మలయాళ థ్రిల్లర్స్ అనగానే చాలామంది తెలుగు ప్రేక్షకులకు గుర్తొచ్చేది 'దృశ్యం' ఫ్రాంచైజీనే. మోహన్ లాల్ హీరోగా నటించిన ఈ థ్రిల్లర్ చిత్రాలకు జీతూ జోసెఫ్ దర్శకుడు. ఇదివరకే రెండు భాగాలు రిలీజై సూపర్ హిట్ అయ్యాయి. గతనెలలో మూడో భాగం థియేటర్లలోకి తీసుకురాగా ఇది ఓ మాదిరి రెస్పాన్స్ అందుకుంది. కానీ కలెక్షన్స్ మాత్రం రూ.200 కోట్లకు పైనే వచ్చాయి. ఇకపోతే రేపటి నుంచి అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో రిలీజ్ కానుంది. ఇంతలోనే మద్రాస్ హైకోర్టు.. మూవీ టీమ్కి షాకిచ్చింది.
(ఇదీ చదవండి: ప్రెగ్నెన్సీ ప్రకటించిన టాలీవుడ్ హీరోయిన్)
రాజ్ కుమార్ థియేటర్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ.. దృశ్యం 3 సినిమా తెలుగు హక్కులు తమవే అని గత నెలలో మద్రాసు హైకోర్టుని ఆశ్రయించింది. ఈ క్రమంలోనే తమ పిటిషన్లో చిత్ర నిర్మాతలు ఎం.జే.ఆంటోని (ఆశీర్వాద్ సినిమాస్), దర్శకుడు జీతూ జోసెఫ్, పనోరమా స్టూడియోస్, పెన్ స్టూడియోస్ తదితరులు తమ అనుమతి లేకుండా చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేయడం, డబ్బింగ్ చేయడం, విడుదల చేయడం, పంపిణీ చేయడం లేదా ఇతర వాణిజ్య ప్రయోజనాల కోసం వినియోగించడం ద్వారా తమ కాపీరైట్ హక్కులను ఉల్లంఘిస్తున్నారని ఆరోపించింది.
ఈ కేసును గత నెలలోనే విచారించిన మద్రాస్ హైకోర్టు ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది. అనంతరం జరిగిన విచారణలో కోర్టు కీలక నిర్ణయం తీసుకుంటూ, కేసు తుది తీర్పు వెలువడే వరకు 'దృశ్యం 3' తెలుగు డబ్బింగ్ వెర్షన్ని ఓటీటీలో విడుదల చేయకూడదని బుధవారం (జూన్ 17) మధ్యంతర ఉత్తర్వు జారీ చేసింది. అంటే ఓటీటీలో మిగతా భాషల్లో స్ట్రీమింగ్ అవుతుంది కానీ తెలుగు మాత్రం అందుబాటులోకి రాదు.
(ఇదీ చదవండి: ఓటీటీలోకి వచ్చేసిన తెలుగు క్రైమ్ థ్రిల్లర్ సినిమా)


