్పత్తుల వ్యాపారంలో ఉన్న పరాగ్ మిల్క్ ఫుడ్స్ హైదరాబాద్ మార్కెట్లో గోవర్ధన్ బ్రాండ్తో
వ్యాపారం పెరిగితే తెలంగాణలో ప్లాంటు
పీఈ ద్వారా రూ.500 కోట్ల సమీకరణ
పరాగ్ మిల్క్ సీఎండీ దేవేంద్ర షా
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: పాలు, పాల ఉత్పత్తుల వ్యాపారంలో ఉన్న పరాగ్ మిల్క్ ఫుడ్స్ హైదరాబాద్ మార్కెట్లో గోవర్ధన్ బ్రాండ్తో తాజా పాల విక్రయాలను ప్రారంభించింది. కంపెనీకి కావాల్సిన పాలను పటాన్చెరు సమీపంలోని పవిత్ర డెయిరీ సరఫరా చేస్తోంది. ఈ ప్లాంటు సామర్థ్యం రోజుకు 50 వేల లీటర్లు. మూడు నెలల్లో సామర్థ్యాన్ని ఒక లక్ష లీటర్లకు పెంచనున్నట్టు పరాగ్ మిల్క్ ఫుడ్స్ చైర్మన్ దేవేంద్ర షా తెలిపారు. చీఫ్ మార్కెటింగ్ ఆఫీసర్ మహేష్ ఇస్రానితో కలసి మంగళవారమిక్కడ మీడియాతో మాట్లాడారు. తొలుత జంట నగరాలకు పాలను సరఫరా చేస్తామని చెప్పారు. ఏడాది చివరికల్లా నిజామాబాద్, కరీంనగర్, వరంగల్ పట్టణాలకు విస్తరిస్తామన్నారు. 100 ఎక్స్క్లూజివ్ ఔట్లెట్లను హైదరాబాద్లో ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు.
పలమనేరు ప్లాంటు విస్తరణ..
చిత్తూరు జిల్లా పలమనేరులో ఉన్న కంపెనీ ప్లాంటు సామర ్థ్యం రోజుకు 8 లక్షల లీటర్లు. రూ.200 కోట్లతో చేపట్టనున్న విస్తరణతో సామర్థ్యం రెండింతలకు చేరుకోనుంది. 12 లక్షల లీటర్ల సామర్థ్యం గల ప్లాంటు పుణే వద్ద ఉంది. ఉత్తరాదిన ఒక ప్లాంటును ఏర్పాటు చేస్తామని కంపెనీ చైర్మన్ తెలిపారు. విస్తరణకుగాను వచ్చే మూడేళ్లలో రూ.400-500 కోట్ల ప్రైవేట్ ఈక్విటీ ఫండ్ సమీకరిస్తామని వెల్లడించారు. వ్యాపారం పెరిగితే తెలంగాణలో ప్లాంటు పెడతామని పేర్కొన్నారు. తాజా పాలను కొత్తగా ప్రవేశపెట్టగా, ప్రస్తుతం హైదరాబాద్ నుంచి పాల ఉత్పత్తుల విక్రయం ద్వారా కంపెనీకి ఏటా రూ.50 కోట్ల ఆదాయం సమకూరుతోంది. కాగా, హైదరాబాద్ మార్కెట్లో రోజుకు 24 లక్షల లీటర్ల పాలు అమ్ముడవుతున్నాయి.