కేవలం తాను, తనకులం, తనవర్గం, తనపార్టీవాళ్ల కోసం పథకాలు రూపొందిస్తే ప్రజలకు మేలు జరగదని, అత్యంత కీలకమైన నిర్ణయాలను త్వరగా
దరఖాస్తులకు కటాఫ్ ఎందుకు ?
కేసీఆర్పై టీపీసీసీ మండిపాటు
సీఎం జోరుకు అధికారుల తీరుకు పొంతనేదంటూ ధ్వజం ?
హైదరాబాద్ : కేవలం తాను, తనకులం, తనవర్గం, తనపార్టీవాళ్ల కోసం పథకాలు రూపొందిస్తే ప్రజలకు మేలు జరగదని, అత్యంత కీలకమైన నిర్ణయాలను త్వరగా, సమర్థంగా అమలుచేయాలని సీఎం కేసీఆర్కు టీపీసీసీ అధికార ప్రతినిధులు మల్లురవి, కొనగాల మహేశ్లు సూచించారు. కేవలం మాటలతో కాలం గడిపితే ప్రజల కడుపులు నిండవని వారు శుక్రవారం ఒక ప్రకటనలో విమర్శించారు. పాతపథకాల్లో ఏమైనా పొరబాట్లు ఉంటే సరిదిద్దుకుని అమలు చేయాలే తప్ప పాతపథకాలు మొత్తం రద్దుచేస్తామని మొండిగా వ్యవహరిస్తే, ప్రజలు నష్టపోతారని వారు పేర్కొన్నారు. ఇప్పటికైనా ఒక పని చేసేముందు అది ప్రజలకు ఏ మేరకు ఉపయోగపడుతుంది, గతంలోని పథకాలతో ప్రజలకు ఏమైనా ఇబ్బందులుంటే దాని కంటె మెరుగ్గా చేయగలమా అనే విషయాలను పరిశీలించి నిర్ణయాలు తీసుకోవాలన్నారు. కొత్త ప్రభుత్వంపై ప్రజలు ఎన్నో ఆశలతో ఉంటే సీఎం కేసీఆర్, మంత్రులు ఆచరణసాధ్యం కాని హామీలు, అసమర్థ మాటలు ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నాయని విమర్శించారు.
అధికారంలోకిరాగానే కేసీఆర్ అన్ని తొందరపాటు, అవకతవక నిర్ణయాలు తీసుకుంటున్నారని వారు ధ్వజమెత్తారు. సీఎం చెప్పే మాటలకు, అధికారులు చేసే పనులకు పొంతన లేకుండా ఉండడం ప్రజల దురదృష్టమన్నారు. రేషన్కార్డులు, పెన్షన్లు, ఇతర సంక్షేమపథకాల దరఖాస్తులకు కటాఫ్ తేదీలు ఎందుకని ప్రశ్నించారు. ఇవి నిరంతరం జరిగే ప్రక్రియలని, వాటికి కటాఫ్లు పెట్టడం ప్రజలను ఇబ్బందులకు గురిచేయడం కాదా అని ప్రశ్నించారు.