నలుగురు టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీల ప్రమాణ స్వీకారం | Sakshi
Sakshi News home page

నలుగురు టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీల ప్రమాణ స్వీకారం

Published Fri, Mar 31 2017 1:38 AM

TRS MLC sworn in

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ శాసనమండలికి ఎన్నికైన నలుగురు టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీలు గురువారం ప్రమాణ స్వీకారం చేశారు. ఎమ్మెల్యే కోటా నుంచి ఎన్నికైన ఎలిమినేటి కృష్ణారెడ్డి, మైనంపల్లి హన్మంతరావుతోపాటు  రెండోసారి ఎమ్మెల్సీగా ఎన్నికైన వి.గంగాధర్‌గౌడ్, ఉపాధ్యాయ నియోజకవర్గం (మహబూబ్‌నగర్‌–హైదరాబాద్‌–రంగారెడ్డి) నుంచి పీఆర్టీయూ అభ్యర్థిగా విజయం సాధించిన కాటేపల్లి జనార్దన్‌రెడ్డి శాసనమండలి దర్బారు హాలులో గురువారం జరిగిన కార్యక్రమంలో ప్రమాణ స్వీకారం చేశారు.

శాసనమండలి చైర్మన్‌ స్వామిగౌడ్‌ ఈ నలుగురి చేత ప్రమాణం చేయించారు. కార్యక్రమానికి డిప్యూటీ సీఎం మహమూద్‌ అలీ, శాసనసభా వ్యవహారాలశాఖ మంత్రి టి.హరీశ్‌రావు, హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి హాజరయ్యారు. టీఆర్‌ఎస్‌ నేతలు, పలువురు ఎమ్మెల్సీలు ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరై కొత్త ఎమ్మెల్సీలు, రెండోసారి ఎన్నికైన ఎమ్మెల్సీ లను అభినందించారు.

పార్టీ బలోపేతానికి కృషి: మైనంపల్లి
టీఆర్‌ఎస్‌ బలోపేతం కోసం కృషి చేస్తానని ఎమ్మెల్సీ మైనంపల్లి హన్మంతరావు తెలిపారు. శాసనమండలి సభ్యుడిగా ప్రమాణస్వీకారం చేసిన తర్వాత జూబ్లీహాలు వద్ద ఆయన  మీడియాతో మాట్లాడారు. ఉద్యమంలో కష్టపడ్డ అందరికీ సీఎం కేసీఆర్‌ తగిన గుర్తింపు ఇస్తున్నారని, వారందరికీ తప్పక న్యాయం చేస్తారన్న నమ్మకం తనకు ఉందన్నారు. గ్రేటర్‌ హైదరాబాద్‌ లో టీఆర్‌ఎస్‌ సభ్యత్వం భారీగా నమోదవుతోందని, ఈ సారి 20 లక్షలపైనే సభ్యత్వ లక్ష్యం పెట్టుకున్నామని చెప్పారు. 

Advertisement
Advertisement