రైతుల ఖాతాల్లోకి రూ.2,233 కోట్లు | Telangana Government Released Rythu Bandhu Funds For kharif | Sakshi
Sakshi News home page

రైతుల ఖాతాల్లోకి రూ.2,233 కోట్లు

Jun 12 2019 2:35 AM | Updated on Jun 12 2019 2:35 AM

Telangana Government Released Rythu Bandhu Funds For kharif - Sakshi

ప్రతీకాత్మక చిత్రం

సాక్షి, హైదరాబాద్‌ : ఖరీఫ్‌ సీజన్‌కు సంబంధించి రైతుబంధు పథకం నిధులను అధికారులు విడతలవారీగా విడుదల చేస్తున్నారు. ఇప్పటికే నాలుగు విడతలుగా రైతుల ఖాతాల్లోకి రిజర్వుబ్యాంకు ఈ–కుబేర్‌ ద్వారా నేరుగా రైతుబంధు డబ్బులు జమ అవుతున్నాయి. మంగళవారం నాటికి మొత్తం 21.22 లక్షలమంది రైతుల ఖాతాల్లో రూ.2,233.16 కోట్లు రైతుబంధు డబ్బు జమ చేశారు. మిగిలిన సొమ్మును వారం పది రోజుల్లో జమా చేసే అవకాశాలున్నాయి. మరోవైపు రైతుబంధు అకౌంట్‌ నంబర్‌ మార్చుకోవాలనుకునే రైతులు సమీప వ్యవసాయ కార్యాలయాలను సంప్రదించాలని వ్యవసాయమంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి ఒక ప్రకటనలో సూచించారు.

ఖరీఫ్‌ సాగు మొదలైన నేపథ్యంలో పంట పెట్టుబడులకు ఇబ్బందులు తలెత్తకుండా త్వరితగతిన రైతుల ఖాతాల్లో డబ్బు జమ చేయాలని, ఎన్నికల కోడ్‌ మూలంగా జరిగిన జాప్యంతో వారు నష్టపోకుండా చూడాలని ఆ శాఖ ఉన్నతాధికారులను ఆదేశించారు. సహకార, మహిళా సంఘాలు, వ్యవసాయ మార్కెట్ల ద్వారా కొనుగోలు చేసిన ధాన్యానికి సంబంధించి రూ.4,837 కోట్లు 3,85,217 మంది రైతులకు చెల్లించినట్లు పేర్కొన్నారు. ఇంకా రూ.1,080 కోట్ల బకాయిలు ఉన్నాయని మంత్రి వెల్లడించారు. మంగళవారం రూ.501 కోట్లు విడుదల చేసినట్లు తెలిపారు. ధాన్యం డబ్బులు, రైతుబంధు నిధుల విషయంలో రైతులు ఆందోళన చెందవద్దని భరోసా ఇచ్చారు. రాష్ట్రానికి రుతుపవనాలు రానున్న నేపథ్యంలో రైతుబంధు డబ్బులు త్వరగా జమయ్యేలా చర్యలు తీసుకోవాలని అధికారులను  ఆదేశించారు. 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement