జయలలిత మృతిపై అపోలో ఆస్పత్రి వివరణ
జయలలితకు అందించిన చికిత్సపై నివేదిక ఇచ్చేందుకు తాము సిద్ధంగా ఉన్నామని చెన్నై అపోలో ఆస్పత్రి వర్గాలు తెలిపాయి.
చెన్నై: తమిళనాడు ముఖ్యమంత్రి జయలలితకు అందించిన చికిత్సపై నివేదిక ఇచ్చేందుకు తాము సిద్ధంగా ఉన్నామని చెన్నై అపోలో ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. చికిత్సకు సంబంధించిన వివరాలతో కూడిన నివేదిక సీల్డ్ కవర్ లో అందిచేందుకు సిద్ధంగా ఉన్నామని మద్రాస్ హైకోర్టుకు అపోలో తరపు న్యాయవాది పీఎస్ రామస్వామి తెలిపారు. జయలలిత మృతి వెనుక సందేహాలు ఉన్నాయని దాఖలైన పిల్ పై మద్రాస్ హైకోర్టు సోమవారం విచారణ జరిపింది. జయలలిత క్త సంబంధీకులు తమను ఆశ్రయించనందున ఈ వ్యవహారంలో జోక్యం చేసుకునే హక్కు పిటిషనర్కు ఉందా మద్రాస్ హైకోర్టు ప్రశ్నించింది. తదుపరి విచారణను ఫిబ్రవరి 23కు వాయిదా వేసింది.
‘అమ్మ’ మృతి అనుమానాస్పదమని పేర్కొంటూ చెన్నైకి చెందిన అన్నాడీఎంకే కార్యకర్త పీఏ జోసెఫ్ మద్రాస్ హైకోర్టులో పిల్ దాఖలు చేశారు. అంతకుముందు డిసెంబర్ 29న పిల్ ను విచారణకు స్వీకరించిన న్యాయమూర్తులు కీలక వ్యాఖ్యలు చేసింది. జయలలిత మృతిపై పిటిషనర్కే గాక తమకు కూడా వ్యక్తిగతంగా సందేహాలు ఉన్నాయని న్యాయమూర్తులు వ్యాఖ్యానించారు. అసలేం జరిగిందో ప్రజలకు తెలియాల్సిన అవసరముందని అభిప్రాయపడ్డారు.


