పల్లెల్లో భగీరథ ప్రయత్నం | Water Problem Issue In Medak District | Sakshi
Sakshi News home page

పల్లెల్లో భగీరథ ప్రయత్నం

Mar 22 2019 2:57 PM | Updated on Mar 22 2019 2:57 PM

Water Problem Issue In Medak District - Sakshi

మల్కాపూర్‌ పంచాయతీ కార్యాలయం 

మెదక్‌ రూరల్‌: పల్లెల్లో తాగునీటి గోసను అధిగమించేందుకు గ్రామ సర్పంచ్‌లు భగీరథ ప్రయత్నాలు చేస్తున్నారు. ఓట్లేసి గెలిపించిన ప్రజలకు నీటి సమస్యలు తలెత్తనీయకుండా జవాబుదారితనంగా వ్యవహరిస్తున్నారు. వేసవిలో నీటి ఎద్దడిని తీర్చేందుకు పల్లెల్లో కొనసాగుతున్న ప్రయత్నాల పై కథనం.. మెదక్‌ మండలంలో 19 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. ప్రతి ఏడాది ఎండాకాలం వచ్చిందంటే చాలు ఓ వైపు భానుడి భగభగలు మరోవైపు నీటి కోసం తంటాలు పడటం ప్రజలకు పరిపాటిగా మారింది. దీన్ని దృష్టిలో పెట్టుకొని తెలంగాణా ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా మిషన్‌భగీరథ పథకాన్ని ప్రవేశపెట్టి ప్రతి గ్రామంలో ట్యాంకులను ఏర్పాటుచేసింది. పల్లెల్లో సింగూరు నీటిని అందించేందుకు ప్రణాళిక సిద్ధం చేసింది. కాని కాలం కరుణించక ఈ సారి వర్షాలు సరిగ్గా కురువలేదు. దీంతో భూగర్భజలాల అడుగంటాయి. చెరువులు, కుంటలు వట్టిపోయాయి.

నీటి మట్టం అందనంత కిందికి పడిపోయింది. ప్రభుత్వ, ప్రవేట్‌ బోర్లు చాలా వరకు ఎండిపోయాయి. దీంతో పల్లెల్లో నీటి కష్టాలు ప్రారంభమవుతున్న తరుణంలో నూతనంగా ఎన్నికైన సర్పంచ్‌లు అధికారుల సహకారంతో నీటి సమస్యను అధిగమించేందుకు క్రియాశీలక పాత్ర పోషిస్తున్నారు. ఓటేసిన ప్రజలకు నీటి సమస్య తలెత్తనీయకుండా పటిష్ఠమైన చర్యలు చేపడుతున్నారు. ఒక్కొక్కరు ఒక్కో విధంగా ప్రయత్నాలు చేస్తూ ప్రజలు నీటికోసం రోడ్డెక్కకుండా చర్యలు చేపడుతున్నారు. మిషన్‌ భగీరథ నీళ్ళు అందరికీ అందాలనే ఉద్ధేశ్యంతో పలు చోట్ల అవగాహన లేమితో కొందరు తొలగించిన చెర్రలను తిరిగి వేయింస్తున్నారు. దీంతో నీరు అందరికి సమానంగా వెళ్తాయి.

అలాగే పాడయిన బోర్లను ఫ్లష్షింగ్‌ చేయించడం, అద్దెకు బోర్లు తీసుకోవడం, లీకేజీలను అరికట్టడం, కట్‌వాల్స్‌ ఏర్పాటు చేసి నీటినివిడుదల చేయడం వంటి ప్రయత్నాలను చేస్తూ సమస్య పరిష్కారానికి కృషి చేస్తున్నారు. నీటి వృథాను అరికట్టి నీటిని పొదుపుగా వాడుకోవాలని ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. గ్రామాల్లో సమస్యలు తలెత్తనీయకుండా సర్పంచ్‌లు బాధ్యతాయుతంగా విధులు నిర్వర్తిస్తుండటం పట్ల పలువరు హర్షంవ్యక్తం చేస్తున్నారు.

ప్రత్యామ్నాయ ఏర్పాట్లు..
నీటి సమస్యను పరిష్కరించేందుకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లను చేస్తున్నాము. ఇప్పటికే రెండు బోర్లను అద్దెకు తీసుకోగా, ఇటీవల ఒక బోర్‌ను వేశాము. నీటి సమస్య తలెత్తనీయకుండా చర్యలు చేపడుతున్నాము. గ్రామస్తులందరికీ నీటిని సరఫరా చేసేందుకు మిషన్‌ భగీరథ పైప్‌లైన్‌ కలిపాము. నీటి కోసం గ్రామస్తులు రోడ్డు పైకి రాకుండా బాధ్యతాయుతంగా వ్యవహరిస్తూ సమస్య పరిష్కారానికి కృషి చేస్తున్నాము. నీటి వృథాను అరికట్టేందుకు ప్రజలకు అవగాహన కల్పిస్తున్నాము. 
– దొడ్లె లక్ష్మి, సర్పంచ్, తిమ్మానగర్‌ 

నీటి సమస్య తలెత్తనీయకుండా చర్యలు..
వేసవిలో నీటి సమస్యను అధిగమించేందుకు పటిష్ఠ చర్యలు చేపడుతున్నాము. పాడయిన బోర్లను ఫ్లష్షింగ్‌ చేయించాము. తొలగించిన మిషన్‌ భగీరథ చెర్రలను వేయించి నీటిని కంట్రోల్‌ చేశాము. దీంతో రెండు రోజులకోసారి మిషన్‌ భగీరథ నీళ్ళు అందరికి సమానంగా వస్తున్నాయి. కట్‌వాల్స్‌ ఏర్పాటు చేశాము. అద్దెకు ఓ బోరును మాట్లాడిపెట్టాము. అదనంగా పైప్‌లను సైతం వేయడం జరిగింది. నీటి సమస్య ఉత్పన్నం కాకుండా ముమ్మరంగా ప్రయత్నాలు చేస్తున్నాము. ఏమైనా సందేహాలు ఉంటే అధికారుల నుంచి తగు సలహాలు, సూచనలు తీసుకుంటున్నాము. 
– సరోజ, సర్పంచ్, మల్కాపూర్‌

Advertisement
 
Advertisement
Advertisement