ప్రభుత్వ సంకల్పం గొప్పది | World Bank on Mission Bhagiratha | Sakshi
Sakshi News home page

ప్రభుత్వ సంకల్పం గొప్పది

Nov 3 2017 1:24 AM | Updated on Nov 3 2017 1:25 AM

World Bank on Mission Bhagiratha - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ప్రతీ ఒక్కరికి సురక్షితమైన తాగునీటిని అందించాలన్న రాష్ట్ర ప్రభుత్వ సంకల్పం గొప్పదని ప్రపంచ బ్యాంక్‌ ప్రతినిధి మెగ్వెల్‌ అన్నారు. ప్రజలకు మేలు చేసే ఏ విషయంలోనైనా తెలంగాణ ప్రభుత్వంతో కలసి పనిచేయడానికి ప్రపంచ బ్యాంక్‌ సిద్ధంగా ఉందని హామీనిచ్చారు. హైదరాబాద్‌లో గురువారం ప్రపంచ బ్యాంక్‌ ఆధ్వర్యంలో ‘తాగునీటి పథకాల నిర్వహణ’పై వర్క్‌షాప్‌ జరిగింది. పాత ఆదిలాబాద్, మహబూబ్‌ న గర్, కరీంనగర్‌ జిల్లాల్లో ప్రపంచ బ్యాంక్‌ నిధులతో నిర్మించిన తాగునీటి పథకాల గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీ, జెడ్పీటీసీ సభ్యులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. సిరిసిల్ల, పెద్దపల్లిలోని తాగునీటి పథకాలను పరిశీలించామని, పనులు బాగా చేశారని మెగ్వెల్‌ ప్రశంసించారు.

మిషన్‌ భగీరథ ఇంజనీర్‌ ఇన్‌ చీఫ్‌ సురేందర్‌రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ ఏర్పడ్డాక సీఎం కేసీఆర్‌ ఆదేశాలతో పెండింగ్‌లోని తాగునీటి పథకాలపై దృష్టి పెట్టి పనులు పూర్తి చేశామన్నారు. ప్రతీ ఇంటికి నీటిని అందించాలన్న కేసీఆర్‌ ఆశయం మేరకు మిషన్‌ భగీరథ చేపట్టామన్నారు. మిషన్‌ భగీరథపై పవర్‌ పాయింట్, వీడియో ప్రజెంటేషన్‌ ఇచ్చా రు. పథకం నిర్వహణలో తలెత్తే సమస్యల పరిష్కారానికి తమ సహకారం ఉంటుందని ప్రపంచ బ్యాంక్‌ మరో ప్రతినిధి రాఘవ తెలిపారు. కరీంనగర్‌ జెడ్పీ చైర్‌పర్సన్‌ తుల ఉమ, ప్రాజెక్ట్‌ డైరెక్టర్‌ రాములు నాయక్, చీఫ్‌ ఇంజనీర్‌ విజయపాల్‌రెడ్డి పాల్గొన్నారు. ప్రపంచ బ్యాంకు ప్రతినిధులు ప్రభుత్వ సీఎస్‌ ఎస్పీ సింగ్‌తో భేటీ అయ్యారు. తెలంగాణ తాగునీటి పథకాలకు ప్రపంచ బ్యాంకు ఆర్థిక సాయంపై ఎస్పీ సింగ్‌ కృతజ్ఞతలు తెలిపారు. 

Advertisement
 
Advertisement
Advertisement