అమర్ సింగ్‌ అనూహ్య నిర్ణయం | Amar Singh Leaves for London for Treatment | Sakshi
Sakshi News home page

అమర్ సింగ్‌ అనూహ్య నిర్ణయం

Jan 16 2017 8:38 AM | Updated on Aug 14 2018 9:04 PM

అమర్ సింగ్‌ అనూహ్య నిర్ణయం - Sakshi

అమర్ సింగ్‌ అనూహ్య నిర్ణయం

ములాయం సింగ్‌ యాదవ్‌ కుటుంబంలో విభేదాలకు ప్రధాన కారకుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న అమర్‌ సింగ్‌ అనూహ్య నిర్ణయం తీసుకున్నారు.

లక్నో: సమాజ్వాదీ పార్టీలో, ములాయం సింగ్‌ యాదవ్‌ కుటుంబంలో విభేదాలకు ప్రధాన కారకుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న అమర్‌ సింగ్‌ అనూహ్య నిర్ణయం తీసుకున్నారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఉత్తరప్రదేశ్‌కు పూర్తిగా దూరంగా ఉండనున్నారు. యూపీలో ఎన్నికల ప్రక్రియ ముగిసే వరకు ఆయన విదేశాల్లో ఉంటారు. చికిత్స కోసం త్వరలో లండన్‌కు వెళ్తున్నట్టు అమర్‌ సింగ్‌ చెప్పారు. మార్చి చివర్లో మళ్లీ స్వదేశానికి తిరిగి రానున్నారు.

‘నేను గతంలో లండన్‌లో చికిత్స చేయించుకున్నాను. పార్టీ నుంచి పిలుపు రావడంతో మధ్యలో వచ్చేశాను. చికిత్స పూర్తిగా చేయించుకోవడానికి ఇప్పుడు మళ్లీ లండన్‌ వెళ్తున్నాను. తర్వాత సింగపూర్కు వెళ్తాను. మార్చి చివర్లో తిరిగి వస్తాను’ అని అమర్‌ సింగ్‌ చెప్పారు.  ఆ సమయానికి యూపీలో ఎన్నికలు పూర్తవుతాయి. యూపీలో ఫిబ్రవరి 11 నుంచి మార్చి 4 వరకు ఏడు విడతల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే.

ములాయం కుటుంబంలో విభేదాలకు అమర్‌ సింగే కారణమని ముఖ్యమంత్రి అఖిలేష్‌ ఇటీవల తీవ్ర ఆరోపణలు చేశారు. అంతేగాక అఖిలేష్‌ వర్గం అమర్‌ సింగ్‌ను పార్టీ నుంచి బహిష్కరించింది. అఖిలేష్‌ వెంట పార్టీలో అత్యధికమంది నాయకులు ఉండగా.. ములాయం వెంట సోదరుడు శివపాల్‌, అమర్‌ సింగ్‌తో పాటు కొద్దిమంది మాత్రమే ఉన్నారు. పార్టీ గుర్తు సైకిల్‌ కోసం ఇరు వర్గాలు పోరాడుతున్నాయి. ఈసీని కలసి సైకిల్‌ను తమకే కేటాయించాలని విన్నవించారు. ములాయం వెంట అమర్‌ సింగ్‌ కూడా వెళ్లి ఈసీని కలిశారు. ఈ నేపథ్యంలో లండన్‌ వెళ్లాలని అమర్‌ సింగ్‌ చెప్పడం ఎస్పీ వర్గాలను ఆశ్చర్యపరిచింది. అఖిలేష్‌ డిమాండ్‌ మేరకు ములాయం తన సన్నిహితుడు అమర్‌ సింగ్‌ను కొన్నాళ్లు పక్కనపెట్టారా? లేక తానే దూరంగా ఉండాలని అమర్‌ భావిస్తున్నారా? ఈ రెండు కారణాలు గాక ఆయన చికిత్స కోసమే లండన్‌ వెళ్తున్నారా అన్నది ఎస్పీ వర్గాల్లో చర్చనీయాంశమైంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement