అరవింద్ కేజ్రీవాల్ సారథ్యంలోని ఢిల్లీ ప్రభుత్వ మనుగడ ప్రశ్నార్థకంగా మారింది! స్వతంత్ర ఎమ్మెల్యే రాంబీర్ షోకీన్ .. కేజ్రీవాల్ సర్కారుకు సోమవారం మద్దతు ఉపసంహరించుకున్నారు
న్యూఢిల్లీ: ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) నేత అరవింద్ కేజ్రీవాల్ సారథ్యంలోని ఢిల్లీ ప్రభుత్వ మనుగడ ప్రశ్నార్థకంగా మారింది! స్వతంత్ర ఎమ్మెల్యే రాంబీర్ షోకీన్ .. కేజ్రీవాల్ సర్కారుకు సోమవారం మద్దతు ఉపసంహరించుకున్నారు. దీంతో 70 స్థానాలున్న అసెంబ్లీలో ఆప్ బలం కాంగ్రెస్, జేడీయూల మద్దతులో కలిపి 35కు పడిపోయింది. ఎన్నికల్లో 28 సీట్లు గెల్చుకున్న ఆప్ బలం వినోద్ కుమార్ బిన్నీ బహిష్కరణ, మరో సభ్యుడు స్పీకర్గా ఎన్నికవడంతో 26కు చేరింది.
ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీల అమలులో ప్రభుత్వం విఫలమైనందుకే మద్దతు వాపసు తీసుకున్నట్లు షోకీన్ తెలిపారు. దీని గురించి లెఫ్టినెంట్ గవర్నర్ నజీబ్ జంగ్కు తెలిపేందుకు ఆయన కార్యాలయానికి వెళ్లగా ఆయన బిజీగా ఉండడంతో కలవలేకపోయానని, మంగళవారం అపాయింట్మెంట్ కోరానని చెప్పారు. విద్యుత్, నీటి సమస్య, కాంట్రాక్టు టీచర్ల క్రమబద్ధీకరణ వంటి వాటిపై ఎన్నో హామీలిచ్చిన అరవింద్ కేజ్రీవాల్ అధికారంలోకి వచ్చి ఇన్నాళ్లయినా సమస్యల పరిష్కారంలో విఫలమయ్యారన్నారు.