సిటీ.. శ్రీదేవి.. ఓ జ్ఞాపకం

Sridevi memorable moments in hyderabad - Sakshi

నగరంతో అతిలోకసుందరికి ఎంతో అనుబంధం

ఉలవచారు రెస్టారెంట్‌లో ‘ఆకుకూర పప్పు’ బాగా ఇష్టం

శ్రీదేవి రాకతో సీసీఎల్‌కి మరింత ఉత్సాహం

నచ్చిన ప్లేసెస్‌ ట్యాంక్‌బండ్, చార్మినార్‌

అందానికి నిర్వచనం శ్రీదేవి.టాప్‌ హీరోకు ఉన్నంత స్టార్‌డమ్‌ అతిలోక సుందరి సొంతం.ప్రేక్షక లోకం ఆమె ప్రేమలో పడిపోతే..ఆమె మాత్రం నగరంపై అమితమైన ప్రేమను పెంచుకున్నారు.హీరోయిన్‌గా సినీ జీవితం ప్రారంభమైనప్పటి నుంచి చనిపోయే దాకా ఆమె ఇక్కడకువస్తూపోతూ ఉండేవారు. చార్మినార్, ట్యాంక్‌బండ్, బిర్లా మందిర్‌ వంటి ప్రాంతాలుఎంతో ఇష్టమైనా అభిమానుల తాకిడి తట్టుకోలేక రాత్రి వేళ వెళ్లి చూసొచ్చేవారు. స్వతహాగా మాంసాహారి అయినా.. సిటీలో మాత్రం శాకాహారాన్నే ఇష్టంగా తినేవారు. ఆమెనుకలవాలని, ఒక్కసారైనా ఆ అందమైన కళ్లల్లో పడాలని ఎంతో మంది కలలుగంటే..ఆ అదృష్టం మాత్రం కొందరికే దక్కింది. ఆ జ్ఞాపకాలను ‘సాక్షి’తో పంచుకున్నారు.

సాక్షి, సిటీబ్యూరో/బంజారాహిల్స్‌: శ్రీదేవి హైదరాబాదుకు వస్తే సందడే సందడి..తాజ్‌బంజారా, పార్క్‌హయత్‌లో బస..టైముంటేట్యాంక్‌బండ్‌పై షికారు..ఉలవచారు రెస్టారెంట్‌లోఆకుకూర పప్పు..టమోటాచారు..అవర్‌ప్లేస్‌ హోటల్‌లోభోజనం.. ఇలా గడిపేవారు.. సీసీఎల్‌ మ్యాచ్‌లు ఉన్నపుడు స్టేడియంలో హుషారుగా కనిపించేవారు..ఇలా శ్రీదేవితో తమకు ఉన్నఅనుబంధం గురించి సాక్షితో పలువురు మాట్లాడారు. 

ఆ నవ్వు ఇక చూడలేం..
శ్రీదేవి నవ్వు నాకు చాలా ఇష్టం.. మహేశ్వరి ద్వారా పరిచయం కలిగింది. ప్రతిసారీ  చిరునవ్వుతో నన్ను విష్‌ చేసేవారు.. చాలా తక్కువగా మాట్లాడేవారు.. ఇక ఆమె చిరునవ్వును  చూడలేననే విషయం తలచుకుంటే బాధేస్తుంది. –వి.కవితరెడ్డి, ఆడీకార్‌ బ్రాండ్‌ కన్సల్టెంట్‌

సత్యభామ క్యారెక్టర్‌ బాగా ఇష్టపడేవారు
ముంబైలో ఓ ప్రదర్శనలో శ్రీదేవి నా కూచిపూడి నృత్య ప్రదర్శన చూసి అభినందించారు.అప్పటినుంచి ఆమెతో పరిచయం ఏర్పడింది. శ్రీదేవి చెల్లెలు మహేశ్వరీ నాకు ఫ్యాషన్‌ డిజైనర్‌ కావడంతో పరిచయం మరింత పెరిగింది. భామాకలాపంలో నా నృత్యం శ్రీదేవికి చాలా ఇష్టం.   – పద్మజారెడ్డి, కూచిపూడి నృత్యకారిణి
 
‘ఉలవచారు’లో ఆకు కూర పప్పు..
నగరంలో ఉన్నప్పుడు  ఒక్కసారైనా ఫిల్మ్‌నగర్‌లోని ‘ఉలవచారు’ రెస్టారెంట్‌ ఫుడ్‌ని ప్రిఫర్‌ చేసేవారు. ఇక్కడ దొరికే ‘ఆకు కూర పప్పు, పప్పుచారు, టమోటా చారు’ అంటే చాలా  ఇష్టం. అడిగి మరీ వండించుకుని పార్సిల్‌ తీసికెళ్లేవారు. సిటీకి వచ్చే ముందుఫోన్‌ చేసి మరీ చెప్పేవారు.   –‘ఉలవచారు’ రెస్టారెంట్‌ యజమాని వినయ్‌

స్కూల్‌లో ఉండగానే పరిచయం
 నేను శ్రీదేవి చెల్లెలు శ్రీలత స్కూల్‌ ఫ్రెండ్స్‌. లంచ్‌ సమయంలో శ్రీలతకు బాక్స్‌ ఇచ్చేందుకు శ్రీదేవి మా కాన్వెంట్‌కు వచ్చేవారు.. అలా పరిచయమయ్యారు. కార్తీకదీపం  సినిమా సమయంలో మా ఇద్దరి మధ్య సాన్నిహిత్యం ఏర్పడింది. మనమధ్యలో లేకపోవడం బాధగా ఉంది. – శైలజరెడ్డి, సెన్సార్‌బోర్డ్‌ మెంబర్‌
 
హాయ్‌.. రవీ అనేపిలుపు దూరమైంది

నేను సీసీఎల్‌కు ఆరేళ్ల పనిచేశా.. అప్పుడు శ్రీదేవితో సాన్నిహిత్యం ఏర్పడింది. ఏ చిన్న పని పడినా  హేయ్‌ రవి.. హౌ ఆర్‌ యూ అనేవారు. ఫ్యామిలీ ఎలా ఉంది?’ అంటూ ఆప్యాయంగా పలకరించేవారు. హాయ్‌ రవి అనే పిలుపు దూరమైందంటే చాలా విచారకరంగా ఉంది. –రవి పనాస, ఆర్‌కే మీడియా ఫౌండర్, సీఈఓ

గతంలో  ఓసారి..
శ్రీదేవి ఓ రోజు రాత్రివేళలో చార్మినార్‌కు వెళ్లి అక్కడ ఫొటోలు తీసుకుంటున్నారు.ఆ సమయంలో అభిమానులు వచ్చారు. తరువాత భారీ సంఖ్యలోజనం గుమిగూడటంతో కష్టపడి కారులోకిచేరుకున్నారు. ఎక్కువగా అన్నపూర్ణ స్టూడియో, రామానాయుడు స్టూడియో, సారధి స్టూడియోలలో షూటింగ్‌లకు హాజరయ్యేవారు. అవుట్‌డోర్‌ షూటింగ్‌లకు అభిమానుల తాకిడి ఎక్కువని, ఒప్పుకునేవారు కాదని, జగదేక వీరుడు అతిలోక సుందరి సినిమా షూటింగ్‌ సమయంలో ఆమెతో పాటు పని చేసిన ప్రొడక్షన్‌ అసిస్టెంట్‌ వాసుదేవరావు పేర్కొన్నారు.  చికెన్, మటన్‌తో పాటు దక్షిణాది వంటకాల వైపే ఆమె మక్కువ చూపేవారని అవర్‌ప్లేస్‌ హోటల్‌ మేనేజర్‌ తెలిపారు. బోనీ కపూర్, అనిల్‌కపూర్‌తో కలిసి ఆమె తన ఇద్దరి పిల్లలతో తమ హోటల్‌కు వచ్చి విందారగించిన విషయాన్ని అక్కడి సిబ్బంది గుర్తు చేసుకున్నారు. సుమారుగా ఆమె 60 సినిమాల వరకు ఇక్కడ స్టూడియోల్లోనే షూటింగ్‌ జరుపుకున్నారు.  – బంజారాహిల్స్‌

టీఎస్‌ఆర్‌ కుటుంబంతోఅనుబంధం

కాంగ్రెస్‌ నాయకుడు ఎంపీ తిక్కవరపు సుబ్బిరామిరెడ్డి కుటుంబీకులతో శ్రీదేవికి మంచి స్నేహం ఉంది. ఆయన కుమార్తె పింకిరెడ్డి మంచి స్నేహితురాలు. నగరంలో శ్రీదేవి ఎక్కడికి వెళ్లాలన్నా పింకిరెడ్డి వెంట ఉండాల్సిందే. సేవా కార్యక్రమాలలో పాల్గొనడానికి ఇష్టపడేవారు. రసమయి అక్కినేని లైఫ్‌టైమ్‌ అచీవ్‌మెంట్‌ అవార్డును, స్వర్ణకంకణాన్ని 2004 సెప్టెంబర్‌ 20న జూబ్లీహల్‌లో రసమయి ఆధ్వర్యంలో శ్రీదేవికి అందజేశారు. టీఎస్సార్‌ షష్టిపూర్తి ముంబాయిలో చేసిన సందర్భంగా షణ్ముకానంద హల్‌లో శ్రీదేవికి సన్మానం చేశారు. అప్పుడు ముంబై వెళ్లిన పలువురు కళాకారులను ఇంటికి ఆహ్వానించి విందు ఏర్పాటు చేశారు. రసమయి సంస్థ నిర్వాహకులు ఎంకే రాము, వంశీ కళా సంస్థ నిర్వాహకులు వంశీ రామరాజులు ఆమె ఆకస్మిక మృతికి సంతాపాన్ని వ్యక్తంచేశారు.

Read latest Tollywood News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top