ఉద్యమ సమయంలో విద్యకు సంబంధించి చెప్పిన వాటన్నిటినీ కేసీఆర్ అమలు చేస్తున్నారని ఎంపీ బాల్క సుమన్ తెలిపారు.
'కోదండరాం అజెండా ఏంటో అర్థమైంది'
Jun 13 2017 2:31 PM | Updated on Jul 29 2019 2:51 PM
హైదరాబాద్: ఉద్యమ సమయంలో విద్యకు సంబంధించి చెప్పిన వాటన్నిటినీ కేసీఆర్ అమలు చేస్తున్నారని ఎంపీ బాల్క సుమన్ తెలిపారు. ఆయన మంగళవారం మండలి విప్ బోడకుంటి వెంకటేశ్వర్లు, ఎమ్మెల్సీ రాజేశ్వర్ రావుతో కలిసి విలేకరులతో మాట్లాడారు. నాణ్యమైన విద్య అందించడంపై సీఎం కేసీఆర్ కు స్పష్టమైన అవగాహన ఉందని చెప్పారు.
గత పాలకులు నిర్లక్ష్యం చేసిన వాటిని తెలంగాణ ప్రభుత్వం పట్టించుకుని పేదల పక్షాన నిలుస్తోందని అన్నారు. రాష్ట్ర ఆవిర్భావం నుంచి ఇప్పటి వరకు కేసీఆర్ విద్యారంగంలో తెస్తున్న సంస్కరణలు కేజీ టూ పీజీ ఉచిత విద్యలో భాగమేనని వివరించారు. విద్యారంగంలో ఒకే రోజు 169 గురుకులాలు ప్రారంభించడం చారిత్రాత్మకమని తెలిపారు. విపక్షాలకు తెలియక గురుకులాల ప్రారంభంపై ఏవేవో మాట్లాడుతున్నాయని ఆరోపించారు.
ప్రభుత్వానికి అంతటా ప్రశంసలు వస్తుంటే కోదండ రాం లాంటి వాళ్లకు మాత్రం అవేవీ కనబడడం లేదని విమర్శించారు. కోదండరాం అజెండా ఇప్పటికే అందరికీ అర్దమయిందని అన్నారు. బంగారు తెలంగాణ కోరుకునే వారెవ్వరూ కోదండరాం లాగా మాట్లాడరని వ్యాఖ్యానించారు.
Advertisement
Advertisement